Skip to main content

క్యాంపస్ ప్లేస్‌మెంట్స్.. తాజా పరిస్థితులు..

కాలేజీ ఏదైనా.. ఏ కోర్సులో చేరినా.. ముఖ్యంగా ఇంజనీరింగ్ విద్యార్థుల దృష్టంతా.. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌పైనే ఉంటుంది. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఎంపికై కార్పొరేట్ కంపెనీల్లో కెరీర్ సొంతం చేసుకోవాలని కలలు కంటారు. ఇంజనీరింగ్‌లో చేరబోయే విద్యార్థి సైతంఏ కాలేజీలో ప్లేస్‌మెంట్స్ బాగున్నాయో తెలుసుకొని మరీ అడుగు ముందుకేస్తాడు. ఇక నాలుగేళ్ల ఇంజనీరింగ్ కోర్సు ఫైనల్‌కు చేరుకున్న విద్యార్థిలో ఉండే ఉత్కంఠ అంతాఇంతా కాదు. ప్రస్తుత విద్యా సంవత్సరం మొదలైన నేపథ్యంలో.. క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్ తాజా పరిస్థితులపై టీసీఎస్ వైస్ ప్రెసిడెంట్ అండ్ రీజినల్ హెడ్, ది ఐటీ అండ్ ఐటీఈఎస్ ఇండస్ట్రీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ITS-AP) అధ్యక్షుడు వి.రాజన్నతో ఇంటర్వ్యూ..

ఆర్థిక సంవత్సరమే ఆధారం:
కంపెనీలు ఆయా ఆర్థిక సంవత్సరంలో చేపట్టాల్సిన నియామకాలపై నిర్దిష్ట విధానాలను అవలంబిస్తాయి. ఈ క్రమంలో 2013-14 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్ 2012-13లోనే ముగిశాయి. ఒక్క ఐటీ రంగంలోనే దేశవ్యాప్తంగా 1.9 లక్షల మంది విద్యార్థులను క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్ ద్వారా ఎంపిక చేయడం జరిగింది. వీరిలో మన రాష్ట్రం వాటా 15 శాతం వరకు ఉంటుంది. ఎంపికైన విద్యార్థులు కోర్సు పూర్తి చేసుకుని ఆయా సంస్థల్లో విధుల్లో చేరుతున్నారు.

విద్యార్థుల కోణంలో.. సెప్టెంబర్/అక్టోబర్:
ఈ విద్యా సంవత్సరానికి(2013-14) సంబంధించి కంపెనీలు సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో క్యాంపస్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియను ప్రారంభించే అవకాశముంది. అందులో ఎంపికైన విద్యార్థులు 2014-15 ఆర్థిక సంవత్సరంలో సంస్థల్లో అడుగుపెడతారు. కాబట్టి క్యాంపస్ సెలక్షన్ లక్ష్యంగా పెట్టుకున్న విద్యార్థులు ఇప్పట్నుంచే ఆ దిశగా కృషి చేయాలి. కంపెనీలు ఆశించే అకడమిక్ నైపుణ్యాలతోపాటు, బిహేవియర్ స్కిల్స్‌నూ మెరుగుపరచుకోవాలి.

పరిస్థితులు ఆశాజనకంగానే:
రూపాయి విలువ క్షీణత, ఆయా సంస్థల ఆర్థిక ఫలితాల్లో కొంత ప్రతికూలతలు వంటి కారణాలతో.. ఆ ప్రభావం క్యాంపస్ నియామకాలపై పడుతుందని ఆందోళన చెందనక్కర్లేదు. ప్రధానంగా ఐటీ, ఐటీ అనుంబంధ రంగాలు, ఇతర రంగాలు అన్నింటిలోనూ భవిష్యత్తు అవకాశాలు ఆశాజనకంగానే ఉంటాయి. ముఖ్యంగా నాస్‌కామ్ అంచనా ప్రకారం- ఐటీ రంగంలో 2013-14లో పురోగతి గత ఏడాది మాదిరిగానే ఉంటుందని, ఐటీ ఎగుమతులు 12 నుంచి 14 శాతానికి వృద్ధి చెందుతాయని, దేశీయంగా ఐటీ రంగం 13 నుంచి 15 శాతం వృద్ధి సాధిస్తుందని పేర్కొంది. ఇది అటు ఇండస్ట్రీకి శుభవార్తే. కాబట్టి ఈ ఏడాది ఐటీ రంగంలో అధిక నియామకాలకు అవకాశం ఏర్పడనుంది. ప్రస్తుతం కోర్ సబ్జెక్ట్‌తో సంబంధం లేకుండా.. అన్ని బ్రాంచ్‌లు, కోర్సుల వారికి ఐటీ రంగం అవకాశం కల్పిస్తున్న కారణంగా విద్యార్థులు క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్ విషయంలో ఆందోళన చెందకుండా.. కరిక్యులంపై దృష్టిపెట్టి సబ్జెక్ట్ నాలెడ్జ్ సొంతం చేసుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వాలి.

