న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) బోర్డు పరీక్షలను ప్రతిఏటా రెండుసార్లు నిర్వహించడానికి రంగం సిద్ధమవుతోంది. 2025–26 విద్యాసంవత్సరం నుంచి బోర్డు పరీక్షలను రెండుసార్లు నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని కేంద్ర విద్యా శాఖ సీబీఎస్ఈకి సూచించింది.
సీబీఎస్ఈలో సెమిస్టర్ విధానం ప్రవేశపెట్టే ఆలోచన లేదని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. ప్రతి సంవత్సరం రెండు సార్లు బోర్డు పరీక్షల నిర్వహణపై కేంద్ర విద్యాశాఖ, సీబీఎస్ఈ అధికారులు వచ్చే నెలలో స్కూల్ ప్రిన్సిపాళ్లతో సమావేశం కానున్నట్లు తెలిసింది.