Skip to main content

భార‌త్‌లో నా తండ్రి ఏడాది జీతం అంత ఈ ఒక్క దానికే వెచ్చించారు : గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్

న్యూఢిల్లీ: విద్యాభ్యాసం పూర్తి చేసుకుని భయటి ప్రపంచంలోకి అడుగుపెడుతున్న గ్రాడ్యుయేట్లు ఆశావహంగాను, కొత్త విషయాలు తెలుసుకోవడంపై ఆసక్తిగాను ఉండాలని టెక్ దిగ్గజం గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ సూచించారు.
అంతే కాకుండా కొంత అసహనంగా కూడా ఉండాలని, దాన్నుంచే కొత్త సాంకేతిక విప్లవం రాగలదని ఆయన పేర్కొన్నారు. 2020 గ్రాడ్యుయేట్ల స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పిచాయ్ ఈ విషయాలు తెలిపారు.

మీరెవరూ ఊహించి ఉండరు..
ఈ స్నాతకోత్సవం ఇలా జరుగుతుందని మీరెవరూ ఊహించి ఉండరు. మీరు వేడుకగా జరుపుకోవడానికి బదులు కోల్పోయిన అవకాశాలు, తల్లకిందులైన ప్రణాళికల గురించిన ఆందోళనతో జరుపుకోవాల్సి వస్తోందని మీరు బాధపడుతూ ఉండొచ్చు. ఇలాంటి కష్టకాలంలో ఆశావహంగా ఉండటం కష్టమే. కానీ ఆశావహంగా ఉండగలిగితే, ఈ ఏడాది గ్రాడ్యుయేట్లయిన మీరు కొత్త మార్పులకు శ్రీకారం చుట్టగలరు. చరిత్రలో నిల్చిపోగలరు అని సుందర్ చెప్పారు.

పురోగతి సాధించాలంటే కాస్త అసహనం వీడాలి..
ఒక తరం సాధించిన పురోగతి మరో తరానికి పునాదిరాయి కాగలదని సుందర్ తెలిపారు. నేటి యువత ప్రపంచాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. పురోగతి సాధించాలంటే కాస్త అసహనం కూడా ఉండాలన్నారు. కొన్ని టెక్నాలజీ సంబంధిత విషయాలు మీకు విసుగు తెప్పించవచ్చు. అసహనానికి గురిచేయొచ్చు. ఆ అసహనాన్ని కోల్పోవద్దు. దాన్నుంచే కొత్త సాంకేతిక విప్లవం సృష్టి జరగొచ్చు, మా తరం కనీసం కలలో కూడా ఉహించని కొత్తవన్నీ మీరు నిర్మించవచ్చేమో. కాబట్టి అసహనంగా ఉండండి. ప్రపంచానికి అవసరమైన పురోగతి దాన్నుంచే వస్తుంది అని సుందర్ పేర్కొన్నారు.

నేనూ సవాళ్లు ఎదుర్కొన్నా..
గూగుల్ సీఈవో స్థాయికి ఎదిగే క్రమంలో తానూ పలు సవాళ్లు ఎదుర్కొన్నానని ఈ సందర్భంగా సుందర్ చెప్పారు. తన చిన్నతనంలో టెక్నాలజీ పెద్దగా అందుబాటులో ఉండేది కాదని, కానీ ప్రస్తుత తరం పిల్లలు కంప్యూటర్లతోనే పెరుగుతున్నారన్నారు. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదివేందుకు 27 ఏళ్ల కిందట తాను అమెరికా వెళ్లే క్రమంలో తన విమాన టికెట్ కోసం తన తండ్రి ఆయన ఏడాది జీతంతో సమానమైన మొత్తం వెచ్చించారని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ గుర్తుచేసుకున్నారు. తన జీవితంలో తొలి విమాన ప్రయాణం అదేనని చెప్పుకొచ్చారు. కాలిఫోర్నియా వచ్చిన తర్వాత అక్కడి పరిస్థితులు తాను ఊహించిన విధంగా లేవని అన్నారు. అమెరికా అత్యంత ఖరీదైన ప్రాంతమని అప్పట్లో ఇంటికి ఫోన్ చేయాలంటే నిమిషానికి రెండు డాలర్లు ఖర్చయ్యేవని, బ్యాగ్ కొనాలంటే భారత్లో తన తండ్రి నెల జీతం అంత మొత్తం వెచ్చించాల్సి ఉండేదని తాను ఎదుర్కొన్న అనుభవాలను పంచుకున్నారు. నన్ను అక్కడ (భారతదేశం) నుంచి ఇక్కడి దాకా (అమెరికా) తీసుకొచ్చినది కేవలం అదృష్టం ఒక్కటే కాదు. టెక్నాలజీ అంటే నాకున్న అమితాసక్తి, కొత్తవి నేర్చుకోవాలనే అభిలాష కూడా ఇందుకు కారణం అని సుందర్ తెలిపారు.
Published date : 09 Jun 2020 01:13PM

Photo Stories