Skip to main content

జీఎస్‌ఎల్‌వీ మార్క్ -3డీ1

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) బాహుబలిగా అభివర్ణిస్తున్న జీఎస్‌ఎల్‌వీ మార్క్-3డీ1 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలోగల సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధన కేంద్రం(షార్) నుంచి జూన్ 5 సాయంత్రం 5:28 గంటలకు ఈ ప్రయోగం జరిగింది. దీనిద్వారా 3,136 కిలోల భారీ ఉపగ్రహం జీశాట్-19ని రోదసీలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు.

ప్రయోగం సాగిందిలా..
43.43 మీటర్ల పొడవు, 640 టన్నుల బరువున్న జీఎస్‌ఎల్‌వీ మార్క్-3డీ1ను 16 నిమిషాల 20 సెకన్ల వ్యవధిలో మూడు దశ ప్రయాణంతో కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.
మొదటిదశ: కౌంట్‌డౌన్ ముగిసిన వెంటనే మొదటిదశలో రెండు వైపులున్న 200 టన్నుల ఘన ఇంధన బూస్టర్ల(ఎస్-200)ను మండించటంతో రాకెట్ ప్రయాణం ప్రారంభమైంది.
రెండోదశ: 1.54 నిమిషాలకు రెండో దశలోని 110 టన్నుల ద్రవ ఇంధనాన్ని (ఎల్-110) మండించి రాకెట్ ప్రయాణ స్పీడ్‌ను పెంచారు. 2.20 నిమిషాలకు ఎస్-200 రెండు బూస్టర్లు విడిపోయాయి. 5.20 నిమిషాలకు రెండో దశ పూర్తయింది.
మూడోదశ: 25 టన్నుల క్రయోజనిక్ ఇంధనంతో మూడోదశను ప్రారంభించి 16.20 నిమిషాలకు రాకెట్‌కు శిఖర భాగంలో అమర్చిన 3,136 కిలోల బరువైన జీశాట్-19 సమాచార ఉపగ్రహాన్ని భూమికి దగ్గరగా(పెరిజీ) 170 కి.మీ. భూమికి దూరంగా(అపోజి) 35,975 కి.మీ. ఎత్తులోని జియో ట్రాన్‌‌సఫర్ ఆర్బిట్(భూ బదిలీ కక్ష్య)లో ప్రవేశపెట్టారు.
స్థిరకక్ష్యలోకి..: ఆ తర్వాత బెంగళూరు హసన్‌లోని ఉపగ్రహాల నియంత్రణ కేంద్రం ఉపగ్రహాన్ని అదుపులోకి తీసుకుని.. ఉపగ్రహంలో నింపిన అపోజీ మోటార్లను మండించి భూమికి 36 కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర కక్ష్యలో ఉపగ్రహాన్ని స్థిరపర్చారు.

జీశాట్-19 ఉపగ్రహంతో ఉపయోగాలివీ..
  • దేశంలో టెలివిజన్ ప్రసారాలు, టెలికాం రంగంలో విసృ్తత సేవలు, ఇంటర్నెట్ వేగవంతం అవడమే కాకుండా అత్యంత అధునాతనమైన కమ్యూనికేషన్ వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది.
  • ప్రపంచవ్యాప్తంగా ఆండ్రాయిడ్ మొబైల్స్‌లో ఇంటర్నెట్‌ను వేగవంతం చేయడానికి ఎంతో ఉపకరిస్తుంది.
  • ఉపగ్రహంలో కేయూ బ్యాండ్ హైయర్ ఫ్రీక్వెన్సీ ట్రాన్‌‌సపాండర్స్‌తో పాటు జియో స్టేషనరీ రేడియేషన్ స్పెక్ట్రోమీటర్ అనే పేలోడ్‌‌స అమర్చి పంపారు. ఇప్పటికే ఇస్రోకు చెందిన 14 సమాచార ఉపగ్రహాలు అంతరిక్ష కక్ష్యలో పనిచేస్తూ 275 ట్రాన్‌‌సపాండర్లతో దేశవాళి డీటీహెచ్ ప్రసారాలు, టెలికాం సేవలు అందిస్తున్నాయి. అయితే దేశంలో 400 ట్రాన్‌‌సపాండర్లు దాకా డిమాండ్ ఉంది. తాజా విజయంతో రాబోయే రెండుమూడేళ్లలో జీఎస్‌ఎల్వీ రాకెట్ల ద్వారా 450 టాన్‌‌సపాండర్లను అందుబాటులోకి తేవాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది.
  • దేశంలో 850 టీవీ చానళ్లు ఉంటే అందులో 650 చానళ్లను ప్రభుత్వం గుర్తించింది. ఇందులో 300 చానళ్లకు మాత్రమే వీశాట్ లింక్‌ను ఉపయోగించుకుంటున్నారు. ఇస్రో అంతర్గతంగా వాణిజ్యపరంగా 120 ట్రాన్‌‌సపాండర్లను ఉపయోగించుకుంటోంది. జీశాట్-19 ఉపగ్రహంతో సమాచార వ్యవస్థలో అత్యంత అధునాతమైన సాంకేతిక వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. ఈ ఉపగ్రహం సుమారు 10 ఏళ్ల పాటు సేవలు అందిస్తుంది.

