Skip to main content

జీర్ణవ్యవస్థ

జీవుల పెరుగుదల, వివిధ కణాల విధుల నిర్వహణ, శక్తి కోసం ఆహారం అవసరం. ఎంజైముల చర్యలతో సంక్లిష్ట ఆహార పదార్థాలు సరళ పదార్థాలుగా మారతాయి. దీన్ని జీర్ణక్రియ అంటారు. జీర్ణక్రియలో పాల్గొనే అవయవాలన్నింటిని కలిపి జీర్ణ వ్యవస్థగా పేర్కొంటారు.
మానవుడి జీర్ణ వ్యవస్థను మూడు భాగాలుగా విభజించొచ్చు. అవి..
1) ఆహారనాళం లేదా జీర్ణనాళం
2) జీర్ణగ్రంథులు
3) జీర్ణక్రియా విధానం

ఆహారనాళం
ఆహారనాళం పొడవు 9 మీటర్లు. ఇది నోటితో ప్రారంభమై, పాయువుతో అంతమవుతుంది. ఆహారనాళంలోని భాగాలు వరుసగా..
1) నోరు
2) ఆస్యకుహరం
3) గ్రసని
4) ఆహార వాహిక
5) జీర్ణాశయం
6) చిన్న పేగు
7) పెద్ద పేగు
8) పురీషనాళం
9) పాయువు

నోరు
ఇది ఆహారనాళం మొదటి భాగం. నోటిద్వారా ఆహారం తీసుకునే ప్రక్రియను అంతఃగ్రహణం అంటారు. నోటిలో ఆహారం 15 నుంచి 30 సెకన్ల వరకు ఉంటుంది.

ఆస్యకుహరం
రెండు దవడల మధ్య ఉన్న ఖాళీ ప్రదేశాన్ని ఆస్యకుహరం అంటారు. దీనిలో మూడు భాగాలుంటాయి. అవి..
1) దంతాలు
2) లాలాజల గ్రంథులు
3) నాలుక

దంతాలు
దంతాల అధ్యయనాన్ని ఒడెంటాలజీ అంటారు. ఎక్కువ సంఖ్యలో దంతాలున్న జీవులు..
అపోజం - 50
గుర్రం, పంది - 44
దంతాలు డెంటిన్‌తో ఏర్పడతాయి. దంతాల్లోని సజీవ కణాలు ఒడంటోబ్లాస్టులు. ఈ కణాలు డెంటిన్‌ను స్రవిస్తాయి. దంతం కిరీట భాగాన్ని కప్పుతూ ఉండే మెరిసే పొరను ఎనామిల్ లేదా పింగాణి పొర అంటారు. ఈ ఎనామిల్ దంతాలకు దృఢత్వాన్నిస్తుంది. పింగాణి పొర ఏర్పడటానికి ఫ్లోరిన్ (తక్కువ మోతాదులో) అవసరం. మానవ శరీరంలో అతి దృఢమైన పదార్థం ఎనామిల్ (పింగాణి).
దంత నిర్మాణం
దంత నిర్మాణంలో 3 భాగాలుంటాయి. 1) కిరీటం, 2) మెడ, 3) మూలం
కిరీటం (క్రౌన్): పైకి కనిపించే దంతభాగం.
మెడ: చిగురు వద్ద ఉండే దంత భాగం.
మూలం (రూట్): దవడ గుంతల్లో ఉండే దంత భాగం.
మానవ దంతాలు దవడ ఎముక గుంతల్లో అమరి ఉంటాయి. ఇలాంటి అమరికను థీకోడాంట్ దంత విన్యాసం అంటారు. మానవుడి జీవిత కాలంలో రెండుసార్లు దంతాలు ఏర్పడతాయి. దీన్ని ద్వివార దంత విన్యాసం అంటారు. చేపల జీవితకాలంలో అనేకసార్లు దంతాలు ఏర్పడతాయి. దీన్ని బహువార దంత విన్యాసం అంటారు. పక్షుల్లో దంతాలు ఉండవు.

