Skip to main content

భూతాపం - పర్యావరణంలో మార్పులు

ప్రస్తుతం ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య భూతాపం. భూమి వేడెక్కడం వల్ల పర్యావరణంలో అనేక మార్పులు సంభవిస్తున్నాయి. ఇప్పటికైనా మేల్కొని సరిదిద్దుకోకపోతే భవిష్యత్‌లో ఇది పెను ముప్పుగా మారే ప్రమాదం ఉంది. ఈ విషయాన్ని గ్రహించిన ప్రపంచ దేశాలు పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించాయి. అభివృద్ధి పేరిట మనిషి సాగిస్తున్న ప్రకృతి విధ్వంస కాండ వల్ల భూమ్మీద జీవం మనుగడే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి తలెత్తిందని గుర్తించాయి. భావితరాల కోసం ఈ భూమిని భద్రంగా ఉంచాలని ఇటీవల జరిగిన పారిస్ ఒప్పందంలో నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో గ్రూప్స్ అభ్యర్థుల కోసం.. గ్లోబల్ వార్మింగ్ మొదలైన తీరు, దాన్ని అరికట్టడానికి ప్రపంచ దేశాలు చేపట్టిన చర్యలను విశ్లేషిస్తున్నారు ప్రముఖ పర్యావరణవేత్త, జస్టిస్ కుల్దీప్‌సింగ్ జాతీయ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ కె. పురుషోత్తం రెడ్డి.
భూతాపం గురించి తెలుసుకోవాలంటే.. ముందుగా వాతావరణంలో మార్పులు సంభవించిన తీరు, అందుకు కారణమైన అంశాలపై అవగాహన పెంచుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికీకరణ జరగకముందు ప్రజలు పర్యావరణ హితమైన జీవనం గడిపేవారు. ఆ సమయంలో శాస్త్ర సాంకేతిక రంగం ఇంకా అభివృద్ధి చెందలేదు. పర్యావరణాన్ని కలుషితం చేసే కారకాలు కూడా పెద్దగా లేవు. భారీ యంత్రాలు లేకపోవడం వల్ల అడవుల నరికివేత జరిగినా అది మనిషి సామర్థ్య పరిధిలోనే జరిగేది. కాబట్టి వనాల నిర్మూలన పరిమితంగా జరిగింది. ముఖ్యంగా మన దేశంలో నాటి ప్రజల జీవన సరళి పర్యావరణ అనుకూలంగా ఉండేది. మొక్కలు, వృక్షాల సహాయంతో ఆయుర్వేదాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన సమాజం మనది. ఆ విధంగా పారిశ్రామికీకరణకు ముందున్న కాలంలో చెట్లు, జీవరాశులు సమస్త ప్రాణికోటి హాయిగా జీవించాయి. పారిశ్రామిక విప్లవం మొదలైన తర్వాత యూరప్‌లో వివిధ రకాల ఆవిష్కరణలు జరిగాయి. శాస్త్ర సాంకేతిక రంగ పురోగతితో ఐరోపా దేశాలు అభివృద్ధిలో ముందుకు సాగాయి. కంపెనీలు అసంఖ్యాకంగా పుట్టుకొచ్చాయి. వస్తూత్పత్తి పెరిగింది. పెరిగిన వస్తూత్పత్తికి అనుగుణంగా ఆయా దేశాలు మార్కెట్ల కోసం ప్రయత్నించాయి. వస్తువులను ఉత్పత్తి చేయడానికి అవసరమైన ముడి సరకులు అవసరమయ్యాయి. ఈ పరిస్థితుల్లో వలసవాదం ప్రారంభమైంది. వ్యాపారం పేరుతో ఐరోపా దేశాలు భారత్ సహా ఇతర దేశాలవైపు బాట పట్టాయి. పోర్చుగీస్‌వారు, ఫ్రెంచ్‌వారు, బ్రిటిషర్లు మన దేశంలో అడుగుపెట్టారు. తర్వాతి కాలంలో భారత్ బ్రిటిషర్లకు వలసదేశంగా మారింది.

