Paris Olympics: పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించిన భారత బాక్సర్లు వీరే..
![World Qualifying Tournament Amit Panghal and Jaismine Lamboria secure Paris 2024 Olympic quotas](/sites/default/files/images/2024/06/04/amit-panghal-jaismine-lamboria-1717479475.jpg)
వరల్డ్ క్వాలిఫయింగ్ చివరి టోర్నీలో జూన్ 2వ తేదీ పురుషుల 51 కేజీల విభాగంలో అమిత్.. మహిళల 57 కేజీల విభాగంలో జైస్మిన్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లి ‘పారిస్’ బెర్త్లను ఖరారు చేసుకున్నారు. పురుషుల 57 కేజీల విభాగంలో సచిన్ సివాచ్ ఒలింపిక్స్కు అర్హత సాధించడంలో విఫలమయ్యాడు.
క్వార్టర్ ఫైనల్స్లో అమిత్ 5–0తో చువాంగ్ లియు (చైనా)పై.. జైస్మిన్ 5–0తో మరీన్ కమారా (మాలి)పై గెలుపొందారు. మరోవైపు ‘బాక్స్ ఆఫ్’ మ్యాచ్లో సచిన్ సివాచ్ 0–5తో మునార్బెక్ (కిర్గిస్తాన్) చేతిలో ఓడిపోయాడు. హరియాణాకు చెందిన 28 ఏళ్ల అమిత్ వరుసగా రెండో సారి ఒలింపిక్స్కు అర్హత పొందాడు. టోక్యో ఒలింపిక్స్లో అమిత్ 52 కేజీల విభాగంలో పాల్గొని రెండో రౌండ్లో ఓడిపోయాడు.
ఆరుగురు బాక్సర్లు మాత్రమే..
2019 ప్రపంచ చాంపియన్షిప్లో రజతం, 2019 ఆసియా చాంపియన్షిప్లో స్వర్ణం నెగ్గిన అమిత్ 2018 ఆసియా క్రీడల్లో, 2022 కామన్వెల్త్ గేమ్స్లో పసిడి పతకాలు గెలిచాడు. గత టోక్యో ఒలింపిక్స్లో భారత్ నుంచి మొత్తం తొమ్మిది మంది బాక్సర్లు బరిలోకి దిగగా.. ఈసారి పారిస్ ఒలింపిక్స్లో ఆరుగురు భారత బాక్సర్లు మాత్రమే పోటీపడనున్నారు.
మహిళల విభాగంలో నిఖత్ జరీన్ (50 కేజీలు), ప్రీతి (54 కేజీలు), జైస్మిన్ (57 కేజీలు), లవ్లీనా (75 కేజీలు).. పురుషుల విభాగంలో అమిత్ పంఘాల్ (51 కేజీలు), నిశాంత్ దేవ్ (71 కేజీలు) పారిస్ ఒలింపిక్స్లో భారత్కు ప్రాతినిధ్యం వహించనున్నారు.