Madras Day: ఆగస్టు 22వ తేదీ ‘మద్రాస్ డే’.. నేటితో 385 ఏళ్లు పూర్తి

దక్షిణాది రాష్ట్రాలలోని ప్రముఖ నగరాలలో చెన్నై ఒకటి.

ఈ నగరం భిన్న సంస్కృతులకు ప్రతిబింబంగా నిలుస్తుంది. భారతీయతకు చిహ్నంగానూ ఈ నగరం పేరొందింది. ప్రతి సంవత్సరం ఆగస్టు 22వ తేదీ ‘మద్రాస్ డే’ నిర్వహిస్తుంటారు.
 
తమిళనాడు రాజధాని మద్రాసును ఇప్పుడు చెన్నై అని పిలుస్తున్నారు. మద్రాసు ఏర్పడి నేటికి(2024, ఆగస్టు 22) 385 ఏళ్లు పూర్తయ్యాయి. 1639 ఆగస్టు 22వ తేదీ తమిళనాడు రాజధాని మద్రాసుకి బ్రిటీష్ ‘ఈస్ట్ ఇండియా కంపెనీ’ పునాది రాయి వేసింది. అప్పట్లో దీనిని ‘మద్రాసు’ అని పిలిచేవారు. దాదాపు 70 లక్షల జనాభా కలిగిన ఈ నగరం ప్రపంచంలోనే 31వ అతిపెద్ద నగరంగా గుర్తింపు పొందింది. అయితే చరిత్రకారులు తెలిపిన వివరాల ప్రకారం ఈ నగరం రెండు వేల ఏళ్ల క్రితం నాటిది.

రెండవ శతాబ్దంలో ఈ ప్రాంతం చోళ సామ్రాజ్యంలో భాగంగా ఉంది. తోడై మండల ప్రావిన్స్‌లో మద్రాసు పట్టణం అనే చిన్న గ్రామం ఉండేది. 1639 ఆగస్టు 22వ తేదీ సెయింట్ ఫోర్ట్ జార్జ్ నిర్మాణంతో ఆధునిక మద్రాస్ ఉనికిలోకి వచ్చింది. దీని తరువాత ఈస్ట్ ఇండియా కంపెనీ చుట్టుపక్కల ఉన్న చిన్న గ్రామాలను కూడా మద్రాసులో విలీనం చేసింది. 1639లో ఈస్ట్ ఇండియా కంపెనీ కోరమాండల్ తీరంలోని చంద్రగిరిలో విజయనగర రాజు పెద వెంకట రాయల నుంచి కొంత భూమిని కొనుగోలు చేసింది. 

World Photography Day: ఆగస్టు 19వ తేదీ ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం

ఈ నేలపైనే ఆధునిక మద్రాసు పుట్టింది. ఇది వలస కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా మారింది. నాటి రోజుల్లో బ్రిటీష్‌వారు మద్రాసు గ్రామాన్ని ఆ పక్కనే ఉన్న చెన్నపట్టణాన్ని కలిపి మద్రాసుగా పిలుస్తూ వచ్చారు. అయితే నాటి రోజుల్లో స్థానికులు మద్రాసును చెన్న పట్టణం లేదా చెన్నపురి అని పిలిచేవారు. ఈ నేపధ్యంలోనే 1996 ఆగస్టులో అప్పటి ప్రభుత్వం మద్రాసును అధికారికంగా ‘చెన్నై’గా మార్చింది.

ప్రతి సంవత్సరం ఆగస్టు 22వ తేదీ తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో ‘మద్రాస్ డే’ను నిర్వహిస్తుంటారు. 1939లో మద్రాసు చరిత్రపై అధ్యయనం చేసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో చరిత్రకారులు, ప్రొఫెసర్లు సభ్యులుగా ఉన్నారు. 2004 నుంచి ‘చెన్నై హెరిటేజ్ ఫౌండేషన్’ మద్రాసు దినోత్సవాన్ని నిర్వహిస్తూవస్తోంది. చారిత్రక వారసత్వాన్ని  పరిరక్షించేందుకే ఈ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తుంటారు.

World Organ Donation Day: ఆగస‍్టు 13వ తేదీ ప్రపంచ అవయవ దాన దినోత్సవం..

#Tags