Skip to main content

జాతీయ పౌర రిజిస్టర్ (National Register of Citizens) కథాకమామీషూ

ఇది సర్వసత్తాక, సార్వభౌమ, సామ్యవాద, లౌకిక , ప్రజాస్వామ్య, గణతంత్ర భారతదేశం. ‘భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం’ భారత్ విశిష్ట లక్షణం. భిన్నంగా ఉన్నా అందరం ఒక్కటే..ఒక్కటిగా ఉన్నా భిన్నమైన వాళ్లం అని చెప్పడం దాని ఉద్దేశ్యం. కుల, మత, వర్గ, లింగ అనే తారతమ్య భేదాలు లేకుండా కలిసికట్టుగా ఏకతాటిపై నడిచేవారు భారతజాతీయులు. కానీ ప్రస్తుతం మాత్రం ప్రతి వ్యక్తి త‌న‌కు తాను భార‌త‌పౌరుడ‌ని నిరూపించుకోవాల్సిన ప‌రిస్థితి సంభ‌వించింది. దీంతో ఎవరు భారతీయులో, ఎవరు కాదో తేల్చడానికి కేంద్రం తర్జనభర్జనలు పడుతోంది.దీనిని తేల్చడానికి సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, సెన్సెస్, ఎన్‌పీఆర్‌లు తెరమీదకు వచ్చాయి. ఫలితంగా గత కొన్ని రోజులుగా ప్రజల ఆంధోళనలతో, రాజకీయ నాయకుల విమర్శలతో, విశ్లేషకుల చర్చలతో దేశం వేడెక్కిపోతోంది. అసలేంజరిగిందో..ఓ సారి చూద్దాం!
జాతీయ పౌర రిజిస్టర్ రగడకు ముఖ్యకారణం ఏమిటి?
ప్రపంచంలో ఏ దేశానికైనాఇలావెళ్లిపోయి అలా స్థిరపడలేరు. ఒక వ్యక్తి అమెరికా,రష్యా, నెదర్లాండ్స్‌, ఇంగ్లండ్.... ఇలా ఎక్కడకు వెళ్లి స్థిరపడేందుకు ప్రయత్నించినా కుదరదు. మరి ఇతర దేశాల నుంచి (అక్రమంగా వలస) వచ్చినవారు భారత్‌లో ఎలా స్థిరపడగలరు? ఏ దేశాలు దీనికి ఒప్పుకోవు. కానీ... భారత్‌లో ఈశాన్య రాష్ట్రాలలో ముఖ్యంగా అస్సాంలో మాత్రం పొరుగుదేశాలనుంచి వలస వచ్చిన హిందువులు, ముస్లింలు, ఇతర మైనార్టీలు యదేచ్ఛగా నివసిస్తున్నారు. దీనిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం నిజమైన భారతీయులను ఎన్నార్సీ ద్వారా నమోదు చేసింది. అయితే కేంద్రం మాత్రం.. ముస్లింలు మినహా మిగిలిన వారందరికీ ఎటువంటి గుర్తింపు పత్రాలు లేకపోయినా వారికి భారతపౌరసత్వం వర్తింపచేస్తున్నట్టు కొసమెరుపుగా.. ప్రకటించింది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఈ రిజిస్టార్‌ను (అస్సాం తరహాలో) రూపొందించి ఎన్‌ఆర్‌సీ గొడుగు కిందకి అందరినీ తీసుకురావడానికి (రొహింగ్యాలను వెనక్కి పంపేందుకు బంగ్లాదేశ్ ప్రయత్నిస్తున్నట్టుగా) చర్యలు కూడా చేపడుతోంది. దీంతో దేశవ్యాప్తంగా జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్నార్సీ) చర్చనీయాంశమైంది. ఈ నేపధ్యంలో...

భారతీయ పౌరుడంటే ఎవరు?
1955 పౌరసత్వ చట్టం ప్రకారం.. ఈ దేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి భారతీయ పౌరుడే. దీని ప్రకారం..
  • 1950 జనవరి 26వ తేదీన కానీ, అంతకుపూర్వం కానీ..1987 జూలై 1వ తేదీకి ముందు జన్మించిన వారు భారతీయ పౌరులు.
  • 1987 జూలై 1వ తేదీన కానీ, అంతకుముందు పుట్టిన వారు. అయితే.. 2003లో సవరించిన పౌరసత్వ నిబంధనలు అమల్లోకి రాకముందు జన్మించిన వారు; తల్లిదండ్రుల్లో ఏ ఒక్కరు ఆ సమయానికి భారత పౌరులై ఉన్నా..
  • 2003లో సవరించిన పౌరసత్వ నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత జన్మించిన వారు; తల్లిదండ్రులిద్దరూ పౌరులై ఉన్నా లేక తల్లిదండ్రులిద్దరిలో ఒకరు అక్రమ వలసదారు కాకున్నా పౌరుడిగానే పరిగణింపబడతారు.
అయితే దేశ పౌరుడిగా గుర్తించబడాలంటే దానికి ఎన్పీఆర్, జనగణన, ఎన్నార్సీ ప్రక్రియ ఉంటుంది. అది ఎలాగో చూద్దాం!

జాతీయ జనాభా పట్టిక (National Population Register) అంటే...
ఎన్పీఆర్ అంటే దేశంలోని సాధారణ నివాసుల వివరాలతో కూడిన ఒక రిజిస్టర్. ఈ నివాసులు మన దేశ పౌరులే అయివుండనవసరం లేదు. ఎన్‌పీఆర్ ప్రకారం... ఏదైనా ఒక నిర్ణీత ప్రదేశంలో ఒక వ్యక్తి గత ఆరు నెలలుగా నివాసం ఉంటున్నా లేదా మరో ఆరు నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం అక్కడే నివాసం ఉండాలనుకుంటే అతడిని యూజువల్ రెసిడెంట్ (సాధారణ నివాసి)గా పేర్కొంటారు. వీరంతా ఎన్‌పీఆర్‌లో నమోదుకు అర్హులు. అది తప్పని సరని నిబంధనలు చెబుతున్నాయి. దేశంలోని ప్రతీ పౌరుడి కచ్చితమైన వివరాలు సేకరించడమే ఎన్‌పీఆర్ ముఖ్య ఉద్దేశం.

