Skip to main content

అక్టోబర్ 2019 ద్వైపాక్షిక సంబంధాలు

కర్తార్‌పుర్ కారిడార్‌పై భారత్-పాక్ ఒప్పందం
Current Affairs కర్తార్‌పుర్ కారిడార్‌ను వాడుకలోకి తీసుకొచ్చేందుకు భారత్, పాకిస్తాన్‌లు అక్టోబర్ 24న చారిత్రక ఒప్పందం చేసుకున్నాయి. కర్తార్‌పుర్ జీరో పాయింట్ వద్ద కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి ఎస్.సి.ఎల్.దాస్, పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయ అధికార ప్రతినిధి మహమ్మద్ ఫైజల్‌లు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. సిక్కుల పవిత్ర యాత్రా స్థలాలైన పాకిస్తాన్‌లోని కర్తార్‌పూర్ సాహిబ్ గురుద్వారా, భారత్‌లోని గురుదాస్‌పూర్ డేరాబాబా నానక్ గురుద్వారాను కర్తార్‌పూర్ కారిడార్ కలుపుతుంది. ఈ కారిడార్ ద్వారా భారత్‌లో సిక్కు యాత్రికులు వీసా అనుమతులు లేకుండా కర్తార్‌పూర్ సాహిబ్ గురుద్వారాను సందర్శించవచ్చును.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కర్తార్‌పుర్ కారిడార్‌పై ఒప్పందం
ఎప్పుడు : అక్టోబర్ 24
ఎవరు : భారత్, పాకిస్తాన్
ఎక్కడ : కర్తార్‌పుర్ జీరో పాయింట్
ఎందుకు : కర్తార్‌పుర్ కారిడార్‌ను వాడుకలోకి తీసుకొచ్చేందుకు

వెనెజువెలా అధ్యక్షుడితో వెంకయ్య భేటీ
18వ అలీనోద్యమ దేశాధినేతల(నాన్ అలైన్‌డ్ మూవ్‌మెంట్-నామ్) సదస్సు సందర్భంగా భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోతో భేటీ అయ్యారు. ఈ సమావేశం సందర్భంగా ద్వైపాక్షిక బంధాల బలోపేతం, ప్రాంతీయ మరియు ప్రపంచ సమస్యలు వంటి అంశాలపై ఇరువురు నేతలు చర్చలు జరిపారు. ‘నేటి ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లు - బాన్‌డుంగ్(ఇండోనేషియా) సూత్రాలు అమలు’ అనే ఇతివృత్తంతో అజర్‌బైజాన్ రాజధాని బాకులో అక్టోబర్ 25, 26 తేదీల్లో నామ్ సదస్సును నిర్వహించారు.
మరోవైపు అగ్ని ఆరాధకుల మందిరంగా ప్రసిద్ధికెక్కిన బాకులోని పురాతన అతెష్గాను వెంకయ్య అక్టోబర్ 26న సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... నిత్యం జ్వలించే ఈ అగ్ని పీఠం, రాతి గదులతో కూడిన ఆలయం భారత్- అజర్‌బైజాన్ దేశాల ప్రజల సాంస్కృతిక చిహ్నంగా వెలుగొందుతోందన్నారు. ప్రాచీనమైన ఈ ఆలయంలో గణేశుడు, సరస్వతి మంత్రాలను సంస్కృతంలో వినడం ఎంతో ఆనందదాయకమన్నారు. గోడలపై చెక్కిన చిత్రాలు విభిన్న మతాల మధ్య సారూప్యతను తెలియజేస్తున్నాయన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోతో భేటీ
ఎప్పుడు : అక్టోబర్ 26
ఎవరు : భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
ఎక్కడ : బాకు, అజర్‌బైజాన్

