Skip to main content

Good Governance Index 2021: సర్వతోముఖాభివృద్ధి దిశగా ఏపీ..

ప్రధాన రంగాలన్నింటిలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రం గతంలో కంటే మెరుగైన పురోగతి సాధించింది.
Andhra Pradesh
Andhra Pradesh

ఆర్థిక ఇబ్బందులు, కరోనా కష్టాలు ఉన్నప్పటికీ.. వాటన్నింటినీ అధిగమించి సర్వతోముఖాభివృద్ధి దిశగా వేగంగా అడుగులు ముందుకు వేసింది. కేంద్ర ప్రభుత్వం డిసెంబ‌ర్ 25వ తేదీన‌ విడుదల చేసిన గుడ్‌ గవర్నెన్స్‌ ఇండెక్స్‌–2021 ఈ విషయాన్ని స్పష్టం చేసింది. గుడ్‌ గవర్నెన్స్‌ ఇండెక్స్‌ నివేదికలో రాష్ట్రాన్ని ‘ఏ’ గ్రూపులో చేర్చారు. ఈ నివేదికలో 2019–20, 2020–21 సంవత్సరాలకు సంబంధించిన గణాంకాలను బేరీజు వేశారు.

గతంలో కన్నా ఎక్కువగా..
మానవాభివృద్ధి సూచికల్లో రాష్ట్రం గతంలో కన్నా ఎక్కువ పాయింట్లు సాధించింది. విద్యారంగం పరంగా.. నాణ్యమైన విద్య, లింగ సమానత్వ సూచిక, ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో ఆఫ్‌ ఎస్సీ, ఎస్టీ (ఎస్సీ, ఎస్టీల చేరికలు), రిటెన్షన్‌ రేట్‌ ఎట్‌ ఎలిమెంటరీ లెవెల్‌ (ప్రాథమిక విద్య స్థాయిలో డ్రాపవుట్లు అరికట్టడం), స్కిల్‌ ట్రెయినింగ్‌ (నైపుణ్య శిక్షణ), ప్లేస్‌మెంట్‌ రేషియో (ఉద్యోగ, ఉపాధి కల్పన) అంశాలలో చెప్పుకోదగ్గ ప్రగతి సాధించిందని ఈ నివేదిక స్పష్టం చేసింది. నాణ్యమైన విద్య పరంగా 2019లో గరిష్ట స్కోరు 39 శాతం ఉండగా 2021లో 63 శాతానికి పెరిగింది. ఈ నివేదిక ఇంకా ఏం చెప్పిందంటే..

మెరుగైన భద్రత.. 
♦ప్రజల భద్రతకు భరోసానిస్తూ మెరుగైన పోలీసు వ్యవస్థతో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే మెరుగైన పనితీరు కనబరుస్తోంది. 2019–20లో 26.10 శాతం నేరాల్లో దోషులను గుర్తించి శిక్షలు విధించగా, 2020–21లో అది 38.40 శాతానికి పెరిగింది.
♦2019–20లో పోలీసు శాఖలో మహిళా పోలీసులు 4.17 శాతం ఉండగా.. 2020–21లో 5.85 శాతానికి పెరిగారు.
♦పీహెచ్‌సీల్లో వైద్యుల అందుబాటు 2019–20తో పోలిస్తే 2020–21లో 6.4 శాతం వృద్ధి చెందింది. 1,145 పీహెచ్‌సీలలో ఇద్దరు వైద్యుల విధానం, 650 మంది మెడికల్‌ ఆఫీసర్‌ల నియామకం, సుమారు 3 వేల మంది సిబ్బంది నియామకం, ఏపీవీవీపీ, డీఎంఈ పరిధిలో 11 వేలకు పైగా పోస్టుల భర్తీ, మరో 4,142 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతుండటం, కొత్తగా 3,483 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం ఇందుకు దోహదపడింది.
♦మాతృ మరణాలు 74 నుంచి 65కు, శిశు మరణాలు 32 నుంచి 29కి తగ్గాయి.
♦ప్రజల ఆరోగ్యం, విద్య, ఆర్థిక వ్యవస్థ, ఉపాధి, ఆహారం, నివాసం తదితర విషయాల్లో ఏపీ ప్రభుత్వం చొరవ తీసుకుంటోంది. ఈ విషయంలో 0.546 స్కోర్‌తో దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. పౌరులు ప్రత్యక్ష లబ్ధిదారులుగా నిలవడం అభివృద్ధి నమూనాకు కీలకం.
♦2019–20లో 42.05 శాతంగా ఉన్న మహిళల ఆర్థిక స్వావలంబన 2020–21లో 58.2 శాతానికి పెరిగింది. ఆడబిడ్డల జననాల పెరుగుదల ఆశాజనకంగా ఉంది. 2019–20లో 26.96 శాతంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కేసులు 2020–21లో 12.62 శాతానికి తగ్గాయి.

Published date : 27 Dec 2021 05:44PM

Photo Stories