పౌరసత్వ చట్టం 1955, పౌరసత్వ నిబంధనలు (రిజిస్ట్రేషన్ ఆఫ్ సిటిజన్స్, జాతీయ గుర్తింపు కార్డుల జారీ) 2003లోని వివిధ ప్రొవిజన్లను అనుసరించి... గ్రామం, పట్టణం, జిల్లా, రాష్ట్రం తదితర విభాగాల్లో దేశంలోని పౌరుల వివరాలను సేకరిస్తారు. ఎన్‌పీఆర్ కోసం పాస్‌పోర్టు, డ్రైవింగ్ లెసైన్స్, ఆధార్ కార్డు, వారి తల్లిదండ్రుల జన్మస్థలం వంటి 14 అంశాలను పూరించాల్సి ఉంటుంది. ఇవన్నీ ఈసారి కొత్తగా పెట్టిన నిబంధనలు. అంతక్రితం పేరు, జెండర్, తల్లిదండ్రుల పేర్లు, కుటుంబ యజమానితో ఉండే సంబంధం, పుట్టిన తేదీ, జాతీయత, చేస్తున్న వృత్తి, చిరునామా వివరాలు మాత్రమే అడిగేవారు. అయితే ఇందులో ఆధార్ నంబరు వాలంటీరిగా ఇస్తే మాత్రమే తీసుకుంటారు. 2011 జనాభా లెక్కల ప్రక్రియలో భాగంగా తొలిసారిగా 2010లో అప్పటి యూపీఏ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. 2015లో ఇంటింటి సర్వే ద్వారా దాన్ని ఆధార్‌తో అనుసంధానం చేయడంతో ఎన్‌డీఏ ప్రభుత్వం దీన్ని ఆప్‌డేట్ చేసింది. ఎన్‌పీఆర్‌కు సంబంధించిన సమాచార సేకరణ 2020 ఏప్రిల్‌లో ప్రారంభమై సెప్టెంబర్‌లో ముగుస్తుంది. ఎన్‌పీఆర్ ప్రక్రియ పూర్తయ్యాక 2021 జనాభా లెక్కల సేకరణ ప్రక్రియలో భాగంగా 2020లో ఎన్‌పీఆర్‌ను మళ్లీ ఆప్‌డేట్ చేయనున్నారు. ప్రస్తుతం అస్సాంలో ఈ ప్రక్రియ పూర్తయ్యింది. ఇక అస్సాంమినహా మిగిలిన అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ కార్యక్రమం జరగనుంది. కాబట్టి సాధారణ నివాసుల సమగ్ర వివరాలున్న డేటాబేస్‌ను రూపొందించేందుకు ఎన్పీఆర్ రూపకల్పనను చేపట్టారు. ఈ డేటాబేస్‌లో ఆ నివాసుల ఇతర బయోమెట్రిక్ వివరాలుంటాయి. ప్రతీ పౌరుడు ఈ పట్టికలో నమోదు కావాల్సిందే. వారికి జాతీయ గుర్తింపు కార్డును ఇస్తారు.

జాతీయ జనాభా పట్టిక (NPR) ఎలా ఏర్పడిందంటే..
1999లో కార్గిల్ ప్రాంతంలో పాకిస్తాన్ సైనికులు పౌర దుస్తుల్లో చొరబడి కొన్ని ప్రాంతాలను ఆక్రమించడం, మన సైనికులు దాన్ని తిప్పికొట్టి విజయం సాధించడం జరిగాక పౌరులకు గుర్తింపు కార్డు ఇవ్వాలన్న ఆలోచన పుట్టుకొచ్చింది. అప్పటి వాజ్‌పేయి ప్రభుత్వం నియమించిన కార్గిల్ సమీక్ష కమిటీ ఈ సూచన చేసింది. సరిహద్దు ప్రాంతాల్లోని వారికి ఈ కార్డులు అంద జేయాలన్న ప్రతిపాదన కాస్తా ఆ తర్వాత దేశవ్యాప్తంగా అమలు చేయాలన్న నిర్ణయానికి దారి తీసింది. అందుకోసం 1955 నాటి పౌరసత్వ చట్టాన్ని సవరించి బహుళ ప్రయోజన గుర్తింపు కార్డు (ఎంఎన్‌ఐసీ) ప్రాజెక్టు, జాతీయ జనాభా పట్టిక(ఎన్‌పీఆర్)లకు చోటిచ్చారు. అయితే 2002లో ఈ రెండు ప్రాజెక్టుల మాటా ఏమైందని పార్లమెంటులో అడిగినప్పుడు అప్పటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి విద్యాసాగరరావు ఎంఎన్‌ఐసీకి చట్టబద్ధత కల్పించడంతోసహా ఇందుకు సంబంధించిన అన్ని అంశాలనూ లోతుగా పరిశీలిస్తున్నామని తెలియజేశారు. ఈ ప్రతిపాదనల్లో ఆధార్ మూలాలున్నాయి. ఎంఎన్‌ఐసీపై ఆ తర్వాత చెప్పుకోదగ్గ అడుగులు పడలేదు. యూపీఏ హయాంలో ప్రణాళికా సంఘం ఆధ్వర్యంలో నందన్ నీలేకని చీఫ్‌గా భారత ప్రత్యేక గుర్తింపు వ్యవస్థ (యూఐడీఏఐ) ఏర్పడి, ఆధార్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే దాన్ని ప్రారంభించిన ఉద్దేశం పెద్దగా నెర వేరలేదు సరిగదా దానివల్ల పౌరుల వ్యక్తిగత వివరాలు బయటపడి అనేక సమస్యలు ఏర్పడ్డాయి. మరోపక్క కార్డు నమోదు ప్రక్రియకు అనుసరించిన విధానాలవల్ల ఎవరికి పడితే వారికి ఆ కార్డు సంపాదించడం సులభమైపోయింది. దీనితో ఎన్‌పీఆర్ తొలిసారిగా 2010లో అప్పటి యూపీఏ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఇది 2015లో అప్‌డేట్ అయ్యింది. 2020లో మరోసారి అప్‌డేట్ చేయడానికి భారత కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.

జనగణన (Census) అంటే..
ఎన్‌పీఆర్, జనగణన వేర్వేరు. జన గణనను ప్రతి పదేళ్లకోసారి చేపడతారు. గడిచిన దశాబ్ధకాలంలో దేశం ఎంత మేరకు వృద్ధి చెందింది? ఎలాంటి భవిష్యత్ ప్రణాళికలను రూపొందించుకోవాలి? ప్రభుత్వ పథకాలు ఏమేరకు సత్ఫలితాలిచ్చాయి? వంటి అంశాలను తెలుసుకునేందుకు జనగణన ఉపయోగపడుతుంది. అక్షరాస్యత, పట్టణీకరణ, మతాలు, జనన మరణాలు, వలసలు వంటి విస్తృత వివరాలు అందులో ఉంటాయి. ఎన్పీఆర్‌తో పోలిస్తే జన గణనలో మరిన్ని వివరాలను సేకరిస్తారు. వ్యక్తి గృహవివరాలు, ఇంటి నిర్మాణం, కుటుంబ సభ్యుల పూర్తి వివరాలు, గృహోపకరణాల వివరాలు, పూర్తి ఆదాయ మార్గాలు, వ్యవసాయ- వ్యవసాయేతర వర్గాలు, సాగు, తాగు నీటి లభ్యత, వ్యవసాయ విధానం, వాణిజ్య వర్గాలు, ఎస్సీ, ఎస్టీ వివరాలు, భాష, మతం, దివ్యాంగత.. తదితర పూర్తి సమాచారాన్ని నమోదు చేస్తారు. అయితే........

ఈ సారి జరగబోయే జనగణన- 2021ని రెండు దశల్లో పూర్తి చేయనున్నారు. 2020 ఏప్రిల్- సెప్టెంబర్ మధ్య జరిగే ‘జనగణన - 2021’ తొలి దశతో పాటు ఎన్పీఆర్‌ను అప్‌డేట్ చేసే ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ దశలో కుటుంబ సమగ్ర వివరాలను నమోదు చేస్తారు. 2021 ఫిబ్రవరి 9 - 28 మధ్య రెండో దశ నమోదు జరుగుతుంది. ఆ దశలో వర్గాల వారీగా మొత్తం జనాభా సంఖ్యను గణిస్తారు.