సెలైంట్ స్ప్రింగ్
1960-65 నాటికి పారిశ్రామికీకరణ వేగవంతమైంది. దీని పర్యావసనాలను, పర్యావరణంపై ప్రభావాన్ని ఊహించని అమెరికా, యూరప్ దేశాలు యథేచ్ఛగా ప్రకృతి దోపిడీకి పాల్పడ్డాయి. కంపెనీల నుంచి వచ్చే పొగనే అభివృద్ధి సూచికగా భావించారు. ఈ తరుణంలోనే వ్యవసాయ రంగంలో రసాయనిక ఎరువుల వాడకం పెరిగింది. డీడీటీ(డై క్లోరో డై ఫినాయిల్ ట్రై క్లోరో ఈథేన్)ని పెద్ద మొత్తంలో ఉపయోగించారు. డీడీటీ వాడకం వల్ల పర్యావరణానికి తీవ్ర హాని కలుగుతుందని రచెల్ కార్‌సన్ అనే మెరైన్ బయాలజిస్ట్, పర్యావరణవేత్త పరిశోధనలో తేలింది. డీడీటీని ఉపయోగించడం వల్ల నేల లోపల రెండు కిలోమీటర్ల మేర ఉన్న జీవరాశి నశించిపోతుందని ఆమె తెలిపారు. దీనివల్ల ఆహార గొలుసు (ప్రకృతిలో ఒక జీవరాశిని మరో జీవరాశి ఆహారంగా తీసుకోవడం) దెబ్బతిని, భూమిపై జీవం మనుగడ ప్రమాదంలో పడుతుందని ‘సెలైంట్ స్ప్రింగ్’ అనే పుస్తకంలో రచెల్ పేర్కొన్నారు. 1962లో విడుదలైన సెలైంట్ స్ప్రింగ్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ పుస్తకం వల్ల అమెరికాతోపాటు యావత్ ప్రపంచం పర్యావరణం గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. అమెరికా ప్రభుత్వం డీడీటీపై నిషేధం విధించింది. దీన్ని పర్యావరణ ఉద్యమానికి నాందిగా పేర్కొనవచ్చు. ఆ క్రమంలోనే యూఎస్ ఎన్విరాన్‌మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (యూఎస్‌ఈపీఏ) ఏర్పాటైంది. 1972 జూన్ 5న ఐక్యరాజ్య సమితి స్వీడన్‌లోని స్టాక్‌హోంలో పర్యావరణంపై మొదటి సదస్సు నిర్వహించింది. నాటి నుంచి జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 1972లో డెన్నిస్ మిడోస్ ‘లిమిట్స్ టు గ్రోత్’ అనే పుస్తకం రాశాడు. 1972 తర్వాత యూరోపియన్, అమెరికా యూనివర్సిటీలు పర్యావరణం సబ్జెక్ట్‌పై భారీ స్థాయిలో పరిశోధనలు చేయడం ప్రారంభించాయి. ఫలితంగా వేలాది ఆర్టికల్స్ ప్రచురితమయ్యాయి.

బ్రండ్‌ట్లండ్ కమిషన్
1980 నాటికి పర్యావరణం సబ్జెక్ట్‌పై స్పష్టత వచ్చింది. పర్యావరణ పరిస్థితిపై ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. 1983లో గ్రో హార్లెమ్ బ్రండ్‌ట్లండ్ నేతృత్వంలో వరల్డ్ కమిషన్ ఆన్ ఎన్విరాన్‌మెంట్ అండ్ డెవలప్‌మెంట్ (డబ్ల్యూసీఈడీ)ను ఐరాస ఏర్పాటు చేసింది. దీన్నే బ్రండ్‌ట్లండ్ కమిషన్ అంటారు. నాలుగేళ్లు పనిచేసిన ఈ కమిషన్ ప్రపంచమంతటా పర్యటించి వివిధ దేశాల ప్రజలు, నాయకులు, ప్రభుత్వాలు, మేధావులతో సంప్రదింపులు జరిపింది. 1987లో ఈ కమిషన్ ఐక్యరాజ్య సమితికి నివేదిక సమర్పించింది. ఈ రిపోర్టును ‘అవర్ కామన్ ఫ్యూచర్’ అనే పేరుతో పుస్తక రూపంలో తీసుకొచ్చారు. వరల్డ్ కమిషన్ నివేదికలో గుర్తించిన సమస్యలను గ్లోబల్ ఎన్విరాన్‌మెంటల్ సమస్యలు అంటారు. ఇందులో పేర్కొన్న ముఖ్య పర్యావరణ సమస్యలు...
  • ఓజోన్ పొర క్షీణించడం
  • భూతాపం (గ్లోబల్ వార్మింగ్)
  • జీవవైవిధ్యం దెబ్బతినడం
  • ఎడారీకరణ లేదా నీటి ఎద్దడి
  • పొంచి ఉన్న అణు ముప్పు
  • అణు రియాక్టర్లతో తలెత్తే ప్రమాదం
  • అణు బాంబులతో తలెత్తే ప్రమాదం
అభివృద్ధి వల్ల తలెత్తే సమస్యలను కూడా డబ్ల్యూసీఈడీ తన నివేదికలో పేర్కొంది. నగరీకరణ జరిగే క్రమంలో వివిధ సమస్యలు తలెత్తుతాయి. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు, నీటి సౌకర్యం, విద్య, వైద్య, ఉపాధి వసతులు కల్పించాలని నివేదిక పేర్కొంది. పారిశ్రామికీకరణ నేపథ్యంలో ముడి వస్తువుల లభ్యత, వ్యర్థాల నిర్వహణ ప్రక్రియలు మొదలైనవి; వ్యవసాయంలో కృత్రిమ ఎరువుల వాడకాన్ని తగ్గించి సహజ ఎరువులను వినియోగించడం; నీటిపారుదల, మానవ హక్కులు తదితర విభాగాల్లో సమస్యలను గుర్తించింది. డబ్ల్యూసీఈడీ నివేదికపై చర్చించడానికి 1992 జూన్ 3-14 వరకు బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో వరల్డ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. దీన్నే ‘ఎర్త్ సమ్మిట్’ అంటారు. ఈ సదస్సులో డబ్ల్యూసీఈడీ నివేదికపై చర్చించి, ఆమోదం తెలిపారు.

