Skip to main content

భారతదేశం- ఇంధన వనరులు

భారతదేశంలో విస్తారమైన బొగ్గు నిల్వలు ఉన్నాయి. వీటిలో కోకింగ్ రకం తక్కువగా ఉండటం వల్ల ఆస్ట్రేలియా, చైనాల నుంచి దిగమతి చేసుకుంటున్నాం. నదీ పరీవాహక ప్రాంతాల్లో సహజ వాయువు అపారంగా లభిస్తోంది. సహజ వాయువు రంగంలో స్వయం సమృద్ధి సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
 ఇంధనాలు ప్రధానంగా రెండు రకాలు అవి..
 1) శిలాజ ఇంధనాలు
 ఉదా: బొగ్గు, చమురు, సహజవాయువు.
 2) అణు ఇంధనాలు
 ఉదా: యురేనియం, థోరియం, ఫ్లూటోనియం, రేడియం.
 భారతదేశంలో సుమారుగా 220 బిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయి. ఇందులో 200 బిలియన్ టన్నులు బిట్యూమినస్, 20 బిలియన్ టన్నులు లిగ్నైట్ రకానికి చెందినవి. ఆంథ్రసైట్, పీట్ తరగతికి చెందిన బొగ్గు నిల్వలకు మనదేశంలో అంతగా ప్రాధాన్యం లేదు.
 బొగ్గు నిల్వలు: భారతదేశంలో బొగ్గు నిల్వలు ప్రధానంగా గోండ్వానా యుగానికి చెందినవి. ఇవి సుమారు 200 మిలియన్ సంవత్సరాల క్రితం నదీ హరివాణాల్లో ఏర్పడ్డాయి. భారతదేశపు బొగ్గు నిల్వలు ప్రధానంగా నాన్‌కోకింగ్ రకానికి చెందినవి. కోకింగ్ రకానికి చెందిన నాణ్యమైన బొగ్గును ఉక్కు కర్మాగారాల్లోని బ్లాస్ట్ ఫర్నేస్‌లలో వాడతారు. ఈ కోకింగ్ బొగ్గు నిల్వలు చాలా తక్కువగా ఉన్నాయి.
 బొగ్గు క్షేత్రాలు: భారతదేశంలో బొగ్గు క్షేత్రాలు దామోదర్, మహానది, సోన్, గోదావరి, వార్ధా నదీ హరివాణాల్లో కేంద్రీకృతమై ఉన్నాయి. దేశంలో 60 శాతం బొగ్గు దామోదర్ నదీలోయ క్షేత్రాల నుంచే ఉత్పత్తి అవుతోంది. దామోదర్ నదీలోయ జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. ఝరియా, రాణిగంజ్, గిర్ధి, బొకారో, పాతకేరా ఈ ప్రాంతంలోని అతి పెద్ద బొగ్గు క్షేత్రాలు. పశ్చిమబెంగాల్‌లో రాణిగంజ్.. దేశంలోని అతిపెద్ద బొగ్గు క్షేత్రం. మహానది-సోన్ నదీ హరివాణాలు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి. ఇది గోదావరి-వార్ధా లోయ తెలంగాణ, మహారాష్ర్టల్లో విస్తరించి ఉంది. ఇక్కడ కోర్బా, సింగ్రోలి, టాల్చేర్, ఇబ్‌లోయ, బిలాస్‌పూర్ ముఖ్యమైన బొగ్గు క్షేత్రాలు. మహారాష్ట్రలోని కాంప్‌తీ, చాందా, బలార్షా బొగ్గు క్షేత్రాలు, తెలంగాణలోని సింగరేణి బొగ్గు క్షేత్రం ఈ లోయలో భాగంగా ఉన్నాయి. తెలంగాణలోని సింగరేణి బొగ్గు క్షేత్రం ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో విస్తరించి ఉంది. ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, ఇల్లందు(సింగరేణి), మణుగూరు, సత్తుపల్లి, వరంగల్‌లోని భూపాలపల్లి, ఆదిలాబాద్‌లోని మందమర్రి, బెల్లంపల్లి, శ్రీరాంపూర్, గోలేటి, కరీంనగర్‌లోని గోదావరిఖని ముఖ్యమైన గని కేంద్రాలు.