దంతాలు - రకాలు
మానవుడిలో రెండు రకాల దంతాలు ఏర్పడతాయి. 1) పాలదంతాలు, 2) శాశ్వత దంతాలు
పాల దంతాలు
ఇవి 6 నుంచి 7 నెలల వయసులో ఏర్పడి, 8 నుంచి 9 సంవత్సరాల వయసులో ఊడిపోతాయి. పాల దంతాల సంఖ్య - 20
పాలదంతాల ఫార్ములా:

చిన్న పిల్లల పాలదంతాల్లో లోపించిన దంతాల సంఖ్య - 12
అవి.. అగ్ర చర్వణకాలు- 8, జ్ఞానదంతాలు- 4
శాశ్వత దంతాలు
పాలదంతాలు ఊడిపోయి వాటి స్థానంలో శాశ్వత దంతాలు వస్తాయి.
శాశ్వత దంతాల అర్ధ దవడ ఫార్ములా:

శాశ్వత దంతాలు వివిధ ఆకార, పరిమాణాల్లో ఉంటాయి. కాబట్టి వీటిని విషమ దంతాలు అంటారు.
  • ఏనుగు పైదవడలోని కుంతకాలు, ఏనుగు దంతాలు(టస్క్)గా మార్పు చెందుతాయి.
  • రదనికలు మాంసాహార జీవుల్లో బాగా అభివృద్ధి చెంది ఉంటాయి. రదనికల అగ్రభాగం మొనదేలి ఎముకల నుంచి మాంసాన్ని చీల్చడానికి ఉపయోగపడుతుంది.
  • కుందేలులాంటి శాకాహార జీవుల్లో రదనికలు లోపించి దవడలో ఏర్పడే ఖాళీ ప్రదేశాన్ని ‘డయాస్టీమా’ అంటారు. డయాస్టీమా లోపించిన జీవులు.. పులి, సింహం, కుక్క.
  • సముద్ర క్షీరదాలైన సీల్, వాల్స్‌ల్రో ఏర్పడే రెండు పొడవైన దంతాలు.. రదనికల రూపాంతరాలు.
  • పాములోని రెండు కోరలు కూడా రదనికల రూపాంతరాలే.
  • చర్వణకాల్లోని చివరి దంతాన్ని జ్ఞానదంతం (విస్‌డమ్ టీత్) అంటారు. ఇది యుక్త వయసులో (21 ఏళ్ల తర్వాత) ఏర్పడుతుంది.
రూట్ కెనాల్ థెరపీ: శాశ్వత దంతాలు ఊడిపోయినప్పుడు దంతవైద్యులు కృత్రిమ దంతాలను దవడ గుంతల్లో అమర్చే ప్రక్రియ.

దంత వ్యాధులు
ఫ్లోరోసిస్: ఫ్లోరిన్ (2 పీపీఎం కంటే ఎక్కువ) నీటిని తాగడం వల్ల దంతాలు పసుపు రంగులోకి మారుతాయి. ఎముకలు వికృత రూపందాల్చుతాయి.
పయేరియా: దంతాలు, చిగుళ్ల నుంచి చీము వస్తుంది.
జిజివైటిస్: రెండు దంతాల మధ్యలోనిచిగురులో వాపు.
దంతక్షయం: బ్యాక్టీరియా చర్యలతో దంతాలపై ఎనామిల్ క్షీణించడం.

లాలాజల గ్రంథులు
మానవుడిలో మూడు జతల లాలాజల గ్రంథులు ఉంటాయి. కుందేలులో నాలుగు జతలుంటాయి. పాములో లాలాజల గ్రంథులు విష గ్రంథులుగా రూపాంతరం చెందుతాయి. లాలా జల గ్రంథులు రోజుకు ఒక లీటరు లాలాజలాన్ని ఉత్పత్తి చేస్తాయి. లాలాజలం ఆమ్లం స్వభావం (pH–6.8) లో ఉంటుంది.
దీనిలో టయలిన్ (లాలాజల అమైలేజ్), లైసోజోమ్ అనే ఎంజైములు ఉంటాయి. టయలిన్ పిండి పదార్థాలను డెక్ట్రిన్, మాల్టోజ్ చక్కెరలుగా మారుస్తుంది. లైసోజైమ్ సూక్ష్మజీవ నాశినిగా పనిచేసి నోటి దుర్వాసనను దూరం చేస్తుంది.

నాలుక
నాలుక రుచులను గుర్తించే జ్ఞానేంద్రియం. దీనిపై రుచులను గుర్తించే నాలుగు రకాల రుచి మొగ్గలు ఉంటాయి. అవి..
  • నాలుక కొన - తీపి రుచి మొగ్గలు
  • నాలుక కొన వెనక భాగం - ఉప్పు
  • నాలుక పక్క భాగాలు - పులుపు
  • నాలుక లోపలి భాగం (గొంతులో)- చేదురుచి మొగ్గలు ఉంటాయి.

గ్రసని

ఆహార, వాయు నాళ మార్గాల కూడలిని గ్రసని అంటారు. గ్రసనిలో ఎలాంటి జీర్ణక్రియ జరగదు.

