Skip to main content

Economy: తెలంగాణ స్టేట్‌ స్టాటిస్టికల్‌ అబ్‌స్ట్రాక్ట్‌–2021

TS Economy

Economy: తెలంగాణ స్టేట్‌ స్టాటిస్టికల్‌ అబ్‌స్ట్రాక్ట్‌–2021 ఆవిష్కరణ

తెలంగాణ రాష్ట్ర స్థూల ఉత్పత్తితోపాటు తలసరి ఆదాయంలోనూ ఏటేటా వృద్ధి నమోదవుతోంది. రాష్ట్రం ఏర్పాటైన 2014–15లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ) రూ.5,05,849 కోట్లు కాగా, 2020–21 నాటికి అది రూ.9,80,407 కోట్లకు చేరింది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ‘‘తెలంగాణ రాష్ట్ర గణాంక సంగ్రహణ–2021(తెలంగాణ స్టేట్‌ స్టాటిస్టికల్‌ అబ్‌స్ట్రాక్ట్‌–2021)లో ఈ విషయం వెల్లడైంది. రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక శాఖలు సంయుక్తంగా రూపొందించిన ఈ నివేదికను ఫిబ్రవరి 23న హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్‌చైర్మన్‌ బోయినపల్లి వినోద్‌కుమార్‌ ఆవిష్కరించారు.

నివేదికలోని కొన్ని అంశాలు..

  • 2014–15 నుంచి 2020–21 మధ్యకాలంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 93.8 శాతం వృద్ధి నమోదైంది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి 5 శాతంగా నమోదైంది. 2014–15లో ఇది 4 శాతం మాత్రమే. 
  • రాష్ట్రం ఏర్పాటైన తొలి రెండేళ్లలో జీడీపీ కంటే జీఎస్‌డీపీ పెరుగుదల తక్కువ కాగా, ఆ తర్వాత జీడీపీ కంటే ప్రతియేటా జీఎస్‌డీపీలో పెరుగుదల నమోదవుతోంది.
  • తెలంగాణ ఏర్పాటైన తర్వాత జీఎస్‌డీపీ వార్షిక సగటు పెరుగుదల 11.8 శాతం కాగా, జీడీపీ పెరుగుదల 8.5 శాతమే. 
  • కోవిడ్‌ క్లిష్ట సమయంలోనూ రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో వృద్ధి నమోదైంది. 2020–21లోనే జీఎస్‌డీపీ పెరుగుదల 2.4 శాతం నమోదైంది. అదే సమయంలో జీడీపీ మాత్రం మైనస్‌ 3 శాతానికి తగ్గింది.

2020–21 ఆర్థిక ఏడాదిలో రాష్ట్ర తలసరి ఆదాయం ఎంత?

  • స్టాటిస్టికల్‌ అబ్‌స్ట్రాక్ట్‌–2021 గణాంకాల ప్రకారం దేశ తలసరి ఆదాయంతో పోలిస్తే రాష్ట్ర తలసరి ఆదాయం ముందంజలో ఉంది.  2020–21 ఆర్థిక సంవత్సరానికి దేశ తలసరి ఆదాయం రూ.1,28,829 కాగా, రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 2,37,632కు చేరింది.
  • రాష్ట్రం ఏర్పాటైన 2014–15 ఆర్థిక ఏడాదిలో రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 91,121 కాగా, దేశ తలసరి ఆదాయం రూ. 63,462గా నమోదైంది.
  • రాష్ట్రం ఏర్పాటైన తొలి రెండేళ్లలో సగటు వార్షిక తలసరి ఆదాయం పెరుగుదల తెలంగాణలో 10.9, జాతీయస్థాయిలో 11.7 శాతంగా నమోదయ్యాయి. ఆ తర్వాత వార్షిక సగటు పెరుగుదల 11.3 శాతం కాగా, దేశ సగటు 7.3 శాతంగా నమోదైంది.

