Skip to main content

అగ్రవర్ణాల పేదలకు 10% రిజర్వేషన్

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జనవరి 7న అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది.
దశాబ్దాలుగా ఉన్న డిమాండ్‌కు తలొగ్గుతూ అగ్ర కులాల్లోని పేదలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం జనరల్ కోటాగా ఉన్న 50 శాతం నుంచే మరో పది శాతాన్ని పక్కకు తీసి ఈ రిజర్వేషన్లు కల్పిస్తారు. అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లలో మార్పు ఉండదు. అగ్ర కులాలకు రిజర్వేషన్లు ఇచ్చేందుకు అవసరమైన రాజ్యాంగ సవరణల బిల్లును కేంద్రం జనవరి 8న పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. ప్రస్తుత ప్రభుత్వానికి ఇవే చివరి పూర్తిస్థాయి పార్లమెంటు సమావేశాలు కావడం గమనార్హం. ఈ బిల్లును ఉభయసభలూ మూడింట రెండొంతుల ఆధిక్యంతో ఆమోదించాల్సి ఉంది. ఈ రిజర్వేషన్లు అమలైతే బ్రాహ్మణ, కమ్మ, కాపు, రాజ్‌పుత్, జాట్, మరాఠా, భూమిహార్ తదితర కులాల్లోని పేదలకు లబ్ధి చేకూరనుంది.

50 శాతానికి అదనంగానే...
గతంలో ఇంద్రా సాహ్నీ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం మొత్తం రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లోనూ 50 శాతం దాటకూడదు. మిగతా 50 శాతం సీట్లు, ఉద్యోగాలను పూర్తిగా ప్రతిభ ఆధారంగా (జనరల్ కోటా)నే భర్తీ చేయాలి. ప్రస్తుతం కొన్ని రాష్ట్రాలను మినహాయిస్తే మిగిలిన అన్ని చోట్లా ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు కలిపి మొత్తంగా 49.5 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. అంటే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లను మరో 0.5 శాతానికి మించి పెంచే వీలు లేదు. ఈ సమస్యను అధిగమించేందుకే కేంద్రం రాజ్యాంగ సవరణ చేపట్టనుంది. ఈ బిల్లును పార్లమెంటు ఆమోదిస్తే మొత్తం రిజర్వేషన్ల శాతం దాదాపు 60కి చేరుతుంది. రాజ్యాంగంలో ఆర్థికంగా వెనుకబడిన వారికి రిజర్వేషన్ల గురించి ప్రస్తావనేదీ లేదు కాబట్టి అగ్రవర్ణాల్లోని పేదలకు రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగ సవరణ తప్పనిసరి. అధికరణం 15, 16లను సవరించడం ద్వారా రిజర్వేషన్లు ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది.

1991లోనే పీవీ ప్రయత్నం :
అగ్రకులాల్లోని పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వాలు ప్రయత్నించడం ఇదే తొలిసారి కాదు. 1991లోనూ నాటి ప్రధానమంత్రి, తెలుగు వ్యక్తి పీవీ నరసింహారావు ఈ ప్రయత్నం చేశారు. మండల్ కమిషన్ సిఫారసులను అమలు చేయడంతో అగ్ర కులాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో వారిని శాంతింపజేసేందుకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 1991 సెప్టెంబర్ 25న ఆఫీస్ ఆఫ్ మెమొరాండంను ఇచ్చారు. అయితే దీన్ని అమలు చేయడం కుదరదంటూ సుప్రీంకోర్టు కొట్టేసింది. ఆర్థికంగా వెనుకబడిన అగ్ర కులాల వారు ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యా సంస్థల్లో తక్కువగా ఉన్నారని నిరూపించేలా ఏదైనా వ్యవస్థ ఉంటే వారికి రిజర్వేషన్లు ఇవ్వొచ్చని అప్పట్లో కోర్టు చెప్పింది. అయితే ఈసారి మాత్రం సుప్రీంకోర్టు తీర్పుతో సమస్య రాకుండా ఉండేలా ముందస్తు చర్యలు తీసుకుని బీజేపీ ప్రభుత్వం కొత్త బిల్లును రూపొందించింది. దీంతో పార్లమెంటు ఆమోదం లభిస్తే, ఉన్నత కులాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి ప్రయోజనం చేకూరనుంది.

ఇదీ ఈబీసీ కోటా కథ..
ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు(ఈబీసీ) ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో పదిశాతం రిజర్వేషన్ ఇవ్వాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి ఎన్నో ఏళ్ల నేపథ్యం ఉంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీల కిందకు రాని అగ్రవర్ణ పేదలకు కోటా ఇవ్వాలనే డిమాండ్ 30 ఏళ్ల క్రితమే వచ్చింది. తాము కేంద్రంలో అధికారంలోకి వస్తే అగ్రకులాల పేదలకు రిజర్వేషన్ ఇస్తామని మొదట హామీ ఇచ్చిన రాజకీయ నేత బీఎస్పీ స్థాపకుడు కాన్షీరామ్. తర్వాత ఈ పార్టీ అధ్యక్షురాలు మాయావతి, ఎస్పీ నేత ములాయంసింగ్ యాదవ్ కూడా ఈ ప్రతిపాదనకు మద్దతు పలికారు. కేంద్రమంత్రి, ఆర్పీఐకి చెందిన రాందాస్ అఠావలే కూడా అనేక సందర్భాల్లో ఈ ప్రతిపాదనను సమర్థించారు.