ఆహార వాహిక
ఇది గ్రసనితో ప్రారంభమై జీర్ణాశయంలోకి తెరుచుకుంటుంది. ఆహార వాహికలోనూ ఎలాంటి జీర్ణక్రియ జరగదు. ఆహారం మింగినప్పుడు అది ఆహార వాహికలోకి చేరుతుంది.
  • ఆహారాన్ని మింగడం నియంత్రిత చర్య.
  • ఆహార వాహికలో ఆహారం 10 నుంచి 15 సెకన్లు ఉంటుంది.
  • ఆహార వాహికలోని పెరిస్టాలిటిక్ చలనాలతో ఆహారం జీర్ణాశయంలోకి చేరుతుంది.

జీర్ణాశయం
జీర్ణాశయం సంచి లాంటి కండర నిర్మిత భాగం. ఇది ఉదరంలో ఎడమ వైపు ఉంటుంది. జీర్ణాశయం గోడల్లోని జఠర గ్రంథులు జఠర రసాన్ని స్రవిస్తాయి. జఠర రసంలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం (HCl), పెప్సిన్, రెనిన్ అనే ఎంజైములు, మ్యూసిన్ ఉంటాయి.
  • జీర్ణాశయంలోని హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఆహారంలోని సూక్ష్మజీవులను చంపుతుంది. ఆహారానికి ఆమ్ల స్వభావాన్ని కలిగిస్తుంది.
  • జీర్ణాశయంలో ఆమ్లం అధికంగా ఉత్పత్తి అయితే పెప్టిక్ అల్సర్ వస్తుంది.
  • పెప్టిక్ అల్సర్ నివారణకు మిల్క్ ఆప్ మెగ్నిషియాన్ని ఔషధంగా వాడుతారు. దీనిలో మెగ్నిషియం హైడ్రాక్సైడ్ ఉంటుంది.
  • హెలికో బ్యాక్టర్ పైలోరి అనే బ్యాక్టీరియా వల్ల జీర్ణాశయ అల్సర్ వస్తుందని రోబిన్ వారెన్, బెరిమార్షల్ కనుగొన్నారు. వీరి పరిశోధనకు 2005లో నోబెల్ బహుమతి లభించింది.
విధులు
  • ఆహారాన్ని తాత్కాలికంగా నిల్వ చేయడం (2 నుంచి 4 గంటలు)
  • ఆహారంలోని పదార్థాలను కలపడం.
  • ఆహారంలో భౌతిక రసాయన మార్పులను కలిగించడం.
  • జీర్ణాశయ గోడల్లోని వర్తుల కండరాలు ఆహారాన్ని మెత్తగా చేస్తాయి.
  • జీర్ణాశయంలో పాక్షికంగా జీర్ణమై ద్రవరూపంలోకి మారిన ఆహారాన్ని కైమ్ అంటారు. (కైమ్ ఆమ్ల స్థితిలో ఉంటుంది).
మానవుడి జీర్ణాశయంలో మూడు గదులుంటాయి. కానీ, నెమరువేసే జంతువుల్లో నాలుగు గదులుంటాయి. అవి.. 1) ప్రథమ ఆమాశయం 2) జాలకం 3) తృతీయ ఆమాశయం 4) చతుర్థ ఆమాశయం.
వీటిలో ప్రథమ ఆమాశయం పెద్దది. ఈ గదిలో సెల్యులోజ్‌ను ఉత్పత్తి చేసే సూక్ష్మజీవులుంటాయి. ఈ గది మానవుడిలో లోపించి ఉంటుంది.
గ్యాస్ట్రో ఎంటరాలజీ: జీర్ణాశయం, ఉదరంలోని భాగాల అధ్యయనాన్ని గ్యాస్ట్రో ఎంటరాలజీ అంటారు.
అన్నవాహికను ఎక్స్‌రే తీసే ముందు రోగికి బేరియం ద్రావణాన్ని తాగిస్తారు. బేరియం ఎక్స్ కిరణాలను బాగా గ్రహిస్తుంది.

బేరియాట్రిక్ సర్జరీ
ఊబకాయుల్లో బరువును తగ్గించడానికి బేరియాట్రిక్ సర్జరీ చేస్తారు. ఉదరంలోని అన్నకోశం (జీర్ణాశయం) సైజు తగ్గించడం దీని ప్రధాన లక్ష్యం. లైపోసక్షన్ ఇందుకు పూర్తి భిన్నం. దీనిలో వివిధ శరీర భాగాల్లో అదనంగా పేరుకున్న కొవ్వును తొలగిస్తారు.
Published date : 01 Dec 2015 04:43PM

Photo Stories