Skip to main content

దేశంలోనే బెస్ట్‌ ఇన్‌స్టిట్యూట్స్‌లో చ‌ద‌వాలంటే.. సాధించాల్సిన టాప్‌ ఎంట్రెన్స్‌లు ఇవే..!

దేశంలో ఇంజనీరింగ్‌ కోర్సులకు క్రేజ్‌ ఎక్కువ. ముఖ్యంగా బెస్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌లైన ఐఐటీలు, నిట్‌లు, ట్రిపుల్‌ఐటీల్లో చేరాలని లక్షల మంది కలలు కంటుంటారు.
అందుకోసం ఇంటర్‌లో చేరిన తొలిరోజు నుంచే ఆయా ఇంజనీరింగ్‌ ఎంట్రెన్స్‌ టెస్టులకు ప్రిపరేషన్‌ ప్రారంభిస్తారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల విద్యార్థులు జాతీయ స్థాయిలో నిర్వహించే జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్‌తో పాటు బిట్‌శాట్, టీఎస్‌ ఎంసెట్, ఏపీ ఎంసెట్‌ వంటి ఇంజనీరింగ్‌ ప్రవేశ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో.. టాప్‌ ఇంజనీరింగ్‌ ఎంట్రెన్స్‌లపై ప్రత్యేక కథనం..

జేఈఈ మెయిన్‌..
దేశంలో పేరున్న ఇంజనీరింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లు నిట్‌ల్లో ప్రవే శాలకు నిర్వహించే పరీక్ష.. జేఈఈ మెయిన్‌. ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లు ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే అడ్వాన్స్‌డ్‌కు అర్హత పరీక్ష కూడా జేఈఈ మెయిన్‌. ఈ ఏడాది (2021) మెయిన్‌ను ఎన్‌టీఏ నాలుగు సెషన్ల (ఫిబ్రవరి/మార్చి /ఏప్రిల్‌/మే)లో నిర్వహిస్తోంది. మెయిన్‌ పరీక్ష పేపర్‌–1 (బీఈ/ బీటెక్‌)లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌ నుంచి మొత్తం 90ప్రశ్నలు అడుగుతారు. సబ్జెక్టుకు 20 చొప్పున 60 ప్రశ్నలు, అలాగే ప్రతి సబ్జెక్టు నుంచి మరో 10న్యూమరికల్‌ ప్రశ్నలు చొప్పున ఉంటాయి. ఈ పదిలో ఐదు ఐచ్ఛిక ప్రశ్నలు. అంటే.. మొత్తం 75 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. ఒక్కో ప్రశ్నకు 4 మార్కుల చొప్పున మొత్తం 300 మార్కులకు మెయిన్‌ ఉంటుంది. పరీక్ష సమయం మూడు గంటలు. ఫిబ్రవరి, మార్చి సెషన్‌ పరీక్షలు ముగిసాయి.
  • ఏప్రిల్‌ సెషన్‌ పరీక్ష తేదీలు: ఏప్రిల్‌ 27–30; మే సెషన్‌ పరీక్ష తేదీలు: మే 24–28.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://jeemain.nta.nic.in/ , www.nta.ac.in  

జేఈఈ అడ్వాన్స్‌డ్‌..
ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీలు)ల్లో బీటెక్‌ కోర్సుల్లో అడ్మిషన్స్‌ కోసం జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షను నిర్వహిస్తారు. ఈ పరీక్ష ఏడాదికి ఒకసారి మాత్రమే జరుగుతుంది. జేఈఈ మెయిన్‌లో టాప్‌ 2.5లక్షల ర్యాంక్‌లో నిలిచిన విద్యార్థులు మాత్రమే అడ్వాన్స్‌డ్‌ రాసేందుకు అర్హులు. జూలై 3వ తేదీన అడ్వాన్స్‌డ్‌ పరీక్ష జరుగనుంది. అడ్వాన్స్‌డ్‌ పరీక్షలో రెండు పేపర్లు(పేపర్‌–1, పేపర్‌2) ఉంటాయి. ఈ పేపర్లలో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచి ప్రశ్నలు అడుగుతారు. మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు, న్యుమరికల్‌ ప్రశ్నలు, మ్యాచింగ్‌ లిస్ట్‌ ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం మూడు గంటలు. కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: http://jeeadv.ac.in/impdates.php

బిట్‌శాట్‌..
  • దేశంలో ఎక్కువ మంది విద్యార్థులు రాసే మరో ఇంజనీరింగ్‌ ఎంట్రెన్స్‌.. బిట్‌శాట్‌ (బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ అడ్మిషన్‌ టెస్ట్‌). దీనిద్వారా రాజస్థాన్‌లోని పిలానీ, గోవా, హైదరాబాద్‌ల్లోని బిట్స్‌ క్యాంపస్‌ల్లో వివిధ ప్రోగ్రామ్‌ల్లో ప్రవేశాలు కల్పిస్తారు. కంప్యూటర్‌ ఆధారిత టెస్ట్‌ (సీబీటీ) విధానంలో ఆన్‌లైన్‌లో జరిగే ఈ పరీక్ష ఏటా దాదాపు 2లక్షల మంది దరఖాస్తు చేసుకుంటుంటారు. బిట్‌శాట్‌ 2021 ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ మే 29 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ ఏడాది పరీక్ష జూన్‌ 24 నుంచి 30 వరకు నిర్వహిస్తారు.
  • బిట్‌శాట్‌లో ఫిజిక్స్‌ 40, కెమిస్ట్రీ 40, ఇంగ్లిష్‌ ప్రొఫిషియెన్సీ 15, లాజికల్‌ రీజనింగ్‌ 10, మ్యాథమెటిక్స్‌/బయాలజీ 45 చొప్పున మొత్తం 150 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు ఉంటాయి. ప్రతి సరైన సమాధానానికి మూడు మార్కులు కేటాయిస్తారు. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు కోత వేస్తారు. పరీక్ష సమయం మూడు గంటలు.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.bitsadmission.com

