'PM-Kisaan': రైతుల బ్యాంకు ఖాతాల్లోకి రూ.16,000 కోట్లు
![PM Modi Releases 12th Instalment Of ₹16,000 Crore](/sites/default/files/images/2022/10/18/pmkisaan-modhi-2022delhi-1666095176.jpg)
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి(పీఎం–కిసాన్) 12వ విడత నిధులను ప్రధాని నరేంద్ర మోదీ అర్హులైన రైతుల ఖాతాల్లోకి బదిలీ చేశారు. అక్టోబర్ 17న ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ, ఎరువుల శాఖల ఆధ్వర్యంలో ప్రారంభమైన పీఎం కిసాన్ సమ్మాన్ సమ్మేళన్–2022 కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 12వ విడతలో దాదాపు రూ.16,000 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లోకి చేరాయి. దీంతో ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు రూ.2.16 లక్షల కోట్ల సాయం అందించినట్లయ్యింది. ఏటా 11 కోట్ల మంది రైతన్నలు లబ్ధి పొందుతున్నారు. కేంద్రం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎం–కిసాన్ కింద అర్హులకు ప్రతి సంవత్సరం రూ.6,000 మూడు విడతల్లో అందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి నాలుగో నెలలకోసారి రూ.2,000ను వారి ఖాతాల్లోకి బదిలీ చేస్తున్నారు. ఈ పథకాన్ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే అమలు చేస్తోంది.
Also read: FCI: ఐదేళ్ల కనిష్టానికి ఆహార ధాన్యాల నిల్వలు
కిసాన్ సమృద్ధి కేంద్రాలు ప్రారంభం
‘ఒకే దేశం, ఒకే ఎరువుల పథకం’లో భాగంగా ‘భారత్’ బ్రాండ్ రాయితీ యూరియాను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల ఆవిష్కరించారు. అలాగే 600 పీఎం–కిసాన్ సమృద్ధి కేంద్రాలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ రెండు చర్యల వల్ల రైతులకు నాణ్యమైన ఎరువులు సకాలంలో అందుతాయని చెప్పారు. అంతర్జాతీయ ఎరువుల ఈ–వారపత్రిక ‘ఇండియన్ ఎడ్జ్’ను సైతం మోదీ ఆవిష్కరించారు.
Also read: Digital Transactions: వృద్ధి గతిని మార్చిన డిజిటల్ బ్యాంకింగ్
ఖజానాపై ‘ఎరువుల’ భారం
కిసాన్ సమృద్ధి కేంద్రాల్లో రైతులకు బహుళ సేవలు అందుతాయని తెలియజేశారు. ఇవి ‘వన్ స్టాప్ షాప్’గా పని చేస్తాయన్నారు. దేశవ్యాప్తంగా 3.25 లక్షల రిటైల్ ఎరువుల దుకాణాలను కిసాన్ సమృద్ధి కేంద్రాలుగా మార్చబోతున్నట్లు ప్రకటించారు. ఎరువుల కోసం మనం దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోందని, ఎరువులపై కేంద్ర ప్రభుత్వం ప్రతిఏటా రూ.2.5 లక్షల కోట్ల మేర రాయితీ భారం భరిస్తోందన్నారు. ఒక్కో కిలో ఎరువును రూ.80కి కొని, రైతులకు రూ.6కు అమ్ముతున్నామని చెప్పారు. ఎరువులతోపాటు ముడి చమురు, వంట నూనెల దిగుమతుల భారం సైతం పెరుగుతోందన్నారు. దిగుమతుల బిల్లు తగ్గించుకోవాలని, ఎరువులు, వంట నూనెల ఉత్పత్తిలో స్వయం స్వావలంబన సాధించాలని, ఈ విషయంలో మిషన్ మోడ్లో పనిచేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. పీఎం కిసాన్ సమ్మాన్ సమ్మేళన్లో దాదాపు 1,500 వ్యవసాయ స్టార్టప్ కంపెనీలు తమ ఉత్పత్తులను, నవీన ఆవిష్కరణలను ప్రదర్శించాయి.
Also read: Industrial production: 18 నెలల కనిష్టానికి పారిశ్రామిక రంగం
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP