AP Bjp new president: ఆంధ్రప్రదేశ్ బీజేపీ కొత్త అధ్య‌క్షురాలిగా దగ్గుబాటి పురంధేశ్వరి..ఈమె రాజకీయ ప్రస్థానం ఇదే

భారతీయ జనతా పార్టీ పలు రాష్ట్రాల పార్టీ చీఫ్‌లను మార్చేస్తూ కీలక నిర్ణయం ప్రకటించింది.
AP Bjp new president:

తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణకు కొత్తగా జి. కిషన్‌రెడ్డిని, అలాగే ఆంధ్రప్రదేశ్‌కు దగ్గుబాటి పురంధేశ్వరిని బీజేపీ కొత్త చీఫ్‌గా నియమిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. 
తెలంగాణ ఎన్నికల మేనేజ్‌మెంట్‌ కమిటీ చైర్మన్‌గా ఈటల రాజేందర్‌ను నియమించింది. అలాగే బీజేపీ జాతీయ కార్యవర్గంలోకి మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డిని సైతం తీసుకుంది. పంజాబ్‌ బీజేపీ అధ్యక్షుడిగా సునీల్‌ జక్కడ్‌ పేరును జార్ఖండ్‌ బీజేపీ చీఫ్‌గా బాబూలాల్‌ మారాండి పేర్లను ప్రకటించారు. 

పురంధేశ్వరి రాజకీయ ప్రస్థానం:

➤ దగ్గుబాటి పురంధేశ్వరి చెన్నైలో ఏప్రిల్‌ 22, 1959లో జన్మించారు. 

➤ స్వర్గీయ నందమూరి తారకరామారావు కుమార్తె. భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు. ఇద్దరు పిల్లలు.

➤ 14, 15వ లోక్‌సభకు రెండుసార్లు కాంగ్రెస్‌ తరపున ఎంపీగా ఎన్నికై,యూపీఏ ప్రభుత్వ హయాంలో కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.

➤ 2004లో కాంగ్రెస్‌ తరపున బాపట్ల ఎంపీగా నెగ్గిన ఆమె, ఆ సమయంలో కేంద్ర సహాయ శాఖ మంత్రిగా పని చేశారు.  

➤ 2009లోనూ విశాఖపట్నం నుంచి రెండోసారి ఎంపీగా నెగ్గి మరోసారి కేంద్ర సహాయశాఖ మంత్రిగా పని చేశారు. 

➤ గృహ హింస బిల్లు, హిందూ వారసత్వ సవరణ బిల్లు, మహిళలకు ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటు లాంటి పలు బిల్లులపై అర్థవంతమైన చర్చల్లో పాల్గొన్నారు. పార్లమెంటులో ఆమె పనితీరును మెచ్చుకుంటూ, ఏషియన్ ఏజ్ ఆమెను 2004-05కి ఉత్తమ పార్లమెంటేరియన్‌గా ఎంపిక చేసింది.

➤ 2014లో బీజేపీలో చేరి, రాజంపేట నుంచి ఎన్నికల్లో పోటీ చేసి ఓడారు.

➤ ఆమె వాగ్ధాటి, ఉచ్చారణ, ఉద్రేకపూరిత ప్రసంగాలకుగానూ ‘‘దక్షిణాది సుష్మా స్వరాజ్’’ బిరుదును తెచ్చిపెట్టాయి. 

➤ ప్రస్తుతం బీజేపీ జనరల్‌ సెక్రటరీ హోదాలో ఉన్నారామె. 

Telangana Bjp new president: తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా జి. కిషన్‌రెడ్డి

#Tags