జనగణన ఎందుకు?
భిన్న అవసరాల కోసం ప్రభుత్వాలు ప్రజలకు సంబంధించిన డేటా సేకరించడం ఎప్పటినుంచో రివాజుగా వస్తోంది. చరిత్ర తిరగేస్తే ఈ సంగతి తెలుస్తుంది. అంతక్రితం మాటెలా ఉన్నా మన దేశంలో మౌర్యుల కాలంలో జనగణన జరిగిందని కౌటిల్యుని అర్థశాస్త్రం చెబుతోంది. అప్పట్లో ఈ జనగణన జరపడానికి కారణం పన్నుల వసూలు విధానాన్ని పటిష్టపరచడమే. బ్రిటిష్ వలస పాలకులు తొలిసారి 1872లో జనగణన నిర్వహించారు. తొలి జనగణనగా దాన్నే పరిగణిస్తున్నారు. 2021లో జరగబోయే జనాభా లెక్కల సేకరణ ఆ ప్రకారంగా 16వ జనగణన అవుతుంది. ఈ జనగణన మాట అలావుంచితే.. దేశంలో ఉండే పౌరులు, ఇతర నివాసుల వివరాలు ఆధారాలతోసహా సేకరించి అవసరమైనప్పుడల్లా ఆ వివరాలను భిన్న ప్రయోజనాల కోసం ఉపయోగించాలన్న ప్రభుత్వ ఆలోచనకు పెద్ద నేపథ్యమేవుంది.

ఇక జాతీయ పౌర రిజిస్టర్ (National Register of Citizens) అంటే...
స్థూలంగా చూస్తే ఎన్‌ఆర్‌సీ...
ఈ దేశ పౌరులెవరో, కానివారెవరో ఆరా తీసి, ఇరుగు పొరుగు దేశాల నుంచి అక్రమంగా వచ్చి ఇక్కడుంటున్నవారిని ఏరి పారేయడానికి ఇదొక అద్భుతమైన ప్రక్రియ. కాబట్టి చట్ట ప్రకారం భారతీయ పౌరులుగా నమోదైన వారి జాబితాయే జాతీయ పౌర పట్టిక (NRC). ఇందులో 1955 పౌరసత్వ చట్టం ప్రకారం..భారతీయ పౌరులుగా అర్హత పొందిన వారి పేర్లతోపాటు వారికి సంబంధించిన ఇతర వివరాలు కూడా పొందుపరచబడి ఉంటాయి. ఈ పట్టికను మొట్టమొదటిసారిగా 1951లో భారతీయుల పౌరసత్వాన్ని, వారి ప్రోపర్టీస్‌ను, ఎకనామిక్ కండిషన్‌ను అంచనా వేయడానికి ప్రభుత్వం రూపొందించింది. ఇప్పటి వరకు దానిని మళ్లీ అప్‌గ్రేడ్ చేయలేదు. అయితే, ఇది అస్సాంలో మాత్రమే ఎప్పటికప్పుడు వివిధ కారణాలతో అప్‌గ్రేడ్ అవుతోంది. ఏ మతానికి చెందిన వారైనా భారతీయ పౌరులందరికీ ఈ జాబితాలో స్థానం లభిస్తుంది. అస్సాంలో 2013 లో సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారం NRCప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం ప్రక్రియ‌లో 3,30,27,661 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆగస్టు 31, 2019న విడుదల చేసిన తుది ఎన్నార్సీ జాబితాలో 19,06,657మందిని విదేశీయులుగా ప్రకటించారు. వీరిలో 14 లక్షల మంది హిందువులు ఉన్నారు. సీఏఏ ప్రకారం ఈ 14 లక్షల మందికి భారత్ పౌరసత్వం వస్తుంది. అస్సామీయుల ఆందోళలనలకు కారణం కూడా ఇదే. మతంతో సంబందంలేకుండా అందరినీ పంపించాలి.

ప్రత్యేక జాతుల సంస్కృతిపై, వారి హక్కులపై ప్రభావం పడరాదన్న ఉద్దేశంతో ఈ ప్రక్రియను సుప్రీంకోర్టు పర్యవేక్షణలో అస్సాంలో చేపట్టారు. అయితే అక్కడ ఎన్‌ఆర్‌సీ పూర్తయినప్పటి నుంచి జాతీయ స్థాయిలో అమలుకు డిమాండ్లు పెరుగుతున్నాయి. కాకపోతే ఇది ప్రతిపాదన మాత్రమే. ఇంకా చట్టరూపం దాల్చలేదు. దీన్ని త్వరలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ అమలు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల రాజ్యసభలో ప్రకటించారు. దీంతో కొన్నేళ్లుగా అస్సాం పౌరులను హడలెత్తిస్తున్న జాతీయ పౌర నమోదు చిట్టా(ఎన్‌ఆర్‌సీ) ‘జాతీయం’ కాబోతోంది. దేశవ్యాప్తంగా ఎన్‌ఆర్‌సీ చట్టంగా అమల్లోకి వస్తే.. ప్రభుత్వం ఈ దేశంలో నివాసం ఉంటున్న పాకిస్తాన్, బంగ్లాదేశ్, అప్ఘనిస్తాన్ అక్రమ ముస్లిం వలసదారులను గుర్తించడంతోపాటు అదుపులోకి తీసుకునేందుకు అవకాశముంటుంది. వారిని స్వదేశాలకు తిప్పి పంపేందుకూ అధికారాలు లభిస్తాయి. అక్రమ వలసదారులు, కాందిశీకులు కానటువంటి నిజమైన భారతీయులను గుర్తించడమే ఎన్నార్సీ లక్ష్యంగా పనిచేయనుంది.

ముస్లిం అక్రమ వలసదారులు మాత్రమేనా..?
పౌరసత్వ సవరణ చట్టం (Citizenship Amendment Act) ప్రకారం అవునని చెప్పాలి. ఈ చట్టం ఏం చెబుతోందంటే... బంగ్లాదేశ్, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ అనే మూడు ఇస్లామిక్ దేశాల్లో మతపరమైన వేధింపులను తట్టుకోలేక భారత్‌కు శరణార్థులుగా వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, క్రిస్టియన్లు, పార్శీలు ఎవరైనా... వారివద్ద సరైన పత్రాలు లేనప్పటికీ.. భారతీయ పౌరసత్వం కల్పించే దిశగా పౌరసత్వ చట్టం అనుమతి ఇస్తుంది. అంతేకాకుండా ఈ శరణార్ధులు భారత్‌లో కనీసం 14 నుంచి 11 సంవత్సరాలు ఉండి తీరాలి అనే నిబంధనను కూడా కేవలం 5 సంవత్సరాలు ఉంటే చాలని ప్రకటించింది. అంటే ఇది పై మూడు దేశాల నుంచి మతపరమైన వేధింపులకు గురైన శరణార్ధులకు మాత్రమే భారత పౌరసత్వం ఇస్తుందన్నమాట. ఎన్నార్సీ గుర్తించిన ముస్లిం వలసదారులే లక్ష్యంగా పనిచేస్తుందన్నమాట. భారతీయ ముస్లింలకు ఆ చట్టంతో ఏ సంబంధం లేదు. అయితే పౌరసత్వ సవరణ చట్టం పై మూడు పొరుగు దేశాల్లో మతపరమైన వేధింపులకు గురై భారత్‌కు వచ్చిన వారికి పౌరసత్వ హక్కులు కల్పించేందుకు ఉద్దేశించినదే కానీ.. ఇక్కడి వారి హక్కులను లాగేసుకునేది కాదు... తాజాగా జాతీయ పౌరసత్వ బిల్లుని లోక్‌సభ ఆమోదించడంతో ఇప్పుడు ఇది చట్టరూపం దాల్చింది. పార్లమెంటు చేసిన చట్టాలను రాష్ట్రాలు అమలు చేసి తీరాల్సిందేనని రాజ్యాంగం స్పష్టంగా చెబుతోంది కాబట్టి ఈ చట్టం దేశవ్యాప్తంగా అమలు అయ్యి తీరుతుంది.

