Skip to main content

భారతదేశ చరిత్ర

భారతదేశ చరిత్ర క్రీ .పూ. 34 వేల ఏళ్ల కిందట హోమోసెఫియన్ల కాలం నుంచి ప్రారంభమైనట్లు చరిత్రకారుల అభిప్రాయం. భారతదేశ చరిత్ర అంటే భారత్‌తో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, భూటాన్‌తో కూడిన సమస్త భారత ఉపఖండ చరిత్ర. వేదాల్లో భారత దేశాన్ని జంబూ ద్వీపంగా పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో నేరేడు పళ్లు ఎక్కువగా లభించడం వల్ల ఈ పేరు వచ్చిందని భావిస్తున్నారు. భరతుడు అనే రాజు పేరు మీదుగా భారతదేశం లేదా భరతవర్షం అనే పేర్లు స్థిరపడ్డాయి. సింధూ నదికి ఆవల ఉన్న నాటి పర్షియన్లు, గ్రీకులు ఈ ప్రాంతాన్ని హిందూ దేశమని పిలిచారు. బ్రిటిషర్ల మూలంగా ఇండియా అనే పేరు వచ్చింది. సింధూ నదిని ఇండస్ అని పిలిచేవారు.
ఒక దేశ ప్రజల సాంఘిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక జీవనం వారి భౌగోళిక పరిస్థితులతో ప్రత్యక్షంగా ప్రభావితమవుతుంది. అధికంగా సారవంతమవడం వల్ల భారతదేశ దక్షిణ ప్రాంతం కంటే గంగా, సింధూ మైదాన ప్రాంతం అన్ని రంగాల్లో బాగా అభివృద్ధి చెందింది. గంగా - సింధూ మైదానాలు, కృష్ణా, గోదావరి, తుంగభద్ర, కావేరి నదీ ప్రాంతాలు సాంస్కృతికంగా ముందు వరుసలో నిలిచాయి. జైన, బౌద్ధ, హిందూ మతాలు, లలిత కళలు ఈ ప్రాంతాల్లో విశేషంగా విలసిల్లాయి. అందువల్లే ఈ ప్రాంతాలపై ఆధిపత్యం కోసం నిరంతరం యుద్ధాలు జరిగాయి. భారతదేశ పశ్చిమ - మధ్య ప్రాంతాలకు (రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్) భౌగోళికంగా సరైన రవాణా సౌకర్యాలు లేవు. ఇవి ఇతర నాగరిక ప్రాంతాల నుంచి వేరవడం వల్ల ఇక్కడి ప్రజలు సాంఘిక దురాచారాలకు లోనయ్యారు.