ఎజెండా 21
డబ్ల్యూసీఈడీ నివేదికలో పేర్కొన్న సమస్యల పరిష్కారానికి యాక్షన్ ప్లాన్ రూపొందించారు. దీన్నే ఎజెండా 21గా పిలుస్తారు. రియో డి జనీరోలో సదస్సు జరిగిన నాటి నుంచి 21వ శతాబ్దం(కొత్త మిలీనియం) లోకి అడుగు పెట్టడానికి సుమారు ఏడున్నరేళ్లు మిగిలి ఉంది. ఈ సమయంలోనే ప్రపంచ దేశాలు తీసుకోవాల్సిన చర్యల పట్టికను ఎజెండా 21గా పేర్కొన్నారు. ఈ ఏడున్నరేళ్లలో ప్రపంచ దేశాలన్నీ ఎకో ఫ్రెండ్లీగా మారాలని పిలుపునిచ్చారు. లేదా To put all the nations of the world in a track to achieve sustainable development అని పేర్కొన్నారు. సస్టెయినబుల్ డెవలప్‌మెంట్‌కు నిర్వచనం చెప్పారు. ప్రస్తుత తరం అవసరాలు తీర్చుకుంటూనే.. రాబోయే తరాల అవసరాలను కూడా కాపాడటమే సస్టెయినబుల్ డెవలప్‌మెంట్‌గా నిర్వచించారు. ఈ భూమ్మీద ఉన్న మానవాళి మొత్తం ‘తామే చివరి తరం వాళ్లం కాదు, భవిష్యత్‌లోనూ జీవం ఉంటుంది’ అనే విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. దేశాల మధ్య, తరాల మధ్య సమానత్వం ఉండాలన్నారు. దీనికి ఉదాహరణగా పారిస్ పర్యావరణ ఒప్పందాన్ని పేర్కొనవచ్చు. భావి తరాలు కూడా సౌఖ్యంగా జీవించాలంటే.. ఈ తరం బాధ్యతాయుతంగా మెలగాలని సూచించారు.

గ్లోబల్ వార్మింగ్ (భూతాపం)
సూర్య కాంతిలో ఉండే అతినీలలోహిత కిరణాలు రేడియోధార్మికతను కలిగి ఉంటాయి. ఇవి వాతావరణం ద్వారా ప్రయాణించి భూమిని వేడెక్కిస్తాయి. ఈ వేడి తిరిగి వాతావరణంలోకి పరావర్తనం చెందుతుంది. కానీ గాలిలో ఉండే కార్బన్ డై ఆక్సైడ్ ఈ వేడిని బంధించి భూ వాతావరణంలోనే ఉండేలా చేస్తుంది. దీన్ని హరిత గృహ ప్రభావం అంటారు (కార్బన్ డై ఆక్సైడ్‌నే గ్రీన్ హౌస్ వాయువు అంటారు). దీంతో భూమి వేడెక్కుతుంది. దీన్నే గ్లోబల్ వార్మింగ్ లేదా భూతాపం అంటారు. పరిశ్రమలు ఇబ్బడిముబ్బడిగా పెరగడం, అడవుల నరికివేత తదితర కారణాల వల్ల 1950 దశకంలో గాలిలో 310 పీపీఎంవీగా ఉన్న కార్బన్ డై ఆక్సైడ్ ప్రస్తుతం 400 పీపీఎంవీకి చేరింది. నిత్యం బొగ్గు, పెట్రోలియం, కిరోసిన్, డీజిల్ తదితర శిలాజ ఇంధనాలను మండిస్తుండటమే కార్బన్ డై ఆక్సైడ్ పెరగడానికి కారణం.

