Skip to main content

భారతదేశ ద్వీపకల్ప నదీ వ్యవస్థ

వర్షాకాలం మాత్రమే నీటి ప్రవాహం కలిగి ఉండటం వల్ల ద్వీపకల్ప నదులను ‘వర్షాధార’ నదులు అని పిలుస్తారు. ఇవి కఠిన శిలల గుండా ప్రవహించడం వల్ల సాధారణ వేగంతో ‘అధోక్రమక్షయం’ చేస్తాయి. ఈ నదులన్నీ అంతర్ వర్తిత రకానికి చెందినవి. ద్వీపకల్ప నదులు నౌకాయానానికి అనుకూలం కాదు. ఈ నదీ వ్యవస్థపై జలపాతాలు అధికంగా ఏర్పడతాయి. ద్వీపకల్ప నదులను ముఖ్యంగా రెండు రకాలుగా వర్గీకరిస్తారు.
 1.తూర్పు వైపునకు ప్రవహించే నదులు
 2. పశ్చిమం వైపునకు ప్రవహించే నదులు
 
 తూర్పు వైపునకు ప్రవహించే నదులు 
 గోదావరి నది
 గోదావరిని.. దక్షిణ గంగ, వృద్ధ గంగ, ఇండియన్ రైన్ అని కూడా పిలుస్తారు. ద్వీపకల్ప నదుల్లో అతిపెద్దది. అంతేకాకుండా దక్షిణ భారతదేశ నదుల్లో అతి పొడవైనది. ఇది పశ్చిమ కనుమల్లో  మహారాష్ర్ట ‘నాసిక్’ జిల్లాలోని ‘త్రయంబక్’ సమీపంలో బీలే సరస్సు వద్ద జన్మించి, ఆ తర్వాత మహారాష్ర్ట, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా సుమారు 1465 కి.మీ ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. గోదావరి మహారాష్ర్టలోని ‘నాందేడ్’ను దాటి అదిలాబాద్‌లోని బాసర వద్ద తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. తెలంగాణలో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలు, ఏపీలోని పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల గుండా ప్రవహిస్తుంది. చివరగా గోదావరి 7 పాయలు (శాఖలు)గా విడిపోయి బంగాళాఖాతంలో కలుస్తుంది. గోదావరి ప్రధాన శాఖలు.. గౌతమి, వశిష్ట, వైనతేయ, తుల్య, భరద్వాజ.
 
 గోదావరి తెలంగాణ రాష్ర్టంలోకి ప్రవేశించే బాసర ప్రాంతంలో సరస్వతి ఆలయం ఉంది. గోదావరి పాయలైన గౌతమి, వశిష్టల మధ్య ఏర్పడినదే  ‘కోనసీమ’. గోదావరికి అంతర్వేది సమీపంలో నదీ వంకలు, ఆక్స్‌బౌ సరస్సులు ఉన్నాయి. దీని పరివాహక ప్రాంతం మహారాష్ర్ట, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. గోదావరి దేశంలో రెండో పెద్ద పరీవాహక ప్రాంతాన్ని కలిగి ఉంది.
ఉప నదులు: మంజీరా, ప్రవర, కిన్నెరసాని నదులు కుడివైపు నుంచి, ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, సీలేరులు ఎడమవైపు నుంచి గోదావరిలో కలుస్తున్నాయి.
 
 కృష్ణా నది
 ద్వీపకల్ప నదుల్లో రెండో పెద్ద నది. దక్షిణ భారతదేశంలో రెండో పొడవైన నది. పశ్చిమ కనుమల్లోని మహాబలేశ్వర్ (మహారాష్ట్ర) వద్ద జన్మించి.. మహారాష్ర్ట, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తూ హంసలదీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. దీని మొత్తం పొడవు 1400 కి.మీ. ఇది మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ మండలంలోని ‘తంగడి’ వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. ఇది శ్రీశైలం సమీపంలో ‘పాతాళగంగ’ గార్‌‌జను ఏర్పరుస్తుంది. కృష్ణా నది విజయవాడకు దిగువన ఉన్న ‘పులిగడ్డ’ వద్ద రెండు పాయలుగా చీలి కొంత దూరం తర్వాత తిరిగి కలుస్తుంది. ఆ రెండు పాయల మధ్య ఉన్న భూభాగాన్ని ‘దివిసీమ’ అంటారు.
 ఉప నదులు: తుంగభద్ర, ఘటప్రభ, మలప్రభ, మూసీ, దిండి, భీమ తదితరాలు.
 
