India-Japan relations: ఇండో–పసిఫిక్ శాంతికి భారత్–జపాన్ భాగస్వామ్యం కీలకం
![India, Japan to boost ties, free Indo-Pacific](/sites/default/files/images/2023/04/01/india-japan-1680350725.jpg)
ప్రజాస్వామ్య విలువలు, అంతర్జాతీయ వ్యవహారాల్లో చట్టబద్ద పాలనపై గౌరవం ఆధారంగా భారత్, జపాన్ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దీన్ని మరింత విస్తరించుకోవడం రెండు దేశాలకూ ప్రయోజనకరమే కాక, ఇండో–పసిఫిక్ ప్రాంతంలో శాంతి స్థాపనకు కీలకమన్నారు. భారత్ పర్యటనలో భాగంగా మార్చి 20న ఢిల్లీకి వచ్చిన జపాన్ ప్రధాని పుమియో కిషిదతో చర్చలు జరిపిన అనంతరం మోదీ ఈ మేరకు పేర్కొ న్నారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, ఇండో–పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడు నేపథ్యంలో.. మోదీ, కిషిద భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. శుద్ధ ఇంధనం, సెమీ కండక్టర్లు, రక్షణ ఉత్పత్తుల తయారీ రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంచుకోవడంపై ఇద్దరు నేతలు ప్రధానంగా చర్చించారు. పెరుగుతున్న ప్రాంతీయ భద్రతా సవాళ్లను ఎదుర్కోవడంపైనా వారు సమాలోచనలు జరిపారు.
భారత్ అధ్యక్షతన జరగబోయే జీ20 సదస్సుతోపాటు జపాన్ సారథ్యంలో నిర్వహించనున్న జీ7 సమావేశాల్లో ప్రపంచ సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవడానికి కలసికట్టుగా పనిచేయాలని మోదీ, కిషిదా నిర్ణయించారు. మే నెలలో జపాన్లోని హిరోషిమాలో జరిగే జీ7 సమావేశాలకు మోదీని ఆహ్వానించగా.. ఆయన అంగీకరించినట్లు కిషిద చెప్పారు. ఈ చర్చల సందర్భంగా ముంబయి –అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు ప్రాజెక్టు కోసం జపాన్ రుణంలో నాలుగో విడతగా 300 బిలియన్ల యెన్ల(రూ.18 వేల కోట్లు) నిధుల విడుదలకు సంబంధించి రెండు దేశాలు పత్రాలు మార్చుకున్నాయి.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
![Sakshi Education Mobile App](/sites/default/files/inline-images/CAs_0.jpg)