పదిహేడేళ్ల శ్రమ ఫలితమిది
భారీ ఉపగ్రహాలను నింగి లోకి తీసుకెళ్లగల జీఎస్‌ఎల్‌వీ మార్క్-3 రాకెట్ అభివృద్ధి, విజయం వెనుక ఇస్రో పదిహేడేళ్లు కఠోర శ్రమ, నిరంతర కృషి దాగుంది. సుమారు 3 నుంచి 5 టన్నుల బరువైన సమాచార ఉపగ్రహాలను ప్రయోగించేందుకు.. మనుషులను అంత రిక్షంలోకి తీసుకెళ్లేందుకు.. చంద్రుడు, అంగారకుడి మీద పరిశోధనల కోసం రోవర్లను పంపేందుకు భారీ రాకెట్లు అవసరం. ఇస్రో 2000లో దీనిపై ప్రతిపాదన చేయగా కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దాంతో మార్క్-3 తరహా భారీ రాకెట్ అభివృద్ధిపై శాస్త్రవేత్తలు దృష్టి పెట్టారు. 2003లో ఈ ప్రాజెక్టుకు రూ.3 వేల కోట్లు నిధులు మంజూరు చేశారు. ఆ నిధుల్లో రూ.700 కోట్లతో షార్‌లో ప్రయోగానికి అవసరమైన ఏర్పాట్లు ప్రారంభించారు.

అన్ని దశలూ భారీగానే
పీఎస్‌ఎల్‌వీ, సాధారణ జీఎస్‌ఎల్‌వీ రాకెట్లలోని మొదటి దశలో సుమారు 138, 142 టన్నుల ఘన ఇంధనాన్ని వాడతారు. అయితే భారీ రాకెట్ రూపకల్పనలో భాగంగా మార్క్3 ప్రయోగం మొదటి దశలో 200 టన్నుల చొప్పున ఘన ఇంధనాన్ని నింపిన రెండు స్ట్రాపాన్ (ఎస్-200) బూస్టర్లు అవసరమని గుర్తించారు. వీటిని షార్‌లోని ఘన ఇంధనం తయారీ విభాగం(స్ప్రాబ్)లోనే తయారు చేశారు. 2010 జనవరి 24న ఈఎస్-200 స్ట్రాపాన్ బూస్టర్లకు భూస్థిర పరీక్షలు నిర్వహించి విజయం సాధించారు.
రెండో దశలో సాధారణంగా 40 టన్నుల ద్రవ ఇంధనాన్ని వినియోగిస్తుండగా.. మార్క్ 3 తరహా కోసం 110 టన్నుల ఇంధనాన్ని నింపిన బూస్టర్ల(ఎల్-110) ను వినియోగించారు. వీటిని తమిళనాడులోని మహేంద్రగిరిలో ఉన్న లిక్విడ్ ప్రొపెల్లెంట్ స్పేస్ సెంటర్‌లో తయారు చేశారు.
మూడోదశలో అత్యంత శక్తివంత మైన క్రయోజనిక్ ఇంజన్లను వినియోగిస్తారు. సాధారణ జీఎస్‌ఎల్‌వీలో ఈ దశలో 12.5 టన్నుల ఇంధనాన్ని వినియోగించగా.. మార్క్3 కోసం 25 టన్నులు వినియోగించాల్సి వచ్చింది. 12.5 టన్నుల క్రయోజనిక్ దశ రూపకల్పన కోసమే అప్పట్లో ఇస్రో శాస్త్రవేత్తలు తీవ్రంగా కష్టపడ్డారు. తాజాగా 25 టన్నుల క్రయోదశ (సీ-25) అభివృద్ధి కోసం రెండేళ్లు పట్టింది. అయితే మొత్తంగా పూర్తిస్థాయిలో క్రయోజనిక్ దశ అభివృద్ధిలో ఇస్రో విజయం సాధించింది.

