Skip to main content

మార్చి 2020 అవార్డ్స్

బెస్ట్ ఎయిర్‌పోర్ట్‌గా బెంగళూరు ఎయిర్‌పోర్టు
Current Affairs
హైదరాబాద్ బేగంపేట ఎయిర్‌పోర్ట్ వేదికగా మార్చి 12న ప్రారంభమైన ‘వింగ్స్ ఇండియా 2020’ సదస్సుకు తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కె. తారక రామారావు మార్చి 13న ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పౌరవిమానయాన రంగంలో చేసిన సేవలకుగాను వివిధ సంస్థలు, వ్యక్తులకు ఆయన అవార్డులను ప్రదానం చేశారు.
అవార్డుల వివరాలు
  • మోస్ట్ డెడికేటెడ్ ఔట్‌లుక్ ఫర్ ఏరోస్పేస్ ఇండస్ట్రీ అవార్డును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందుకుంది.
  • టర్బో మేఘా ఎయిర్‌వేస్ (ట్రూజెట్) బెస్ట్ ఉడాన్ ఎయిర్‌లైన్ అవార్డు దక్కించుకుంది.
  • 2.5 కోట్లకుపైగా ప్రయాణికుల విభాగంలో బెస్ట్ ఎయిర్‌పోర్ట్ అవార్డును బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు అందుకుంది.
  • బెస్ట్ డొమెస్టిక్ ఎయిర్‌లైన్ అవార్డును (షెడ్యూల్డ్) విస్తారా స్వీకరించింది.
  • ఏవియేషన్ సస్టేనబిలిటీ అండ్ ఎన్విరాన్‌మెంటల్ అవార్డును స్పైస్‌జెట్, జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ స్వీకరించాయి.

15 మందికి నారీ శక్తి పురస్కారాలు ప్రదానం
Current Affairs 2019 సంవత్సరానికిగాను 15 మంది మహిళలు ‘నారీ శక్తి’ పురస్కారాలను గెలుచుకున్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మార్చి 8న ఈ అవార్డులను వారికి ప్రదానం చేశారు. మహిళా సాధికారత, సామాజిక సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని సమాజంలో సానుకూల మార్పుల్ని తీసుకువచ్చే మహిళలకు ఏటా నారీ శక్తి పురస్కారాలు అందజేస్తారు. పోడు వ్యవసాయంలోనూ, గ్రామీణ మహిళల వికాసంలో ఎందరికో ఆదర్శంగా నిలిచిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పడాల భూదేవి ఈ ఏడాది అవార్డును అందుకున్నారు.
బహుమతి గ్రహీతల్లో శ్రీకాకుళంకు చెందిన పడాల భూదేవితో పాటు వీణా దేవి (40-బీహార్), అరిఫా జాన్ (33-శ్రీనగర్, జమ్మూ కశ్మీర్), చారి ముర్ము (47-జార్ఖండ్), నిలజా వాంగ్మో (40-లేహ్), రష్మీ ఊర్థర్దేశ్ (60-పుణే, మహారాష్ట్ర), మాన్ కౌర్ (103-పాటియాలా, పంజాబ్), కళావతీ దేవీ (68-కాన్పూర్, ఉత్తరప్రదేశ్), తాషి, నుంగ్షీ (కవలలు) (28- డెహ్రాడూన్ - ఉత్తరాఖండ్), కౌషికి చక్రవర్తి (38-కోల్‌కతా, పశ్చిమబెంగాల్), అవని చతుర్వేది, భావనాకాంత్, మోహనాసింగ్ (వాయుసేన మొదటి మహిళా పెలైట్లు), భగీరథి అమ్మా (105)- కాత్యాయని(98) (అలప్పుజ-కేరళ)లు అవార్డులు అందుకున్నవారిలో ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 15 మందికి నారీ శక్తి పురస్కారాలు ప్రదానం
ఎప్పుడు : మార్చి 8
ఎవరు : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
ఎక్కడ : న్యూఢిల్లీ