ప్రధాని మోదీతో ఈయూ ఎంపీలు భేటీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో యూరోపియన్ యూనియన్(ఈయూ)కు చెందిన 28 మంది పార్లమెంట్ సభ్యులు భేటీ అయ్యారు. న్యూఢిల్లీలో అక్టోబర్ 28న జరిగిన ఈ సమావేశంలో మోదీ మాట్లాడుతూ... ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారిపై తక్షణ చర్యలు అవసరమని పేర్కొన్నారు. కశ్మీర్‌లో పర్యటించడం ద్వారా జమ్మూ, కశ్మీర్, లదాఖ్ ప్రాంతాల సాంస్కృతిక, మతపరమైన వైవిధ్యంతోపాటు అక్కడ జరుగుతున్న అభివృద్ధి, పాలనపరమైన అంశాలపై అవగాహన ఏర్పడుతుందన్నారు.
మరోవైపు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తోనూ ఈయూ ఎంపీల బృందం సమావేశమైంది. ఈ సమావేశంలో జమ్మూకశ్మీర్‌లో సీమాంతర ఉగ్రవాదం ఫలితంగా ఉత్పన్నమైన పరిస్థితిని ఈయూ ప్రతినిధి బృందానికి దోవల్ వివరించారు. ఈయూ బృందం అక్టోబర్ 29న కశ్మీర్‌లో పర్యటించి, ఆర్టికల్ 370 రద్దు అనంతరం ఏర్పడిన పరిస్థితులను ప్రజలను అడిగి తెలుసుకోనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ
ఎప్పుడు : అక్టోబర్ 28
ఎవరు : యూరోపియన్ యూనియన్(ఈయూ)కు చెందిన 28 మంది పార్లమెంట్ సభ్యులు
ఎక్కడ : న్యూఢిల్లీ

జమ్మూకశ్మీర్‌లో ఈయూ బృందం పర్యటన
జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి 23 మందితో కూడిన యూరోపియన్ యూనియన్ (ఈయూ) ఎంపీల బృందం జమ్మూకశ్మీర్‌లో పర్యటించింది. అక్టోబర్ 29న కశ్మీర్‌లో పర్యటించిన ఈయూ బృందం స్థానిక ప్రజలతో, అధికారులతో మాట్లాడి అక్కడి పరిస్థితులను తెలుసుకుంది. ఆర్టికల్ 370రద్దు విషయంలో భారత్ తీసుకున్న నిర్ణయాన్ని ఎంపీల బృందం సమర్ధించింది. కశ్మీర్ లోయలోని ప్రజలు శాంతి, అభివృద్ధిని కోరుకుంటున్నట్లు వెల్లడించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జమ్మూకశ్మీర్‌లో పర్యటన
ఎప్పుడు : అక్టోబర్ 29
ఎవరు : 23 మందితో కూడిన యూరోపియన్ యూనియన్ (ఈయూ) ఎంపీల బృందం
ఎందుకు : కశ్మీర్‌లోని పరిస్థితులను తెలుసుకునేందుకు

సౌదీ రాజు సల్మాన్‌తో ప్రధాని మోదీ భేటీ
సౌదీ అరేబియా రాజు సల్మాన్ బిన్ అబ్దుల్‌అజీజ్ అల్ సౌద్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. సౌదీ అరేబియా రాజధాని రియాధ్‌లో అక్టోబర్ 29న జరిగిన ఈ సమావేశంలో ఆయిల్ అండ్ గ్యాస్, తీర ప్రాంత భద్రత, టెక్నాలజీ, వాణిజ్యం, పెట్టుబడులు వంటి రంగాల్లో సహకారంపై ఇరువురు నేతలు చర్చలు జరిపారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానిని సహించరాదని సల్మాన్-మోదీ తీర్మానించారు. ఈ సందర్భంగా భారత్-సౌదీ మధ్య స్ట్రాటెజిక్ పార్ట్‌నర్‌షిప్ కౌన్సిల్ ఒప్పందం జరిగింది. అలాగే సౌదీ అరేబియాలో రూపే కార్డు ప్రవేశపెట్టడానికి ఉద్దేశించిన ఒప్పందంపై సంతకాలు జరిగాయి.
మరోవైపు సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్, జోర్డాన్ రాజు రెండో అబ్దుల్లాతోనూ మోదీ సమావేశమయ్యారు. ఉగ్రవాదంపై పోరు సహా భద్రతకు సంబంధించిన అంశాల్లో భారత్, సౌదీ అరేబియాల మధ్య సహకారం విజయవంతంగా ముందుకు సాగుతోందని స్థానిక పత్రిక ‘అరబ్ న్యూస్’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సౌదీ అరేబియా రాజు సల్మాన్ బిన్ అబ్దుల్‌అజీజ్ అల్ సౌద్‌తో భేటీ
ఎప్పుడు : అక్టోబర్ 29
ఎవరు : భారత ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : రియాద్, సౌదీ అరేబియా
ఎందుకు : ఆయిల్ అండ్ గ్యాస్, తీర ప్రాంత భద్రత, టెక్నాలజీ, వాణిజ్యం, పెట్టుబడులు వంటి రంగాల్లో సహకారంపై చర్చలు జరిపేందుకు

