Skip to main content

వాయు కాలుష్యం

తినే తిండి విషయంలో శ్రద్ధ పెరిగింది. తాగే నీటి విషయంలో మరింత జాగ్రత్త పడుతున్నాం. కానీ, పీల్చే గాలి విషయంలో మనకింకా ఆ స్పృహ రాలేదు. నిజానికి, తిండికన్నా, నీటికన్నా గాలినే మనం ఎక్కువగా వినియోగి స్తాం. అనుక్షణం ఆక్సిజన్ మన శరీరంలోని అణువణువుకూ అందాలి. అప్పుడే మనం సజీవంగా ఉండగలుగుతాం. సృష్టిలో జీవులకు, నిర్జీవులకు మధ్య తేడా అదే! మృత శరీరాల్లా కుళ్లిపోకుండా మనం మనగలుగుతున్నా మంటే అందుకు కారణం ప్రాణవాయువే. ఆ గాలి ఎంతగా కాలుష్యమౌతోందంటే, అది మన మనుగడకే శాపంగా మారింది. విషవాయువుల్ని పీలుస్తూ మనకు తెలియకుండానే మనం మన ఆయుర్దాయాన్ని కోల్పోతున్నాం. ఇందులో మన పాత్ర ఎంత? అనేది నేరుగా సమాధానం లభించని ప్రశ్న. ఎవరైనా కోరుకునేది స్వచ్ఛమైన గాలినే. కానీ, మనకు లభిస్తున్న గాలి స్వచ్ఛమైనదిగా కాక, కలుషితమై ఉండటానికి కారణాలేంటి? మన చుట్టూ ఉన్న గాలి కలుషితమైపోవడంలో ఎవరి పాత్ర ఎంత? ఇవి మనం తప్పక తెలుసుకోవాల్సిన అంశాలు.
అవగాహన ఉంటే.. వ్యక్తులుగా, సమూహాలుగా, పౌర సమాజంగా, కడకు ప్రభుత్వాలుగా తప్పులు చేయకుండా ఉండటానికి, చేసిన తప్పుల్ని సరిదిద్దుకొని బాధ్యతగా నడచుకోవడానికి అవకాశం లభిస్తుంది. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన చికాగో, హార్వర్డ్, యేల్ విశ్వవిద్యాలయాలకు చెందిన ఆర్థికవేత్తలు ఇటీవల జరిపిన ఒక అధ్యయనంలో గగుర్పాటు కలిగించే అంశాలు వెల్లడయ్యాయి. వాయు కాలుష్యం వల్ల మన దేశ జనాభాలో సగానికంటే ఎక్కువ మంది ఆయుర్దాయం సగటున మూడేసి సంవత్సరాలుతగ్గిపోతోంది! ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అధ్యయనం ప్రకారం ప్రపంచంలోని 20 అత్యంత వాయుకాలుష్య నగరాల్లో 13 నగరాలు భారత్‌లోనివే కావడాన్ని బట్టి సమస్య తీవ్రత స్పష్టమౌతోంది.