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
తెలంగాణ స్టేట్‌ స్టాటిస్టికల్‌ అబ్‌స్ట్రాక్ట్‌–2021 ఆవిష్కరణ
ఎప్పుడు : ఫిబ్రవరి 23
ఎవరు    : తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్‌చైర్మన్‌ బోయినపల్లి వినోద్‌కుమార్‌
ఎక్కడ    : ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ, హైదరాబాద్‌
ఎందుకు : తెలంగాణ రాష్ట్ర ఆర్థిక స్థితి, గతులను గురించి వెల్లడించేందుకు..

Demographics: తెలంగాణ జనాభాలో ఎంత శాతం మంది మహిళలు ఉన్నారు?

తెలంగాణ రాష్ట్రంలో రానున్న 15 ఏళ్లలో యువశక్తి తగ్గిపోనుంది. రాష్ట్ర జనాభాలో 2021 ఏడాది నాటికి 15–40 ఏళ్లలోపు యువత 43.6 శాతం ఉండగా, 2036 నాటికి ఇందులో 15.9 శాతం తగ్గి.. 27.7 శాతం కానున్నట్లు అంచనా. ఫిబ్రవరి 23న రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన తెలంగాణ స్టేట్‌ స్టాటిస్టికల్‌ అబ్‌స్ట్రాక్ట్‌–2021లో ఈ విషయం వెల్లడైంది. ఈ నివేదిక ప్రకారం..

  • రానున్న 15 ఏళ్లలో 40 ఏళ్ల పైబడిన వారి జనాభా 42.5 శాతానికి పెరగనుంది.
  • 15–40 ఏళ్లలోపు గణాంకాలను పరిగణనలోకి తీసుకునే 6 శ్లాబుల్లో 35–39 ఏళ్ల శ్లాబు మినహా అన్ని శ్లాబుల్లోనూ తగ్గుదల నమోదు కానుంది.  80ఏళ్ల పైబడిన వారి సంఖ్య 82 శాతం పెరగనుంది. 
  • 2021 నాటికి రాష్ట్ర జనాభా 3,77,25,000 కాగా దేశ జనాభాలో ఇది 2.8 శాతమని అంచనా.
  • రాష్ట్రంలో 50.3 శాతం మంది పురుషులు కాగా, 49.7 శాతం మంది మహిళలున్నారు.

విద్యుత్‌ వినియోగం ఇలా..
తాజా ప్రభుత్వ నివేదిక ప్రకారం... తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో వరుసగా ఆరేళ్లపాటు విద్యుత్‌ వినియోగం పెరగ్గా, 2020–21లో స్వల్పంగా తగ్గింది. 2014–15లో 39,519 మిలియన్‌ యూనిట్లు (ఎంయూ) ఉన్న విద్యుత్‌ వినియోగం, క్రమంగా పెరుగుతూ 2019–20 నాటికి 58,515 ఎంయూలకు చేరింది. 2020–21లో 57,006 ఎంయూలకు పడిపోయింది. కరోనా నియంత్రణకు లాక్‌డౌన్‌ విధించడంతో పరిశ్రమలు, వాణిజ్య సముదాయాలు మూతపడటమే ఇందుకు కారణం.

రాష్ట్రంలో విద్యుత్‌ వినియోగం (మిలియన్‌ యూనిట్లలో..)

Telangana: రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో సేవల రంగం వాటా ఎంత శాతం?

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో సేవల రంగానిదే అధిక భాగస్వామ్యం ఉంది. రాష్ట్ర మొత్తం రాష్ట్ర స్థూల విలువలో ఈ రంగం వాటా 59.4 శాతంగా ఉంది. ప్రాథమిక సెక్టార్‌ కిందకొచ్చే జీవ సంపద, పంటల భాగస్వామ్యం 24.1 శాతం కాగా, నిర్మాణ, తయారీ రంగాలతో కూడిన సెకండరీ సెక్టార్‌ భాగస్వామ్యం 16.5 శాతంగా ఉంది. ఫిబ్రవరి 23న రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన తెలంగాణ స్టేట్‌ స్టాటిస్టికల్‌ అబ్‌స్ట్రాక్ట్‌–2021లో ఈ విషయం వెల్లడైంది. ఈ నివేదిక ప్రకారం..  