సీఏఏ, ఎన్నార్సీ వేరువేరు
జాతీయ పౌర రిజిస్టర్ (NRC) కు, పౌరసత్వ సవరణ చట్టాని (CAA)కితేడా ఉంది. ఇవి రెండూ వేరువేరు అయినప్పటికీ ఇంటర్‌లింక్డ్ విషయాలు. ఎలాగంటే... జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్‌ఆర్‌సీ) ద్వారా అక్రమ వలసదారులైన ముస్లింలను గుర్తించి, వారిని ఆయా దేశాలకు పంపి, ఆయా దేశాల్లో మతపరమైన వేధింపులకు గురై శరణార్ధులుగా 2014, డిసెంబ‌ర్ 31లోపు వచ్చిన ముస్లీమేతరులకు పౌరసత్వ సవరణ చట్టం ద్వారా భారత్‌లో నివసించడానికి చట్టపరమైన పౌరసత్వపు హక్కును కల్పించడం.పౌరసత్వ సవరణ చట్టం అమలు జరగాలంటే ఎన్నార్సీ తప్పనిసరి.ఇక్కడ శరణార్థులకు, చొరబాటు దారులు లేదా అక్రమ వలస దారులకు తేడా ఉంది. పై రెండు చట్టాలు శరణార్థులకు మేలు చేసేవే. తమ వివరాలేవీ బయటపెట్టడానికి ఇష్టపడని అక్రమ వలసదారులను దేశం దాటించడం వీటి ప్రధాన ఉద్ధేశ్యం.

ఎన్‌ఆర్‌సీ అవసరం ఎలా వచ్చిందంటే.....
  • భూములు కొల్లగొడుతున్నారని ఆరోపణ!
    ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యావకాశాలు వలసవచ్చిన విదేశీయులకు వెళుతున్నాయని, స్థానికులైన తమకు రావడం లేదని 1950వ దశకం నుంచే ‘సన్స్ ఆఫ్ సాయిల్’గా పిలుచుకునే 34 శాతం జనాభా కలిగిన అస్సామీ భాష మాట్లాడే అస్సామీలు కొంతకాలంగా ఆందోళన చేస్తున్నారు. తమ వెనకబాటుతనాన్ని ఆసరాగా చేసుకొని వలసదారులు తమ విలువైన భూములను కొల్లగొడుతున్నారంటూ 1960వ దశకం నుంచి ఆందోళన తీవ్రం చేశారు. ఇరుగు పొరుగు రాష్ట్రాల ప్రజలతోపాటు బంగ్లాదేశ్ యుద్ధానంతరం ఆ దేశీయులు అసోంలోకి వలస వచ్చారు. వాస్తవానికి బంగ్లా దేశీయులకన్నా పశ్చిమ బెంగాల్‌కు చెందిన ముస్లింలే అసోంలో ఎక్కువ ఉన్నారని పలు స్వచ్ఛంద సంస్థలు తమ అధ్యయనాల్లో తెలిపాయి. మణిపూర్ నుంచి వలసవచ్చిన వారు కూడా స్థానికంగా భూములు కొనుక్కొని స్థిరపడ్డారని ఆ సంస్థలు వెల్లడించాయి.
  • పెరిగిన ముస్లిం జనాభా
    వలసలు ఎక్కడి నుంచి అన్న ప్రశ్నను పక్కన పెడితే అసోం రాష్ట్రంలో హిందువులకన్నా ముస్లిం జనాభా శాతం పెరుగుతూ వచ్చింది. వారిప్పుడు మెజారిటీ స్థాయికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఆరెస్సెస్ శక్తులు ఆందోళనల్లో భాగంగా ముస్లింలకు వ్యతిరేకంగా అస్సామీలను రెచ్చ గొడుతూ వచ్చారు. ఆ పర్యవసానంగానే నిల్లీ మారణకాండ, కొక్రాజర్ మారణకాండలు జరిగాయి. ఈ రెండు ఘటనల్లో కూడా ఆరెస్సెస్ నాయకులు అరెస్ట్ అవడం గమనార్హం. హిందువులైనా, ముస్లింలు అయినా తమకు సంబంధం లేదని, విదేశీయులందరిని తమ రాష్ట్రం నుంచి పంపించాలని స్థానిక అస్సామీలు మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నారు.
  • ప్రభుత్వాల తాత్సారం వల్లే!
    ఓటు బ్యాంకు రాజకీయాలకు విలువనిచ్చే వరుస ప్రభుత్వాలు తాత్సారం చేస్తు రావడంతో సమస్య జటిలమవుతూ వచ్చింది. అఖిల అసోం విద్యార్థుల సంఘం 1979 నుంచి ఆందోళనను తమ చేతుల్లోకి తీసుకొని నడిపించింది. సమ్మెలు, దిగ్బంధనాలు, సహాయ నిరాకరణ వంటి వివిధ రీతుల్లో కొనసాగిన ఆందోళనల్లో విధ్వంసాలు, ప్రభుత్వ పతనాలు చోటు చేసుకున్నాయి. రాష్ట్రపతి పాలనలో కూడా పౌర జీవితం స్తంభించిపోయింది. ఆరు సుదీర్ఘ సంవత్సరాల ఆందోళన అనంతరం 1985లో అప్పటి కేంద్రంలోని రాజీవ్ ప్రభుత్వం దిగివచ్చి అస్సాం ఆందోళనకారులతో ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందం ప్రకారం1951 నుంచి 1961 లోపు వచ్చిన బంగ్లాదేశీయులకు భారత పౌరసత్వం కల్పించాలి. 1971 తర్వాత వచ్చిన వారిని వెనక్కి పంపించాలి. 1961 నుంచి 1971 మధ్యన వలసవచ్చిన వారికి ఓటింగ్ హక్కు మినహా అన్ని పౌర హక్కులు ఉంటాయి. నాటి ఒప్పందంలో 90 శాతం అంశాలు కూడా ఇప్పటికి అమలు కాలేదన్నది ఉద్యమకారుల ఆరోపణ.
  • బీజేపీ అధికారంలోకి వచ్చాక
    2014లో బీజేపీ అధికారంలోకి వచ్చాక సమస్య పరిష్కారం దిశగా చర్యలకు ఉపక్రమించింది. 1985 (అస్సాం ఉద్యమ‌కారుల‌కు, కేంద్రప్రభుత్వానికి మ‌ధ్య జ‌రిగిన) అస్సాం ఒప్పందంలోని అంశాలను మార్గదర్శకంగా తీసుకొని పౌరులను గుర్తించాల్సిందిగా కోరుతూ 2015లో ఓ ఉన్నతాధికార కమిటీని వేసింది. బంగ్లాదేశ్ విముక్తి యుద్ధానికి ఒక్క రోజు ముందు అంటే, 1971, మార్చి 24వ తేదీ అర్థరాత్రి తర్వాత భారత్‌కు వచ్చిన విదేశీయులందరిని విదేశీయులుగా పరిగణించాలని కమిటీకి కేంద్రం నిర్దేశించింది.
    దీంతో విదేశాల నుంచి వలస వచ్చిన హిందువులను కాకుండా ముస్లింలనే వెనక్కి పంపించాలంటూ ఆరెస్సెస్ అధినేతలు బీజేపీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చారు.