నిర్లక్ష్యం, లెక్కలేనితనం వల్ల ఈ దుస్థితి
వాయు కాలుష్యం పట్టణాలు, నగరాల్లోనే ఎక్కువ. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు, విద్య-వైద్య సదుపాయాలు కొరవడటం వంటి కారణా లతో పట్టణాలు, నగరాలకు వలసలు పెరిగాయి. గత ఒకటి, రెండు దశాబ్దా లుగా మన పట్టణ జనాభా అపరిమితంగా పెరుగుతోంది. తాజా అధ్యయనం ప్రకారం, వాయు కాలుష్యం వల్ల దేశంలో 66 కోట్ల మంది ఆయుష్షు సగటున 3.2 సంవత్సరాలు తగ్గుతోంది. అందులో అత్యధికులు నగర, పట్టణ ప్రాం తాల్లో ఉండేవారే! వాయు కాలుష్యం వల్ల ఆయుర్దాయం తగ్గడమే కాదు, పనిలో సామర్థ్యం, ఉత్పాదకత తగ్గిపోతున్నాయి. అనారోగ్యం, వైద్య ఖర్చులు పెరుగుతున్నాయి. విశ్వ ప్రమాణాల ప్రకారం ఢిల్లీ మహానగరమే అత్యం త కాలుష్య నగరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. దేశ రాజధాని పరిస్థితే ఇలా ఉంటే, ఇక ఇతర నగరాలు, పట్టణాల్లో పరిస్థితి ఏమిటన్నది పెద్ద ప్రశ్న. పారిశ్రామిక వ్యర్థాలతో, వాహనాలు వెలువరించే విష వాయు వులతో, పచ్చదనాన్ని మింగేస్తూ విస్తరిస్తున్న కాంక్రీట్ నిర్మాణాలతో, ప్లాస్టిక్ తదితర చెత్త కాల్చివేతలతో పట్టణ ప్రాంతాలు కాలుష్య కాసారాలవుతు న్నాయి. సగటు మనిషి జీవనం అత్యంత దుర్భరంగా తయారవుతోంది. కంటి, చర్మ, శ్వాసకోశ సంబంధ వ్యాదులతో పాటు క్యాన్సర్ వంటి ప్రమాద కరమైన జబ్బులూ నగరజీవుల్ని గుల్లచేస్తున్నాయి. అతి శీతల పరిస్థితుల్లో మాత్రమే ఉండే స్వైన్ ఫ్లూ వంటి ప్రాణాంతక జబ్బులు చలి తగ్గి, ఉష్ణోగ్రతలు పెరిగిన తర్వాత కూడా కొనసాగడానికి వాతావరణ కాలుష్యమే కారణమంటున్నారు నిపుణులు. కాలుష్యనియంత్రణకు పటిష్టమైన చర్యలను చేపట్టడంలో, చట్టాల అమలుపై శ్రద్ధ వహించడంలో ప్రభుత్వాలు విఫలమౌతున్నాయి. పర్యవేక్షణ, నియంత్రణ వ్యవస్థలు నిద్రాణస్థితిలో ఉండటం, పౌరుల్లో అవగాహన పెంచకపోవడం వంటివి సమస్యను మరింత తీవ్రం చేస్తున్నాయి. ప్రభుత్వాల నిరక్ష్యానికి పౌర సమాజపు అలసత్వం, వ్యక్తులుగా పౌరుల ఉదాసీనత తోడై అగ్నికి ఆజ్యం పోసినట్లు వాయు కాలుష్యం విజృంభిస్తోంది.