నాగరికత పరిణామ క్రమంలో లిపి వాడుకలోకి రాని పూర్వయుగాన్ని ‘చరిత్ర పూర్వయుగం’గా పేర్కొంటారు. లిపి ఉండి మనం చదవడానికి వీలు కాని యుగాన్ని ‘ప్రొటో హిస్టరీ యుగం’గా, లిపి సృష్టి జరిగి రాత ఆరంభమైనప్పటి నుంచి ‘చారిత్రక యుగం’గా వ్యవహరిస్తారు. మన దేశ చరిత్రలో ప్రసిద్ధి చెందిన సింధూ నాగరికత ప్రొటో హిస్టరీకి సంబంధించింది. ఎందుకంటే అప్పటి ప్రజలు వాడిన లిపిని మనం అర్థం చేసుకోలేకపోయాం. చరిత్రలో కాలాన్ని క్రీస్తు పూర్వయుగంగా, క్రీస్తు శకంగా విభజించారు.
పాతరాతి యుగం (క్రీ.పూ. 35000-10000)
  • ఈ యుగంలో మానవులు ఎక్కువగా అడవుల్లో నివసించేవారు.
  • క్వార్టజైట్ అనే కఠిన శిలతో కత్తి, సుత్తి, గొడ్డలి, బల్లెం, బొరిగ మొదలైన ఆయుధాలను తయారుచేసుకున్నారు.
  • జంతువులను వేటాడి పచ్చిమాంసం తినేవారు.
  • చెట్ల తొర్రలు, కొండ గుహల్లో నివసించేవారు.
  • ఆకులు, చర్మాన్ని దుస్తులుగా కప్పుకునేవారు.
  • వీరికి పంటలు పండించడం తెలియదు.
  • వీరు నివసించిన గుహలు కర్నూలులో ఉన్నాయి.
  • అండమాన్ దీవుల్లోని ఆదిమవాసులు, ఆంధ్రాలోని యానాదులు, తమిళనాడులోని కురుంబులు, ఇరుళులు, కదిరులు ఈ యుగ సంతతికి చెందినవారని చరిత్రకారుల అభిప్రాయం.
మధ్యరాతి యుగం (క్రీ.పూ. 8000-4000)
  • మధ్యరాతి యుగంలో ప్రజలు సంచార జీవితానికి స్వస్తి పలికారు. స్థిర నివాసం ఏర్పరచుకోవడం ప్రారంభమైంది.
  • జంతువులను మచ్చిక చేసుకున్నారు.
  • ఈ కాలానికి చెందిన ప్రజలు జెస్పర్, చెర్ట్ అనే ఇసుక రాళ్లతో చేసిన పరికరాలు, ఆయుధాలను ఉపయోగించేవారు. ఇవి పరిమాణంలో చిన్నవిగా ఉండేవి. అందువల్ల ఈ యుగాన్ని ‘సూక్ష్మ శిలాయుగం’గా పేర్కొంటారు.
  • మరణించిన వారిని ఆహారం, వారు వాడిన పనిముట్లతో పాటు ఖననం చేసేవారు.
నూతన శిలా యుగం (క్రీ.పూ. 4000-2500)
  • నూతన శిలా యుగంలో మానవ జీవన సరళిలో స్థిరత్వం చోటుచేసుకుంది.
  • పంటలు పండించడాన్ని విస్తృతపరిచారు.
  • నూలు, ఉన్ని వస్త్రాలను నేయడం నేర్చుకున్నారు.
  • ‘వ్యవసాయం, పశుపోషణ’ ముఖ్య వృత్తులుగా మారాయి.
  • ఇళ్ల నిర్మాణం జరిగి పల్లెలు ఏర్పడ్డాయి.
  • సరకుల రవాణా కోసం బండ్లను వినియోగించారు.
  • మట్టి పాత్రలను ఎక్కువగా తయారు చేశారు.
  • పదునైన, నునుపైన, అందమైన రాతి పనిముట్లు, ఆయుధాలను రకరకాల ఆకృతుల్లో తయారుచేసి ఉపయోగించేవారు.
  • విగ్రహారాధన, లింగపూజ, చంద్రుని వృద్ధి, క్షయ దశల ఆధారంగా రోజులను లెక్కవేయడం వీరి నుంచే ప్రారంభమైంది.
  • వీరు జంతువులు, శిలలు, పితృదేవతలు, భూతాలను ఆరాధించారు.
  • మరణించినవారిని సమాధి చేసేవారు.
  • ఎముకలు, గవ్వలతో రూపొందించిన ఆభరణాలు ధరించేవారు.
  • ఈ యుగానికి చెందిన ప్రజలు ఆస్ట్రిక్ జాతివారని కొందరు చరిత్రకారుల భావన.
సింధూ నాగరికత (క్రీ.పూ. 2500-1750)
రాగి లోహం వాడుకతో ఈ యుగం ప్రారంభమైనందువల్ల దీన్ని ‘తామ్ర శిలాయుగం’గా పేర్కొంటారు. దీన్ని ‘హరప్పా సంస్కృతి’ అని కూడా అంటారు. 1921లో సింధూ మైదాన ప్రాంతంలో చేపట్టిన పురావస్తు తవ్వకాల్లో హరప్పా ప్రదేశం బయల్పడింది. అందువల్ల దీన్ని ‘సింధూ నాగరికత’ లేదా ‘హరప్పా నాగరికత’గా వ్యవహరించారు.
హరప్పా, మొహంజోదారో ప్రదేశాలు ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉన్నాయి. హరప్పా నగరంలో ధాన్యాగార భవనం ఒక విశిష్ట నిర్మాణం. మొహంజోదారోలో బయల్పడిన స్నానవాటిక ప్రసిద్ధి చెందింది. చాన్హుదారో కోటలకు ఖ్యాతి చెందింది. గుజరాత్‌లోని లోథాల్ ప్రసిద్ధ రేవు పట్టణం. దేశ, విదేశీ (మెసపటోమియా ప్రజలతో) వాణిజ్యం చేశారు. రాజస్థాన్‌లోని కాళీభంగన్, హరియాణాలోని బన్వాలి కూడా ఈ నాగరికతకు చెందిన ముఖ్యమైన ప్రదేశాలు. సింధూ స్థావరాల్లో రాఖీగర్హిని అతి పెద్ద నగరంగా 2014లో పురావస్తు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అంతకుముందు వరకు మొహంజోదారోను పెద్ద నగరంగా పరిగణించేవారు.