    సిటిజెన్‌షిప్ (అమెండ్‌మెంట్)బిల్ 2019
    ఈ నేపథ్యంలో మోదీ ప్రభుత్వం 2016లో ‘సిటిజెన్‌షిప్ (అమెండ్‌మెంట్)బిల్’ను తీసుకొచ్చింది. అందులో బంగ్లాదేశ్, పాకిస్థాన్, అఫ్ఘానిస్తాన్ నుంచి వలస వచ్చిన హిందువులకు భారత పౌరసత్వం ఇచ్చేలా సవరణలు తీసుకొచ్చారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా కూడా అస్సామీలు చేస్తున్న ఆందోళనను పట్టించుకోకుండా ‘నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్’ అసోంలోని భారత పౌరుల జాబితాను విడుదల చేసింది. పౌరులుగా గుర్తించడంలో ఎన్నో అక్రమాలు జరిగాయని, ఆధార్ కార్డులు ఉన్నా కూడా బెంగాలీ ముస్లింలను గుర్తించలేదని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. ఇది తమ రాష్ట్రంలో చిచ్చు పెట్టవచ్చని, అశాంతి పరిస్థితులకు దారితీయవచ్చని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్‌తో పరస్పర దేశ పౌరుల మార్పిడి ఒప్పందం లేనందున ఆ దేశీయులను వెనక్కి పంపించడం సాధ్యం కాదు. అందుకనే దేశంలోని శరణార్థుల శిబిరాలకు వారిని పంపిస్తామని కేంద్రం చెప్పింది. దీంతో వరుసగా రెండోసారి భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన మోదీ సర్కారు అస్సాంలో 1971 మార్చి 24ను కటాఫ్ తేదీగా లెక్కేసి, ఆ తేదీనాటికి నివాసం ఉన్నట్టు చూపే పత్రాలను సమర్పించమని పౌరుల్ని కోరారు. అలా చూపలేనివారిని ఈ దేశ పౌరులుగా ప్రకటించడం సాధ్యం కాదని ప్రకటించారు. ఈ ప్రకారంగా అసోంలో మొత్తం 3.30 కోట్ల మంది ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించగా, వారిలో 3 కోట్ల పదకొండు లక్షల మందిని మాత్రమే భారత పౌరులుగా గుర్తించారు. దీంతో దాదాపు 19 లక్షల మందికి ఎన్‌ఆర్‌సీ తుది జాబితాలో చోటు దక్కకలేదు. జాబితాలో చోటు లేని వారిని చట్టపరమైన ఎంపికలు జరిగే వరకు విదేశీయులుగా ప్రకటించలేమని కేంద్రం తెలిపింది. అంతేగాక జాబితాలో పేరు లేని వారు విదేశీయుల ట్రిబ్యునల్‌కు అప్పీలు చేసుకోవచ్చని వెల్లడించింది. స్థానిక పౌరులమని నిరూపించుకోలేక పోయినవారిలో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లింలే కాకుండా బెంగాల్ నుంచి వచ్చిన ముస్లింలు, హిందువులు, క్రై స్తవులు కూడా ఉన్నారు.

    స్వాతంత్య్రం తర్వాత ఏంజరిగిందంటే..
    1947లో పాకిస్థాన్ నుంచి, 1971లో బంగ్లాదేశ్ నుంచి భారత్‌కి వలస నాటి నుంచి నేటి వరకు కొనసాగుతూనే ఉంది. 1959లో టిబెట్‌ను చైనా అక్రమంగా విలీనం చేసుకుంది. దానితో దలైలామాతో సహా లక్షలాది మంది టిబెటియన్లు వలస వచ్చారు. 1979లో సోవియట్‌ఆఫ్గన్ యుద్ధ సమయంలో ఆఫ్గనిస్తాన్ నుంచి భారత్‌కు అనేక మంది వలస వచ్చారు.1980 నుంచి 2000 వరకు శ్రీలంకలో సింహళిలు, తమిళుల మధ్య జరిగిన సివిల్‌వార్ సమయంలో అనేక మంది తమిళులు వలస వచ్చారు. 2015-2017 మయన్మార్ నుంచి బంగ్లాదేశ్‌కు రొహింగ్యాలు వలస వచ్చారు. తర్వాత బంగ్లాదేశ్ నుంచి వారు ఈశాన్యరాష్ట్రాలోకి ప్రవేశించారు. మొత్తంగా చూస్తే ఎక్కువ మంది బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి మన దేశానికి వలస వచ్చినట్టు తెసుస్తోంది. ఈవలసలను నిరోధించడానికి భారత్ ఆర్టికిల్ 244 హెడ్యూల్ 6 ప్రకారం ఈశాన్య రాష్ట్రాలను ట్రైబల్ ఏరియాస్‌గా ప్రకటించడంతోపాటు, కాశ్మీర్ తరహలో ప్రత్యేకప్రతిపత్తిని ఇచ్చింది. ఈశాన్య రాష్ట్రాల్లో మిజోరాం, అరుణాచల్‌ప్రదేశ్, నాగాలాండ్‌లకు ఇన్నర్‌లైన్ పర్మిట్ (Inner Line Permit Act-1873)ను కూడా ఇచ్చింది. ఇన్నర్‌లైన్ పర్మిట్ ప్రకారం మిజోరాం, అరుణాచల్‌ప్రదేశ్, నాగాలాండ్‌లకు వెళ్లాలంటే వీసా, పాస్‌పోర్టు అవసరం ఉంటుంది. ఎంత కాలం అక్కడ ఉండబోతున్నామో ఇన్నర్‌లైన్ పర్మిట్‌లో స్పష్టంగా తెలుపవలసి ఉంటుంది. ఈ రాష్ట్రాల్లో సీఏఏ వర్తించదు. ఈ మూడు రాష్ట్రాలతోపాటు మణిపూర్‌ను కూడా త్వరలో ఇన్నర్‌లైన్‌పర్మిట్‌లో చేరుస్తామని కేంద్రం ఇటీవల స్పష్టంగా ప్రకటించింది. అస్సాం, మేఘాలయ, త్రిపుర, సిక్కిం రాష్ట్రాలకు ఈ ఇన్నర్‌లైన్ పర్మిట్ లేదు. 1978లో MP హీరాలాల్ పట్వారీ మరణించడంతో అస్సాంలో రీఎలక్షన్స్ ప్రకటించారు. అస్సాంలో ఓటర్ల సంఖ్య సెడెన్‌గా పెరగడంతో ఈ ఎలక్షన్స్ పాల్గొనమని అస్సామీయులు ఆందోళన చేపట్టారు. పెరిగిన ఓటర్లంతా వలసగా వచ్చినవారు. అయితే వీరిలో పాస్‌పోర్టు, సరైన డాక్యుమెంట్స్ లేకుడా, ఇల్లీగల్‌గా ఉంటున్నవారు అధికం.