మూలాల్లోకి వెళితేనే పరిష్కారాలు
జీవం అస్థిత్వానికే మూలాధారమైన గాలి విషతుల్యం కావడానికి ఏయే అంశాలు దోహదం చేస్తున్నాయి? వివిధ స్థాయిల్లో ప్రత్యేక చర్యల ద్వారా ఈ సమస్యను నియంత్రించగలమా? బొగ్గు, పెట్రోల్-డీజిల్ తదితర శిలాజ ఇంధనాల వినియోగం వాయు కాలుష్యానికి ప్రధాన కారణం. పారిశ్రామిక వ్యర్థాలు, వాహనాల నుంచి వెలువడే ఉద్గారాలు, అపరిమిత విద్యుత్ వినియోగం, నిలువయ్యే మురుగు, చెత్త తగులబెట్టడం వంటివి కూడా గాలిని బాగా కలుషితం చేస్తాయి. ఎటువంటి శుద్ది చర్యలు చేపట్టకుండా వాటినలా వాతావరణంలోకి వదిలేయడం వల్ల గాలి కాలుష్యం పెరిగిపోతోంది. కల్తీ ఇంధనాల వాడకం, కాలం చెల్లిన వాహనాలను తిరగనివ్వడం వంటి విపరీత చర్యలు. ప్లాస్టిక్కును, పాత టైర్లను, పారిశ్రామిక వ్యర్థాలను, ఇతర చెత్తా చెదారాన్ని జనావాసాల మధ్యే కాల్చడం వల్ల కూడా గాలి కలుషితమౌతోంది. పరిమితిని మించి వెలువడే ఉద్గారాల స్థాయిని గుర్తించే పక్కా వ్యవస్థ మనకు లేదు. ఇక నియంత్రించే వ్యవస్థ అసలుకే లేదు. కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్ తదితర నైట్రోజన్ సంబంధ వాయువులు, ముఖ్యంగా బెంజిన్ వంటి ప్రమాదకరమైన ఉద్గారాలు నిత్యం మన నగ రాలు, పట్టణాల వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయి. హైదరాబాద్ నగ రాన్నే తీసుకుంటే, గ్రేటర్ పరిధిలోని మొత్తం వాహనాల సంఖ్య 41 లక్షలు. ఏటా సగటున 2 లక్షల వాహనాలు పెరుగుతున్నాయి. ఏటా దాదాపు 110 కోట్ల లీటర్ల పెట్రోల్, 120 కోట్ల లీటర్ల డీజిల్ వినియోగమౌతోంది. ఇందులో అత్యధిక వాహనాలు, ఏ సమయంలో చూసినా కేవలం 6,411 కిలోమీటర్ల మేరకు విస్తరించి ఉన్న రోడ్లపై తిరుగుతుండటం ఆందోళనకరం. దీంతో ట్రాఫిక్ పెరిగి, వాహనాల సగటు వేగం గంటకు 12 కిలోమీటర్లకు పడిపోయింది. ఫలితంగా, అవి ఎక్కువ ఉద్గారాలను వెలువరిస్తూ, మరింతగా వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయి. పారిశ్రామిక వ్యర్థాలు, మురుగునీరు వచ్చి చేరే హుస్సేన్‌సాగర్, మూసీ కూడా వాయు కాలుష్య కారకాలే! విలా సాలకు, సౌఖ్యాలకు అలవాటు పడ్డ నగరజీవి జీవనశైలికి తోడు అవసరానికి మించిన ఏసీల వాడకం, సొంత వాహనాల్ని విరివిగా వాడటం వల్ల కూడా సమస్య జటిలమౌతోంది.

