Skip to main content

శాతవాహనుల పాలనా విధానం

మౌర్యులకు సామంతులుగా పాలనలోకి వచ్చిన శాతవాహనులు పాలనా విధానంలో వారినే అనుసరించారు. మను ధర్మశాస్త్రం, చాణుక్యుడి అర్థశాస్త్రాలు శాతవాహనులకు మార్గదర్శకాలుగా ఉన్నాయి. అయితే మౌర్యులు తమ పాలనలో కేంద్రీకృత విధానం, విస్తృత యంత్రాంగానికి ప్రాధాన్యతనిస్తే, శాతవాహనులు మాత్రం పరిమిత యంత్రాంగం, వికేంద్రీకృత విధానాలను అనుసరించారు. రాజు నిరంకుశుడైనప్పటికీ, శ్రేయోరాజ్య భావనతో పాలించేవారు. రాజు దైవాంశ సంభూతుడని, రాజ్యాధికారం ‘దైవదత్తం’ అనే భావన శాతవాహనులకు ఉండేది. రాజ్యం వారసత్వంగా సంక్రమించేది. రాజు సర్వ స్వతంత్రుడు. శాసనాల ప్రకారం శాతవాహన రాజులు రామ, భీమ, కేశవ, అర్జున గుణగణాలను ఆపాదించుకున్నారు. ధర్మ, అర్థ, కామ, మోక్షాల (పురుషార్థాలు)కు పాలనలో ప్రాధాన్యమిచ్చారు.
రాజ్య పాలన
శాతవాహనులు రాజ్యాన్ని ఆహారాలు (రాష్ట్రాలు)గా విభజించారు. వీటి అధిపతులను అమాత్యులని పిలిచేవారు. రాజుకు సలహాలిచ్చే మంత్రివర్గ సభ్యులను రాజామాత్యులని వ్యవహరించేవారు. రాజు సలహాలను అమలు చేయడానికి అక్షపటల అనే సచివాలయం ఉండేది. ప్రత్యేక కార్యనిర్వహణ కోసం నియమితులైన వారిని ‘మహామాత్రులు’ అని పిలిచేవారు. అమాత్యులు, రాజామాత్యులు, మహామాత్రులు, మంత్రి మండలిని మౌర్యుల పాలన నుంచి శాతవాహనులు స్వీకరించారు. వీరందరూ ఉన్నత ఉద్యోగులే. ప్రతి ఆహారం (రాష్ర్టం)లో ఒక ప్రధాన నగరం (నిగమం)తోపాటు అనేక గ్రామాలుండేవి. గోవర్థనాహార, సోపారహార, మామలాహార, శాతవాహనాహార వంటి పేర్లు శాసనాల్లో కన్పిస్తున్నాయి. పట్టణ పాలనను నిగమ సభలు నిర్వహించేవి.  సైన్యానిధిపతిని మహాసేనాధిపతని, పత్రాలు రాసే అధికారిని లేఖకుడని, కోశాధికారిని హేరణిక, వస్తు సంచయిక అధికారిని భాండారికుడు, భూమిశిస్తు వసూలు చేసే అధికారిని నిబంధకారుడని, రెవెన్యూ రికార్డులు భద్రపరిచే వారిని మహాభాండారికుడని పిలిచేవారు. పాలనావ్యవస్థలో చివరి భాగం గ్రామం.  గ్రామాధ్యక్షుణ్ని గ్రామణి, గుల్మిక, గ్రామిక అని పిలిచేవారు. గ్రామణి ఆధీనంలో 5-10 గ్రామాలుండేవి.