‘కోర్’ బ్రాంచ్‌లకు ప్రాధాన్యం!:
క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్ ప్రక్రియలో ఐటీ కంపెనీలు ఐటీ సంబంధిత గ్రూప్‌లతోపాటు కోర్ బ్రాంచ్‌లకు కూడా సమప్రాధాన్యం ఇస్తున్న మాట వాస్తవమే. ఇందుకు కారణం.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది ఒక హారిజాంటల్ ప్రక్రియ. మరోవైపు ప్రతి రంగంలోనూ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ వినియోగం పెరిగింది. దీంతో ఐటీ సంస్థలు పలు రంగాలకు అంటే.. హెల్త్‌కేర్, మ్యాన్యుఫ్యాక్చరింగ్, బ్యాంకింగ్, టూరిజం.. ఇలా దాదాపు ప్రతి రంగానికి సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ సంబంధిత సేవలందిస్తున్నాయి. ఈ క్రమంలో ఐటీ సంస్థలకు ఐటీ నిపుణులతోపాటు సంబంధిత రంగ నిపుణుల అవసరం ఉంటుంది. ఉదాహరణకు బ్యాంకింగ్ రంగాన్నే పరిగణనలోకి తీసుకుంటే.. ఆ రంగంలోని ఒక సంస్థకు ఐటీ సంబంధిత సేవలందించే క్రమంలో బ్యాంకింగ్ డొమైన్ నాలెడ్జ్ కలిగిన వ్యక్తి ఉంటే క్లయింట్ వాస్తవ అవసరాలకు అనుగుణంగా ప్రొడక్ట్ రూపొందించొచ్చు. ఇదే దృష్టితో హెల్త్‌కేర్ రంగానికి సేవలందించే క్రమంలో టీసీఎస్ సంస్థ వైద్యులను కూడా నియమిస్తోంది. ఇలా ఏ రంగానికి సేవలందిస్తామో ఆ రంగానికి చెందిన నిపుణులను నియమించుకుంటున్నాం. అందుకే కోర్ బ్రాంచ్ ఉత్తీర్ణులను కూడా ఐటీ సంస్థలు ప్రాధాన్యమిస్తున్నాయి. అలాగని.. కోర్ బ్రాంచ్ విద్యార్థులు తమ బ్రాంచ్‌ల ప్రాధాన్యం తగ్గిందని ఆందోళన చెందక్కర్లేదు. వారికి కూడా కోర్ సెక్టార్‌లోనే కోరినన్ని జాబ్స్ అందుబాటులో ఉన్నాయి. ఆ సంస్థలు కూడా క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్ నిర్వహిస్తున్నాయి.

టెక్నికల్ వర్సెస్ ట్రెడిషనల్:
క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్‌లో సంస్థలు టెక్నికల్ విద్యార్థులకే ప్రాధాన్యమిస్తున్నాయని.. సంప్రదాయ డిగ్రీ విద్యార్థులకు అవకాశాలు అందట్లేదనేది కూడా అవాస్తవం. డిగ్రీ విద్యార్థులకు కూడా ఇప్పుడు అవకాశాలు విస్తరించాయి. ఐటీ సంబంధిత సర్వీసులైన బీపీఓ, కాల్ సెంటర్ వంటి వాటిలో సంప్రదాయ డిగ్రీ విద్యార్థులను సంస్థలు నియమిస్తున్నాయి. ఇందుకోసం క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్ కూడా నిర్వహిస్తున్నాయి. అంతేకాకుండా APSWAN, పాస్‌పోర్ట్ హెల్ప్‌లైన్ సెంటర్లు వంటి సంస్థల్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫైలింగ్ తదితర అవసరాలకు సంప్రదాయ డిగ్రీ విద్యార్థులకు అవకాశాలు లభిస్తున్నాయి. సంప్రదాయ డిగ్రీ విద్యార్థుల విషయంలో ప్రధాన సమస్య.. సాఫ్ట్‌స్కిల్స్ లోపం. క్యాంపస్ సెలక్షన్ కోరుకునే డిగ్రీ విద్యార్థులు సబ్జెక్ట్ నాలెడ్జ్‌తోపాటు సాఫ్ట్‌స్కిల్స్‌ను మెరుగుపరచుకోవాలి.