నాటి మెసపటోమియా, ఈజిప్టు నాగరికత కంటే సింధూ నాగరికత పరిధి చాలా విస్తృతమైంది. ఈ నాగరికతకు చెందిన ప్రజలు గ్రిడ్ పద్ధతిలో పట్టణాలను నిర్మించారు. మెలుహా ప్రాంతంవారికి సుమేరియన్లతో ఉన్న సంబంధాల గురించి కొన్ని సుమేరియన్ గ్రంథాల ద్వారా తెలుస్తోంది. సింధూ ప్రాంతాన్ని అత్యంత ప్రాచీన కాలంలో ‘మెలుహా’గా వ్యవహరించేవారు.
హరప్పా నాగరితను పట్టణ నాగరికతగా పేర్కొనవచ్చు. వీధులు ఉత్తర, దక్షిణాలుగా, ఉప వీధులు తూర్పు, పడమరలుగా చక్కని దీర్ఘచతురస్ర ఆకారంలో నిర్మించారు. నిర్మాణాలకు కాల్చిన ఇటుకలను ఉపయోగించారు. భూగర్భ మురుగు పారుదల సౌకర్యం నాటి సాంకేతిక ప్రతిభకు నిదర్శనం. నగర ప్రజల సమష్టి ప్రయోజనాల కోసం సభా మందిరాన్ని కూడా నిర్మించారు. గోధుమ, బార్లీ వీరి ప్రధానమైన పంటలు.
లోథాల్ నగరంలో పత్తి, వరి పండించినట్లుగా ఆధారాలు లభించాయి. వీరు పాలు, కూరగాయలు, గోధుమ, బార్లీతో పాటు మంసాహారాన్ని కూడా తీసుకునేవారు. ఎద్దు, మహిషం, గొర్రె, పంది, ఒంటె, కుక్క, ఆవు లాంటి పెంపుడు జంతువులు, ఖడ్గమృగం, పెద్దపులి, ఎలుగుబంటి, వానరం తదితర వన్యమృగాలు వీరికి తెలుసు. వీరు యుద్ధాల్లో రాగితో చేసిన గొడ్డలి, కత్తి, బల్లెం, విల్లంబులు, బాడిశ తదితర పరికరాలను ఉపయోగించారు. కానీ రక్షణ కవచాలు తెలియదు. గృహ సామగ్రి కోసం రాగి, వెండి, పింగాణీతో పాటు శిలలు, దంతాలతో చేసిన వస్తువులను వినియోగించారు. వీరు దశాంశ పద్ధతిలో తూనికలు ఉపయోగించారు. సింధూ ప్రజల మట్టి ముద్రికలు, శిలా విగ్రహాలు, లోహ ప్రతిమల ఆధారంగా వీరు ప్రధానంగా మాతృదేవత లేదా అమ్మతల్లిని ఆరాధించినట్లుగా తెలుస్తోంది. మూడు ముఖాలతో పద్మాసీనుడై ఉన్న శివుని చుట్టూ వన్యమృగాలున్న ఒక ముద్రిక లభించింది. దీని ఆధారంగా వీరు పశుపతిగా, మహాయోగిగా శివుణ్ని ఆరాధించేవారని, వృక్షాలు, సర్పాలను కూడా పూజించేవారని తెలుస్తోంది. ‘స్వస్తిక్’ అనేది సూర్య దేవతారాదనకు చిహ్నం. మృతదేహాన్ని పూడ్చి పెట్టేవారు. సింధూ ప్రజల లిపి బొమ్మల లిపి. దీన్ని కుడి నుంచి ఎడమ దిశకు రాసినట్లుగా తెలుస్తోంది.
మొహంజోదారో నగరం ఏడుసార్లు ధ్వంసమైనా మళ్లీ నిర్మించారు. ఇక్కడ 4.5 అడుగుల నాట్యం చేస్తున్న స్త్రీ విగ్రహాన్ని కనుగొన్నారు. వీరికి గుర్రం తెలియదు. అందువల్ల గుర్రాన్ని ఉపయోగించిన ఆర్యులు వీరిని సులభంగా ఓడించారని చరిత్రకారుల అభిప్రాయం. కొంత వరకు ప్రకృతి వైపరీత్యాలు కూడా ఈ నాగరికత నాశనం చెందడానికి కారణమై ఉంటాయని భావిస్తున్నారు.
సింధూ నాగరికత ప్రజలకు సమకాలీకులైన సుమేరియన్లు ఇనుమును ఉపయోగించినా వీరు దీన్ని వాడలేదు. ఎన్నిసార్లు వరదలు వచ్చినా అదే ప్రాంతంలో నివసించారు. ఈ కారణాల వల్ల వీరికి ఆధునిక పద్ధతులను త్వరగా స్వీకరించే మనస్తత్వం లేదని భావిస్తున్నారు.
సింధూ నాగరికత ప్రజల ప్రత్యేకతలు
  • వరి, పత్తి పండించడంలో సిద్ధహస్తులు.
  • తూనికలు, కొలతలను ప్రామాణికబద్ధం చేశారు.
  • స్త్రీ శక్తిని పూజించడం వీరి నుంచే ప్రారంభమైంది. లింగ పూజ, అగ్ని పూజ, కోనేటి స్నానం వీరే ప్రారంభించారు.
  • దువ్వెనలు వాడటం, గాజులు ధరించడం వీరి నుంచి వచ్చినవే.
సింధూ నాగరికతకు చెందిన నగరాలు
నగరం
కనుగొన్న సం.
కనుగొన్నవారు
హరప్పా
1921
దయారాం సహాని
మొహంజోదారో
1922
ఆర్.డి. బెనర్జీ
చాన్హుదారో
1935
ఎం.జి. మజుందార్
కాళీభంగన్
1953
ఎ.కె. ఘోష్
రూపర్
1953
వై.డి. శర్మ
లోథాల్
1954
ఎస్.ఆర్. రావ్
రాఖీగర్హి
1963
-
బన్వాలీ
1973
ఆర్.ఎన్. బిస్త్
దోలవీర
1991
ఘోష్