  • ప్రాథమిక సెక్టార్‌లో జీవసంపద రంగం 43.6, పంటల రంగం 37.3 శాతం స్థూల విలువను కలిగి ఉన్నాయి. ఇక మాధ్యమిక సెక్టార్‌లో తయారీ రంగం 63.6 శాతం, నిర్మాణ రంగ స్థూల విలువ 25 శాతంగా నమోదయ్యాయి.
  • సేవల రంగం పరిధిలోకి వచ్చే రియల్‌ ఎస్టేట్, ప్రొఫెషనల్‌ సర్వీసెస్‌ భాగస్వామ్యం 34.7 శాతం కాగా, వ్యాపారం, హోటళ్లు, రెస్టారెంట్ల సబ్‌సెక్టార్‌ భాగస్వామ్యం 25.6 శాతం ఉంది.
  • రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలతో మత్స్యసంపదతో పాటు పాలు, మాంసాహార ఉత్పత్తి, వినియోగం 2018–19 నుంచి 2020–21 నాటికి 19 శాతం పెరిగింది.

Telangana: మిషన్‌ భగీరథను ఎప్పుడు, ఎక్కడ ప్రారంభించారు?

తెలంగాణ రాష్ట్రంలో తాగునీరు, పారిశుధ్య సౌకర్యాల మెరుగునకు ప్రభ్యుత్వం అనేక ప్రత్యేక చర్యలు చేపట్టింది. అందులో మిషన్‌ భగీరథది కీలకపాత్ర. ఈ పథకాన్ని 2016, ఆగస్టు 6వ తేదీన గజ్వేల్‌ నియోజకవర్గం, కోమటిబండ గ్రామంలో ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు కలిసి ప్రారంభించారు. రాష్ట్రంలోని నల్లాల ద్వారా అన్ని కుటుంబాలకు సురక్షితమైన, నాణ్యమైన తాగునీటిని అందించాలనేది మిషన్‌ భగీరథ లక్ష్యం. దీని ఫలితాలను ఫిబ్రవరి 23న తెలంగాణ స్టేట్‌ స్టాటిస్టికల్‌ అబ్‌స్ట్రాక్ట్‌–2021లో ప్రభుత్వం పేర్కొంది. ఆ వివరాలు ఇలా..

మిషన్‌ భగీరథ.. 

  • రాష్ట్రంలోని వందశాతం గ్రామీణ నివాస ప్రాంతాల (24,028 రూరల్‌ హాబిటేషన్లు)కు 2021 నాటికి పైపుల ద్వారా నీటి సరఫరా
  • 2020–21కల్లా అన్ని రూరల్‌ హాబిటేషన్లలో నల్లాల ద్వారా రోజుకు వందలీటర్ల తలసరి నీరు సరఫరా 
  • దీనికింద అత్యధికంగా లబ్ధి పొందుతున్న జిల్లాల్లో నల్లగొండ (7.07%), భద్రాద్రి కొత్తగూడెం (6.39%), మహబూబాబాద్‌ (5.67%), ఆదిలాబాద్‌ (5.02%) ఉన్నాయి. 
  • గ్రామీణ జనాభాలోని 2.07 కోట్ల మందిలో వందశాతం ప్రజలు భగీరథ పథకం కింద లబ్ధిపొందారు.