    విభజనకాలంలో...
    మతపరంగా ప్రజలను అటూ ఇటూ మార్పిడి చేసుకున్నారు. అయితే ప్రజల మార్పిడి ప్రక్రియ రక్తపాతంతో, మారణ కాండతో, అత్యాచారాలతో సాగింది. కొన్నేళ్లలోపే ఉపఖండం పశ్చిమప్రాంతంలో ఈ ప్రజల మార్పిడి ప్రక్రియ పూర్తయింది, దాదాపు ముగిసిపోయింది. భారత్ భూభాగంలోని పంజాబ్‌లో ముస్లింలు, పాకిస్తాన్ భూభాగంలో హిందువులు, సిక్కులు చాలా తక్కువమంది మాత్రమే ఉండిపోయారు. 1960ల మధ్య వరకు విభజనకు సంబంధించి కొన్ని వింత ఘటనలు కొనసాగాయి. పాకిస్తాన్ కెప్టెన్‌గా వ్యవహరించిన క్రికెటర్ అసిఫ్ ఇక్బాల్ 1961లో మాత్రమే పాకిస్తాన్‌కు వలస వెళ్లాడు. అప్పటివరకు అతడు హైదరాబాద్ జట్టు తరపున ఆడేవాడు. 1965 యుద్ధ కాలంలో చిన్న అలజడి చెలరేగింది కానీ త్వరలోనే అది ముగిసిపోయింది. కానీ తూర్పు భారత్‌లో విభిన్న చిత్రం చోటు చేసుకుంది. అనేక సంక్లిష్ట కారణాల రీత్యా తూర్పు పాకిస్తాన్, భారత్‌కి చెందిన పశ్చిమ బెంగాల్, అస్సాం, త్రిపురల మధ్య జనాభా మార్పిడి పూర్తి కాలేదు. బెంగాల్‌లోని అనేక వర్గాలకు చెందిన ముస్లింలు.. అలాగే తూర్పు బెంగాల్ (పాకిస్తాన్) లోని హిందువులు భారత్‌లోనే ఉండిపోయారు. కానీ ఇరుపక్షాల మధ్య ఘర్షణలు కొనసాగాయి.

    అందుకే ఇలాంటి ఘటనలను నిలిపివేయడానికి 1950 ఏప్రిల్ లోనే జవహర్‌లాల్ నెహ్రూ, నాటి పాకిస్తాన్ ప్రధాని లియాఖత్ ఆలి ఖాన్ ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇదే చారిత్రాత్మకమైన నెహ్రూ-లియాఖత్ ఒప్పందం. ఈ ఒప్పందంలో అయిదు ప్రధాన అంశాలున్నాయి.
  • ఇరుదేశాలూ తమ భూభాగంలోని మైనారిటీలను పరిరక్షిస్తూనే.. ప్రభుత్వ ఉద్యోగాలు, రాజకీయాలు, సాయుధ బలగాల్లో చేర్చుకోవడంతోపాటు అన్ని హక్కులు, స్వేచ్ఛలను వారికి కల్పించాలి.
  • దాడుల కారణంగా తాత్కాలికంగా గూడు కోల్పోయి, వలసపోయినప్పటికీ, తిరిగి తమ ఇళ్లకు చేరుకోవాలని భావిస్తున్నవారికి ఇరుదేశాలూ ఆశ్రయం కల్పించి, పరిరక్షించాలి.
  • అలా వెనక్కు తిరిగి రాని వారిని రెండు దేశాలూ తమతమ పౌరులుగానే భావించాలి.
  • ఈలోగా, ఇరు దేశాల్లో ఉండిపోయిన వారు స్వేచ్ఛగా రాకపోకలు సాగించవచ్చు, ఇప్పటికీ తామున్న దేశం నుంచి మరొక దేశంలోకి వలస వెళ్లాలని కోరుకుంటున్నవారికి ఇరుదేశాలూ రక్షణ కల్పించి సహకరించాలి.
  • ఇరుదేశాలు శాంతిభద్రతలను కాపాడటానికి నిజాయితీగా ప్రయత్నించాలి. అప్పుడు మాత్రమే ప్రజలు తాము కోరుకున్న భూభాగాలపై సురక్షితంగా ఉన్నట్లు భావించగలరు.

ఈ ఒప్పంద సూత్రాలను బట్టే, భారత్ తన జనాభా గణనను చేపట్టి, 1951లో ప్రథమ జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్సీ)ను రూపొందించింది. భారత్‌లో ముస్లిం జనాభా శాతం.. హిందువులు, సిక్కుల జనాభా కంటే కాస్త అధికంగానే పెరుగుతూవచ్చిందని, అదే సమయంలో తూర్పు, పశ్చిమ పాకిస్తాన్‌లో మైనారిటీలుగా ఉంటున్న హిందువుల జనాభా వేగంగా తగ్గుతూ వచ్చిందని ఇరుదేశాల జనగణన డేటా సూచిస్తోంది. అంటే హిందూ మైనారిటీలు పాక్‌ను, బంగ్లాదేశ్‌ను వదిలిపెట్టి భారత్‌లో స్థిరపడ్డారని చెప్పవచ్చు. దేశవిభజన సమయంలో పూర్తి చేయని కర్తవ్యానికి సమాధానంగా పౌరసత్వ సవరణ బిల్లును తీసుకురావడానికి కారణం ఇదేనని బీజేపీ చెబుతుండవచ్చు. పాకిస్తాన్ నెహ్రూ-లియాఖత్ ఒడంబడికలోని సూత్రాలను పాటించి గౌరవించడంలో విఫలమైందని, దీంతో భారత్ మైనారిటీల సహజ నిలయంగా మారిందని పాక్‌లో మైనారిటీలను నేటికీ పీడిస్తున్నారని బీజేపీ వాదన. ఇక్కడే మనం సంక్లిష్టతల్లోకి కూరుకుపోవడం ప్రారంభిస్తాం.
  • మొదట, భారత్ నిర్మాతలు తమ లౌకిక రిపబ్లిక్ ఇలా ఉండాలని కోరుకున్న చట్రంలో జిన్నా రెండు దేశాల థియరీ ఇమడలేదు.
  • రెండు, ఏ దశవద్ద పాత చరిత్ర ముగిసి కొత్త చరిత్ర ప్రారంభం కావాలి?
  • ఇక మూడోది, దేశీయతతో కూడిన జాతీయ సమానార్థకమైనది ఏది? మతం, జాతి, భాషతో సమానమైనదా?

తూర్పు భారత్‌లో ప్రత్యేకించి అస్సాంలో వలసల స్వభావం, సంక్లిష్టతను అర్థం చేసుకోవడానికి మనం కొన్ని దశాబ్దాల వెనక్కు వెళ్లడం అవసరం. అస్సాం సాపేక్షికంగా తక్కువ జనసాంద్రత కలిగిన విశాలమైన సారవంతమైన భూములతో, సమృద్ధిగా జలవనరులతో కూడిన ప్రాంతం. అందుకే ఈ రాష్ట్రంలోకి 20వ శతాబ్దిలో తూర్పు బెంగాల్ నుంచి తొలి దశ వలసలకు దారితీసింది. వీరిలో చాలామంది ఆర్థిక కారణాలతో వచ్చినవారే. భూములకోసం, మంచి జీవితం కోసం వీరొచ్చారు. ఇలా మన దేశంపైకి వలసరూపంలో చేసిన ఆక్రమణ గురించి ప్రస్తావించిన తొలి వ్యక్తి బ్రిటిష్ సూపరెంటెండెంట్ సీఎస్ ముల్లన్. 1931లో అస్సాంలో జనగణన కార్యకలాపాలను ఈయనే పర్యవేక్షించారు. తన మాటల్లోనే చెప్పాలంటే..

‘బహుశా, గత 25 ఏళ్లలో అస్సాం ప్రావిన్స్ లో జరిగిన అత్యంత ముఖ్యమైన ఘటన, అస్సామీయుల సంస్కృతి, నాగరికతలను పూర్తిగా ధ్వంసం చేసి అస్సాం భవిష్యత్తునే శాశ్వతంగా మార్చివేయగలిగిన ఘటన ఏమిటంటే, తూర్పు బెంగాల్ జిల్లాల నుంచి ప్రత్యేకించి మైమెన్‌సింగ్ జిల్లా నుంచి భూదాహంతో వలసవచ్చిన ముస్లింల భూ ఆక్రమణే’ అని సీఎస్ ముల్లాన్ పేర్కొన్నారు. ‘ఎక్కడ శవాలు ఉంటే అక్కడికి రాబందులు వచ్చి కూడతాయి. ఎక్కడ బీడు భూములుంటే అక్కడికల్లా మైమెన్‌సింగ్ జిల్లా నుంచి వలస వచ్చినవారు గుమికూడతార’ని ఆయన ముగించారు.

