NTA: JEE 2024కి భారీగా నమోదు.. జనవరి సెషన్కు ఇన్ని లక్షల దరఖాస్తులు
![jee main 2024 exam registration applications JEE Main Students preparing for IITs and NITs entrance](/sites/default/files/images/2023/12/25/jee2024-1703494956.jpg)
జనవరిలో జరగనున్న తొలిసెషన్కు దాదాపు 12.30 లక్షల మందికిపైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇది 2023లో జరిగిన రెండు సెషన్ల రిజిస్ట్రేషన్ల కంటే 68 వేలు ఎక్కువ. 2023 జనవరి సెషన్తో పోలిస్తే 3.70 లక్షల మంది అభ్యర్థులు పెరిగారు.
మొత్తం దరఖాస్తుదారుల్లో పురుషులు 8,23,842 మంది, మహిళలు 4,06,486 మంది ఉన్నారు. పేపర్–1 (బీటెక్, బీఈ)కు 6.40 లక్షల మంది, పేపర్–2 (ఆర్కిటెక్చర్, ప్లానింగ్)కి 5,89,834 మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) దరఖాస్తుల్లో తప్పుల సవరణకు ఇచ్చిన గడువు ముగిసింది.
జనవరి 24వ తేదీ నుంచి ఫిబ్రవరి 1వ తేదీ మధ్య నిర్వహించనున్న ఈ పరీక్షలకు అడ్మిట్ కార్డులను ఎన్టీఏ జనవరి రెండోవారం నుంచి అందుబాటులో ఉంచనుంది. ఫిబ్రవరి 12వ తేదీ ఫలితాలను వెల్లడించనుంది.
చదవండి: జేఈఈ (మెయిన్స్ & అడ్వాన్స్డ్) - గైడెన్స్ | వీడియోస్
రాష్ట్రం నుంచి పెరిగిన దరఖాస్తులు
తెలుగు రాష్ట్రాల్లో జేఈఈ మెయిన్ రిజిస్ట్రేషన్లు గణనీయంగా పెరుగుతున్నాయి. 2024 జనవరి సెషన్కు 1,62,624 మంది దరఖాస్తుదారులతో మహారాష్ట్ర మొదటిస్థానంలో ఉంది. 2023లో జరిగిన రెండు సెషన్లకు కలిపి మహారాష్ట్రలో 1,39,696 మంది దరఖాస్తు చేసుకున్నారు.
2023లో రెండు సెషన్లకు కలిపి ఆంధ్రప్రదేశ్లో 1,01,745 మంది దరఖాస్తు చేసుకోగా ఇప్పుడు 2024 తొలిసెషన్కే 1,34,703 మంది దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తోంది. 2023లో రెండు సెషన్లకు కలిపి తెలంగాణలో 95,411 మంది దరఖాస్తు చేసుకోగా ఇప్పుడు జనవరి సెషన్కు 1,26,746 మంది నమోదయ్యారు.ఆ తర్వాతి స్థానాల్లో ఉత్తరప్రదేశ్ (1,25,272 మంది), కర్ణాటక (79,229) ఉన్నాయి.
చదవండి: JEE Success Tips : జేఈఈ మెయిన్స్ & అడ్వాన్స్డ్ రాసే విద్యార్థులకు నా సలహా ఇదే..
గతేడాది నుంచి మార్పు
కరోనా తర్వాత రిజిస్ట్రేషన్లలోనే కాకుండా తరువాత పరీక్షలకు హాజరవుతున్న వారిసంఖ్య తగ్గిపోయింది. జేఈఈ మెయిన్కు, జేఈఈ అడ్వాన్స్కు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. 2017 నుంచి 2022 వరకు గణాంకాలు ఈ తగ్గుదలను స్పష్టం చేస్తున్నాయి. ఏటా ఈ పరీక్షకు లక్ష నుంచి లక్షన్నర మంది వరకు తగ్గిపోయారు. కానీ.. 2023 సెషన్లు ఈ పరిస్థితిని మార్చేశాయి.