వియన్నా ఒప్పందాన్ని పాక్ ఉల్లఘించింది : ఐసీజే
పాకిస్తాన్ చెరలో ఉన్న భారత మాజీ నేవీ అధికారి కులభూషణ్ జాదవ్ కేసులో పాకిస్తాన్‌ను అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) మరోసారి తీవ్రంగా తప్పుబట్టింది. వియన్నా ఒప్పందాన్ని పాకిస్తాన్ ఉల్లంఘించిందంటూ ఐక్యరాజ్య సమితి సాధారణ సభకు ఐసీజే అధ్యక్షుడు అబ్దుల్‌ఖావీ యూసఫ్ విన్నవించారు. ఐరాస సాధారణ సభకు అక్టోబర్ 31న సమర్పించిన తన నివేదికలో పూర్తి వివరాలను అందించారు. 2019, జులై 17న ఇచ్చిన తీర్పులో ఇదే విషయాన్ని తెలిపామన్న యూసఫ్.. వియన్నా ఒప్పందంలోని ఆర్టికల్ 36ను పాకిస్తాన్ ఉల్లంఘించిందని తెలిపారు.
గూఢచర్యం ఆరోపణలపై కులభూషణ్ జాదవ్‌ను 2016లో పాకిస్తాన్ అరెస్ట్ చేసింది. అనంతరం 2017లో పాక్ మిలిటరీ కోర్టు ఆయనకు మరణశిక్ష విధించగా.. నెదర్లాండ్‌‌సలోని ద హేగ్‌లో ఉన్న అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత్ సవాల్ చేసింది. ఈ కేసులో వాదనల అనంతరం ఉరిశిక్షను పునఃసమీక్షించాలంటూ 2019, జులై 17న ఐసీజే తీర్పు ఇచ్చింది. ఆయన నిర్బంధాన్ని తప్పుబట్టిన కోర్టు.. తక్షణం దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని పాక్‌ను ఆదేశించింది.
కులభూషణ్‌ జాదవ్‌ కేసుకు సంబంధించిన మరిన్ని సమగ్ర కథనాల కోసం ఈ క్రింది లింక్‌పై క్లిక్‌ చేయండి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : వియన్నా ఒప్పందాన్ని పాకిస్తాన్ ఉల్లంఘించింది
ఎప్పుడు : అక్టోబర్ 30
ఎవరు : అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) అధ్యక్షుడు అబ్దుల్‌ఖావీ యూసఫ్
ఎక్కడ : భారత మాజీ నేవీ అధికారి కులభూషణ్ జాదవ్ కేసులో

మెక్సికో నుంచి 311 మంది భారతీయులు వెనక్కి
Current Affairs సరైన అనుమతులు లేకుండా తమ దేశంలో ఉంటున్న 311 మంది భారతీయులను మెక్సికో అధికారులు వెనక్కి పంపించారు. ఈ మేరకు ఈ 311 మందిని టొలుకా విమానాశ్రయం నుంచి ప్రత్యేక బోయింగ్ 747 విమానంలో భారత్‌కు తిప్పి పంపినట్లు మెక్సికన్ జాతీయ వలసల సంస్థ (ఐఎన్‌ఎమ్) అక్టోబర్ 17న ప్రకటించింది. మెక్సికన్ సరిహద్దుల నుంచి పెరుగుతున్న వలసలను నివారించేందుకు ఆ దేశంపై టారిఫ్‌ల భారం పెంచుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరించిన నేపథ్యంలో మెక్సికో ఈ నిర్ణయం తీసుకుంది.