ఆదాయ వనరులు
శాతవాహనుల ప్రధాన ఆదాయ వనరు భూమిశిస్తు. పంటలో 1/6 వంతును శిస్తుగా వసూలు చేసేవారు. వృత్తి పన్నులుండేవి. రేవులు, రహదారులపై సుంకాలు విధించేవారు. ఒక వృత్తిని అనుసరించే వారంతా సంఘంగా ఏర్పడేవారు. వీటిని శ్రేణులుగా పిలిచేవారు. ఈ శ్రేణి అధ్యక్షుడే శ్రేష్ఠి. గ్రామణి (గుల్మిక) ఆధీనంలో 9 రథాలు, 9 ఏనుగులు, 25 గుర్రాలు, 45 మంది సైనికులు ఉండేవారు. శాసనాల్లోని కటక, స్కంధావార (సైనిక శిబిరం) వివరాలు అప్పటి మిలిటరీ పాలనా విధానాన్ని సూచిస్తున్నాయి. శాతవాహనుల కాలంలో సాగుభూమిని కొలవడానికి ‘రజ్జు’ అనే కొలమానాన్ని వాడారు. ‘రజ్జుగాహకుడు’ అనే అధికారి భూమి కొలతలు, లావాదేవీలను పర్యవేక్షించేవాడు. వృత్తి పనుల వారు చెల్లించే సుంకాన్ని ‘కరుకర’ అని పిలిచేవారు. దక్షిణ భారతదేశంలో భూధానం చేయడం అనే ప్రక్రియను శాతవాహనులే ప్రారంభించారు. 

సైన్య నిర్వహణ
శాతవాహనుల కాలంలో రాష్ట్రాలతో పాటు స్థానిక సంస్థలు కూడా సైన్యాన్ని నిర్వహించేవి. గ్రామణి లేదా గుల్మిక ఆధీనంలో కొంత సైన్యం ఉండేది. చరిత్రకారుడు ప్లీని ఆంధ్రులకు పదివేల కాల్బలం, రెండువేల అశ్విక దళం, వెయ్యి ఏనుగుల సైనిక బలం ఉన్నట్లు పేర్కొన్నాడు. సైన్యాన్ని కేంద్రంలో మహాసేనాధిపతి నిర్వహించేవాడు.
ప్రాంతీయ ఆచారాలు, సంప్రదాయాలు, కట్టుబాట్లకు అనుగుణంగా న్యాయ నిర్ణయం జరిగేది. స్థానిక వివాదాలను గ్రామపెద్దలే పరిష్కరించేవారు. దక్షిణ భారత మనువుగా పేరొందిన ఆపస్తంభుడి ధర్మసూత్రాలను అనుసరించి న్యాయ పరిష్కారాలు చేసేవారు.

సామాజిక వ్యవస్థ - స్వరూపం
శాతవాహనుల కాలం నాటి సమాజ పరిస్థితులు తెలుసుకోవటానికి హాలుడు ప్రాకృత భాషలో రచించిన గాథాసప్తశతి, రాణి  నాగానిక వేయించిన నానాఘట్ శాసనం, గౌతమీ బాలశ్రీ వేయించిన శిలా శాసనం, వాత్సాయనుడి కామ సూత్రాలు ముఖ్యాధారాలుగా ఉన్నాయి. అమరావతి, కార్లై నాసిక్ శిల్పాల్లో వివిధ స్త్రీ, పురుష వేషధారణలు, సంగీత వాయిద్యాలు, సైనిక విన్యాసాలు, కోలాటాలు, సమాజంలోని వివిధ వృత్తుల వారిని మనం వీక్షించవచ్చు. కొంత మంది చరిత్రకారులు శాతవాహనులది మాతృస్వామిక వ్యవస్థ అని పేర్కొన్నారు. దీనికి ఆధారం నానాఘట్, నాసిక్ శాసనాలను స్త్రీలు వేయించడమే. సంఘంలో చాతుర్వర్ణ వ్యవస్థ ఏర్పడింది. పితృస్వామిక ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండేది. కుటుంబ పెద్దను గహపతి (గృహపతి) అని పిలిచేవారు. వృత్తిని బట్టి కులాలు, ఉప కులాలు ఏర్పడ్డాయి. సంఘంలో బ్రాహ్మణులకు ప్రత్యేక గౌరవం ఉండేది. గౌతమీపుత్ర శాతకర్ణికి ‘ఆగమ నిలయ’, ‘ఏకబ్రాహ్మణ’, ‘వినివర్తిత చాతుర్వర్ణ సాంకస్య’ వంటి బిరుదులున్నాయి. అయితే శాతవాహనుల కాలంలో కుల వ్యవస్థ పూర్తిగా ఏర్పడలేదని కూడా చెప్పవచ్చు. ఒకే కుటుంబంలో వివిధ వృత్తుల వారు ఉండేవారు. వీరంతా బౌద్ధ సంఘాలకు దానాలు చేసేవారు. ‘థిమిక’ అనే చర్మకారుడు తన కుటుంబ సభ్యులతో అమరావతి స్థూపాన్ని దర్శించి, అనేక దానాలు చేశాడని తెలుస్తోంది. దీన్ని బట్టి కులవ్యవస్థ పూర్తిగా ఏర్పడలేదని ఊహించవచ్చు. సమాజంలో 18 వృత్తుల వారు ఉండేవారు. అందువల్లే కులవృత్తిపై నియమాలు ఏర్పడలేదు. అమరావతి స్థూపంలోని ‘పూర్ణకుంభం’ ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట చిహ్నంగా రూపొందింది.