సిన్హో కమిషన్ :
సామాజికంగా వెనుకబడిన వర్గాలకు చెందని.. అగ్రవర్ణ పేదల కోసం యూపీఏ సర్కారు ‘జాతీయ ఆర్థికంగా వెనుకబడిన తరగతుల కమిషన్’ను 2006లో నియమించింది. ఈ వర్గాల జీవన స్థితిగతుల అధ్యయనానికి మేజర్ జనరల్ (రిటైర్డ్) ఎస్‌ఆర్ సిన్హో చైర్మన్‌గా, మహేంద్రసింగ్ సభ్యులుగా కమిషన్ ఏర్పాటు చేశారు. 2008 జనవరి నాటికి ఈ కమిషన్ నివేదిక ఇవ్వాల్సిఉండగా, అనేక పొడిగింపుల తర్వాత, చివరికి యూపీఏ-2 హయాంలో 2010లో నివేదిక ఇచ్చింది.

కోటి కుటుంబాలు..
ఎనిమిదేళ్ల క్రితం అగ్రవర్ణ పేదల సంఖ్య ఆరు కోట్లుగా ఈ కమిషన్ అంచనా వేసింది. దాదాపు కోటి కుటుంబాలున్నాయంది. అగ్రవర్ణ పేదలకు కోటా కల్పించడానికి తొలి అడుగుగా యూపీఏ ఈ కమిషన్‌ను నియమించింది. కమిషన్ సభ్యులు 28 రాష్ట్రాల్లో పర్యటించి సామాజికంగా బలహీనవర్గాలకు(ఎస్సీ, ఎస్టీ, బీసీ) చెందని కులాల జీవన స్థితిగతులను అధ్యయనం చేశారు. ఆదాయ పన్ను కట్టని అగ్ర కులాలకు చెందిన పేదలను ఓబీసీ(అదర్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్)లతో సమానంగా పరిగణించాలనే ప్రతిపాదన మొదట ఈ కమిషన్ చేసింది. ఆర్థికంగా బలహీనులైన ఈ వర్గాలు బీసీల స్థాయిలో ఉన్నారని కూడా తెలిపిందని వార్తలొచ్చాయి. ఓబీసీలతో సమానంగా ఈ అగ్రవర్ణ పేదలను ప్రభుత్వం చూడాలని కమిషన్ కోరింది. ఈ కమిషన్ నివేదికలోని విషయాలను ఇంత వరకూ అధికారికంగా ప్రభుత్వం వెల్లడించలేదు.

రాజ్యాంగ సవరణ అవసరం :
సామాజికంగా వెనుకబడని వర్గాలకు రిజర్వేషన్ కల్పించాలంటే రాజ్యాంగంలోని 15, 16 అధికరణల సవవరణ అవసరం. అలాగే ప్రస్తుత అన్ని కోటాల పరిమితిని 50% నుంచి 60 శాతానికి పెంచడానికి కూడా రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. అన్ని రకాల రిజర్వేషన్ల మొత్తం 50 శాతం దాటకూడదనే సుప్రీంకోర్టు ఉత్తర్వులను అధిగమించాలంటే రాజ్యాంగ సవరణ ద్వారా కొత్త కోటా అంశాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలి. అలా చేర్చాక కూడా దాన్ని పరిశీలించే అధికారం తమకు ఉంటుందని 2007లో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 1992లో ఇందిరా సహానీ వర్సెస్ కేంద్రం కేసులో అన్ని కోటాలకు 50% గరిష్ట పరిమితి విధించింది.

తొలిసారి ఈ పదప్రయోగం :
అంబేడ్కర్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ ప్రకటనలో తొలిసారి ఈబీసీ పద ప్రయోగం చోటు చేసుకుంది. కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలో 2014-15 నుంచి అమల్లోకి వచ్చిన డా.అంబేడ్కర్ పోస్ట్‌మెట్రిక్ స్కాలర్‌షిప్ ఫర్ ది ఇకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ స్టూడెంట్స్ అనే పథకంలో తొలిసారి ఆర్థికంగా వెనుకడిన వర్గం (ఈబీసీ) అనే పదం ఉపయోగించారు. జనరల్ కేటగిరీకి చెందిన విద్యార్థులకు ఈ పథకం అమలు చేయడం ప్రారంభించారు. జాతీయ ఆర్థికంగా వెనుకబడిన తరగతుల కమిషన్ తన నివేదికను 2010లో సమర్పించాక ఈ స్కాలర్‌షిప్ పథకం అమలు మొదలైంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి:
అగ్ర కులాల్లోని పేదలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు
ఎప్పుడు: జనవరి 7
ఎవరు: బీజేపీ ప్రభుత్వం
ఎందుకు: విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు
Published date : 08 Jan 2019 05:10PM

Photo Stories