ఫిలిప్పిన్స్ అధ్యక్షుడితో రాష్ట్రపతి కోవింద్ భేటీ
ఫిలిప్పిన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెర్టేతో భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ భేటీ అయ్యారు. ఫిలిప్పిన్స్ రాజధాని మనీలాలో అక్టోబర్ 18న జరిగిన ఈ సమావేశంలో రక్షణ, వాణిజ్య సంబంధాలు, సముద్రతీర భాగస్వామ్యం, ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడం వంటి అంశాలపై ఇరువురు నేతలు విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు. అనంతరం తీరప్రాంతం, భద్రత, పర్యాటకం, శాస్త్ర, సాంకేతిక, సాంస్కృతిక రంగాలకు సంబంధించిన నాలుగు ఒప్పందాలపై సంతకాలు చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఫిలిప్పిన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెర్టేతో భేటీ
ఎప్పుడు : అక్టోబర్ 18
ఎవరు : భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
ఎక్కడ : మనీలా, ఫిలిప్పిన్స్

ప్రధాని మోదీ టర్కీ పర్యటన రద్దు
ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల అధికారిక టర్కీ పర్యటన రద్దయి్యంది. 2019, సెప్టెంబర్‌లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ వేదికగా జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దుపై టర్కీ అధ్యక్షుడు తుయి్యప్ ఎర్డోగన్ విమర్శలు చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు పారిస్‌లోని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ సమావేశంలోనూ పాక్‌కు మద్దతుగా ఎర్డోగన్ చేసిన వ్యాఖ్యలు కూడా పర్యటనకు రద్దుకు కారణాలుగా తెలుస్తోంది.
2019, అక్టోబర్‌లో జరగనున్న పెట్టుబడుల సదస్సులో పాల్గొనేందుకు సౌదీ అరేబియాకు వెళ్లనున్న మోదీ.. అక్కడి నుంచి టర్కీ రాజధాని అంకారా వెళ్లాల్సి ఉంది. అయితే తాజా నిర్ణయంతో మోదీ కేవలం సౌదీలో మాత్రమే పర్యటించనున్నారు. ఈ వార్తలపై భారత విదేశాంగ శాఖ స్పందిస్తూ అసలు మోదీ టర్కీ పర్యటన ఖరారే కాలేదని, అలాంటప్పుడు రద్దయ్యే అవకాశమే లేదని పేర్కొంది.

పీఓకేలోని ఉగ్రస్థావరాలపై భారత్ కాల్పులు
పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)లోని నీలం లోయలో ఉన్న ఉగ్రస్థావరాలపై భారత్ అక్టోబర్ 20న తీవ్రస్థాయిలో కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో జైషే మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రసంస్థలకు చెందిన దాదాపు 35 మంది ఉగ్రవాదులు మృతి చెందారని భారత ఆర్మీ వెల్లడించింది. అలాగే మూడు ఉగ్రస్థావరాలు, ఆ స్థావరాలకు రక్షణ కల్పిస్తున్న పాక్ ఆర్మీ పోస్ట్‌లు ధ్వంసమయ్యాయని తెలిపింది. భారత్ దాడులు చేసిన సమయంలో ఒక్కో ఉగ్రస్థావరంలో 10 నుంచి 15 మంది ఉగ్రవాదులు భారత్‌లోని కశ్మీర్లోకి చొరబడేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొంది.
ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు వీలుగా అక్టోబర్ 19న జమ్మూకశ్మీర్లోని తంగధర్ సెక్టార్లో నియంత్రణ రేఖ వెంబడి ఉన్న భారత ఆర్మీ పోస్టులపై పాక్ కాల్పులకు తెగబడింది. ఆ కాల్పుల్లో ఇద్దరు భారత జవాన్లు పదమ్ బహదూర్ శ్రేష్ఠ, గమిల్ కుమార్ శ్రేష్ఠ, ఒక పౌరుడు మృతి చెందారు. ప్రతీకారంగా భారత్ తాజా కాల్పులు జరిపింది.
తాజా ఘటనపై భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ స్పందిస్తూ... ‘ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు భారత్ కాల్పుల్లో 6 నుంచి 10 మంది పాక్ జవాన్లు, అంతే సంఖ్యలో ఉగ్రవాదులు చనిపోయారు’ అని అన్నారు. మరోవైపు పాక్ మిలటరీ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ స్పందిస్తూ... భారత్ కాల్పుల్లో ఐదుగురు పౌరులు చనిపోయారని తెలిపారు. పాక్ ఆర్మీ కాల్పుల్లో 9 మంది భారత జవాన్లు చనిపోగా, రెండు భారత బంకర్లు ధ్వంసమయ్యాయన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పీఓకేలోని ఉగ్రస్థావరాలపై భారత్ కాల్పులు
ఎప్పుడు : అక్టోబర్ 20
ఎక్కడ : నీలం లోయ, పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)
ఎందుకు : పాక్ చేసిన కాల్పులక ప్రతీకారంగా

