అంతర్జాతీయ ద్రవ్య నిధి

గ్రీసులో సంక్షోభం తీవ్రతరమైంది. అంతర్జాతీయ ద్రవ్య నిధికి(ఇంటర్నేషన్ మానెటరీ ఫండ్- ఐఎంఎఫ్) గ్రీసు చెల్లించాల్సిన 1.6 బిలియన్ల రుణ వాయిదా గడువు 2015, జూన్ 30తో ముగిసింది.
ఈ ఐఎంఎఫ్ వాయిదా చెల్లింపుల దగ్గరే సంక్షోభం ముదిరి ప్రపంచ మార్కెట్లను అల్లకల్లోలం చేస్తోంది. ఈ నేపథ ్యంలో ‘ఐఎంఎఫ్’ గురించి తెలుసుకుందాం..

ఐఎంఎఫ్:
అంతర్జాతీయ ద్రవ్య నిధి ప్రపంచంలోని అతి ప్రధానమైన ఆర్థిక సంస్థల్లో ఒకటి. రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలోనే 44 దేశాల అధినేతలు అమెరికాలోని బ్రెటన్ ఉడ్స్‌లో సమావేశమై ఐఎంఎఫ్ స్థాపన విషయాన్ని చర్చించి ఒక ఒడంబడిక పత్రాన్ని రూపొందించారు. ఆ తర్వాత ఐక్య రాజ్యాల ద్రవ్య, ఆర్థిక సమావేశం జరిగింది. 1945 డిసెంబర్ 7 నుంచి ఐఎంఎఫ్ డ్రాఫ్ట్ అమల్లోకి వచ్చింది.

ప్రధాన లక్ష్యాలు:
  1. అంతర్జాతీయ స్థాయిలో ఆర్థిక, ద్రవ్య వ్యవహారాలను సహకార భావంతో ఒక శాశ్వత సంస్థ ద్వారా నిర్వహించడం
  2. అంతర్జాతీయ వ్యాపారాన్ని సమతుల్యస్థితిలో అభివృద్ధి పరచడానికి అవసరమైన పరిస్థితులు కల్పించడం
  3. వివిధ దేశాల మధ్య సక్రమ ఆర్థిక వ్యవహారాలు నిర్వహించడానికి అనుకూల పరిస్థితులు కల్పించడం
  4. అంతర్జాతీయ స్థాయిలో ద్రవ్య విలువలను స్థిరంగా ఉంచడానికి కృషి
  5. విదేశీ చెల్లింపు నిబంధనలు రద్దు చేయడం

స్వరూపం
ఐఎంఎఫ్ కార్యకలాపాలు నిర్వహించడానికి బోర్డ్ ఆఫ్ గవర్నర్లు, బోర్డ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్లు, మేనేజింగ్ డెరైక్టర్ ఇతర కార్యాలయ సిబ్బంది ఉంటారు. ఐఎంఎఫ్ కేంద్ర కార్యాలయం వాషింగ్టన్‌లో ఉంది. ప్రస్తుతం దీని సభ్యదేశాల సంఖ్య 188. ఐఎంఎఫ్ కార్యనిర్వహణకు సభ్యదేశాలు ఆర్థిక సహాయం అందిస్తాయి. ప్రతి సభ్య దేశం ఎంత డబ్బు చెల్లించాల్లో కోటాల కింద నిర్ధారించారు. బంగారు నిల్వల రూపంలో 20శాతం లేదా 10 శాతం నగదు చెల్లించాలి. అధిక భాగం బంగారం విలువ లేదా డాలర్ హోల్డింగ్స్ రూపంలో, మిగిలిన మొత్తాన్ని కరెన్సీ రూపంలో చెల్లించాలి.

ఐఎంఎఫ్ ముఖ్యంగా ద్రవ్య మార్పిడి అంశాల గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. 1947 మార్చి 1 నుంచి ఈ సంస్థ వివిధ దేశాలతో ఒప్పందం కుదుర్చుకొని ద్రవ్యమార్పిడి విషయాలను సమన్వయపరచడానికి కృషి చేస్తోంది. సభ్యదేశాలకు ద్రవ్యసంబంధమైన విషయాల్లో సాంకేతిక పరిజ్ఞానం అందజేస్తుంది. అంతర్జాతీయ ఆర్థిక సంబంధ విషయాలను నిశితంగా పరిశీలిస్తుంది. ఐక్యరాజ్యసమితితో ఐఎంఎఫ్ సన్నిహిత సబంధాలు కలిగి ఉంటుంది.





#Tags