చదవండి: JEE Mains 2024: వీలైనంత దగ్గరగా జేఈఈ పరీక్ష కేంద్రం
2023లో జేఈఈ మెయిన్కు సుమారు 11.62 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. గతేడాది షెడ్యూల్ ప్రకటన ఆలస్యం కావడంతోపాటు పరీక్షలకు వ్యవధి ఎక్కువ లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్షల వాయిదా కోసం కొందరు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించగా కోర్టు అందుకు అంగీకరించలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో పరీక్షకు హాజరయ్యే వారిసంఖ్య తక్కువగానే ఉండవచ్చని అభిప్రాయపడినా.. దరఖాస్తుదారుల సంఖ్య భారీగా పెరిగింది.
జేఈఈ మెయిన్ పరీక్షకు 2017లో 11,86,454 మంది దరఖాస్తు చేయగా 2022లో ఆ సంఖ్య 10,26,799కు తగ్గింది. 2017లో 11,22,351 మంది పరీక్షకు హాజరు కాగా 2022 నాటికి వారిసంఖ్య 9,05,590కి తగ్గింది. 2023లో దరఖాస్తులు పెరగడంతోపాటు 11.13 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. ఇక జేఈఈ మెయిన్ తరహాలోనే అడ్వాన్స్కు దరఖాస్తులతోపాటు అర్హత సాధిస్తున్నవారు పెరుగుతున్నారు.
2023లో అడ్వాన్స్ పరీక్షకు అర్హులైన 2.50 లక్షల మందిలో 1.89లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 43,773 మంది అడ్వాన్స్లో ర్యాంకులు సాధించారు.
2017 నుంచి 2023 వరకు మెయిన్ పరీక్షకు నమోదు చేసుకున్న, పరీక్ష రాసిన విద్యార్థుల వివరాలు
సంవత్సరం |
నమోదు చేసుకున్నవారి సంఖ్య |
పరీక్షకు హాజరైనవారి సంఖ్య |
2017 |
11,86,454 |
11,22,351 |
2018 |
11,48,000 |
10,43,000 |
2019 |
12,37,892 |
11,47,125 |
2020 |
11,74,000 |
10,23,000 |
2021 |
10,48,012 |
9,39,008 |
2022 |
10,26,799 |
9,05,590 |
2023 |
11,62,000 |
11,13,325 |
2017 నుంచి 2023 వరకు అడ్వాన్స్కు అర్హత సాధించిన, అడ్వాన్స్కు దరఖాస్తు చేసుకున్న, ర్యాంకులు సాధించిన విద్యార్థుల వివరాలు
సంవత్సరం |
అడ్వాన్స్కు అర్హత సాధించినవారు |
అడ్వాన్స్కు దరఖాస్తు చేసుకున్నవారు |
ర్యాంకులు సాధించినవారు |
2017 |
2,21,834 |
1,71,000 |
51,000 |
2018 |
2,31,024 |
1,65,656 |
31,988 |
2019 |
2,45,194 |
1,74,432 |
38,705 |
2020 |
2,50,681 |
1,50,838 |
43,204 |
2021 |
2,50,597 |
1,41,699 |
41,862 |
2022 |
2,10,251 |
1,55,538 |
40,712 |
2023 |
2,50,000 |
1,89,744 |
43,773 |
పోటీతత్వంతో ఉండేది కొందరికే
ఐఐటీల్లో 17 వేల వరకు సీట్లుండగా ఎన్ఐటీ తదితర జాతీయ విద్యాసంస్థల్లోని సీట్లన్నీ కలిపి మరో 39 వేల వరకు పెరిగాయి. వీటికి ఏటా పోటీపడుతున్న 12 లక్షల మందికి పైగా విద్యార్థుల్లో సీరియస్గా ప్రిపేర్ అవుతున్నది కొందరేనని కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు చెబుతున్నారు. 50 శాతం మంది ఏదో దరఖాస్తు చేశామనిపించుకోవడమే తప్ప పరీక్షలకు అసలు సిద్ధం కావడంలేదని పేర్కొంటున్నారు.