భారత్‌కు పాకిస్తాన్ తపాలా సేవలు బంద్
జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేస్తూ కేంద్రం 2019, ఆగస్టులో 5వ తేదీన తీసుకున్న నిర్ణయానికి నిరసనగా అదే నెల 27 నుంచి భారత్‌తో పాక్ తపాలా సేవలను నిలిపివేసింది. రెండు దేశాల మధ్య తపాలా సర్వీసులు నిలిచిపోయినట్లు కేంద్ర సమాచార శాఖ మంత్రి రవిశంకర్ అక్టోబర్ 21న ధ్రువీకరించారు. భారత్‌కు ముందస్తు సమాచారం ఇవ్వకుండానే పాకిస్తాన్ తపాలా సేవలను నిలిపివేసిందని తెలిపారు. ఈ నిర్ణయం ప్రపంచ తపాలా సంఘం నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. పాకిస్తాన్ చర్యకు బదులుగా భారత్ కూడా పాక్ మెయిళ్లను తీసుకోవడం బంద్ చేసిందన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్‌కు పాకిస్తాన్ తపాలా సేవలు బంద్
ఎప్పుడు : అక్టోబర్ 21
ఎవరు : కేంద్ర సమాచార శాఖ మంత్రి రవిశంకర్

మిరియం కాలేజీలో గాంధీ విగ్రహావిష్కరణ
ఫిలిప్పీన్స్ లోని మిరియం కాలేజీలో సెంటర్ ఫర్ పీస్ ఎడ్యుకేషన్ వద్ద నెలకొల్పిన మహాత్మా గాంధీ విగ్రహాన్ని భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అక్టోబర్ 20న ఆవిష్కరించారు. ఫిలిప్పీన్స్ పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో జరిగిన పౌర సన్మానంలోనూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోవింద్ మాట్లాడుతూ.. దేశాల మధ్యే కాకుండా వ్యక్తుల మధ్య కూడా ఘర్షణలు నెలకొన్నప్పుడు భారతీయ నాగరికత విలువలు శాంతి మార్గాన్ని చూపుతాయని చెప్పారు. భారత సంస్కృతిని వ్యాప్తి చేసేందుకు కృషి చేయాలని ప్రవాసులకు పిలుపునిచ్చారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ
ఎప్పుడు : అక్టోబర్ 21
ఎవరు : భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
ఎక్కడ : సెంటర్ ఫర్ పీస్ ఎడ్యుకేషన్, మిరియం కాలేజీ, ఫిలిప్పీన్స్

