Skip to main content

టోక్యో ఒలింపిక్స్‌లో ఫ్లాగ్‌ బేరర్స్‌గా ఎవరు వ్యవహరించనున్నారు?

అంతర్జాతీయస్థాయిలో భారత్‌కు ఎన్నో గొప్ప విజయాలు అందించిన దిగ్గజ మహిళా బాక్సర్‌ మేరీకోమ్, పురుషుల హాకీ జట్టు కెప్టెన్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌కు అరుదైన గౌరవం లభించింది.
Current Affairs జూలై 23న జరిగే టోక్యో ఒలింపిక్స్‌ ప్రారంభోత్సవంలో వీరిద్దరు భారత బృందానికి పతాకధారులుగా (ఫ్లాగ్‌ బేరర్స్‌) వ్యవహరించనున్నారు. ఈ మేరకు మేరీకోమ్, మన్‌ప్రీత్‌ సింగ్‌ పేర్లను ఖరారు చేస్తూ టోక్యో ఒలింపిక్స్‌ నిర్వాహకులకు భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) సమాచారం ఇచ్చింది.

ముగింపు ఉత్సవంలో బజరంగ్‌...
2021, ఆగస్టు 8న ఒలింపిక్స్‌ ముగింపు ఉత్సవంలో భారత బృందానికి స్టార్‌ రెజ్లర్, ప్రస్తుత ఆసియా, కామన్వెల్త్‌ క్రీడల చాంపియన్‌ బజరంగ్‌ పూనియా ఫ్లాగ్‌ బేరర్‌గా ఉంటాడని ఐఓఏ తెలిపింది. ఇప్పటివరకైతే టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌ నుంచి 18 క్రీడాంశాల్లో మొత్తం 115 మంది క్రీడాకారులు బరిలోకి దిగనున్నారు. లింగ సమానత్వం పాటించాలనే సదుద్దేశంతో ఈసారి నుంచి ఒలింపిక్స్‌ ప్రారంభోత్సవంలో ఆయా దేశాలు ఇద్దరు చొప్పున (1 మహిళ, 1 పురుషుడు) క్రీడాకారులకు పతాకధారులుగా వ్యవహరించే అవకాశాన్ని కల్పిస్తున్నాయి.

2016లో బింద్రా...
2016 రియో ఒలింపిక్స్‌లో షూటర్‌ అభినవ్‌ బింద్రా భారత బృందానికి ఫ్లాగ్‌ బేరర్‌గా వ్యవహరించాడు. బింద్రా 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గి విశ్వ క్రీడల్లో వ్యక్తిగత విభాగంలో పసిడి పతకం నెగ్గిన ఏకైక భారతీయ ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు.

క్విక్‌ రివ్యూ :
ఏమిటి : టోక్యో ఒలింపిక్స్‌లో భారత బృందానికి పతాకధారులుగా (ఫ్లాగ్‌ బేరర్స్‌) ఎవరు వ్యవహరించనున్నారు?
ఎప్పుడు : జూలై 5
ఎవరు : దిగ్గజ మహిళా బాక్సర్‌ మేరీకోమ్, పురుషుల హాకీ జట్టు కెప్టెన్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌
ఎక్కడ : టోక్యో, జపాన్‌
Published date : 06 Jul 2021 06:33PM

Photo Stories