Skip to main content

భారత్ స్టేజ్ - IV ప్రమాణాలు

ప్రవీణ్ దత్తు, అధ్యాపకులు, ఎల్.హెచ్.ఆర్. <br/> ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మైలవరం.
సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన ఆదేశాలతో దేశంలో భారత్ స్టేజ్(BS)-IV ప్రమాణాలు2017ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి. వాహనాల నుంచి వెలువడే ఉద్గారాలను తగ్గించి పర్యావరణంతోపాటు ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించే ఉద్దేశంతో అత్యన్నత న్యాయస్థానం తాజా తీర్పును వెలువరించింది.

భారత్ స్టేజ్ అంటే?
వాహనాల నుంచి వెలువడే పొగలో కార్బన్ డై ఆక్సైడ్, సల్ఫర్ డై ఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్‌లతోపాటు ఇతర కాలుష్య కారకాలు ఉంటాయి. దేశంలో వాహనాల సంఖ్య పెరుగుతుండటంతో వాయు కాలుష్యం కూడా అధికమవుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని వాతావరణానికి, ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే కాలుష్య కారకాల విడుదలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రమాణాలను నిర్దేశించింది. వాటినే ‘భారత్ స్ట్టేజ్ ప్రమాణాలు’ అంటారు. యూరోపియన్ దేశాల్లో ఈ ప్రమాణాలను ‘యూరో స్టేజ్’గా వ్యవహరిస్తారు. యూరో స్టేజ్ ప్రమాణాల ఆధారంగా భారత్ స్టేజ్ ప్రమాణాలను రూపొందించారు.

మషేల్కర్ కమిటీ
మన దేశంలో భారత్ స్టేజ్ ప్రమాణాలను ప్రవేశ పెట్టాలని మషేల్కర్ కమిటీ 2002లో సూచించింది. ఫలితంగా 2005, ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా భారత్ స్టేజ్-II ప్రమాణాలు అమల్లోకి వచ్చాయి. ఈ క్రమంలోనే 2010, ఏప్రిల్ 1 నుంచి భారత్ స్టేజ్-III ప్రమాణాలు; 2017, ఏప్రిల్ 1 నుంచి భారత్ స్టేజ్-IV ప్రమాణాలు అమల్లోకి వచ్చాయి. భారత్‌లో ఎంపిక చేసిన 13 నగరాల్లో భారత్ స్టేజ్ ప్రమాణాలు 2014 నుంచే అమలవుతున్నాయి. ప్రస్తుతం యూరోపియన్ దేశాల్లో యూరో స్టేజ్ - VI ప్రమాణాలు అమల్లో ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మన ప్రభుత్వం కూడా భారత్ స్టేజ్-IV నుంచి భారత్ స్టేజ్-VI ప్రమాణాలకు మారాలనే ఆలోచన చేస్తోంది. ఇది కార్యరూపం దాల్చితే(భారత్ స్టేజ్-V ప్రమాణాలు ఉండవు) 2020, ఏప్రిల్ 1 నుంచి భారత్ స్టేజ్-VI ప్రమాణాలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది (ఇది అంచనా మాత్రమే). మన దేశంలో భారత్ స్టేజ్ ప్రమాణాలను ప్రవేశపెట్టక ముందే 1991 నుంచి పెట్రోల్ వాహనాలకు, 1992 నుంచి డీజిల్ వాహనాలకు ఉద్గార ప్రమాణాలను నిర్దేశించారు. వాటి ఫలితంగా ప్రతి వాహనానికి కెటలిటిక్ కన్వర్టర్‌లను అమర్చారు. టూ స్ట్రోక్ ఇంజన్లను నిషేధించారు. మారుతి-800 కార్ల ఉత్పత్తిని నిలిపివేయడం, లెడ్ రహిత పెట్రోల్‌ను వాడటాన్ని భారత్ స్టేజ్ ప్రమాణాల ప్రవేశంతో వచ్చిన మార్పులుగా చెప్పవచ్చు.

వాహనాల ఉద్గారాలు
సాధారణంగా వాహనాలు పెట్రోల్ లేదా డీజిల్‌తో నడుస్తాయి. వాహన ఉద్గారాల నుంచి వెలువడే పొగలో కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్లు, బెంజీన్, ఆల్డిహైడ్, సల్ఫర్ సంబంధిత పదార్థాలు, హైడ్రో కార్బన్లు ఉంటాయి. పెట్రోల్ ఇంజన్ నుంచి వెలువడే పొగలో హైడ్రోకార్బన్లు, కార్బన్ మోనాక్సైడ్లు అధిక మోతాదులో ఉంటాయి. డీజిల్ ఇంజన్ నుంచి వెలువడే పొగలో నైట్రోజన్ ఆక్సైడ్లు, పార్టిక్యులేట్ మేటర్ అధికంగా ఉంటాయి.