సరే..ఆర్థిక కారణాలతో అస్సాంలోకి ముస్లింల వలస ప్రారంభం కాగా, విభజన తర్వాత హిందువుల వలస దానికి తోడైంది. కాగా 1947కి ముందే వచ్చిన మైమెన్‌సింగ్ జిల్లాకు చెందిన ముస్లింలు చాలావరకు అస్సాంలోనే ఉండిపోగా, తర్వాత హిందువులు కూడా గుంపులు గుంపులుగా వచ్చి చేరారు. 1971లో బంగ్లా విభజన నాటికే అనేక మంది అక్కడ స్థిరపడ్డారు. విభజన తర్వాత కూడా వారిని వెనుకకు పంపలేదు. దీంతో మొత్తం భూభాగంలోని జాతుల సమతూకం మారిపోయింది. ఇదే సమస్యకు ప్రధాన కారణం. అస్సాం ఆందోళనలకు సమాధానం ఇవ్వడంలో పౌరసత్వ సవరణ చట్టం (CAA) విఫలమవుతుండటానికి ఇదే ప్రధాన కారణం. మతంపై కాకుండా, జాతి, సంస్కృతి, భాష, రాజకీయ అధికారం వంటి అంశాల్లోనే అక్కడ అధిక ఆందోళనలు చోటుచేసుకుంటున్నాయి. గత మూడు దశాబ్దాలుగా దీన్ని మార్చడానికి ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీలు ప్రయత్నిస్తూ వచ్చాయి. పైగా ముస్లిం వలసప్రజలు దేశ విభజనకు ముందే వచ్చారు వీరికి పౌరసత్వాన్ని నిరాకరించలేరు. బెంగాలీ హిందువులు ఇటీవలి కాలంలో వచ్చినవారు. అందుకే జాతీయ పౌర పట్టిక ప్రకారం అనర్హులుగా తేలిన 19 లక్షలమందిలో 60 శాతం వరకు ముస్లిమేతరులే ఉండటం ఈ నిజాన్ని సూచిస్తోంది. పాకిస్తాన్, ఆప్గానిస్తాన్, బంగా్లదేశ్ ఈ మూడు దేశాలు ఇస్లామిక్ దేశాలు. అక్కడి మైనార్టీలు అత్యాచారాలకు, హత్యలకు, వివక్షకు గురై, అఘాయిత్యాలు తట్టుకోలేక భారత్‌కు వలస వచ్చారు. అనేక మంది ప్రాణాలను కోల్పోయారు. ఈ రోజు అక్కడ 10వవంతు కూడా మైనార్టీలు లేరు. అంటే వారంతా శరణార్ధులుగా వచ్చినవారు. పౌరసత్వ చట్టాన్ని అమలు చేసినట్లయితే, ముస్లింల కంటే హిందువులనే ఎక్కువగా దేశం నుంచి పంపించేయాల్సి ఉంటుంది. తాజా పౌరసత్వ సవరణ చట్టం (CAA)తో దీన్ని పరిష్కరించాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. కానీ దీనికి అస్సామీలు అంగీకరించడం లేదు.

ఎన్‌ఆర్‌సీ అస్సాంకేనా?
అస్సాంలో మాదిరిగానే బంగ్లాదేశీయుల వలసలు ఎక్కువగా ఉన్న ఢిల్లీతోపాటు శ్రీనగర్‌లోనూ ఇలాంటి వివరాలు సేకరించాలని విశ్లేషకులు అంటున్నారు. అంతకంటే ముందుగా ఎన్నార్సీ ప్రక్రియను పశ్చిమబెంగాల్, బిహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశాల్లోనూ మొదలుపెట్టాలని, ఈ ప్రక్రియ ఏ ఒక్క మతానికో లేక వర్గానికో పరిమితం కారాదని అంటున్నారు. అసోంతోపాటు చాలా రాష్ట్రాల్లో అక్రమ వలసదారులున్నందున ఇలాంటి ప్రక్రియను మిగతా రాష్ట్రాల్లోనూ అమలు చేస్తే తప్పేంటని వాదిస్తున్నారు. ఎన్నార్సీ ప్రక్రియలో అవకతవకలకు తావివ్వకుంగా, న్యాయబద్ధంగా, నిర్దేశిత విధానాలను పాటించాలని సుప్రీంకోర్టు సైతం సూచించింది.

ఎన్‌ఆర్‌సీ దేశవ్యాప్తంగా అమలుచేస్తే..
ప్రస్తుతానికి ఎన్‌ఆర్‌సీ అనేది ఓ ప్రతిపాదన మాత్రమే. చట్టంగా అమలులోకి ఇంకా రాలేదు. అమల్లోకి వస్తే అక్రమ వలసదారులే లక్ష్యంగా మారతారు. అక్రమ వలసదారులు దేశంలో ఏ మూలన ఉన్నా సరే అంతర్జాతీయ చట్టాలను అనుసరించి వారిని బయటకు పంపివేయడం జరుగుతుంది. ఇది దేశంలోని ప్రతీ మూలలో, భారతదేశ మట్టిపై అక్రమంగా నివసిస్తున్న ప్రతీ ఒక్కరికి వర్తిస్తుంది. అయితే అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ల నుంచి వచ్చిన హిందువులు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు, జైన్, పార్శీలకు పెద్దగా ఇబ్బంది లేకపోవచ్చు. మతపరమైన హింసను స్వదేశాల్లో ఎదుర్కొన్నందుకే ఇక్కడకు వచ్చామని వారు చెప్పుకుంటే సరిపోతుంది. ఇంకోలా చెప్పాలంటే ఎన్‌ఆర్‌సీ దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తే పైన చెప్పుకున్న మూడు దేశాలు మినహా మిగిలిన ఏ దేశపు అక్రమ వలసదారు కూడా ఇక్కడ ఉండేందుకు అవకాశం ఉండదు. అంతేకాకుండా.. ఈ దేశాల నుంచి వచ్చిన ముస్లింలూ చిక్కుల్లో పడతారు. ఎందుకంటే వీరు పౌరసత్వ చట్ట సవరణ నిబంధనల్లో లేరు కాబట్టి. దీంతో వీరందరినీ అదుపులోకి తీసుకుని డిటెన్షన్ కేంద్రాలకు తరలించాల్సి వస్తుంది. అస్సాంలో ఇప్పటికే గుర్తించిన 19 లక్షల మంది అక్రమ వలసదారులను ఇలాగే డిటెన్షన్ కేంద్రాల్లోనే ఉంచారు. దేశవ్యాప్తంగా అక్రమ వలసదారులను ఇలా డిటెన్షన్ కేంద్రాలకు తరలించిన తరువాత విదేశీ వ్యవహారాల శాఖ ఆయా దేశాలకు సమాచారం ఇస్తుంది. ఆయా దేశాలు అంగీకరిస్తే వారిని తిప్పి పంపుతారు. అప్పుడు వారంతా విదేశీయులుగా గుర్తింపబడతారు. అయితే వీరంతా ట్రిబ్యునల్ ముందు హాజరై తాము విదేశీయులం కాదని, భారతీయులమని నిరూపించుకోవాలి. అలా జరగనట్లయితే వారంతా దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది. మొత్తంగా 2020 కల్లా జాతీయ ప్రజా రిజిస్టర్ (ఎన్‌పీఆర్)ను రూపొందించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. దీని ఆధారంగానే దేశవ్యాప్త పౌరసత్వ రిజిస్టర్‌ను తయారు చేయనుంది. ఎన్‌పీఆర్ పూర్తయి, అధికారికంగా ముద్రించాక ప్రభుత్వం దీనినే భారత జాతీయ పౌరసత్వ(ఎన్‌ఆర్‌ఐసీ) రిజిస్టర్‌కు ఆధారంగా చేసుకుంటుంది. అంటే, ఇది అస్సాంలో చేపట్టిన జాతీయ పౌరసత్వ రిజిస్టర్(ఎన్నార్సీ)కి అఖిల భారత రూపం. 2020 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీల మధ్య ఈ కార్యక్రమం అస్సాం మినహా దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఇందులో భాగంగా అధికారులు ఇంటింటికీ వెళ్లి ఆ ప్రాంతంలో ఆరు నెలలుగా నివాసం ఉంటున్న లేదా మరో ఆరు నెలలు, అంతకంటే ఎక్కువ కాలం అక్కడే ఉండాలనుకున్న వ్యక్తుల పేర్లను నమోదు చేసుకుంటారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలి.