నివారణ మార్గాలు
పరిశ్రమల్లో విద్యుత్‌ను అధికంగా వినియోగిస్తారు. విద్యుత్ ఉత్పత్తి కోసం చాలా దేశాలు థర్మల్ విద్యుత్ కేంద్రాల మీద ఆధారపడుతున్నాయి. బొగ్గును మండించటం వల్ల కార్బన్ డై ఆక్సైడ్ అధిక మొత్తంలో విడుదలవుతుంది. కాబట్టి థర్మల్ విద్యుత్‌కు స్వస్తి పలకాలి. ప్రత్యామ్నాయంగా పునర్పుతాదక శక్తి వనరులైన సౌర, పవన విద్యుత్‌లపై ఆధారపడాలి. పెట్రో ఇంధనాల ఉత్పత్తి, వాడకం తగ్గించాలి. కరెంట్ వినియోగాన్ని తగ్గించుకోవాలి.
ప్రకృతికి మన అవసరాలను తీర్చే శక్తి ఉంది. కానీ అత్యాశను కాదని గుర్తించాలి!

పారిస్ ఒప్పందం
ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతున్న భూతాపాన్ని కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలు ఇటీవల పారిస్ వేదికగా ఏకమయ్యాయి. పారిశ్రామిక విప్లవానికి ముందు నాటితో పోల్చితే 2100 నాటికి భూతాపంలో పెరుగుదలను 2 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ స్థాయికి పరిమితం చేయాలని దేశాలు నిర్ణయించాయి. పారిస్ పర్యావరణ ఒప్పందం జరగడానికి ప్రపంచంలోని చిన్న చిన్న ద్వీప దేశాల ఒత్తిడి కూడా పనిచేసింది. భూతాపం పెరగడం వల్ల భూమిపై ఉన్న మంచు కరిగి సముద్రంలోకి చేరుతుంది. ఫలితంగా సముద్ర మట్టం పెరుగుతుంది. దీంతో లోతట్టు ప్రాంతాలు, సముద్ర తీర ప్రాంతాలు మునిగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ దీవులు ప్రపంచ దేశాల మీద ఒత్తిడి తెచ్చాయి. పారిస్ ఒప్పందం కుదరడంలో కీలక పాత్ర పోషించాయి.

పారిస్ సదస్సు ముఖ్యాంశాలు..
  • 21వ ప్రపంచ పర్యావరణ సదస్సు (కాప్ 21) నవంబర్ 30న ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ప్రారంభమైంది. ఈ సమావేశానికి 195 దేశాల నేతలు, 40 వేల మంది ప్రతినిధులు హాజరయ్యారు.
  • భారత్ 2030 నాటికి కర్బన ఉద్గారాలను 33 శాతం తగ్గించనుందని ప్రధాని మోదీ తెలిపారు.
  • గ్రీన్‌హౌస్ ఉద్గారాలను విడుదల చేస్తున్న దేశాల జాబితాలో భారత్‌ది మూడో స్థానం. కానీ తలసరి ఉద్గారాల పరంగా చూస్తే భారత్ పదో స్థానంలో ఉంది.
  • అంతర్జాతీయ పర్యావరణ సదస్సు డిసెంబర్ 2న జల, వాతావరణ మార్పు అనుసరణ ఒప్పందాన్ని ప్రకటించింది.
  • భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలండ్ సంయుక్తంగా అంతర్జాతీయ సోలార్ కూటమిని పారిస్‌లో ప్రారంభించారు. ఉష్ణమండల దేశాలు సౌరశక్తిని ఒడిసిపట్టుకునేలా చేయడమే ఈ కూటమి ఏర్పాటు ముఖ్య ఉద్దేశం.
  • పారిస్ ముసాయిదా ఒప్పందానికి 196 దేశాలు ఆమోదం తెలిపాయి.
Published date : 22 Dec 2015 01:36PM

Photo Stories