Skip to main content

నాడు–నేడుతో సర్కారీ బడి.. సరికొత్త సవ్వడి..

నాడు.. వెలిసిపోయిన బ్లాక్బోర్డులు, విరిగిపోయిన బల్లలు, నేలవాలిన ప్రహరీలు, కూలడానికి సిద్ధంగా ఉన్న పైకప్పులు, శిథిల స్థితిలో భవనాలు, వినియోగానికి వీలులేని మరుగుదొడ్లు, పనిచేయని కుళాయిలు, ముంపునకు గురయ్యే ప్రాంగణాలు..
నేడు.. అధునాతన హంగులతో భవనాలు, పక్కాగా నిర్మించిన ప్రహరీలు, కార్పొరేట్కు ధీటుగా ఫర్నిచర్, గ్రీన్ చాక్బోర్డులు, తరగతి గదిలో ఫ్యాన్లు, ట్యూబ్లైట్లు, విజ్ఞానపు బొమ్మలతో ఆసక్తి కలిగించే క్లాస్ రూమ్లు, డిజిటల్ తరగతులు, ఇంగ్లిష్ క్లబ్లు, ఆధునికీకరించిన మరుగుదొడ్లు, ఆహ్లాదం కలిగించే ప్రాంగణాలు, స్వచ్ఛమైన తాగునీటి వసతులు .. ఇది రెండేళ్ల వైఎస్సార్ సీపీ పాలనలో స్పష్టంగా కనిపించిన మార్పు..

విద్యపైనే దేశ భవిష్యత్ ఆధారపడి ఉందని నమ్మిన సీఎం జగన్ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. మనబడి నాడు–నేడులో భాగంగా పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నారు. అత్యాధునిక సౌకర్యాలతో కాన్వెంట్లను తలదన్నేలా తీర్చిదిద్దుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో నాడు–నేడులో భాగంగా 1,117 బడుల అభివృద్ధికి ప్రభుత్వం రూ.230 కోట్లు కేటాయించింది. ఇప్పటివరకూ రూ.226.23 కోట్లను వెచ్చించి 98 శాతం పనులు పూర్తిచేశారు. ఏడాదిలో ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య 25 వేలకు పైగా పెరగడం ప్రభుత్వ కృషికి నిదర్శనం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యారంగానికి ప్రాధాన్యమిస్తూ సీఎం జగన్ పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. అమ్మఒడి, విద్యాకానుక, వసతిదీవెన, విద్యాదీవెన, గోరుముద్ద వంటి పథకాలతో ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తున్నారు. ముఖ్యంగా మనబడి నాడు–నేడులో భాగంగా పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు శ్రీకారం చుట్టారు. కార్పొరేట్ స్థాయిలో సదుపాయాలు కల్పిస్తూ పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు చర్యలు తీసుకున్నారు. పాదయాత్ర సందర్భంగా శిథిలావస్థలో ఉన్న పాఠశాలలను స్వయంగా చూసిన జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాగానే వీటి ప్రక్షాళనకు ఆదేశాలు జారీ చేశారు. నాడు–నేడులో భాగంగా మూడు విడతలతో రాష్ట్రంలోని అన్ని పాఠశాలలను అభివృద్ధి చేయాలని సంకల్పించారు. దీనిలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లాలో మొదటి విడతలో చేపట్టిన పనులు 98 శాతం పూర్తయ్యాయి. కార్పొరేట్ సవ్వడులు నాడు–నేడులో భాగంగా పాఠశాలల భవనాలను ఆధునికీకరించారు. ప్రాంగణాలను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేలా మొక్కలు నాటారు. తరగతి గదుల్లో ట్యూబ్లైట్లు, ఫ్యాన్లు, ఫర్నిచర్, గ్రీన్ చాక్బోర్డులు ఏర్పాటుచేయడంతో పాటు గోడలను విజ్ఞానాన్ని అందించే బొమ్మలతో తీర్చిదిద్దారు. వీటితో పాటు డిజిటల్ తరగతి గదులు, ఇంగ్లిష్ ల్యాబ్లు ఏర్పాటుచేస్తున్నారు. ముఖ్యంగా పాఠశాలల్లో అధ్వానంగా ఉన్న మరుగుదొడ్లను ఆధునికీకరించి అందుబాటులోకి తీసుకువచ్చారు. తాగునీటి కోసం కుళాయిలు ఏర్పాటుచేశారు. మొత్తంగా పాఠశాలలను నందవనంలా తీర్చిదిద్దారు. మొదటి విడతలో రూ.230 కోట్లు జిల్లాలో మొదటి విడత నాడు–నేడు పనులకు 1,117 పాఠశాలలను ఎంపిక చేసి రూ.230 కోట్లు కేటాయించారు. ఇప్పటివరకు సుమారు 98 శాతం పనులను రూ.226.23 కోట్లతో పూర్తిచేశారు. సమగ్ర శిక్ష అభియాన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, గిరిజన సంక్షేమ శాఖ, పంచాయతీరాజ్ శాఖ, ఆంధ్రప్రదేశ్ విద్య, సంక్షేమ, మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ ఆధ్వర్యంలో పనులు చేయిస్తున్నారు.

శాఖ

పాఠశాలలు

నిధులు (రూ. కోట్లలో..)

సమగ్రశిక్ష అభియాన్‌

220

45.74

మున్సిపల్‌ అడ్మినిస్టేషన్‌, అర్బన్‌ డెవలప్‌మెంట్‌

72

18.61

గిరిజన సంక్షేమ శాఖ

61

15.52

పంచాయతీరాజ్‌ శాఖ

582

112.32

విద్య, సంక్షేమ, మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్‌

182

34.04


పెరుగుతున్న విద్యార్థుల సంఖ్య
నాడు–నేడు పనులతో పాఠశాలలు ఆహ్లాదంగా మారడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆలోచనా విధానంలో మార్పు కనిపిస్తోంది. ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. జిల్లాలో ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 3,280 ఉండగా 2019–20 విద్యాసంవత్సరంలో 2,85,315 మంది విద్యార్థులు ఉన్నారు. ఆ సంఖ్య 2020–21 విద్యా సంవత్సరంలో 3,11,178కి చేరుకుంది. ఈ లెక్కన ఏడాదిలో 25,863 మంది విద్యార్థుల సంఖ్య పెరిగింది. గతేడాది కరోనా తొలిదశ సమయంలోనూ తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలపైనే తమ విశ్వాసాన్ని ప్రదర్శించారు.

ప్రాథమిక పాఠశాలలు

2,532

ప్రాథమికోన్నత పాఠశాలలు

252

ఉన్నత పాఠశాలలు

496

మొత్తం

3,280


విద్యార్థులు

2019–20

2,85,315

2020–21

3,11,178

ఏడాదిలో పెరుగుదల

25,863

Published date : 16 Jul 2021 03:54PM

Photo Stories