ఎన్నార్సీ వల్ల నష్టపోయేవారు..
  • నిరుపేదలు, నిరక్షరాస్యులు, మహిళలు, అనాథలు వీరిలో అధికంగా ఉంటారు. ఇంకా లోతులకు పోయి చూస్తే బిచ్చగాళ్లు, అనామకులు, వృద్ధులు ఎక్కువ. పుట్టిన తేదీ సర్టిఫికేట్లు, ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, ఓటర్ గుర్తింపు కార్డులు... వంటి కనీసపు గుర్తింపు పత్రాలు ఇప్పటికీ అనేక గ్రామాల్లోని ప్రజలకు అందుబాటులో లేవు. ఇక ఇళ్లువాకిలీ లేని వారి సంగతి సరేసరి. ఇటువంటి వారు ఎక్కడి నుంచి తేవాలి? ఎవరి పౌరసత్వంపై అయినా సందేహాలు వెల్లబుచ్చే అధికారాన్ని కింది స్థాయి అధికారులకు చట్టం కట్టబెట్టింది. ఎవరిదైనా పౌరసత్వానికి ఎవరైనా అభ్యంతరాలు తెలపవచ్చు. ఈ పరిస్థితుల్లో ఈ సందేహాలు, అభ్యంతరాలకు ప్రమాణాలు ఏమిటి? పౌరుడిని ఎవరు నిర్ణయిస్తారు? అస్సాం ఎన్నార్సీ జాబితా చూస్తే దీనిలోని అవకతవకలు తెసుస్తాయి. అక్కడి విచిత్రమేమంటే ఒకే కుటుంబంలో భార్య ఎన్‌ఆర్‌సీలో ఉంటే... భర్తకు అందులో చోటు దక్కలేదు. అన్నదమ్ముల్లో కొందరు జాబితాలోకెక్కితే మరికొందరికి దక్కలేదు. సైన్యంలో రిటైరై, అస్సాం సరిహద్దు పోలీస్ విభాగంలో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసే మహమ్మద్ సనావుల్లా ఉదంతం దీనికి మంచి ఉదాహరణ. ఇప్పుడు జాబితాలో చోటుదక్కని వారంతా వేర్వేరు నిర్బంధ శిబిరాల్లో ఉన్నారు. వీరి విషయంలో కేంద్రం ఏ విధంగా చర్యలు తీసుకోనుందో ఇంకా ఖరారు చేయలేదు.
  • వలసవచ్చిన వారిని పక్కన పెడితే స్థానిక భారతీయులు కూడా తమ పౌరసత్వాన్ని నిరూపించుకోలేక పోవడం అస్సాం విషయంలో ప్రస్పుటంగా కనిపిస్తోంది.
  • 1971 కంటే ముందు బంగ్లాదేశ్ నుంచి శరణార్థులుగా వచ్చిన వారికి ఎన్‌ఆర్‌సీ జాబితాలో చోటు దక్కలేదు. శరణార్థిగా ధ్రువీకరించే పత్రాలను అధికారులు అస్సలు పట్టించుకోకపోవడంతో, పాత జాబితాల్లో అవకతవకల కారణంగా కొంతమంది ఎన్‌ఆర్‌సీలో చోటు దక్కించుకోగలిగారు, కొంతమందికి దక్కలేదు.
  • మూడు ఇస్లామిక్ దేశాల నుంచి శరణార్ధులుగా వచ్చిన వారిలో హిందువులే అత్యధికంగా ఉన్నారు. ముస్లిమేతరులకు పౌరసత్వమిచ్చి వారికి ఎన్నార్సీ నుంచి రక్షణ కల్పించాలని బీజేపీ భావిస్తోంది. దీని వల్ల హిందువులైనా, ముస్లింలు అయినా తమకు సంబంధం లేదని, విదేశీయులందరిని తమ రాష్ట్రం నుంచి పంపించాలనే స్థానిక అస్సామీల డిమాండ్ శాశ్వతంగా నెరవేరదు.
  • ఎన్నార్సీ, సీఏఏల కారణంగా అస్సాంలోని నిరసన జ్వాలలు చల్లారకముందే, బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు దేశవ్యాప్తంగా అమలు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. దేశ శాంతి భద్రతల దృష్ట్యా ప్రజాగ్రహం మరింత పెల్లుబికే అవకాశం ఉంది.
ముగింపు: పొట్టచేత పట్టుకొని బతకడానికి వచ్చినవారిని ఆదుకుని అక్కున చేర్చుకుంటే పెద్దరికం ముఖ్యంగా మానవత్వం నిలబడుతుంది. ఇది ఈ రోజు కొత్తగా చేబుతున్నది కాదు. ఇది వరకు 1964లోనే తమిళులకు, 1971 వరకు బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన వారికి మతంతో సంబంధం లేకుంగా భారత పౌరసత్వం ఇచ్చింది. ప్రతీఏట కోట్లలో పెరిగే దేశ జనాభాతో పోల్చితే వలస వచ్చిన లక్షల జనాభా పెద్ద విషయం కాదు. నిజానికి ఏళ్లతరబడి నానుతున్న ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్, అయోధ్య కేసు వంటివి దేశానికి మేలు చేసే అంశాలు. వీటిని బీజేపీ ప్రభుత్వం త్వరితగతిన పరిష్కరించింది. అక్రమ వలసదారుల గెంటివేత కూడా దేశానికి మరింత మేలు చేసే అంశమే. అందుకు చేప‌ట్టే ప్రక్రియ స‌రైన‌ది కాదు. అలాగే.. నిరసన తెలపడం అనేది భారత ప్రజలకున్న ప్రజాస్వామ్యపు హక్కు. నచ్చని అంశంపై నిరసన తెలియజేయడాన్ని ఎవరూ ఆపలేరు. అయితే అది శాంతియుతంగా జరగాలి. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి.ఎందుకంటే... ఏ దేశమేగినా ఎందుకాలిడినా, ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా, పొగడరా నీతల్లి భూమి భారతిని, నిలుపరా నీజాతి నిండుగౌరవము... అని రాయప్రోలు చెప్పిన మాటలు మర్చిపోకూడదు.
Published date : 04 Jan 2020 05:17PM

Photo Stories