 కృష్ణానదికి గల అతిపెద్ద ఉపనది తుంగభద్ర. దీని పరీవాహక ప్రాంతం కర్ణాటక, మహారాష్ర్ట, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. కృష్ణా, గోదావరి నదుల మధ్య డెల్టా ప్రాంతంలో కొల్లేరు (మంచినీటి) సరస్సు ఉంది.
 
 మహానది
 ద్వీపకల్ప నదుల్లో నాలుగో పెద్దనది. ఛత్తీస్‌గఢ్ రాష్ర్టంలోని ‘దండకారణ్యం’లో గల ‘శిహావ’ అనే ప్రాంతం వద్ద జన్మించి.. ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల గుండా సుమారు 858 కి.మీ.ల దూరం ప్రవహిస్తుంది. ఒడిశాలోని కటక్‌కు దిగువన ‘నారాజ్’ అనే ప్రాంతంలో బంగాళాఖాతంలో కలుస్తుంది. మహానది కటక్ జిల్లాలో విశాలమైన డెల్టాను ఏర్పరుస్తుంది. ఈ డెల్టాను ఆనుకొని ‘చిల్కా’ అనే ఉప్పునీటి సరస్సు ఉంది. మహా నదిపై ‘హిరాకుడ్’ ఆనకట్టను నిర్మించారు. మహానది, గోదావరి నదుల మధ్య ప్రాంతాన్ని కళింగ ప్రాంతం అంటారు.
 ఉప నదులు: మండ్, షియోనాథ్, లేవ్, ఇబ్, హసీడియో, ఓంగ్, జోంక్, టెల్ తదితరాలు.
 
కావేరి నది
పశ్చిమ కనుమల్లో కర్ణాటకలోని కూర్‌‌గ జిల్లా బ్రహ్మగిరి కొండల్లోగల ‘తలైకావేరి’ అనే ప్రాంతంలో జన్మిస్తుంది. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల గుండా సుమారు 805 కి.మీల దూరం ప్రయాణించి తమిళనాడులోని ‘కావేరి పట్నం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. కావేరి నది దక్షిణ కర్ణాటక పీఠభూమి నుంచి తమిళనాడు మైదానాల్లోకి ప్రవేశించే సందర్భంలో శివ సముద్రం జలపాతాన్ని ఏర్పరుస్తుంది. దీని పరీవాహక ప్రాంతం కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. కావేరి నది శ్రీరంగం వద్ద రెండు పాయలుగా చీలిపోయింది. దీని ఉత్తర పాయను కోలరూన్ అని, దక్షిణ పాయను కావేరి అని పిలుస్తారు. ఈ నది తమిళనాడులో ప్రధాన డెల్టాను ఏర్పరుస్తుంది. కావేరి నది ప్రవహించే ముఖ్యమైన జిల్లా తంజావూరు.
ఉప నదులు: హేరంగి, హేమవతి, లోకపావని, భవాని, కబిని, సువర్ణవతి, అమరావతి, అర్కవతి, లక్ష్మణతీర్థ, ష్రింశ తదితరాలు. 
 
పెన్నానది
దీన్ని పినాకిని అని కూడా పిలుస్తారు. కర్ణాటకలో ‘కోలార్’ జిల్లాలోని నందిదుర్గ కొండల్లో చెన్నకేసర కొండ వద్ద జన్మించి, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా దాదాపు 600 కి.మీ ప్రవహిస్తుంది. నెల్లూరు జిల్లాలోని ఊటుకూరు వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇది అనంతపురం జిల్లాలో ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశిస్తుంది.
ఉప నదులు: జయమంగళి, సగిలేరు, చెయ్యేరు, కుందేరు, చిత్రావతి, పాపాఘ్ని మొదలైనవి.
 
పెన్నానది సముద్రంలో కలిసే చోటుకు దక్షిణంగా దాదాపు 100 కి.మీ. దూరంలో పులికాట్ (ఉప్పు నీటి) సరస్సు ఏర్పడింది. ఇది నెల్లూరు జిల్లా, తమిళనాడులకు మధ్య ఉంది. ఈ సరస్సు వలస పక్షులకు నిలయంగా ఉంది.
 
తూర్పు వైపునకు ప్రవహించే ఇతర నదులు
నాగావళి:
దీన్ని లాంగుల్యా అని కూడా పిలుస్తారు. ఒడిశాలోని రాయ్‌గఢ్ కొండల్లో పుట్టి.. ఏపీలోని శ్రీకాకుళంలోని ‘మోపసుబందరు’ వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.
 ఉప నదులు: జంఝావతి, స్వర్ణముఖి, వేదవతి మొదలైనవి.
 