64.9 లక్షల ఎకరాలకు సాగునీరు
మేజర్, మీడియం, మైనర్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో పాత, కొత్త కలిపి 64.9 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతోందని తాజా నివేదికలో ప్రభుత్వం పేర్కొంది. నివేదిక ప్రకారం.. కొత్త ప్రాజెక్టుల ద్వారా అదనంగా 14.2 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది. నిర్మాణం పూర్తి చేసుకున్న 9 నీటిపారుదల ప్రాజెక్టుల కింద 16.9 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటి సరఫరా జరుగుతోంది. నిర్మాణంలో ఉన్న 24 నీటిపారుదల ప్రాజెక్టుల కింద 16.9 లక్షల ఆయకట్టుకు నీరందనుంది.

Telangana: రాష్ట్రంలోని మొత్తం రోడ్లలో జాతీయ రహదారుల వాటా?

తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారుల వాటా క్రమంగా పెరుగుతోంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 2020–21 ఆర్థిక సంవత్సరం లెక్కల ప్రకారం.. రాష్ట్రంలోని మొత్తం రోడ్లలో జాతీయ రహదారుల వాటా 3.6 శాతంగా ఉంది. మొత్తం రోడ్ల నిడివి 1,07,871.2 కిలోమీటర్లు ఉండగా ఇందులో జాతీయ రహదారులు 3,910 కిలోమీటర్ల మేర ఉన్నాయి.

2021–22 ఏడాది లెక్కల ప్రకారం..
2021–22 ఆర్థిక ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో దాదాపు మరో వెయ్యి కిలోమీటర్ల రోడ్డు అందుబాటులోకి వచ్చింది. దీంతో జాతీయ రహదారుల మొత్తం నిడివి 4,983 కి.మీ. కు చేరింది. అంటే మొత్తం రోడ్లలో వీటి వాటా 4.6 శాతానికి చేరింది. ఇది జాతీయ సగటు కంటే ఎక్కువ. ప్రస్తుతం దేశంలో ప్రతి 100 చదరపు కిలోమీటర్లకు జాతీయ రహదారులు 4.06 కిలోమీటర్లు ఉండగా రాష్ట్రంలో 4.45 కిలోమీటర్లు ఉన్నాయి.

నల్గొండ టాప్‌.. పెద్దపల్లి లాస్ట్‌: రాష్ట్ర సర్కారు లెక్కల ప్రకారం జాతీయ రహదారుల్లో నల్గొండ జిల్లా వాటా ఎక్కువుంది. ఈ జిల్లాలో 273 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులున్నాయి. నాగర్‌కర్నూలు, సంగారెడ్డి, ఖమ్మం జిల్లాలు 2, 3, 4 స్థానాల్లో ఉన్నాయి. పెద్దపల్లి జిల్లాలో జాతీయ రహదారులే లేకపోవటంతో అట్టడుగు స్థానంలో ఉంది.

Farmers: రైతుబంధు ద్వారా ఎంత మొత్తాన్ని పెట్టుబడి సాయంగా అందజేస్తున్నారు?

Farmers

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు పథకం లబ్ధిదారుల్లో సన్నకారు రైతులే ఎక్కువని ఫిబ్రవరి 23న విడుదలైన తెలంగాణ స్టేట్‌ స్టాటిస్టికల్‌ అబ్‌స్ట్రాక్ట్‌–2021లో వెల్లడైంది. 2018, మే 10వ తేదీన ప్రారంభమైన రైతుబంధు కింద సంవత్సరానికి ఎకరానికి రూ.10 వేలు పెట్టుబడి సాయంగా (రెండు విడతల్లో) ప్రభుత్వం అందజేస్తున్న విషయం తెలిసిందే. తాజా నివేదిక ప్రకారం..

