SI Jobs 2023 : ఎస్‌ఐ నియామక ప్రక్రియకు బ్రేక్‌.. కార‌ణం ఇదే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ఎస్సై పోస్టుల భర్తీకి చేపట్టిన నియామక ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌ సివిల్‌, రిజర్వ్ విభాగాల్లోని 411 పోస్టుల భర్తీకి ఈ ఏడాది పోలీస్ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసిన విష‌యం తెల్సిందే. అయితే.. ఎస్‌ఐ నోటిఫికేషన్ నియామ‌కం ప్రక్రియపై ఏపీ రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది.

ఈ నియామకాల్లో అన్యాయం జరిగిందని పలువురు అభ్యర్థులు హైకోర్టు కోర్టును ఆశ్రయించారు. గతంలో అర్హులైన వారిని, ప్రస్తుతం అనర్హులుగా ప్రకటించారని పిటిషన్‌ వేశారు. గతంలో అర్హులైన వారు ప్రస్తుతం అనర్హులు ఎలా అవుతారని పోలీస్ నియ‌మాక‌ బోర్డును జడ్జి ప్రశ్నించారు. అలాగే పిటిషనర్ వాదనలతో ఏకీభవించి ఉన్నత న్యాయస్థానం ఎస్‌ఐ నోటిఫికేషన్‌పై స్టే విధించింది.

రాష్ట్రంలో ఫిజికల్ టెస్ట్, రాతపరీక్ష పూర్తయి 35 వేల మంది అభ్యర్థులను ఫలితాలు కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా హైకోర్టు నిర్ణయంతో వీరంతా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఫ‌లితాల విడుద‌ల మాత్రం..

ప్రాథమిక రాత పరీక్షకు 1.51 లక్షల మంది అభ్యర్థులు హాజరుకాగా.. వీరిలో 57 వేల మందికిపైగా అర్హత సాధించారు. అనంతరం వీరికి ఫిజికల్ ఈవెంట్లు నిర్వహించారు. ఈ టెస్ట్‌ల్లో దాదాపు 35 వేల మంది పురుషులు, మహిళలు అర్హత సాధించారు. వీరికి గత నెల 14, 15 తేదీల్లో మెయిన్ పరీక్షలు నిర్వహించగా.. 30 వేల మంది మాత్రమే హాజరయ్యారు. ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీని అక్టోబరు 15న పోలీసు నియామక మండలి విడుదల చేసింది. ఆన్సర్ కీపై అక్టోబరు 18 వరకు అభ్యంతరాలు స్వీకరించారు. ఫైనల్ కీతోపాటు మెయిన్ పరీక్షల ఫలితాలను వెల్లడించాల్సి ఉంది. ఏపీ రాష్ట్ర హైకోర్టు స్టే విధించ‌డంతో ఈ ఫ‌లితాల విడుద‌ల కొద్దిగా ఆలస్యం అయ్యే అవ‌కాశం ఉంది.

#Tags