CTET Registration Date Extended: అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌.. సీటెట్‌ దరఖాస్తుల గడువు పొడిగింపు

కేంద్రీయ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(CTET) దరఖాస్తు గడువు పొడిగిస్తున్నట్లు సీబీఎస్‌ఈ ప్రకటించింది. గత షెడ్యూల్‌ ప్రకారం ఏప్రిల్‌ 2వ నే సీటెట్‌ దరఖాస్తుల గడువు ముగియగా తాజాగా ఆ గడువును ఏప్రిల్‌ 5 వరకు పొడిగిస్తున్నట్లు సీబీఎస్‌ఈ నిర్ణయం తీసుకుంది. చివరి నిమిషంలో వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ల గడువును పొడిగించారు.

ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ లింక్‌ https://ctet.nic.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సీబీఎస్‌ఈ పేర్కొంది. సీటెట్‌ పరీక్షను జులై 7న దేశ వ్యాప్తంగా 136 నగరాల్లో నిర్వహిస్తారు. ఈ ప‌రీక్ష 20 భాషల్లో ఉంటుంది. సీటెట్‌ స్కోర్‌తో దేశ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకునే అవకాశం లభిస్తుంది.

రెండు పేపర్లుగా సీటెట్‌..

సీటెట్‌ పరీక్షను రెండు పేపర్లుగా నిర్వహిస్తారు. ఒకటి నుంచి అయిదో తరగతి వరకు బోధనకు పేపర్‌-1కు హాజరు కావలసి ఉంటుంది. అదేవిధంగా ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు టీచింగ్‌కు పేపర్‌-2లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.రెండు స్థాయిల్లోనూ బోధించాలనుకునే వారు రెండు పేపర్లకు హాజరై ఉత్తీర్ణత సాధించాలి.

సెంట్రల్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌(సీటెట్‌)పరీక్షలో సాధించిన ఉత్తీర్ణ‌త ఆధారంగానే కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పాఠశాలల ఉపాధ్యాయ నియామకాల్లో పరిగణనలోకి తీసుకుంటారు. సీటెట్‌లో సాధించిన స్కోర్‌కు లైఫ్‌లాంగ్‌ వ్యాలిడిటీ ఉంటుంది.
 

#Tags