మహాబలిపురంలో జిన్‌పింగ్ -మోదీ భేటీ
Current Affairs మామల్లపురం(మహాబలిపురం)లో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, భారత ప్రధాని నరేంద్ర మోదీల మధ్య రెండో అనధికార భేటీ అక్టోబర్ 11,12వ తేదీల్లో జరిగింది. చెన్నై నుంచి ప్రత్యేక వాహన శ్రేణిలో మామల్లపురం వచ్చిన జిన్‌పింగ్‌కు మోదీ సాదర స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు నేతలు పల్లవ రాజులు నిర్మించిన అత్యద్భుత కట్టడాలను సందర్శించారు. సంప్రదాయ తమిళ వస్త్రధారణలో ఉన్న మోదీ.. జిన్‌పింగ్‌కు ప్రపంచ పురావస్తు నిర్మాణాలుగా యునెస్కో గుర్తింపు పొందిన ఆ శిల్పకళా సంపద చారిత్రక ప్రాధాన్యతను, పౌరాణిక ప్రాశస్త్యాన్ని, నిర్మాణ కౌశలాన్ని ఒక గైడ్ తరహాలో వివరించారు. అర్జునుడు తపస్సు చేసినట్లుగా భావిస్తున్న ప్రాంతంలో ఏకశిలపై నిర్మితమైన కట్టడాన్ని, పంచ రథ రాతి(పాండవ రథాలు) నిర్మాణాన్ని, శ్రీకృష్ణుడి వెన్నముద్ద బంతి(గుండ్రని పెద్దబండరాయి)ని సందర్శించారు. వీటి వివరాలను జిన్‌పింగ్ ఆసక్తిగా విన్నారు. అలాగే.. సముద్ర తీరంలో నిర్మితమైన శివ విష్ణు రాతి దేవాలయాన్ని సందర్శించారు.
రెండో రోజు (అక్టోబర్ 12న) ఇరువురు నేతలు, రెండు దేశాల ప్రతినిధి బృందాల మధ్య కీలక చర్చలు జరిగాయి. ఈ సదస్సులో భాగంలో మొత్తం ఆరు గంటల పాటు ఇరునేతలు ముఖాముఖి భేటీ అయ్యారు. భారత్-చైనా మధ్య సహకారం, పర్యాటక, వాణిజ్యం తదితర అంశాలపై మోదీ, జిన్‌పింగ్‌కు చర్చించుకున్నారు. రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులపై సరికొత్త విధానంలో చర్చలు జరపాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. ఈ చర్చల్లో భారత్ నుంచి ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, చైనా నుంచి వైస్ ప్రీమియర్ హు చుంగ్ హావా పాల్గొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, భారత ప్రధాని నరేంద్ర మోదీల మధ్య రెండో అనధికార భేటీ
ఎప్పుడు: అక్టోబర్ 11,12వ తేదీల్లో
ఎవరు: చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, భారత ప్రధాని నరేంద్ర మోదీ
ఎందుకు: భారత్-చైనా మధ్య సహకారం, పర్యాటక, వాణిజ్యం తదితర అంశాలపై
ఎక్కడ: మహాబలిపురం

సియెర్రా లియోన్ అధ్యక్షుడితో ఉపరాష్ట్రపతి భేటీ
సియెర్రా లియోన్ అధ్యక్షుడు జూలియస్ మాడా బయోతో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు భేటీ అయ్యారు. సియెర్రా లియోన్ రాజధాని ఫ్రీటౌన్‌లో అక్టోబర్ 13న జరిగిన ఈ సమావేశంలో వ్యవసాయం, ఆహార శుద్ధి, సమాచార సాంకేతిక రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. వ్యవసాయం కోసం సియోర్రా లియోన్‌కు రూ.212 కోట్ల రుణ వెసులుబాటు(క్రెడిట్ లైన్) కల్పిస్తున్నట్లు ఈ సందర్భంగా వెంకయ్య ప్రకటించారు. అలాగే 1000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపించనున్నట్లు పేర్కొన్నారు. సుహృద్భావ సూచికగా సియెర్రా లియోన్‌కు 1000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపించాలని భారత్ నిర్ణయించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సియెర్రా లియోన్ అధ్యక్షుడు జూలియస్ మాడా బయోతో భేటీ
ఎప్పుడు : అక్టోబర్ 13
ఎవరు : భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
ఎక్కడ : ఫ్రీటౌన్, సియెర్రా లియోన్