పారిశ్రామికవేత్త ప్రత్యూషకు నీతీ ఆయోగ్ అవార్డు
హైదరాబాద్‌కు చెందిన పారిశ్రామికవేత్త ప్రత్యూష పారెడ్డికి ‘నీతీ ఆయోగ్ మహిళా అవార్డు’ లభించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్చి 8న ఢిల్లీలో నీతీ ఆయోగ్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ‘విమెన్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా’-2019 సంవత్సరానికి గాను ఈ అవార్డులను అంద జేశారు. భారత్‌లో మార్పును తెస్తున్న మహిళలు అనే అంశం కింద 16 మందిని అవార్డులకు ఎంపిక చేశారు. 2017లో నెమో కేర్ అనే స్టార్టప్ కంపెనీని ప్రారంభించిన ప్రత్యూష శిశు మరణాలను తగ్గించడానికి విశేషంగా కృషి చేశారు. నవజాత శిశువుల ఆరోగ్యం పట్ల బాగా శ్రద్ధ తీసుకునే కార్యక్రమాలు చేపట్టారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నీతీ ఆయోగ్ మహిళా అవార్డు విజేత
ఎప్పుడు : మార్చి 8
ఎవరు : ప్రత్యూష పారెడ్డి
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : శిశు మరణాలను తగ్గించడానికి విశేషంగా కృషి చేస్తున్నందుకు

ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఏజీఎం సుజాతకు భూషణ్ అవార్డు
కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఏటా ఇచ్చే ప్రతిష్టాత్మక ‘ఆయుధ భూషణ్ అవార్డు’కు మెదక్ జిల్లా ఎద్దుమైలారంలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అదనపు జనరల్ మేనేజర్ సుజాత గోగినేని ఎంపికయ్యారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 2019 సంవత్సరానికి సుజాతను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్టు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల డెరైక్టర్ జనరల్ గగన్ చతుర్వేది తెలిపారు. ఆయుధ ఫ్యాక్టరీలలో విశిష్ట సేవలందించినందుకు గాను ఆమెకు ఈ అవార్డు దక్కింది. 2020, మార్చి 18న కోల్‌కతాలో జరగనున్న కార్యక్రమంలో సుజాతకు ఈ అవార్డును అందజేస్తారు.
గుంటూరు జిల్లాకి చెందిన సుజాత బల్గేరియాలో ఇంజనీరింగ్ చదివారు. ఇంజనీరింగ్ అనంతరం రక్షణ శాఖలో ఉద్యోగిగా చేరారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఉన్నత స్థాయికి చేరారు. మెదక్, చెన్నై, కోల్‌కతా తదితర ప్రాంతాల్లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలలో వివిధ హోదాల్లో పనిచేశారు. యుద్ధ వాహనాల ఉత్పత్తి, విమానాల విడి పరికరాలు, నాణ్యతా ప్రమాణాల మదింపు, కర్మాగారం నిర్వహణ వంటి విభాగాలకు గత 30 ఏళ్లుగా అధిపతిగా ఉన్నారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కి అవార్డులు
శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి 2019 సంవత్సరానికి ఎయిర్‌పోర్‌‌ట్స కౌన్సిల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ సర్వీస్ క్వాలిటీ డిపార్చర్స్ అవార్డులు వరించాయి. ఆసియా పసిఫిక్ ప్రాంతం, 1.5-2.5 కోట్ల మంది ప్రయాణికుల విభాగంలో బెస్ట్ ఎయిర్‌పోర్ట్, బెస్ట్ ఎన్విరాన్‌మెంట్ అండ్ ఆంబియెన్స్ అవార్డులు దక్కాయి. 2020, సెప్టెంబరులో పోలండ్‌లో అవార్డుల కార్యక్రమం జరుగనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆయుధ భూషణ్ అవార్డు-2019కు ఎంపిక
ఎప్పుడు : మార్చి 9
ఎవరు : సుజాత గోగినేని
ఎందుకు : ఆయుధ ఫ్యాక్టరీలలో విశిష్ట సేవలందించినందుకు