వంశధార: తూర్పు కనుమల్లో పుట్టి, బంగాళాఖాతంలో కలిసే నదుల్లో ఇది పెద్దది. ఒడిశా రాష్ట్రం లోని జయపూర్ కొండల్లో జన్మించి, ఆ రాష్ట్రం గుండా ప్రవహించి.. శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం వద్ద ఏపీలోకి ప్రవేశిస్తుంది. కళింగపట్నం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.
 
సువర్ణ రేఖ:  ఇది ఛోటానాగ్‌పూర్ పీఠభూమిలో జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీ వద్ద నగ్రిలో జన్మించి.. జార్ఖండ్, పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాల గుండా ప్రవహించి..ఒడిశాలోని కిర్తానియా వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.
 
తామ్రపాణి: కేరళలోని అగస్త్యమలై కొండల్లో జన్మించి, తమిళనాడులోని గల్ఫ్ ఆఫ్ మన్నార్‌లో కలుస్తుంది.
 
బ్రాహ్మణి నది: ఒడిశాలోని మహానది తర్వాత రెండో పొడవైన నది. ఇది జార్ఖండ్‌లోని లోహార్థగా వద్ద జన్మించిన సౌత్ కోయిల్ నది; జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో జన్మించిన సాంక్ నదుల కలయిక వల్ల ఏర్పడింది. ఈ నది ఒడ్డున రూర్కెలా ఉక్కు కర్మాగారం ఉంది.
 
పశ్చిమం వైపునకు ప్రవహించే నదులు
నర్మదా: పశ్చిమం వైపునకు ప్రవహించే నదుల్లో అతి పెద్దది. వింధ్య, సాత్పురా పర్వతాల మధ్య ప్రవహిస్తుంది. దీన్ని పగులులోయ నది, మార్బుల్ రివర్ అని కూడా పిలుస్తారు. నర్మదా నది మధ్యప్రదేశ్‌లోని అమర్ కంటక్ వద్ద జన్మించి.. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్‌ల గుండా దాదాపు 1312 కి.మీ. ప్రవ హిస్తుంది. గుజరాత్‌లోని గల్ఫ్ ఆఫ్ కంభట్‌లోని బ్రోచ్ లేదా బారుచ్ వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ వద్ద దీనిపై ఉన్న ధువన్‌దార జలపాతం అత్యంత ప్రసిద్ధి చెందింది. నర్మదా నదిపైనే ‘మార్బుల్’ జలపాతం కూడా ఉంది. ఇది ఆలియాబెట్ దీవిని ఏర్పరుస్తుంది. దీని పరీవాహక ప్రాంతం అత్యధికంగా మధ్యప్రదేశ్‌లో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర, గుజరాత్‌లు ఉన్నాయి.
ఉప నదులు: హిరన్, ఓర్‌సంగ్, తావా, వరిపాన్, షార్, బార్నెర్, బంజర్, కుంది, షక్కర్, కోలర్ మొదలైనవి.
 
తపతి: పశ్చిమం వైపునకు ప్రవహించే నదుల్లో రెండో పెద్ద నది. సాత్పూరా, అజంతా కొండల మధ్య ప్రవహిస్తోంది. మధ్యప్రదేశ్‌లోని బెతుల్ జిల్లాలోని ముల్తాయ్ వద్ద జన్మించి.. నర్మదా నదికి సమాంతరంగా దాదాపు 724 కిలోమీటర్లు మధ్యప్రదేశ్, మహారాష్ర్ట, గుజరాత్‌ల గుండా ప్రవహించి.. సూరత్ సమీపంలో ‘ఎష్యూరీ’ ద్వారా అరేబియా సముద్రం క్యాంబే సింధు శాఖలో కలు స్తుంది. దీని పరీవాహక ప్రాంతం మహారాష్ట్ర (అత్యధికంగా), మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. నర్మద, తపతిలను కవల నదులు అంటారు.
ఉప నదులు: పూర్ణ, బేతుల్, పాట్కి, కాప్రా, గిర్నా, గంజాల్, పలేర్ మొదలైనవి.
 