ఏపీ/టీఎస్‌ ఎంసెట్‌..
తెలుగు రాష్ట్రాలు నిర్వహించే ఇంజనీరింగ్‌ ఎంట్రెన్స్‌.. టీఎస్‌ ఎంసెట్‌/ఏపీ ఎసెంట్‌. ఈ ఎంట్రెన్స్‌ల్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల నుంచి ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 160 ఆబ్జెక్టివ్‌ టైప్‌ ప్రశ్నలు (మ్యాథ్స్‌ 80, ఫిజిక్స్‌ 40, కెమిస్ట్రీ 40 చొప్పున) ఉంటాయి. పరీక్ష సమయం మూడు గంటలు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున కేటాయించారు. ఎంసెట్‌ పరీక్ష సైతం ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తారు.
  • టీఎస్‌ ఎంసెట్‌ 2021 షెడ్యూల్‌ ఇప్పటికే వెలువడింది. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది మే 18. టీఎస్‌ ఎంసెట్‌ 2021 జూలై 7, 8, 9తేదీల్లో ఆన్‌లైన్‌ విధానంలో జరుగనుంది.
  • ఏపీ ఇంజనీరింగ్‌ ఎంట్రన్స్‌ 2021 జూలై 12 నుంచి 15వ తేదీ వరకూ నిర్వహించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://eamcet.tsche.ac.in/

ఐఐఐటీ–హెచ్‌ యూజీఈఈ..
  • హైదరాబాద్‌లోని ‘ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ’ ట్రిపుల్‌ (ఐఐఐటీ–హెచ్‌)కి ఇంజనీరింగ్‌ కోర్సులను అందించడంలో మంచి పేరుంది. ఈ సంస్థ అందించే కోర్సుల్లో ప్రవేశాల కోసం ‘అండర్‌ గ్రాడ్యుయేట్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామినేషన్‌ (యూజీఈఈ) నిర్వహిస్తారు. యూజీఈఈ 2021కు ఇటీవల నోటిఫికేషన్‌ విడుదలైంది. ఇందులో సాధించిన ర్యాంక్‌ ఆధారంగా పర్సనల్‌ ఇంటర్వూ్యలు నిర్వహించి ప్రవేశం కల్పిస్తారు.
  • ఐఐఐటీ–హెచ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌ (ఈసీడీ), కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ (సీఎస్‌డీ), కంప్యూటర్‌ సైన్స్‌ (సీఎస్‌డీ)– కంప్యుటేషనల్‌ లింగ్విస్టిక్స్‌(సీఎల్‌డీ), కంప్యూటర్‌ సైన్స్‌– కంప్యూటేషనల్‌ నేచురల్‌ సైన్సెస్‌(సీఎన్‌డీ), కంప్యూటర్‌ సైన్స్‌– కంప్యూటింగ్‌ అండ్‌ హ్యూమన్‌ సైన్సెస్‌(సీహెచ్‌డీ) వంటి డ్యూయల్‌ డిగ్రీ కోర్సుల్లో (ఐదేళ్లు) ప్రవేశం కల్పిస్తున్నారు. ఇంటర్మీడియట్‌ (ఎంపీసీ)లో 60 శాతం మార్కులు సాధించినవారు ఆయా కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • ఐఐఐటీహెచ్‌ యూజీఈఈ–2021 పరీక్షలో రెండు విభాగాలు ఉంటాయి. మొదటిది ‘సబ్జెక్ట్‌ ప్రొఫిషియెన్సీ టెస్ట్‌’(ఎస్‌యూపీఆర్‌). కాగా రెండోది ‘రీసెర్చ్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌’(ఆర్‌ఈఏపీ). ఐఐఐటీ–హెచ్‌ యూజీఈఈ–2021కు దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేది మే 10. ఎంట్ర¯Œ్స టెస్ట్‌ ఆన్‌లైన్‌లో జూన్‌ 2న నిర్వహిస్తారు.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://ugadmissions.iiit.ac.in/ugee_page.html  

ఒకటే ప్రిపరేషన్‌..
ఇంజనీరింగ్‌ కోర్సుల్లో చేరాలనుకునే ఎంపీసీ విద్యార్థులు జేఈఈ మెయిన్‌ పరీక్ష కోసం సిద్ధమవుతూ ఉంటారు. ఈ ప్రిపరేషన్‌తోనే ఇతర ఇంజనీరింగ్‌ ఎంట్రన్స్‌లు కూడా రాయొచ్చు. అన్ని పరీక్షలకు సిలబస్‌ దాదాపు ఒకేలా ఉంటుంది. జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్‌ వంటి జాతీయ స్థాయి పరీక్షల కోసం చేసిన సన్నద్ధత రాష్ట్ర స్థాయి ఎంట్రన్స్‌ల్లో ఉత్తమ ర్యాంక్‌ సాధించేందుకు ఉపయోగపడుతుంది. దేశంలోని ప్రముఖ విద్యాసంస్థలు చాలా వరకు జేఈఈ మెయిన్‌/అడ్వాన్స్‌డ్‌ స్కోరుతో పాటు బిట్‌శాట్‌ స్కోరు ఆధారంగా కూడా ప్రవేశాలు కల్పిస్తున్నాయి. కాబట్టి విద్యార్థులు తాము చేరాలనుకుంటున్న బెస్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌ను దృష్టిలో పెట్టుకొని ఆయా పరీక్షలకు సిద్ధం కావడం మంచిది.
Published date : 13 Apr 2021 01:49PM

Photo Stories