ఏపీఎస్‌ఆర్టీసీకి స్మార్ట్ మొబిలిటీ ప్రాజెక్టు అవార్డు
Current Affairs
స్మార్ట్ సిటీ ఎంపవరింగ్ ఇండియా అవార్డులు-2019లో భాగంగా స్మార్ట్ మొబిలిటీ ప్రాజెక్టు విభాగంలో ఏపీఎస్‌ఆర్టీసీ అవార్డు గెలుచుకుంది. ఏపీఎస్‌ఆర్టీసీలో వెహికల్ ట్రాకింగ్ అండ్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టంను ప్రవేశపెట్టి సమర్థంగా అమలు పరిచినందుకుగాను ఈ అవార్డు లభించింది. ఈ పోటీల్లో మొత్తం దేశంలోని పది ఆర్టీసీలు పాల్గొన్నాయి. ప్రథమ స్థానంలో ఏపీఎస్‌ఆర్టీసీ నిలవగా, ద్వితీయ స్థానంలో కేఎస్‌ఆర్టీసీ నిలిచింది. ఢిల్లీలో ఫిబ్రవరి 28న జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హరిదీప్ సింగ్ పురి చేతుల మీదుగా అధికారులు సుధాకర్, శ్రీనివాసరావులు ఈ అవార్డును అందుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏపీఎస్‌ఆర్టీసీకి స్మార్ట్ మొబిలిటీ ప్రాజెక్టు అవార్డు
ఎప్పుడు : ఫిబ్రవరి 28
ఎవరు : స్మార్ట్ సిటీ ఎంపవరింగ్ ఇండియా
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : వెహికల్ ట్రాకింగ్ అండ్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టంను సమర్థంగా అమలు పరిచినందుకుగాను

జాతీయ సైన్స్ దినోత్సవ అవార్డుల ప్రదానం
జాతీయ సైన్స్ దినోత్సవం(ఫిబ్రవరి 28) సందర్భంగా భారతీయ శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పరిశోధనలు, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా పరిశోధన పత్రాలను ప్రచురించిన పలువురికి అవార్డులు అందజేశారు. దేశ రాజధాని నగరం ఢిల్లీలో ఫిబ్రవరి 28న జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ అవార్డులను అందజేశారు. పోస్ట్ డాక్టర్ ఫెలో (పీడీఎఫ్) విభాగంలో తిరుపతి ఐఐఎస్‌ఈఆర్‌కి చెందిన డాక్టర్ హర్షిణి చక్రవర్తి, మద్రాస్ ఐఐటీకి చెందిన డాక్టర్ శిరీష బొడ్డపాటి అవ్సార్ (అగుమెటింగ్ రైటింగ్ స్కిల్స్ ఫర్ అర్టిక్యులేటింగ్ రీసెర్చ్) అవార్డులు అందుకున్న వారిలో ఉన్నారు.
పరిశోధనల్లో మహిళలు 15 శాతమే
సైన్స్ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్రపతి కోవింద్ మాట్లాడుతూ... శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మహిళలు తక్కువ సంఖ్యలో ఉన్నారని వ్యాఖ్యానించారు. పరిశోధన, అభివృద్ధి రంగాల్లో మహిళలు 15 శాతానికే పరిమితం అయ్యారని పేర్కొన్నారు. దేశంలోని పరిశోధన, అభివృద్ధి సంస్థల్లో లింగ సమానత్వం, అభివృద్ధికి సంబంధించి మూడు కార్యక్రమాలను కోవింద్ ప్రారంభించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జాతీయ సైన్స్ దినోత్సవ అవార్డుల ప్రదానం
ఎప్పుడు : ఫిబ్రవరి 28
ఎవరు : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
ఎక్కడ : న్యూఢిల్లీ
Published date : 10 Apr 2020 08:09PM

Photo Stories