వ్యక్తిగత పరిమితులకు స్వస్తి:
క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్ కోరుకునే విద్యార్థులు ప్రధానంగా తమ వ్యక్తిగత పరిమితులకు స్వస్తి పలకాలి. ‘ఫలానా ఉద్యోగమే రావాలి.. లేదా ఫలానా జీతమే రావాలి, లేదా ఫలానా ప్రాంతం లేదా సంస్థలోనే పని చేయాలి’ అనే ఆలోచనను వీడాలి. అప్పుడు అవకాశాలు విస్తరిస్తాయి. గత ఆర్థిక సంవత్సరంలో.. ఒక్క ఐటీ రంగంలోనే దాదాపు రెండు లక్షల క్యాంపస్ సెలక్షన్స్ జరిగాయి. మేం ప్రత్యక్షంగా గమనించిన విషయం ఏంటంటే.. కేవలం పైన పేర్కొన్న వ్యక్తిగత పరిమితుల కారణంగా కొందరు వచ్చిన ఆఫర్లను వదులుకుంటున్నారు. ఇలాంటి వైఖరి సరికాదు. వాస్తవానికి ఐటీ అంటే.. గ్లోబల్ ప్రొఫెషన్. అందుకు అనుగుణంగా సదరు అభ్యర్థి ప్రపంచంలో ఏ ప్రాంతంలో పనిచేయడానికైనా సిద్ధపడాలి. అలాంటి దృక్పథం ఉంటే వ్యక్తిగత వృద్ధి సాధ్యమవుతుంది.

అకడమిక్ పరంగా అవసరమైనవివే:
క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో సెలక్షన్ కోరుకునే విద్యార్థులు అకడమిక్ పరంగా కనీసం నాలుగు కోర్ సబ్జెక్టుల్లో, కనీసం రెండు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లలో(ఉదా: సి++, జావా) నిష్ణాతులు కావాలి. వాస్తవానికి క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్ ఇంటర్వ్యూ సమయంలో అధిక శాతం సంస్థలు సాధారణంగా అడిగే తొలి ప్రశ్న.. What is Your Favourite Subject? And Why? ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చేలా విద్యార్థులు సన్నద్ధం కావాలి. ఏదో ఆ సమయానికి స్ఫురించిన సబ్జెక్ట్‌ను చెప్పడం సరికాదు. అందుకే పైన పేర్కొన్నట్లు కోర్ సబ్జెక్టుల్లో తమకు బాగా నచ్చిన వాటిపై అన్ని కోణాల్లో పట్టు సాధించాలి. అప్పుడు ఎలాంటి ప్రశ్నలు ఎదురైనా ఇట్టే సమాధానం ఇవ్వగలిగే నైపుణ్యం అలవడుతుంది.

సంపూర్ణ అవగాహనతో:
విద్యార్థులు గుర్తించాల్సిన మరో విషయం.. ఏ సంస్థ కూడా కరిక్యులం, సిలబస్‌ను మించి విద్యార్థి నుంచి అదనంగా ఏమీ ఆశించదు. వాస్తవానికి ప్రస్తుత మన కరిక్యులం ఎంతో నాణ్యమైంది. పరిశ్రమ అవసరాలకు సరితూగే రీతిలోనే ఉంది. కానీ విద్యార్థులు సరిగా ఆకళింపు చేసుకోవట్లేదు. కరిక్యులంలో పరిపూర్ణత సాధిస్తే జాబ్ సొంతమైనట్లే. కాబట్టి విద్యార్థులు అకడమిక్స్‌లో, ముఖ్యంగా ప్రాజెక్ట్‌వర్క్, తాము ఎంచుకున్న టాపిక్ ప్రాధాన్యం వంటి విషయాల్లో సంపూర్ణ అవగాహనతో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ప్రక్రియలో అడుగుపెట్టాలి.