జైనమతం (క్రీ.పూ. 540-468)
జైనమత స్థాపకుడు రుషభనాథుడు. జైన ప్రవక్తలను ‘తీర్థంకరులు’ అంటారు. మొత్తం 24 మంది తీర్థంకరులు ఉండేవారు. రుషభనాథుడు మొదటి తీర్థంకరుడు. 23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడు. చివరివారైన 24వ తీర్థంకరుడు మహావీరుడు.

మహావీరుడు క్రీ.పూ. 540లో వైశాలి నగరానికి సమీపాన ఉన్న ‘కుంద’ గ్రామంలో క్షత్రియ కుటుంబంలో జన్మించాడు. ఈయన తల్లిదండ్రులు సిద్ధార్థుడు, వైశాలి. మహావీరుడి భార్య యశోధ, కుమార్తె ప్రియదర్శిని. ఈయన జీవిత సుఖాలతో తృప్తి చెందక కొంత కాలం దిగంబరుడిగా కఠోర నియమాలను పాటించి తపస్సు చేశాడు. ‘జృంబిక’ గ్రామంలో పరిపూర్ణజ్ఞానాన్ని పొందిన తర్వాత ‘మహావీరుడు’గా పేరు పొందాడు. ఈయన ప్రబోధించిన సరైన క్రియ, సరైన విశ్వాసం, సరైన జ్ఞానం అనే మూడు అంశాలను ‘త్రిరత్నాలు’గా పేర్కొంటారు. పంచవ్రతాల ద్వారా మోక్షాన్ని సాధించవచ్చని మహావీరుడు ప్రవచించాడు. ఈయన తన 72వ ఏట క్రీ.పూ. 468లో ‘పావాపురి’ వద్ద నిర్యాణం చెందాడు.