ఉద్యమించాలి, బాధ్యత వహించాలి
  • గాలి నాణ్యతా సూచి (AQI) ప్రకారం 0-50 ఉంటే అది స్వచ్ఛమైన గాలి. ఢిల్లీలో 260 దాటింది. ఇది అత్యంత ప్రమాదకరమైన స్థితి.
  • సమస్య జటిలమైందే అయినా పరిష్కారం లేనిది మాత్రం కాదు. కొన్ని నిర్దిష్టమైన ఉపశమన చర్యలు తీసుకుంటే, 66 కోట్ల భారతీయుల ఆయుర్దాయాన్ని సగటున 3.2 సంత్సరాల చొప్పున పెంచొచ్చన్నారు.
  • అంటే, కొరగాకుండా పోతాయనుకుంటున్న 200 కోట్ల జీవన వసంతాల్ని పౌరులకుమిగిల్చవచ్చు! ముఖ్యంగా ప్రభుత్వాలు ఇందుకు శ్రద్ధ తీసుకోవాలి.
  • శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా పునర్వినియోగ ఇంధన వనరుల్ని ప్రోత్స హించాలి. థర్మల్ విద్యుత్ స్థానే సౌర విద్యుత్ ఉత్పత్తి పెంచాలి.
  • గాలిని కలుషితం చేస్తున్న కారకాల్ని గుర్తించి నియంత్రించాలి. పర్యావరణ చట్టాల్ని చిత్త శుద్ధితో పకడ్బందీగా అమలు పరచి, ఉల్లంఘనలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలి.
  • వాయు కాలుష్యం గురించి, కారకాల గురించీ, పరిష్కార మార్గాల గురించీ, వ్యక్తి, సమాజం స్థాయిలో చేపట్టాల్సిన చర్యల గురించీ విస్తృతంగా ప్రచారం చేయాలి.
  • దేశంలోని అన్ని టెలిసర్వీస్ కంపెనీలు, రేడియో, టీవీ, పత్రిక... ఇతర ప్రసార మాధ్యమాలు అందుకు ముందుకు రావాలి. మొబైల్ ఫోన్ వినియోగం మొదలెట్టగానే ఆ రోజున గాలిలోని ధూళి రేణువుల (ఆరెస్పీయం) స్థాయి ఎంత ఉందో స్క్రీన్‌పై కనబడాలి. పరిమితి, ప్రమాదస్థాయి ఏంటో హెచ్చరించాలి. దాన్ని నియంత్రించడానికి ఎవరెవరు, ఏం చేయగలరో? క్లుప్తంగా వివరించాలి.
  • పౌర సమాజం నుంచి ఒక పెద్ద ఉద్యమమే రావాలి. ప్రభుత్వాలపైన ఒత్తిడి పెరగాలి. లేకుంటే, ప్రాణవాయు వైన గాలే దొరకని దుస్థితి సమీప భవిష్యత్తులోనే వచ్చేస్తుంది.
  • పౌరసమాజం సదా అప్రమత్తంగా ఉండి భవిష్యత్తరాల కోసం పర్యావరణాన్ని కాపాడాలి. చట్టాల్ని, రాజ్యాంగాన్ని, న్యాయస్థానాల్ని బాగా వినియోగించుకొని నిత్య నిరంతర పోరాటాల ద్వారా ప్రభుత్వాల్ని జవాబుదారుగా నిలపాలి.
  • పౌరులు వాయువు కాలుష్య నివారణకు అన్ని చర్యలు తీసుకోవాలి. అనివార్యమైతే తప్ప ఏసీల్ని వాడొద్దు.
  • వాహన వినియోగాన్ని తగ్గించి, పట్టణాల్లో కార్ పూలింగ్ వంటి సంస్కృతిని పెంపొందించాలి.
  • కష్టమనిపించినా, ఉద్గారాల్ని తగ్గించి పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా జీవనశైలిని మార్చుకోవాలి.
అభివృద్ధి నిర్వచనం, ప్రభుత్వాల వైఖరి మారాలి
రైతులకు 7 గంటలు విద్యుత్తు ఇవ్వలేకపోతున్నామని చెప్పే ప్రభుత్వాలు, పట్టణాలు, నగరాల్లో 7 గంటలు కోత విధించగలవేమో ఆలోచించాలి. మన ప్రభుత్వాల ‘అభివృద్ధి’అంటే, ప్రకృతిని-పర్యావరణాన్ని పణంగా పెట్టయినా కార్పొరేట్ రంగానికి ఎర్ర తివాచీ పరవడమే! ఆహారం, నీరు కలుషితమైనపుడు బాగా ప్రభావితమయ్యేది పేదలు, మధ్య తరగతే. కానీ, వాయు కాలుష్యం మాత్రం సంపన్నులతో సహా ఎవర్నీ వదలదు. ఎన్డీయే ప్రభుత్వం దేశంలోని అన్ని పర్యావరణ చట్టాల్ని, వాటి అమలు, నియంత్రణలను ఒక ఛత్రం కిందకు తేనుంది ‘నేషనల్ ఎన్విరాన్‌మెంట్ మేనేజ్‌మెంట్ అథారిటీ’గా అది పనిచేస్తుంది. ప్రజలున్నారు, పౌరసంఘాలున్నాయి, న్యాయస్థానాలున్నాయి, వాటన్నిటికీ పైన భారత రాజ్యాంగముంది. పౌరులు స్వచ్ఛమైన గాలి, నీరు పొందడం రాజ్యాంగపు అధికరణం 21 హామీ ఇస్తున్న జీవించే హక్కులో భాగమే అని డూన్ వ్యాలీ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పే ఇందుకు నిదర్శనం. కాబట్టి పర్యావరణాన్ని పరిరక్షించి కాలుష్యాన్ని త గ్గించడానికి ప్రభుత్వాలు, పౌర సమాజం చిత్తశుద్ధితో పని చేయాలి.

దేశంలో అత్యంత కాలుష్య నగరాలివే!
1. ఢిల్లీ
2. పట్నా
3. గ్వాలియర్
4. రాయ్‌పూర్
5. అహ్మదాబాద్
6. ఫిరోజాబాద్
7. అమృత్‌సర్
8. కాన్పూర్
9. ఆగ్రా
10. లూథియానా
Published date : 24 May 2017 12:33PM

Photo Stories