 ఈశాన్యంలో బొగ్గు నిల్వలు: ఈశాన్య భారతదేశంలోని బొగ్గు నిల్వలు టెరిషరీ యుగానికి చెందినవి. వీటి బొగ్గులో గంధకం శాతం ఎక్కువ. అందువల్ల ఈ బొగ్గు పారిశ్రామిక విలువ తక్కువ. ఈశాన్య భారతంలో అసోం, అరుణాచల్‌ప్రదేశ్, నాగాలాండ్ రాష్ట్రాల్లో బొగ్గు నిల్వలున్నాయి. అసోంలోని మాకుమ్, నాగాలాండ్‌లోని నజీరా లోయ ప్రధాన బొగ్గు క్షేత్రాలు.
 లిగ్నైట్ బొగ్గు: లిగ్నైటు బొగ్గు మృదువైంది. దీన్ని విద్యుత్ ఉత్పత్తికి మాత్రమే ఉపయోగిస్తారు. తమిళనాడు, డార్జిలింగ్, రాజస్థాన్‌లలో నిల్వలు ఉన్నాయి.
 పీట్ బొగ్గు: పీట్ బొగ్గు అపరిపక్వమైంది. ఇందులో సేంద్రియ పదార్థం ఎక్కువగా ఉంటుంది. దీని కెలోరి విలువ చాలా తక్కువ. ‘పీట్’ తరగతికి చెందిన బొగ్గు నిల్వలు కేరళలోని కొచ్చిన్, అల్లెప్పీలలో విస్తరించి ఉన్నాయి.
అవక్షేప శిలల్లో చమురు: చమురు- సహజవాయువు నిల్వలు అవక్షేప శిలల్లో మాత్రమే లభిస్తాయి. ఖండ భాగాల్నే కాకుండా సముద్ర భూతలంపైన ఖండతీర అంచుల్లో కూడా చమురు సహజ వాయువు నిల్వలు ఉంటాయి. మహారాష్ట్ర తీరంలోని ముంబై హై, బేసిన్ క్షేత్రాలు భారతదేశంలో చమురు, సహజవాయువును ఉత్పత్తి చేసే ముఖ్య ప్రాంతాలు. గుజరాత్ తీరంలోని కంభత్ సింధుశాఖలో గాంధార్, వాస్నా, లూనెజ్ ముఖ్య క్షేత్రాలు. గుజరాత్ ఖండాంతర్భాగంలో మెహసానా, కాలోల్, అంకలేశ్వర్, హజీరా ఇతర చమురు-సహజవాయువు క్షేత్రాలు. 
యురేనియం నిల్వలు: మనదేశంలో యురేనియం నిల్వలు జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, మేఘాలయా, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి. జార్ఖండ్‌లోని ‘జాడుగుడా’ ముఖ్యమైన యురేనియం గనుల కేంద్రం. మేఘాలయాలోని డొమియోస్టాట్, ఆంధ్రప్రదేశ్‌లోని కడప, తెలంగాణలో నల్గొండల్లో యురేనియం నిల్వల ఉన్నాయి.
మోనజైట్: కేరళ తీరంలోని ఇసుకలో మోనజైట్ లభిస్తోంది. ఇది ఇసుక, థోరియం, యురేనియం, ఫ్లూటోనియంల మిశ్రమం. ప్రపంచ మోనజైట్ నిల్వల్లో భారతదేశం మొదటి స్థానంలో ఉంది. ఈ గనులు, వాటి శుద్ధి కేంద్రాలు కేరళలోని క్విలన్, తమిళనాడులోని మనం కురిచ్చి, మహారాష్ట్రలోని రత్నగిరి, ఒడిశాలోని ఛత్రపూర్‌లలో ఉన్నాయి.
Published date : 30 Sep 2015 04:53PM

Photo Stories