భవిష్యత్తు బంగారుమయం:
భారతదేశం అన్ని రంగాల్లో వేగంగా పురోగతి సాధిస్తోంది. జీడీపీ పరంగా ప్రస్తుతం కొంత మందగమన పరిస్థితులు ఉన్నప్పటికీ.. 7 నుంచి 8 శాతం మధ్యలో అది నమోదవుతోంది. ఇదే పారిశ్రామిక ప్రగతికి నిదర్శనం. ఒక్క ఐటీ రంగాన్నే తీసుకుంటే.. నాస్‌కామ్ అంచనాల ప్రకారం- 2020 నాటికి ఐటీ పరిశ్రమ 225 బిలియన్ డాలర్ల వృద్ధి సాధించనుంది. దీనికి అనుగుణంగా 30 మిలియన్ల మందికి ఈ రంగంలో ఉపాధి లభించనుంది. మరోవైపు ఐటీ సంస్థలు అన్ని గ్రూప్‌ల విద్యార్థులకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. కాబట్టి ప్రస్తుతం సంభవిస్తున్న చిన్నపాటి ఆర్థిక ఒడిదుడుకులు, వాటి ప్రభావం ఉపాధిపై ఉంటుందనే భయాన్ని విద్యార్థులు వదిలేయాలి. ప్రభుత్వం హార్డ్‌వేర్ పరిశ్రమను కూడా బలోపేతం చేసే దిశగా చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో.. సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ సంబంధిత రంగాల్లో భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉంటాయి.

బ్యాక్‌లాగ్స్ లేకుండా చూసుకోండి:
పొఫెషనల్ డిగ్రీ కోర్సుల్లో బ్యాక్‌లాగ్స్ అంటే ఏదో ఒక సబ్జెక్ట్‌లో ఫెయిలై తర్వాత ఉత్తీర్ణత సాధించడం కంపెనీల కోణంలో ఆహ్వానించదగినది కాదు. కోర్సును నిర్దిష్ట వ్యవధిలో పూర్తి చేసినప్పటికీ మొత్తం కోర్సులో ఏ ఒక్క సబ్జెక్ట్‌నైనా బ్యాక్‌లాగ్ విధానంలో ఉత్తీర్ణత సాధిస్తే అది విద్యార్థి కోణంలో ప్రతికూల అంశమే. అంతేకాకుండా 60 నుంచి 65 శాతం మార్కులు పొందేలా కృషి చేయాలి. ప్రస్తుతం అనేక సంస్థలు కనీసం 60 శాతం వారికే ప్రాధాన్యమిస్తున్నాయి.

