Skip to main content

Bhavina Patel: టోక్యో పారాలింపిక్స్‌లో రజత పతకాలు సాధించిన భారతీయులు?

టోక్యో పారాలింపిక్స్‌–2020 క్రీడల్లో భారత్‌కు రెండు రజత పతకాలు లభించాయి.
మహిళల టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) క్లాస్‌–4 సింగిల్స్‌ విభాగంలో భవీనాబెన్‌ పటేల్‌ రజత పతకం సొంతం చేసుకోగా... పురుషుల అథ్లెటిక్స్‌ హైజంప్‌ టి–47 విభాగంలో నిశాద్‌ కుమార్‌ కూడా రజత పతకం కైవసం చేసుకున్నాడు. 2021, ఆగస్టు 29న జరిగిన టీటీ మహిళల సింగిల్స్‌ క్లాస్‌–4 విభాగం ఫైనల్లో భవీనా 7–11, 5–11, 6–11తో ప్రపంచ నంబర్‌వన్‌ యింగ్‌ జౌ (చైనా) చేతిలో ఓడిపోయి రజతాన్ని దక్కించుకుంది. తొలిసారి పారాలింపిక్స్‌లో పోటీపడిన గుజరాత్‌కు చెందిన 34 ఏళ్ల భవీనా అబ్బురపరిచే ఆటతీరుతో రజత పతకాన్ని సాధించింది.

నిశాద్‌ సూపర్‌ జంప్‌...
పురుషుల అథ్లెటిక్స్‌ హైజంప్‌లో హిమాచల్‌ ప్రదేశ్‌కు చెందిన 21 ఏళ్ల నిశాద్‌ కుమార్‌ భారత్‌కు రజత పతకాన్ని అందించాడు. టి–47 విభాగంలో నిశాద్‌ 2.06 మీటర్ల ఎత్తుకు ఎగిరి రెండో స్థానంలో నిలిచాడు. అంతేకాకుండా ఆసియా రికార్డు కూడా నెలకొల్పాడు. డాలస్‌ వైజ్‌ (అమెరికా) కూడా 2.06 మీటర్ల ఎత్తుకు ఎగరడంతో అతనికి కూడా రజతం లభించింది. రోడెరిక్‌ టౌన్‌సెండ్‌ (అమెరికా) 2.15 మీటర్లతో కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పడంతోపాటు స్వర్ణ పతకాన్ని దక్కించుకున్నాడు.

డిస్కస్‌ త్రోలో వినోద్‌కు కాంస్యం
పురుషుల అథ్లెటిక్స్‌ డిస్కస్‌ త్రో ఎఫ్‌–52 విభాగంలో భారత ప్లేయర్‌ వినోద్‌ కుమార్‌ కాంస్య పతకం సాధించాడు. అయితే వినోద్‌తో పోటీపడిన ప్రత్యర్థులు అతడి వైకల్యం స్థాయిపై సందేహం వ్యక్తం చేస్తూ నిర్వాహకులకు ఫిర్యాదు చేశారు. దాంతో డిస్కస్‌ త్రో ఫలితాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు.

భవీనాకు రూ. 3 కోట్లు
రజత పతకంతో చరిత్ర సృష్టించిన భవీనా పటేల్‌కు స్వరాష్ట్రం గుజరాత్‌ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. ‘దివ్యాంగ్‌ ఖేల్‌ ప్రతిభా ప్రోత్సాహన్‌ పురస్కార్‌’లో భాగంగా భవీనాకు రూ. 3 కోట్లు అందజేయనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. భవీనాకు రూ. 31 లక్షల నజరానా అందజేయనున్నట్లు భారత టేబుల్‌ టెన్నిస్‌ సమాఖ్య పేర్కొంది.

తొమ్మిదో మహిళా క్రీడాకారిణి భవీనా...
సమ్మర్‌ ఒలింపిక్స్, పారాలింపిక్స్‌ క్రీడల్లో కలిపి భారత్‌ తరఫున పతకం గెలిచిన తొమ్మిదో మహిళా క్రీడాకారిణి భవీనా. సమ్మర్‌ ఒలింపిక్స్‌లో మల్లీశ్వరి (వెయిట్‌లిఫ్టింగ్‌; 2000 సిడ్నీ–కాంస్యం), సైనా (బ్యాడ్మింటన్‌; 2012 లండన్‌–కాంస్యం), మేరీకోమ్‌ (బాక్సింగ్‌; 2012 లండన్‌–కాంస్యం), సింధు (బ్యాడ్మింటన్‌; 2016 రియో–రజతం; 2020 టోక్యో–కాంస్యం), సాక్షి మలిక్‌ (రెజ్లింగ్‌; 2016 రియో–కాంస్యం), మీరాబాయి (వెయిట్‌లిఫ్టింగ్‌; 2020 టోక్యో–రజతం), లవ్లీనా (బాక్సింగ్‌; 2020 టోక్యో–కాంస్యం)... పారాలింపిక్స్‌లో దీపా మలిక్‌ (షాట్‌పుట్‌; 2016 రియో–రజతం) పతకాలు సాధించారు.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : టోక్యో పారాలింపిక్స్‌–2020 క్రీడలో రజత పతకాలు సాధించిన భారతీయులు?
ఎప్పుడు : ఆగస్టు 29, 2021
ఎవరు : భవీనాబెన్‌ పటేల్, నిశాద్‌ కుమార్‌
ఎక్కడ : టోక్యో, జపాన్
Published date : 30 Aug 2021 06:04PM

Photo Stories