జైనులు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు. ఉపవాసాలు చేసి శరీరాన్ని కృశింపజేసుకొని మరణించడాన్ని ‘సల్లేఖన వ్రతం’గా పేర్కొంటారు. చాలా మంది రాజులు జైనమతాన్ని ఆదరించి అభివృద్ధి చేశారు. చంద్రగుప్త మౌర్యుడు ఈ మతాన్ని అనుసరించి, అన్నింటినీ త్యజించి శ్రావణ బెళగొళలో మరణించాడు. జైనులు ప్రజల భాష అయిన ప్రాకృతంలో తమ సందేశాన్ని ప్రచారం చేశారు. చంద్రగుప్తుడి కాలంలో పాటలీపుత్రంలో స్థూలభద్ర ఆధ్వర్యంలో జైనమత మొదటి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జైనమత బోధనలను 12 అంగాలుగా విభజించి క్రోడీకరించారు. కొంతకాలం తర్వాత వస్త్రధారణ విషయంలో అభిప్రాయభేదాలు తలెత్తడం వల్ల జైనమతం దిగంబర, శ్వేతాంబర శాఖలుగా చీలిపోయింది. రెండో జైన సంగీతి క్రీ.శ. 512లో వల్లభి (గుజరాత్)లో దేవార్థి క్షమపణ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ‘గంధర్వ’ అనే పవిత్ర గ్రంథాలను క్రమానుసారంగా రాశారు. జైనులు శిల్పకళను అభివృద్ధి చేశారు.

క్రీ.పూ. 4వ శతాబ్దం చివరి రోజుల్లో గంగా లోయ ప్రాంతంలో తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో చాలామంది జైన గురువులు, సన్యాసులు దక్షిణ భారతదేశానికి తరలివెళ్లారు. ముఖ్యంగా శ్రావణ బెళగొళ ప్రాంతానికి ఎక్కువ మంది వచ్చారు. దక్షిణానికి వచ్చినవారిలో భద్రబాహుడు, చంద్రగుప్త మౌర్యుడు లాంటి ప్రముఖులు ఉన్నారు. మగధలో ఉన్న జైనులు శ్వేతాంబరులయ్యారు. వీరికి గురువు స్థూల బాహుడు.

జైనమత మహత్వ సూత్రాలు:
1) అహింస
2) సత్యభాషణ
3) అపరిగ్రహం (దొంగిలించకపోవడం)
4) అస్తేయం (ఆస్తి లేకుండా ఉండటం)
5) బ్రహ్మచర్యం
వీటిలో మొదటి నాలుగు సూత్రాలు మహావీరుడి ముందు కాలం నుంచే అమల్లో ఉన్నాయి. మహావీరుడు బ్రహ్మచర్యాన్ని పంచమ సూత్రంగా కలిపాడు.

జైనుల ప్రధాన కట్టడాలు:
  • అబూ పర్వతం - మహావీరుడి దేవాలయం
  • శ్రావణ బెళగొళ - గోమఠేశ్వరుడి విగ్రహం
  • అజంతా, ఎల్లోరా, ఉదయగిరి గుహలు
  • బాదామి - జైన దేవాలయాలు
అజీవికులు: గోశాల మస్కారిపుత్రుడు అజీవిక మతశాఖను స్థాపించారు. ఇది జైన మత సిద్ధాంతాలకు సన్నిహితంగా ఉంది. అశోకుడి కాలంలో ఇది బాగా వ్యాప్తి చెందింది.

