Skip to main content

భారత రాష్ర్టపతి

ఆర్టికల్ -52 ప్రకారం భారతదేశానికి రాష్ర్టపతి ఉంటారు. ఆయనే దేశంలో అత్యున్నత వ్యక్తి.
ఆర్టికల్-53 ప్రకారం.. రాష్ర్టపతి రాజ్యాంగ అధినేత, ప్రధాన కార్యనిర్వాహక అధికారి, దేశ ప్రథమ పౌరుడు, సర్వ సైన్యాధ్యక్షుడు. ఆర్టికల్ 53(1) ప్రకారం భారతదేశ కార్యనిర్వహణ మొత్తం రాష్ర్టపతికే అప్పగించారు. ఆయనకు సహాయపడేందుకు ఆర్టికల్ 74(1) ప్రకారం ప్రధానమంత్రి నాయకత్వంలో మంత్రిమండలి ఉంటుంది. కాబట్టే ప్రధానమంత్రిని వాస్తవ కార్యనిర్వాహక అధిపతిగా, రాష్ర్టపతిని నామమాత్రపు కార్యనిర్వాహక అధిపతిగా పేర్కొంటారు.
 
అర్హతలు:
రాష్ర్టపతి పదవికి పోటీ చేసే అభ్యర్థి అర్హతల గురించి ఆర్టికల్-58 తెలియజేస్తుంది. దీని ప్రకారం..
 1. భారతీయ పౌరుడై ఉండాలి.
 2. 35 ఏళ్లు నిండి ఉండాలి.
 3. లోక్‌సభ సభ్యుడికి ఉండాల్సిన అర్హతలు ఉండాలి.
 4. అభ్యర్థి నామినేషన్ పత్రాన్ని 50 మంది ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులు ప్రతిపాదించాలి. మరొక 50 మంది సభ్యులు బలపరచాలి.
 5. నామినేషన్ ఫీజుగా రూ.15,000 చెల్లించాలి. డిపాజిట్ తిరిగి రావాలంటే పోలై చెల్లిన ఓట్లలో కనీసం 1/6 వంతు రావాలి.
 
రాష్ర్టపతి ఎన్నిక:
ఆర్టికల్-54 రాష్ర్టపతి ఎన్నిక గురించి తెలుపుతుంది. దీని ప్రకారం ఎలక్టోరల్ కాలేజ్.. నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి ద్వారా రాష్ర్టపతిని ఎన్నుకుంటుంది. ఎలక్టోరల్ కాలేజ్‌లో ఎన్నికైన పార్లమెంట్ (ఉభయసభలు) సభ్యులు, ఎన్నికైన అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల విధానసభ సభ్యులు ఉంటారు. కేంద్రపాలిత ప్రాంత విధానసభ సభ్యులకు 1992లో 70వ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటుహక్కు కల్పించారు. ఎలక్టోరల్ కాలేజ్ మొత్తం సభ్యులు 4,896, మొత్తం ఓట్లు సుమారుగా 11,00,000. వీరిలో మొత్తం పార్లమెంట్ సభ్యులు 776, విధానసభ సభ్యులు 4120. మొత్తం ఓట్లలో పార్లమెంట్ సభ్యులు సుమారుగా 5,50,000, విధాన సభల సభ్యులవి సుమారుగా 5,50,000.
ఆర్టికల్-55 ప్రకారం ఎలక్టోరల్ కాలేజ్ సభ్యుల ఓటు విలువను ప్రత్యేక పద్ధతి ద్వారా లెక్కిస్తారు.

రాష్ర్టపతి ఎన్నికకు 1971 జనాభా లెక్కలను ఆధారంగా తీసుకుంటున్నారు. ఉదా॥ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి జనాభా 4,36,24,000. దీన్ని ఆధారంగా చేసుకొని ఆంధ్రప్రదేశ్ MLA ఓటు విలువ ఈ విధంగా లెక్కిస్తారు.
TSPSC syllabus:President
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన MLA ఓటు విలువ 148. గరిష్టంగా ఉత్తరప్రదేశ్ (208), తమిళనాడు (176), మహారాష్ర్ట (175) ఓటు విలువను కలిగి ఉండగా, సిక్కిం (7), అరుణాచల్ ప్రదేశ్ (8), నాగాలాండ్ (9) అతి తక్కువ ఓటు విలువను కలిగున్నాయి. గమనిక: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ MLA ల ఓటు విలువ ఒకే రకంగా ఉంటుంది.
TSPSC syllabus:President
పై సూత్రం ద్వారా ఎంపీ ఓటు విలువ  TSPSC syllabus:President

