Disabled Quota in RGUKT: ట్రిపుల్ ఐటీలో వికలాంగుల కోటా కింద సీట్ల భర్తీ
వేంపల్లె: రాజీవ్గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయ పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలకు 2024–25 విద్యా సంవత్సరం సంబంధించి వికలాంగుల కోటా కింద 141 సీట్లు భర్తీ చేయనున్నట్లు అడ్మిషన్ కన్వీనర్ అమరేంద్ర కుమార్ సండ్ర పేర్కొన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నాలుగు ట్రిపుల్ ఐటీలకు వికలాంగుల కోటా కింద 200 సీట్లు ఉండగా..255 మంది దరఖాస్తు చేసుకున్నారు. 141 మందికి అధికారులు కాల్ లెటర్స్ పంపారన్నారు. అందులో 112 మంది దొంగ సర్టిఫికెట్లను తీసుకొచ్చి దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు.
Also Read: AP EAPCET 2024 Final Phase Counselling Schedule: Check Important Dates
90 శాతం మంది చెవుడు కింద దరఖాస్తు చేసుకోగా ట్రిపుల్ ఐటీ అధికారులకు అనుమానం వచ్చి విజయవాడ డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ అధికారులకు పంపగా 112 మంది విద్యార్థులవి నకిలీ సర్టిఫికెట్లు అని తేలాయి. దీంతో వారి సీట్లను రద్దు చేసినట్లు తెలిపారు. వికలాంగుల కోటా కింద మిగిలిన 59 సీట్లను త్వరలో మూడో విడత జనరల్ కోటాలో భర్తీ చేయనున్నట్లు తెలిపారు. వీరికి ఈ నెల 20 తేదీన కౌన్సెలింగ్ ప్రక్రియ జరపనున్నామని తెలిపారు. కాల్ లెటర్స్ పంపిన విద్యార్థులకు ఆయా క్యాంపస్లలో 20 తేదీన 8 గంటలకు తప్పక హాజరుకావాలని కోరారు.