హర్యాంక వంశం (క్రీ.పూ.542-490)
క్రీ.పూ. 542-490 మధ్య కాలంలో రాజకీయంగా అనేక పరిణామాలు సంభవించాయి. ఉత్తర భారతదేశంలో మహాజనపదాలుగా పేర్కొనే పదహారు పెద్ద రాజ్యాలు ఏర్పడ్డాయి. వీటినే ‘షోడశ మహాజనపదాలు’ అంటారు. వీటిలో మగధ రాజ్యం శక్తిమంతమైంది. గిరివజ్రం, పాటలీపుత్రం దీని రాజధాని నగరాలు. మొదటగా దీన్ని బృహద్రధ వంశస్థులు పాలించారు. తర్వాత హర్యాంక వంశస్థులు పరిపాలించారు. వీరిలో బింబిసారుడు గొప్పవాడు. ఈయన తర్వాత అజాతశత్రువు పాలించాడు.
అజాతశత్రువు పాలనా కాలం క్రీ.పూ. 495-464. ఈయన హర్యాంక వంశ స్థాపకులైన బింబిసారుడి కుమారుడు. అజాతశత్రువు భార్య వజీరాదేవి. ఈమె కోసలరాజు ప్రసేనజిత్తు కుమార్తె. అజాతశత్రువు వజ్జి గణరాజ్య సమాఖ్యతో 16 ఏళ్లు యుద్ధం చేసి జయించాడు. కంటక శిల, కంటక బోధన అనే రాళ్లు, విసరు రథాలను యుద్ధంలో ఉపయోగించి శత్రురాజులను జయించాడు. ఈయన పాటలీపుత్రాన్ని నిర్మించాడు. ఈయనకు కుణిక అనే పేరు కూడా ఉంది. ఉదయనుడు ఈయన వారసుడు.
అజాతశత్రువు గౌతమబుద్ధుడి సమకాలీకుడు.
హర్యాంక వంశం తర్వాత మగధను శిశునాగవంశం (క్రీ.పూ. 490-458) పాలించింది. వీరి తర్వాత నంద వంశస్థులు రాజ్యానికి వచ్చారు. నంద వంశంలో మహాపద్మనందుడు గొప్పరాజుగా పేరు పొందాడు. ఈయనకు ‘మహాక్షత్రాంతక’ అనే బిరుదు ఉంది. ఆ తర్వాత చంద్రగుప్త మౌర్యుడు చాణక్యుని సహాయంతో నందవంశాన్ని నిర్మూలించి మౌర్యవంశాన్ని స్థాపించాడు.

విదేశీ దండయాత్రలు (క్రీ.పూ. 327-325)
భారతదేశంలో రాజకీయ అనైక్యత కారణంగా విదేశీయులు దండయాత్రలు ప్రారంభించారు. పారశీకులు మొదటగా భారత్‌పై దండయాత్ర చేశారు. వీరిలో ‘సైరస్’, ‘డేరియస్’ గొప్పవారు. పారశీక చక్రవర్తి ‘సైరస్’ గాంధారను జయించారు. వీరి తర్వాత గ్రీకులు భారతదేశంపై దండెత్తారు. గ్రీకు రాజ్యాల్లో అగ్రగామి అయిన మాసిడోనియా చక్రవర్తి అలెగ్జాండర్ విశ్వవిజేతగా పేరు పొందారు. గ్రీకు దండయాత్రల ఫలితంగా భారతదేశానికి, యూరప్ దేశాల మధ్య సంబంధాలు ఏర్పడ్డాయి. భారతీయులు గ్రీకుల నుంచి నాణేల ముద్రణ; శిల్ప, ఖగోళ శాస్త్రాలను నేర్చుకున్నారు.