ప్రస్తుతం ఒక్కో ఎంపీ ఓటు విలువ 708. అందరి ఎంపీల ఓటు విలువ సమానంగా ఉంటుంది.
రాష్ర్టపతి ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ఒకసారి లోక్‌సభ సెక్రటరీ,  మరొకసారి రాజ్యసభ సెక్రటరీ కొనసాగుతారు. 2012 రాష్ర్టపతి ఎన్నికకు రాజ్యసభ సెక్రటరీ వివేక్ కుమార్ అగ్నిహోత్రి రిటర్నింగ్ అధికారిగా కొనసాగారు. ఇప్పటి వరకు 14 సార్లు రాష్ర్టపతి ఎన్నికలు జరిగాయి. మొదటి ఎన్నిక 1952లో, 14వ ఎన్నిక 2012లో జరిగింది.
 
పదవీ కాలం
ఆర్టికల్-56 ప్రకారం రాష్ర్టపతి పదవీ కాలం ఐదేళ్లు. ఈ సమయంలో రాష్ర్టపతిగా కొనసాగేం దుకు ఇష్టం లేకపోతే రాజీనామా చేసి తప్పుకోవ చ్చు. రాజీనామా లేఖను ఉప రాష్ర్టపతికి సమర్పిం చాలి. ఉపరాష్ర్టపతి లేనట్లయితే ఒక ప్రతిని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి, మరో ప్రతిని ప్రధానమంత్రికి అందించాలి. ఆర్టికల్-57 ప్రకారం ఒక వ్యక్తి రాష్ర్టపతి పదవికి ఎన్నిసార్లైనా పోటీ చేయొచ్చు. రెండుసార్లు మాత్రమే పదవి చేపట్టాలి అనే సంప్రదాయం మొదటి రాష్ర్టపతి రాజేంద్రప్రసాద్ ద్వారా మొదలైంది. రాష్ర్టపతిగా ఎక్కువ కాలం రాజేంద్రప్రసాద్, తక్కువ కాలం జాకీర్ హుస్సేన్ కొనసాగారు.
 
జీతభత్యాలు
ఆర్టికల్-59 రాష్ర్టపతి జీతభత్యాల గురించి తెలుపుతుంది. జీతభత్యాలను పార్లమెంట్ నిర్ణయిస్తుంది. వాటిని కేంద్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు. ప్రస్తుత జీతం నెలకు రూ.1,50,000. పెన్షన్ ఏడాదికి రూ. 9,00,000. ఉచిత నివాసం, ఇతర సౌకర్యాలు ఉంటాయి. ఢిల్లీ, హైదరాబాద్‌లలో రాష్ర్టపతికి నివాస గృహాలున్నాయి. సిమ్లాలో వేసవి విడిది ఉంది. జీతభత్యాలకు ఆదాయపన్ను నుంచి మినహాయింపు ఉంటుంది. ఈ సౌకర్యాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గించే అవకాశం లేదు.
 
ప్రమాణ స్వీకారం
పదవీ ప్రమాణ స్వీకారం గురించి ఆర్టికల్ 60 వివరిస్తుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాష్ర్టపతితో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆయన లేనట్లయితే సీనియర్ న్యాయమూర్తి ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఉపరాష్ర్టపతి తాత్కాలిక రాష్ర్టపతి పదవి చేపట్టాలన్నా ఇదే పద్ధతిని అనుసరిస్తారు.
 