స్త్రీ స్వేచ్ఛా గౌరవాలు
సంఘంలో ప్రతి స్త్రీకి గౌరవం లభించేది.  స్త్రీలకు ఆస్తిహక్కులుండేవి. ఆనాటి బౌద్ధ విహారాలకు స్త్రీలే ఎక్కువగా దానధర్మాలు చేశారు. గౌతమీపుత్ర, వాసిష్టీపుత్ర అనే మాతృ సంజ్ఞలు స్త్రీలకున్న గౌరవాన్ని సూచిస్తున్నాయి. హాలుడి గాథాసప్తశతి ప్రకారం.. సంఘంలో స్త్రీలు మధుపానం, బృంద నాట్యాలు, జంట నాట్యాలు చేస్తూ విచ్చలవిడిగా వ్యవహరించేవారు. సతీసహగమనం ప్రధానసాంఘిక దురాచారంగా ఉండేది. వ్యవసాయం, వాణిజ్యం బాగా అభివృద్ధి చెందింది. అందుకే హాలుడి వర్ణనల్లో విలాసవంతమైన జీవితం కనిపిస్తోంది. స్త్రీలు ‘మహాభోజకి’, ‘మహాసేనాపత్ని’, ‘మహాదంనాయకి’ వంటి బిరుదులను ఆపాదించుకున్నారు. వాత్సాయనుడు తన కామసూత్రాల్లో ఘట నిబంధన, కౌముదీ గమన అనే నాటకాలు, మదనోత్సవం, హోళిక, ఉద్యానగమనే  పండుగలను వర్ణించాడు. స్త్రీ, పురుషులు ఒకే విధమైన ఆభరణాలను ధరించేవారు. జూదం, నాట్యం, సంగీతాలు నాటి ప్రజల ప్రధాన వినోదాలు. శాతవాహనుల కాలంలో శకులు, యవనులు (గ్రీకులు), పహ్లవులు సమాజంలో మిళితమై వైదిక, బౌద్ధ మతాలను అనుసరించారు. వీరు ధర్మదేవ, అగ్నివర్మన్, రుషభదత్తుడు వంటి హిందూ పేర్లు పెట్టుకున్నారు. శక రాజైన రుద్ర దమనుడు కుమార్తె రుద్ర భట్టారికను శాతవాహన రాజు వివాహం చేసుకున్నాడు. రుషభదత్తుడు రాజస్థాన్ పుష్కర ప్రాంతానికి యాత్రలు చేసి బ్రాహ్మణులకు గోవులు, గ్రామాలను దానం చేశాడు. గౌతమీపుత్ర శాతకర్ణి ‘ఏకబ్రాహ్మణ’, ‘ఆగమనిలయ’, ‘వినివర్తిత, చాతుర్వర్ణ సాంకస్య’, ‘ద్విజకుటుంబ వివర్ధన’ (బ్రాహ్మణుల అభివృద్ధి) ‘క్షత్రియ దర్పమాన మర్దన ’వంటి బిరుదులు ధరించి వర్ణ సంకరాన్ని అరికట్టాడు.