మౌర్య సామ్రాజ్యం (క్రీ.పూ. 322)
మౌర్యుల చరిత్రకు ఆధారాలు:
విదేశీ గ్రంథాలు: మెగస్తనీస్ (గ్రీకు రాయబారి) రాసిన ‘ఇండికా’, స్ట్రాబో, డియోడరస్, ఏరియస్, ప్లీనీ రచనలు మౌర్యుల చరిత్రకు ప్రధాన ఆధారాలుగా ఉన్నాయి.
సాహిత్య ఆధారాలు: కౌటిల్యుడి ‘అర్థశాస్త్రం’, విశాఖదత్తుడి ‘ముద్రారాక్షసం’.
మత సంబంధ ఆధారాలు: పురాణాలు, బౌద్ధుల దివ్య వదన, అశోకవదన, శ్రీలంకకు సంబంధించిన దీపవంశ, మహావంశ, జైనులకు సంబంధించిన పరిశిష్ట పర్వణ్ మొదలైనవి కూడా మౌర్యుల చరిత్రను తెలుసుకోవడానికి దోహదపడుతున్నాయి.
వీటితో పాటు శిలా శాసనాలు, రాతి చెక్కడాలు, గుహలు కూడా మౌర్యుల చరిత్రకు ఆధారాలుగా ఉన్నాయి.
చంద్రగుప్త మౌర్యుడు: ఈయన మౌర్యవంశ స్థాపకుడు. చంద్రగుప్త మౌర్యుడు తన చివరి రోజుల్లో కర్ణాటకలోని శ్రావణ బెళగొళలో జీవించాడు. ‘సల్లేఖన వ్రతం’ ద్వారా మరణించాడు. ఈయన క్రీ.పూ. 303లో ‘సెల్యుకస్ నికే టర్’తో కుదుర్చుకున్న ఒప్పందం ద్వారా మౌర్య సామ్రాజ్యానికి ఎక్కువ ప్రయోజనం కలిగింది.
బిందుసారుడు (క్రీ.పూ. 298-273): ఈయన చంద్రగుప్త మౌర్యుడి కుమారుడు. బిందుసారుడికి ‘అమిత్రఘాత’, ‘సింహసేనుడు’ అనే బిరుదులు ఉన్నాయి. ఈయన రాజ్యాన్ని మైసూరు వరకు విస్తరించాడు. చాణక్యుడు కొంత కాలంపాటు బిందుసారుడికి కూడా మహామంత్రిగా ఉండి ఆయనకు రాజ్య రక్షణలో సాయపడినట్లుగా టిబెట్ చరిత్రకారుడు తారానాథ్ పేర్కొన్నారు. బిందుసారుడి పాలనా కాలంలో తక్షశిలలో తిరుగుబాటు జరిగింది. ఈయన ఆజ్ఞ ప్రకారం అశోకుడు తక్షశిలకు వెళ్లి శాంతి నెలకొల్పాడు. బిందుసారుడు గ్రీకు రాజ్యాలతో స్నేహ సంబంధాలు పెంపొందించాడు.
అశోకుడు (క్రీ.పూ. 273-232): ఈయన బిందుసారుడి కుమారుడు. అశోకుడు పట్టాభిషేకం చేసుకున్న తొమ్మిదేళ్లకు (క్రీ.పూ. 262- 61లో) సామ్రాజ్యకాంక్షతో కళింగ రాజ్యంపై దండెత్తి జయించాడు. ఈ యుద్ధం ‘ధర్మాశోకుడు’గా పూర్తిగా పరివర్తనం చెందడానికి కారణమైంది. ఆ తర్వాత ఉపగుప్తుడు అనే బౌద్ధ ఆచార్యుడి వద్ద అశోకుడు బౌద్ధమత దీక్ష స్వీకరించాడు. ధర్మప్రచారానికి పూనుకొని ‘దేవానాం ప్రియ’, ‘ప్రియదర్శిని’ బిరుదులు పొందాడు. బానిసలు, సేవకుల పట్ల కరుణ, తల్లిదండ్రులు, పెద్దల పట్ల విధేయత, గురువుల పట్ల గౌరవం, స్నేహితులు, బంధువులు, పరిచయస్థుల పట్ల ఔదార్యం, పురోహితులు, భిక్షువుల పట్ల ఆదరణ అనేవి అశోకుడు ప్రబోధించిన ‘ధర్మం’లోని సూత్రాలు. ‘అహింసా’ అనేది ‘ధర్మం’లోని ముఖ్యసూత్రం. అశోకుడు 42 ఏళ్లు పరిపాలించి క్రీ.పూ. 232లో మరణించాడు.