IV/1, IV/2 ఏదైనా ఒకటే:
మన ఇంజనీరింగ్ విద్యలో సెమిస్టర్ విధానం అమల్లో ఉన్న విషయం తెలిసిందే. క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్‌కు IV/2 (ఇంజనీరింగ్ చివరి సెమిస్టర్)లో వెళ్లాలని నాస్‌కామ్ సూచించింది. కొన్ని కంపెనీలు IV/1 (ఏడో సెమిస్టర్)లోనే అనుమతిస్తే తమకు అనుకూలంగా ఉంటుందని నాస్‌కామ్ దృష్టికి తీసుకెళుతున్నాయి. కానీ నా అభిప్రాయంలో ఈ రెండు సెమిస్టర్లలో ఎప్పుడు క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్ నిర్వహించినా పెద్దగా తేడా ఉండదు. ముందుగానే వీటిని నిర్వహించి ఆఫర్ లెటర్స్ అందిస్తే విద్యార్థులు అకడమిక్స్‌పై ఆసక్తి తగ్గిస్తున్నారనే వాదన కూడా ఉంది. ఇది కొంత వాస్తవమే. అందుకే టీసీఎస్ సంస్థ క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్‌లో ఆఫర్ పొంది.. కంపెనీలో చేరే వరకు విద్యార్థుల కోసం పరిశ్రమ తీరుతెన్నులు తెలుసుకునే విధంగా ప్రత్యేకంగా వెబ్‌పోర్టల్ రూపొందించడం జరిగింది. దీనిద్వారా సంస్థలో తాజా పరిణామాలు తెలుసుకునే వెసులుబాటుతోపాటు, తాము మెరుగుపరచుకోవాల్సిన అంశాలపై అవగాహన లభిస్తుంది. సంస్థలో అడుగుపెట్టాక కంపెనీ అవసరాలు, దానికి సంబంధించిన నైపుణ్యాలు సొంతం చేసుకునేలా రెండు నెలల క్లాస్ రూం శిక్షణ కూడా నిర్వహిస్తున్నాం. దాదాపు ప్రతి సంస్థ కూడా ఇలాంటి శిక్షణ విధానాన్ని అనుసరిస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో సాఫ్ట్‌వేర్ సంస్థల మొత్తం టర్నోవర్ 108 బిలియన్ డాలర్లలో రెండు శాతాన్ని క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో ఎంపికైన అభ్యర్థుల శిక్షణకు కేటాయించాయి. దీనివల్ల ఏ బ్రాంచ్ విద్యార్థిని ఎంపిక చేసినా.. కంపెనీ అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాలు సొంతమవుతాయి.

బిజినెస్ స్కిల్స్ పెంచుకుంటే మరింత బాగు:
కాలేజీ నుంచి కంపెనీకి మారడం అనేది విద్యార్థి జీవితంలో ఒక పెద్ద సవాలు. కాలేజీ లైఫ్, కంపెనీలో పరిస్థితులు.. రెండూ దేనికదే పూర్తిగా భిన్నం. వీటి మధ్య సమతుల్యత సాధించాలంటే.. విద్యార్థులు కోర్సు సమయం నుంచే సాఫ్ట్‌స్కిల్స్(కంపెనీల పరిభాషలో బిజినెస్ స్కిల్స్) పెంచుకోవాలి. ముఖ్యంగా ఇంగ్లిష్ స్పీకింగ్ స్కిల్స్, ఇంటర్ పర్సనల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, టీం వర్కింగ్ స్కిల్స్ వంటి నైపుణ్యాలు పెంచుకోవాలి. అన్నిటికంటే ముఖ్యమైనది దృక్పథం(ఆటిట్యూడ్). వర్క్ కల్చర్‌లో ఇది ఎంతో ముఖ్యమైంది. ‘ఆటిట్యూడ్ ఈజ్ బ్యూటీ’ అనే నానుడి కూడా ఉంది. మన వైఖరి, దృక్పథం ఎంత సానుకూలంగా ఉంటే.. కెరీర్‌లో పురోగతి అంత ఉన్నతంగా ఉంటుంది.

విద్యార్థులకు సలహా:
టెక్నికల్, మేనేజ్‌మెంట్, మరే ఇతర ప్రొఫెషనల్ కోర్సు విద్యార్థులైనా.. కాలేజీలో చేరే నాటికే తమ లక్ష్యంపై స్పష్టతతో అడుగుపెట్టాలి. అలా అడుగుపెట్టాక లక్ష్యం ఛేదించే విధంగా తొలిరోజు నుంచే కృషి చేయాలి. ఇప్పుడు ఏ రంగంలోనైనా ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కానీ వాటిని అందిపుచ్చుకునే బాధ్యత విద్యార్థి జ్ఞాన సముపార్జనపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి తాజాగా ఈ విద్యా సంవత్సరంలో ఆయా కోర్సుల్లో చేరనున్న విద్యార్థులు.. జాబ్ మార్కెట్ ట్రెండ్స్, క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్ వంటి విషయాల్లో చోటుచేసుకునే ఒడిదుడుకుల వంటి వాటి గురించి ఆందోళన చెందకుండా.. అకడమిక్స్‌పై పట్టు సాధించే విధంగా చదవాలి. తాము చేరిన కోర్సులో అత్యున్నత నైపుణ్యం సాధించేలా అధ్యయనం చేయాలి. అప్పుడు ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా అవకాశం సొంతమవుతుంది.

Published date : 01 Aug 2013 04:37PM

Photo Stories