కాలుష్య కారకాలు వాతావరణంలోకి విడుదలై పర్యావరణానికి, మొక్కలకు, జంతువులకు, మనుషులకు హాని కలిగిస్తాయి. ముఖ్యంగా వాహనాల నుంచి వెలువడే ఉద్గారాలు మనిషి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఎక్కువ సేపు కార్బన్ మోనాక్సైడ్ ప్రభావానికి గురైతే తలనొప్పి, వాంతులు, శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. ఇది ఒక్కోసారి మరణానికి కూడా దారితీయవచ్చు.

వాహనాల పొగలో ఉండే నైట్రోజన్ ఆక్సైడ్‌ల వల్ల ఊపిరితిత్తులకు కేన్సర్ సోకుతుంది. గొంతు, ముక్కు, కంటి సమస్యలు వస్తాయి. హైడ్రోకార్బన్లు, బెంజీన్, సస్పెండెడ్ పార్టిక్యులేట్ మేటర్ (మసి వంటి దూళి కణాలు) కేన్సర్‌కు కారకమవుతాయి. అందువల్ల వాతావరణంలో వీటి శాతాన్ని తగ్గించి ప్రజలను వ్యాధుల బారి నుంచి రక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందులో భాగంగా ప్రభుత్వం భారత్ స్టేజ్ ప్రమాణాలను ప్రవేశపెట్టింది. వాయు కాలుష్యం వల్ల భారత్‌లో 2015లో 12 లక్షల మంది మరణించినట్లు గ్రీన్ పీస్ సంస్థ సర్వే వెల్లడించింది. యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్‌కు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ అంచనా ప్రకారం కేవలం వాయుకాలుష్యం వల్లే భారత్‌లో రోజుకు 3,283 మంది మరణిస్తున్నారు. ఈ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని సుప్రీంకోర్టు ఇటీవల తన తీర్పులో ‘కొన్ని వాహన సంస్థల వాణిజ్య అవసరాల కన్నా దేశ ప్రజల ఆరోగ్యం ఎంతో ముఖ్యం’ అని వ్యాఖ్యానించింది.

మనమేం చేయాలి?
వాహన కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రభుత్వంతోపాటు ప్రజలు కూడా చొరవ చూపాలి. ఇందులో భాగంగా చిన్న చిన్న దూరాలకు వాహనాలపై వెళ్లకుండా నడిచి వెళ్లాలి. వీధి చివరన ఉన్న కిరణా కొట్టుకు కూడా బైక్‌పై వెళ్లడం సరికాదు. సాధ్యమైనంత వరకు వ్యక్తిగత వాహనాల వాడకాన్ని తగ్గించాలి. ఒకే ఆఫీస్‌కు వెళ్లే వ్యక్తులు వేర్వేరు వాహనాల్లో కాకుండా ఒకే కారులో లేదా బస్‌లో వెళ్లాలి. ఇలా చేస్తే వాయు కాలుష్యాన్ని తగ్గించడంలో తమ వంతు సహకారం అందించిన వారవుతారు. ఇటీవల సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టుల న్యాయమూర్తులు సైతం ఒకే కారులో ప్రయాణించారు. ఇది వారి సామాజిక బాధ్యతను తెలియజేస్తోంది. ఇదే స్ఫూర్తితో మరింత మంది సామూహిక ప్రయాణంతో సమాజ హితంలో భాగస్వాములు అయ్యేందుకు ప్రయత్నించాలి. ఒకే కారులో వెళ్లడం వీలుకాని పక్షంలో వారంలో ఒక రోజైనా ఆఫీసుకు బస్‌లో వెళ్లడం, వాహనాన్ని షేర్ చేసుకోవడం, కొద్ది దూరాలకు నడిచి వెళ్లడం వంటివి చేస్తే మన వంతుగా వాహన కాలుష్యాన్ని నివారించినట్లవుతుంది.

భారత్ స్టేజ్ III, IV మధ్య భేదాలు
భారత్ స్టేజ్-III వాహనాలు కిలోమీటర్‌కు 2.3 గ్రామ్‌ల కార్బన్ మోనాక్సైడ్‌ను విడుదల చేస్తే స్టేజ్-IV వాహనాలు ఒక గ్రామ్ కార్బన్ మోనాక్సైడ్‌ను మాత్రమే విడుదల చేస్తాయి. భారత్‌‌ స్టేజ్-III వాహనాలు కిలోమీటర్‌కు 0.20 గ్రామ్‌ల హైడ్రో కార్బన్‌లను విడుదల చేస్తే స్టేజ్-IV వాహనాలు కేవలం 0.10 గ్రామ్‌ల హైడ్రోకార్బన్‌లనే విడుదల చేస్తాయి. స్టేజ్-III వాహనాలు కిలోమీటర్‌కు 0.15 గ్రామ్‌ల నైట్రస్ ఆక్సైడ్‌ను విడుదల చేస్తే స్టేజ్-IV వాహనాలు 0.08 గ్రామ్‌లను మాత్రమే విడుదల చేస్తాయి.
Published date : 18 May 2017 04:41PM

Photo Stories