మత పరిస్థితులు
 శాతవాహన కాలంలో వైదిక, బౌద్ధ, జైన మతాలు ఆంధ్ర దేశంలో వర్థిల్లాయి. రాజులు వైదిక మతాన్ని ఆదరిస్తే, స్త్రీలు బౌద్ధమతాన్ని పోషించారు. మొదటి శాతకర్ణి రెండు అశ్వమేధ యాగాలతో పాటు ఒక రాజసూయ యాగం చేశాడు. శివారాధన ఉందని గాథాసప్తశతి పేర్కొంది. మధ్యప్రదేశ్‌లోని విదిశ ప్రాంతంలో హోలియోడోరస్ (గ్రీకు) క్రీ.పూ.1వ శతాబ్దంలో వేసిన స్తంభ శాసనం భాగవత మతం గురించి ప్రస్తావించింది. శాతవాహన రాజుల్లో కృష్ణ, వైదిశ్రీ, యజ్ఞశ్రీ పేర్లను బట్టి వీరు వైదిక ధర్మాన్ని ఆచరించినట్లు తెలుస్తోంది. శివకేశవులు, రాధాకృష్ణులను ప్రజలు ఆరాధించేవారని గాథాసప్తశతి పేర్కొంది. చెట్లు, పుట్టలు, సర్పాలను కూడా ఆరాధించేవారు. శాతవాహనుల కాలానికి చెందిన (క్రీ.పూ.2 శతాబ్దం) గుడిమల్లం శివలింగాన్ని (చిత్తూరు జిల్లా) దేశంలోనే అతి ప్రాచీనమైందిగా గుర్తించారు. అనార్యులు, అటవిక తెగలను బ్రాహ్మణ సమాజంలోకి స్వీకరించడానికి వ్రత్సష్టోమ వంటి యజ్ఞాలు నిర్వహించేవారు.

బౌద్ధ మతం
క్రీ.పూ. రెండో శతాబ్దం నుంచి క్రీ.శ. మూడో శతాబ్దం వరకు పశ్చిమ, తూర్పు దక్కను ప్రాంతాల్లో బౌద్ధం విశేష ఆదరణ పొందింది. స్థూపాలు, చైత్య గృహాలు (ప్రార్థనా స్థలాలు), విహారాలు (వసతులు) వెలిశాయి. శాతవాహన రాజు కృష్ణుడు (కన్హ) బౌద్ధ భిక్షువుల కోసం నాసిక్‌లో గుహాలయాన్ని నిర్మించాడు. గౌతమీ బాలశ్రీ, రెండో పులోమావి, కార్లై (మహారాష్ర్ట)లో మహా సాంఘీకులకు గుహదానం చేశారు. శక రాజైన రుషభదత్తుడు గోవర్థనాహారలో గుహ నిర్మాణానికి బౌద్ధ సన్యాసులకు నాలుగువేల కార్షాపణులు (వెండినాణేలు) దానం చేశాడు. నాసిక్, కార్లై, కన్హేరి, కుడ, భాజా, బేడ్సా, అజంతా వంటి గుహలను దక్కన్ పశ్చిమ ప్రాంతంలో నిర్మించారు. తూర్పు తీరంలో అమరావతి, భట్టిప్రోలు, జగ్గయ్యపేట, గుంటుపల్లి, శాలిహుండం (శ్రీకాకుళం జిల్లా), రామతీర్థం (విజయనగరం జిల్లా), అనకాపల్లిలో బుద్ధన్న కొండలు వంటి అనేక బౌద్ధవాస్తు నిర్మాణాలు వెలిశాయి. బౌద్ధంలో అనేక శాఖలున్నాయి. వీటిలో అంధక శాఖ (ఆంధ్రా), బాదనీయ శాఖ (నాసిక్), మహా సాంఘికులు (కార్లై), చైత్యకులు (అమరావతి), పూర్వ- అపరశైలీయులు (నాగార్జున కొండ) ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ఆంధ్ర దేశంలో అతి ప్రాచీన స్థూపం భట్టిప్రోలు (గుంటూరు జిల్లా)లో ఉంది. వీరికాలంలో శ్రీ పర్వతం (నాగార్జున కొండ) ప్రముఖ విద్యాకేంద్రంగా వెలుగొందింది. పశ్చిమగోదావరి జిల్లాలోని గుంటుపల్లి గుహాలయం శాతవాహనుల కాలం నాటిదే. ఆ కాలంలో ప్రబలిన మహాసాంఘిక వాదానికి మరో పేరే చైత్యక వాదం.
Published date : 25 Jul 2016 03:46PM

Photo Stories