ప్రపంచదేశాల్లో తిరుగులేని శక్తిగా..
తాజా ప్రయోగంతో ప్రపంచ దేశాల్లో భారత్ తిరుగులేని శక్తిగా అవతరించింది. పదిహేడేళ్లుగా ఇస్రో ఎస్-200 ఘన ఇంధన బూస్టర్లు, ఎల్-100 ద్రవ ఇంధన దశ, సీ-25 క్రయోజనిక్ ఇంజిన్లను అభివృద్ధి చేసుకోవడానికి ఎన్నో పరిశోధనలు చేసింది. 2014 డిసెంబర్ 14న జీఎస్‌ఎల్‌వీ మార్క్-3డీ1 రాకెట్‌ను ప్రయోగాత్మకంగా ప్రయోగించి ఎస్-200, ఎల్-110 సామర్థ్యాన్ని నిర్ధారించుకున్నారు. ఆ ప్రయోగంలో సీ-25 లేకుండా డమ్మీని ఉపయోగించారు. తాజాగా సీ-25కు అనేక రకాల భూస్థిర పరీక్షలు నిర్వహించి పూర్తిస్థాయిలో ప్రయోగించారు.

59 ప్రయోగాలు.. విజయాలు 51
Current Affairs జీఎస్‌ఎల్‌వీ మార్క్-3డీ1 ప్రయోగంతో ఇస్రో 59 ప్రయోగాలు పూర్తి చేసుకుంది. ఇందులో 51 ప్రయోగాలు విజయవంతమయ్యాయి. వీటిల్లో ఇప్పటివరకు ఎక్కువగా పీఎస్‌ఎల్‌వీ ప్రయోగాలే విజయవంతంకాగా.. తాజాగా జీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లోనూ వరుస విజయాలు ప్రారంభమయ్యాయి. క్రయోజనిక్ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంతో జీఎస్‌ఎల్‌వీ డీ5, డీ6, మార్క్-3 ప్రయోగాత్మక ప్రయోగం, ఎఫ్-09 ప్రయోగాలతో పాటు తాజాగా మార్క్-3డీ1 ప్రయోగం కూడా వరుసగా విజయవంతమైంది.

అగ్రదేశాల సరసన
  • జీఎస్‌ఎల్‌వీ-మార్క్3ని ప్రయోగించడం ద్వారా భారత్ భారీ ఉపగ్రహాలను ప్రయోగించే సామర్థ్యం కలిగిన ఆరో దేశంగా గుర్తింపు పొందింది. ఇప్పటిదాకా భారీ ఉపగ్రహాలను ప్రయోగించే సామర్థ్యం అమెరికా, రష్యా, చైనా, జపాన్, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలకు మాత్రమే ఉంది.
  • 3 వేల కిలోల బరువు దాటితే దాన్ని భారీ ఉపగ్రహంగా పరిగణిస్తారు.
  • పాతతరం ఉపగ్రహాలతో పోలిస్తే జీశాట్-19 సామర్థ్యం చాలా ఎక్కువ. ఇది ఆరేడు పాత ఉపగ్రహాలకు సమానం.
  • ఇతర దేశాలతో పోలిస్తే భారీ ఉపగ్రహ ప్రయోగానికి భారత్‌కు అయ్యే ఖర్చు చాలా తక్కువ. మిగతా వాళ్లకంటే 60 నుంచి 70 శాతం తక్కువ ఖర్చుతో ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టగలదు.
  • సమాచార ఉపగ్రహ ప్రయోగ మార్కెట్‌లో సింహభాగం వాటా ప్రైవేటు సంస్థలు స్పేస్ ఎక్స్, అరియేన్‌లదే. 10 టన్నుల ఉపగ్రహాలను కూడా మోసుకెళ్లగల రాకెట్లు వీటి వద్ద ఉన్నాయి.
  • 5 టన్నుల దాకా బరువుండే ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి స్పేస్ ఎక్స్ సంస్థ తమ ఫాల్కన్-9 రాకెట్‌ను వాడుతుంది. దీనికి రూ.400 కోట్లు ఛార్జి చేస్తుంది.
  • భారత్ ఇప్పటిదాకా 21 దేశాలకు చెందిన 79 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. అయితే అంతర్జాతీయ విపణిలో భారత్ వాటా 0.6 శాతం మాత్రమే.
  • భవిష్యత్తులో మనుషులను అంతరిక్షంలోకి పంపడానికి ఇస్రో సిద్ధమవుతోంది. ఇందుకోసం రూ.12,500 కోట్లు కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఒకవేళ ప్రభుత్వం అనుమతిస్తే ఈ మిషన్‌లో జీఎస్‌ఎల్‌వీ- మార్క్3 రాకెటే కీలకం కానుంది. అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపగల సామర్థ్యం ప్రస్తుతం అమెరికా, రష్యా, చైనాలకే ఉంది.
Published date : 06 Jun 2017 03:04PM

Photo Stories