  • రైతుబంధు పథకంలో 2.47 ఎకరాల లోపు ఉన్న 43,70,837 మంది సన్నకారు రైతులకు లబ్ధి చేకూరుతోంది. తర్వాత 2.48 ఎకరాల నుంచి 4.94 ఎకరాల వరకున్న చిన్న రైతుల కేటగిరీలో 11,53,096 మంది ఉండగా, 4.95 ఎకరాల నుంచి 9.88 ఎకరాల వరకు సెమీ మీడియం కేటగిరీలో 4,89,097 మంది రైతులున్నారు.
  • ఇక 9.89 ఎకరాల నుంచి 24.78 ఎకరాల లోపు గల మధ్యతరహా రైతులు 88,708 మందికి రైతుబంధు లబ్ధి చేకూరుతుండగా, 24.78 ఎకరాలు అంతకన్నా ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న పెద్ద రైతులు 6,024 మంది ఉన్నారు. మొత్తం లబ్ధిదారుల్లో పెద్దరైతుల సంఖ్య 0.1 శాతంగా ప్రభుత్వం పేర్కొంది.
  • రైతుబంధు పథకం ప్రారంభించిన 2018 నుంచి 2021 వరకు ఏడు దఫాల్లో రూ.43,054.39 కోట్లు మొత్తం లబ్ధిదారులకు అందింది.

రైతుబీమా కింద రూ.3,259.3 కోట్లు
చనిపోయిన 59 సంవత్సరాల లోపు రైతు కుటుంబానికి రూ.5 లక్షలు బీమా మొత్తాన్ని అందించే రైతుబీమా పథకాన్ని కూడా ప్రభుత్వం 2018లోనే ప్రారంభించింది. ఈ పథకం కింద నమోదై చనిపోయిన రైతు కుటుంబాలకు ఇప్పటివరకు రూ.3,259.3 కోట్లు నేరుగా నామినీల ఖాతాల్లో జమయ్యాయి.

Education: హైస్కూల్‌ స్థాయిలో అత్యధికంగా డ్రాపౌట్స్‌ ఉన్న జిల్లా?

విద్యపై పేదరికం తీవ్ర ప్రభావం చూపుతోందని ఫిబ్రవరి 23న విడుదలైన తెలంగాణ స్టేట్‌ స్టాటిస్టికల్‌ అబ్‌స్ట్రాక్ట్‌–2021 వెల్లడించింది. కొద్దిపాటి చదువుతోనే బడి మాన్పించే స్థితిగతులు తెలంగాణలో కన్పిస్తున్నాయని విశ్లేషించింది. ఈ నివేదిక ప్రకారం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహం.. అన్ని వర్గాల్లో పెరిగిన అవగాహన, బడుల సంఖ్య పెరగడం వల్ల 6–10 వయసు పిల్లలను ప్రతి ఒక్కరూ పాఠశాలకు పంపుతున్నారు. జనాభా లెక్కల్లో లేని వారు (వలసదారులు, సంచార తెగలు) కూడా ప్రాథమిక బడుల్లో చేరుస్తున్నారు.

జయశంకర్‌ జిల్లాలో అత్యధికం..
రాష్ట్రంలో జనాభా లెక్కల ప్రకారం 27,78,000 మంది 6–10 వయస్కులుంటే, 1–5 తరగతుల్లో చేరే విద్యార్థులు 31,10,154 మంది ఉన్నారు. కానీ 9, 10 తరగతులకొచ్చే సరికి కేవలం 10,92,039 మందే ఉంటున్నారు. ఇంటర్‌లో విద్యార్థుల సంఖ్య 4.32 లక్షలే ఉంటోంది. టెన్త్‌కొచ్చే సరికి డ్రాపౌట్స్‌ (స్కూల్‌ మానేసేవారు) 12.29 శాతం ఉంటోంది. జయశంకర్‌ భూపాల్‌పల్లి జిల్లాలో అత్యధికంగా డ్రాపౌట్స్‌ (హైస్కూల్‌ స్థాయిలో 29.49%) ఉంటున్నారు. చదువు మధ్యలో మానేసే వారు ఎక్కువగా మారుమూల, గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంటున్నారు.