వివిధ శాసనాల ఆధారంగా అశోకుడి సామ్రాజ్య సరిహద్దుల గురించి తెలుస్తోంది. షహాబద్‌గిరి, మాన్‌షేషరా శాసనాలు వాయవ్య సరిహద్దును, రుమిందై శాసనం ఈశాన్య సరిహద్దును, సొపారా, గిర్నార్ శాసనాలు పశ్చిమ సరిహద్దును తెలుసుకోవడానికి ఉపయోగపడుతున్నాయి. బబ్రూ శాసనం అశోకుడి బౌద్ధమత స్వీకారం గురించి, ధౌలీ, జునాగడ్ శాసనాలు ఉదాత్త రాజ ధర్మ స్వరూపం గురించి, బరాబర్ శాసనం పరమత సహనం గురించి, 13వ శిలాశాసనం కళింగ యుద్ధం గురించి తెలుపుతున్నాయి. మస్కీలో అశోక అనే పదం ఉంది. కళింగ యుద్ధం తర్వాత అశోకుడి పాలన గురించి కళింగ శాసనం ద్వారా తెలుస్తోంది. రుమిందై, ఇగ్లివ శాసనాలు అశోకుడికి బుద్ధుడిపై ఉన్న గౌరవాన్ని వివరిస్తాయి. తరాయి శాసనం అశోకుడికి బౌద్ధమతంపై ఉన్న గౌరవాన్ని తెలుపుతుంది.
అన్ని మతాల సారాంశం ఆధారంగా అశోకుడు కొన్ని సూత్రాలతో దమ్మను తయారు చేశాడు. ఈయన దమ్మ ప్రచారం కోసం ధర్మమహామాత్రులు అనే ప్రచారకులను పంపిస్తే వారు బౌద్ధ మతాన్ని ప్రచారం చేశారు. భారత ఉపఖండంలో అశోకుడు వేయించిన 14 ప్రధాన శిలా శాసనాలు, ఏడు స్తంభ శాసనాలు, అనేక చిన్నరాతి శాసనాలు లభించాయి. ఇందులో చాలావాటిపై ప్రజల కోసం చేసిన ప్రకటనలు చెక్కారు. 14 శిలా శాసనాలు అశోకుడి దమ్మ సూత్రాల గురించి తెలుపుతున్నాయి. మస్కీ శాసనంలో ‘దేవానాం ప్రియ’ అని ఉంది.
మౌర్య వంశ చివరి పాలకులు (క్రీ.పూ. 232 - 185): అశోకుడి తర్వాత వచ్చిన రాజులు అర్ధ శతాబ్దం పాటు పాలించారు. మౌర్య వంశ చివరి రాజైన బృహద్రధుడిని ఆయన సేనాని పుష్యమిత్రుడు వధించి మగధను ఆక్రమించడంతో వీరి పాలన అంతమైంది.

మౌర్యుల పాలనా వ్యవస్థ
భారతదేశంలో ప్రప్రథమంగా కేంద్రీకృత అధికారాలు కలిగిన నిర్దిష్టమైన పరిపాలన రూపొందించింది మౌర్య చక్రవర్తులే. వీరికి పాలనలో సలహా కోసం మంత్రితో పాటు పరిషత్తు ఉండేది. పాలనా సౌలభ్యం కోసం సామ్రాజ్యాన్ని నాలుగు రాష్ట్రాలుగా విభజించి వాటికి రాజప్రతినిధులను నియమించారు. భూమిశిస్తు ప్రభుత్వ ప్రధాన ఆదాయం. పంట దిగుబడిలో 4 నుంచి 6వ వంతు వరకు శిస్తు వసూలు చేసేవారు. పాటలీపుత్ర నగర పాలన ముప్ఫై మంది సభ్యులున్న బోర్డు నిర్వహణలో ఉండేది. వర్తకుల ‘శ్రేణులు’ బ్యాంకులుగా పనిచేశాయి. సమాజంలో బహు భార్యత్వం, కన్యల విక్రయం, సతీసహగమనం లాంటి దురాచారాలు ఉండేవి. ఈ కాలంలో స్త్రీల స్థాయి తగ్గింది. మౌర్యులు ఎక్కువగా ప్రజల భాష అయిన ప్రాకృతాన్ని ఉపయోగించారు. శిలా శాసనాల్లో ‘ఖరోష్టి’, ‘బ్రాహ్మి’ లిపులను వాడారు.
Published date : 04 Sep 2015 05:00PM

Photo Stories