పశ్చిమానికి ప్రవహించే ఇతర నదులు
శరావతి:
కర్ణాటక రాష్ట్రంలో ఉంది. భారతదేశంలో ఎత్తై జలపాతం జోగ్/జర్సొప్పా దీనిపైనే ఉంది.
పంబియార్: ఇది కేరళలో ఉంది. శబరిమలై ఈ నది ఒడ్డునే ఉంది.
పొన్నని: కేరళలో అతి పొడవైన నది
పెరియార్:  కేరళ రాష్ర్టంలో ఉంది. ఆది శంకరా చార్యుల జన్మస్థానమైన ‘కాలడి’ ఈ నది ఒడ్డునే ఉంది.
ఇడుక్కి:  కేరళ రాష్ట్రంలో ఉంది.
గోవా రాష్ట్రంలో పశ్చిమానికి ప్రవహించే నదులు: జువారి, మాండవి, రాచోల్.
కర్ణాటక రాష్ట్రంలో పశ్చిమానికి ప్రవహించే నదులు: నేత్రావతి, తాద్రి, కాళి, గంగవల్లి
 
దక్షిణానికి ప్రవహించే నదులు
సబర్మతి:
ఆరావళి పర్వతాల్లోని (రాజస్థాన్)‘మేవార్’ ప్రాంతంలో జన్మించి, జయ సముద్ర సరస్సును తాకుతూ ఉదయ్‌పూర్ గుండా ప్రవహించి దక్షిణ గుజరాత్‌లోని ‘కంభట్’ సింధు శాఖలో కలుస్తుంది. దీని పురాతన పేరు గిరికర్ణిక. పద్మ, గరుడ  పురాణాల్లో దీని ప్రస్తావన ఉంది. సబర్మతి పరీవాహక ప్రాంతం రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో విస్తరించింది.
ఉప నదులు: హరా, వాకల్, సేది, వేష్వా, హత్‌మతి 
 
మహి: మధ్యప్రదేశ్‌లోని వింధ్య పర్వతాల పశ్చిమ భాగంలో సర్దార్‌పూర్‌కు దక్షిణాన పుట్టి, మధ్యప్రదేశ్‌లో ఉత్తర, వాయవ్యంగా ప్రవహించి, రాజస్థాన్‌లోకి ప్రవేశించి, నైరుతి వైపునకు తిరిగి గుజరా త్‌లోని‘ కాంబే’ సింధు శాఖలో కలుస్తుంది. దీని పరీవాహక ప్రాంతం మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. ఈ నది ఒడ్డున ఉన్న ముఖ్య నగరం వ డోదర.
ఉప నదులు: సోమ్, అనాస్, పనమ్
 
అంతర్ భూభాగ నదీ వ్యవస్థ
రాజస్థాన్‌తోపాటు జమ్మూకాశ్మీర్‌లోని లడఖ్, ఆక్సాయ్‌చిన్ ప్రాంతాలు భారత్‌లో అంతర్ భూభాగ న దులకు ప్రసిద్ధి చెందాయి.
సముద్రంలో కలవకుండా మార్గమధ్యంలోనే ఉప్పునీటి సరస్సులో (లేదా) ఇసుక రేణువుల్లో అంతమైతే వాటిని అంతర్ భూభాగ నదులు అంటారు. ఉదా: ఘగ్గర్, లూనీ, బానీ మొదలైనవి.
 
ఘగ్గర్:  హిమాలయాల దిగువన పుట్టి రాజస్థాన్‌లోని హనుమాన్ నగర్ ప్రాంతంలో ఇసుకలో ఇంకిపోతుంది.
హరియాణా, పంజాబ్ రాష్ట్రాలకు సరిహద్దుగా ప్రవహిస్తుంది.
ఇది అంతర్ భూభాగ నదుల్లో పెద్దది.
ఉప నదులు: మార్కండేయ, తంగ్రి, చైతన్య
 
లూనీ: దీన్ని సాగరమతి, లోనారి, లవణవరి అని కూడా పిలుస్తారు. రాజస్థాన్‌లోని ఆరావళి పర్వతాల్లో అజ్మీర్‌కు సమీపంలో ఉన్న అన్నసాగర్‌లో జన్మించి రాణా ఆఫ్ కచ్ ప్రాంతంలో ఇంకిపోతుంది.
ఇది పుష్కర్ సరస్సు గుండా ప్రవహించే నది
దీని ఉపనది-బాదని
 
బానీ: ఇది ఆరావళి పర్వతాల్లో పుట్టి ‘రాణా ఆఫ్ కచ్’ ప్రాంతంలో ఇంకిపోతుంది. ఇది సాంబారు సరస్సులో కలుస్తుంది.
 
వైగై నది తమిళనాడు రాష్ట్రంలో ఉంది.
Published date : 23 Aug 2016 05:53PM

Photo Stories