వృద్ధులకు ఫించన్‌ ద్వారా నెలకు ఎంత మొత్తాన్ని అందిస్తున్నారు?
రాష్ట్రంలో సామాజిక భద్రతా పెన్షన్ల కింద పలు కేటగిరీల్లో మొత్తం 38,80,922 మందికి నెలవారీ పెన్షన్లు ఇస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ స్టేట్‌ స్టాటిస్టికల్‌ అబ్‌స్ట్రాక్ట్‌–2021లో రాష్ట్ర ప్రభుత్వం ఆయా వివరాలను వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం..
2020–21లో కేటగిరీల వారీగా..

  • వృద్ధాప్య పింఛన్లు నెలకు రూ.2,016 చొప్పున 12,36,502 మంది
  • వితంతువుల పింఛన్లు నెలకు రూ.2,016 చొప్పున 14,47,107 మంది
  • దివ్యాంగులకు పింఛన్లు నెలకు రూ.3,016 చొప్పున 4,90,630 మంది
  • చేనేత కార్మికులకు పింఛన్లు నెలకు రూ.2,016 చొప్పున 37,264 మంది
  • కల్లుగీత కార్మికులకు పింఛన్లు నెలకు రూ.2,016 చొప్పున 62,766 మంది
  • హెచ్‌ఐవీ పేషెంట్ల పింఛన్లు నెలకు రూ.2,016 చొప్పున 33,198 మంది
  • బీడీ కార్మికుల పేషెంట్ల పింఛన్లు నెలకు రూ.2,016 చొప్పున 4,22,246 మంది

Telangana: 2020–21లో రాష్ట్ర ఐటీ రంగ వృద్ధి ఎంత శాతంగా నమోదైంది?

IT Sector

ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగంలో దేశంలో కీలకంగా మారిన తెలంగాణలో 2020–21 ఆర్థిక సంవత్సరంలో 13 శాతం వృద్ధిరేటుతో ఐటీ, ఐటీ ఆధారిత సేవల ఎగుమతులు రూ.1.45 లక్షల కోట్లకు చేరాయి. ఉద్యోగాల కల్పనలోనూ 8 శాతం వృద్ధిరేటు సాధించగా, ఐటీ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య 6.28 లక్షలకు చేరినట్లు రాష్ట్ర గణాంకాల శాఖ తాజాగా విడుదల చేసిన తెలంగాణ స్టేట్‌ స్టాటిస్టికల్‌ అబ్‌స్ట్రాక్ట్‌–2021లో వెల్లడైంది. రాష్ట్ర ఆవిర్భావం నాటికి రూ.57.25 వేల కోట్లుగా ఉన్న ఐటీ ఎగుమతులు, ఏటా పెరుగుతూ ఎనిమిదేళ్లలో రెండింతలు వృద్ధి సాధించి రూ.1.45 లక్షల కోట్లకు చేరాయని ఈ నివేదిక పేర్కొంది.

తెలంగాణ రాష్ట్రంలో శిశు మరణాల రేటు?
దేశ సగటుతో పోలిస్తే ఆరోగ్యపరంగా తెలంగాణ మెరుగైన స్థితిలోనే ఉన్నట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి.
సంవత్సరంలో ప్రతి 1000 మంది జనాభాకు గణాంకాలు ఇలా..

  • జననాల రేటు దేశంలో 19.7 ఉండగా, తెలంగాణలో 16.7  
  • మరణాల రేటు దేశంలో 6, రాష్ట్రంలో 6.1 
  • సంవత్సరం లోపు శిశు మరణాల రేటు దేశంలో 30, రాష్ట్రంలో 23 
  • 28 రోజులలోపు నవజాత శిశువుల మరణాల రేటు దేశంలో 23 ఉండగా, రాష్ట్రంలో 19గా ఉంది.
  • ప్రసవ మరణాలు ప్రతి లక్ష మందికి దేశంలో 113 మంది ఉండగా, రాష్ట్రంలో 63గా ఉంది.

Budget 2022 Highlights: కేంద్ర బడ్జెట్‌ 2022–23​​​​​​​

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 26 Feb 2022 12:41PM

Photo Stories