తొలగింపు - మహాభియోగ తీర్మానం
తొలగింపు గురించి ఆర్టికల్- 61 తెలుపుతుంది. రాష్ర్టపతిని మహాభియోగ తీర్మానం ద్వారా పార్లమెంట్ తొలగిస్తుంది. ఈ తీర్మానాన్ని ఉభయ సభల్లో ఏ సభలోనైనా 1/4 వంతు మంది సభ్యుల మద్దతుతో 14 రోజుల ముందు సభాధ్యక్షుడికి నోటీస్ అందించి ప్రవేశపెట్టాలి. ఆ తర్వాత తీర్మానం చర్చకు వస్తుంది. చర్చ తర్వాత తీర్మానం 2/3 మెజారిటీతో ఆమోదం పొందితే రెండో సభకు వెళ్తుంది. రెండో సభ కూడా 2/3 వంతు మెజారిటీతో తీర్మానాన్ని ఆమోదిస్తే రాష్ర్టపతి పదవి కోల్పోతాడు. ఒక సభ ఆమోదించి మరో సభ వ్యతిరేకిస్తే తీర్మానం వీగిపోయినట్టు భావిస్తారు. తీర్మానంపై ఓటింగ్ జరిపినప్పుడు రాష్ర్టపతి నామినేట్ చేసిన 14 మంది పార్లమెంట్ సభ్యులకు కూడా ఓటు హక్కు ఉంటుంది. 1970లో వి.వి. గిరికి నోటీస్ జారీ చేసి తర్వాత విరమించుకున్నారు. ఇప్పటి వరకు ఈ తీర్మానానికి ఎవరూ గురికాలేదు. ఆర్టికల్- 62 ప్రకారం ఏదైనా కారణం వల్ల రాష్ర్టపతి పదవి ఖాళీ అయితే ఆరు నెలల్లోపు కొత్త రాష్ర్టపతిని ఎన్నుకోవాలి. పదవీ కాలం ముగియడానికి 15 రోజుల ముందు నుంచి నూతన రాష్ర్టపతి ఎన్నిక ప్రక్రియను ప్రారంభించాలి.
 
ఎన్నిక వివాదాలు
ఎన్నిక వివాదాల గురించి ఆర్టికల్- 71 తెలుపుతుంది. ఈ వివాదాలను పరిష్కరించే అధికారం సుప్రీంకోర్టుకు ఉంది. ఓడిపోయిన అభ్యర్థి లేదా ఎలక్టోరల్ కాలేజ్ సభ్యుల్లో 20 మంది సభ్యులతో సుప్రీంకోర్టులో పిటీషన్ వేయొచ్చు. ఇలాంటి పిటీషన్‌ను ఎన్నిక జరిగిన 30 రోజుల్లోపు దాఖలు చేయాలి. ఎన్నిక వివాదంపై కోర్టుకు స్వయంగా హాజరైన రాష్ర్టపతి వి.వి. గిరి.
 
భారత రాష్ర్టపతుల జాబితా
1. బాబూ రాజేంద్ర ప్రసాద్  (1950-62)
బిహార్‌కు చెందిన ఈయన అత్యధిక కాలం రాష్ర్టపతిగా పనిచేశారు. రెండుసార్లు రాష్ర్టపతిగా ఎన్నికైన ఏకైక వ్యక్తి. సుప్రీంకోర్టు సలహాను ఎక్కువసార్లు (3సార్లు) కోరిన రాష్ర్టపతి. ఆయన చేతిలో ఓడిపోయిన వారు.. ప్రొ. కె.టి. షా, జస్టిస్, ఎన్.ఎన్.దాస్. 1962లో భారతరత్న లభించింది.
 
2. సర్వేపల్లి రాధాకృష్ణన్ (1962-67)
 స్వరాష్ర్టం తమిళనాడు. ఈయన వివిధ యూనివర్సిటీలకు వీసీగా పనిచేశారు. రెండు యుద్ధాలను ఎదుర్కొన్న ఏకైక రాష్ర్టపతి. టెంపుల్టన్ అవార్డు గెలిచిన మొదటి భారతీయుడు. ఈయన జన్మదినమైన సెప్టెంబర్ 5ను ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు.
3. జాకీర్ హుస్సేన్  (1967-69)
ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన వ్యక్తి. పదవిలో కొనసాగుతూ చనిపోయిన మొదటి రాష్ర్టపతి. అతి తక్కువకాలం రాష్ర్టపతిగా పని చేశారు. ఈయనకు 1963లో భారతరత్న అవార్డు లభించింది.
 
4. వి.వి.గిరి  (1969-74)
ఆయన సొంత రాష్ర్టం ఒడిశా. స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి రాష్ర్టపతిగా ఎన్నికైన వ్యక్తి. అతి తక్కువ మెజారిటీతో, ఓటు బదలాయింపు ద్వారా రాష్ర్టపతిగా ఎన్నికయ్యారు. ఎన్నిక వివాదంలో స్వయంగా కోర్టుకు హాజరైన రాష్ర్టపతి. కార్మిక నేతగా ఉండి రాష్ర్టపతిగా ఎన్నికయ్యారు.
 
5. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ (1974-77)
అసోంకు చెందినవారు. పదవీకాలంలో చని పోయిన రెండో, చివరి రాష్ర్టపతి. అత్యధికంగా ఆర్డినెన్సులను జారీ చేసిన రాష్ర్టపతి. అత్యవసర  సమయంలో కీలుబొమ్మ రాష్ర్టపతిగా పేరు గడించారు.
 
6. నీలం సంజీవరెడ్డి  (1977-82)
ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు. రాష్ర్టపతిగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఏకైక వ్యక్తి. అతి చిన్న వయస్సులో రాష్ర్టపతి పదవిని చేపట్టారు. ముఖ్యమంత్రిగా, లోక్‌సభ స్పీకర్‌గా, కేంద్రమంత్రిగా పనిచేసిన అనంతరం రాష్ర్టపతిగా ఎన్నికయ్యారు.
 
7. జ్ఞానీ జైల్‌సింగ్ (1982-87)
ఆయన రాష్ర్టం పంజాబ్. బలహీన వర్గాల నుంచి ఎన్నికైన మొదటి రాష్ర్టపతి. పాకెట్ వీటో అధికారాన్ని ఉపయోగించుకున్న ఏకైక రాష్ర్టపతి. ఈయన కాలంలోనే అమృత్‌సర్ స్వర్ణ దేవాలయంలో ‘ఆపరేషన్ బ్లూస్టార్’ నిర్వహించారు.
 
8. ఆర్.వెంకట్రామన్ (1987-92)
తమిళనాడుకు చెందినవారు. ఎక్కువ మంది ప్రధానమంత్రులతో పదవీ ప్రమాణం చేయించిన రాష్ర్టపతి. సంకీర్ణ ప్రభుత్వాల ఏర్పాటుకు పునాదులు వేసినవారు.
 
9. డా॥శంకర్ దయాళ్ శర్మ (1992-97)

మధ్యప్రదేశ్‌కు చెందినవారు. ముఖ్యమంత్రిగా, గవర్నర్‌గా పనిచేసి రాష్ర్టపతి పదవికి ఎన్నికయ్యారు.
 
10. కె.ఆర్. నారాయణన్ (1997-2002)
కేరళకు చెందిన వ్యక్తి. ఏకైక దళిత రాష్ర్టపతి.
 
11. డా॥ఎ.పి.జె.అబ్దుల్ కలాం (2002-2007)
ఈయన సొంత రాష్ర్టం తమిళనాడు. రాజకీయ నేపథ్యం లేకుండా రాష్ర్టపతి అయిన ఏకైక వ్యక్తి. భారత క్షిపణుల పితామహుడిగా ప్రసిద్ధి చెందారు. ఈయన రచించిన పుస్తకం ‘వింగ్స్ ఆఫ్ ఫైర్’. కలాం జన్మదినమైన అక్టోబర్ 15ను యూఎన్‌వో  ‘ప్రపంచ విద్యార్థి దినోత్సవం’గా ప్రకటించింది.
 
12. ప్రతిభా దేవిసింగ్ పాటిల్  (2007-12)
సొంత రాష్ర్టం మహారాష్ర్ట. ఏకైక మహిళా రాష్ర్టపతి. గవర్నర్‌గా, రాజ్యసభ డిప్యూటీ చైర్‌పర్సన్‌గా పనిచేసి రాష్ర్టపతి అయ్యారు. బ్రిటన్ రాణి ఆహ్వానం అందుకున్న ఏకైక రాష్ర్టపతి. వ్యక్తిగత ఖర్చులకు ప్రజాధనాన్ని ఎక్కువగా ఖర్చుపెట్టిన రాష్ర్టపతి.
 
13. ప్రణబ్ ముఖర్జీ  (2012 నుంచి నేటి వరకు)
సొంత రాష్ర్టం పశ్చిమ బెంగాల్. కేంద్ర పరిశ్రమల, వాణిజ్య, విదేశాంగ, రక్షణ, ఆర్థిక మంత్రిగా, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షునిగా పనిచేసి రాష్ర్టపతిగా ఎన్నికయ్యారు.
Published date : 13 Sep 2016 03:08PM

Photo Stories