చెన్నైలో మోదీ-జిన్‌పింగ్ భేటీ
Current Affairs తమిళనాడు రాజధాని చెన్నైకి సూమారు 56 కి.మీ. దూరంలో ఉన్న మహాబలిపురంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భేటీ కానున్నారు. 2019, అక్టోబర్ 11-13 మధ్య జరగనున్న ఈ సమావేశంలో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, వాణిజ్య సంబంధాలు, అంతర్జాతీయ సమస్యలు తదితర కీలక అంశాలపై ఇరువురు నేతలు చర్చలు జరపనున్నారు. అలాగే ఆర్థిక మాంద్యం, అమెరికా - చైనా వాణిజ్య యుద్ధం, డోక్లాం వివాదం, హిందూ మహాసముద్రంలో చైనా నౌకల కదలికలు పెరగడం వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భేటీ
ఎప్పుడు : అక్టోబర్ 11-13
ఎక్కడ : మహాబలిపురం, తమిళనాడు

కర్తార్‌పూర్ ప్రారంభోత్సవానికి మన్మోహన్
భారత్, పాకిస్తాన్‌లను కలిపే కర్తార్‌పూర్ సాహిబ్ కారిడార్ ప్రారంభోత్సవానికి మాజీ ప్రధాని మన్మోహన్ హాజరుకానున్నారు. కారిడార్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని తొలి విడత సిక్కు యాత్రికులతో కలిసి పాక్‌లోని కర్తార్‌పూర్ గురుద్వారాకు వెళ్లాల్సిందిగా పంజాబ్ సీఎం అమరీందర్ కోరడంతో అందుకు మన్మోహన్ అంగీకరించారు. పాక్‌లోని లోథిలో సుల్తాన్‌పూర్‌లో జరిగే గురునానక్ 550 జయంతి ఉత్సవాలకు కూడా మన్మోహన్ హాజరుకానున్నారు.
సిక్కుల పవిత్ర యాత్రా స్థలాలైన పాకిస్తాన్‌లోని కర్తార్‌పూర్ సాహిబ్ గురుద్వారా, భారత్‌లోని గురుదాస్‌పూర్ డేరాబాబా నానక్ గురుద్వారాను కర్తార్‌పూర్ కారిడార్ కలుపుతుంది. ఈ కారిడార్ ద్వారా భారత్‌లో సిక్కు యాత్రికులు వీసా అనుమతులు లేకుండా కర్తార్‌పూర్ సాహిబ్ గురుద్వారాను సందర్శించవచ్చును. సిక్కు మత వ్యవస్థాపకుడు బాబా గురునానక్ 550వ జయంతి నవంబర్12న ఉన్న నేపథ్యంలో నవంబర్ 9న కర్తార్‌పూర్ కారిడార్‌ను ప్రారంభించాలని పాక్ నిర్ణయించింది.

సౌదీ యువరాజుతో అజిత్ దోవల్ భేటీ
సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్‌తో జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ భేటీ అయ్యారు. సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో అక్టోబర్ 2న జరిగిన ఈ సమావేశంలో దోవల్ కశ్మీర్ అంశంపై భారత ప్రభుత్వ వైఖరిని సౌదీ యువరాజుకి వివరించారు. అనంతరం ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతం వంటి విషయాలపై ఇరువురు నేతలు చర్చలు జరిపారు. కొన్ని రోజుల క్రితం పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సౌదీ యువరాజుతో సమావేశమయ్యారు. కశ్మీర్ అంశంలో తమకు మద్దతివ్వాలని ఆయన కోరారు. ఈ నేపథ్యంలో దోవల్ సౌదీ పర్యటన చేపట్టారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్‌తో భేటీ
ఎప్పుడు : అక్టోబర్ 2
ఎవరు : జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్
ఎక్కడ : రియాద్, సౌదీ అరేబియా

భారత్-బంగ్లాదేశ్ బిజినెస్ ఫోరంలో హసీనా
దేశరాజధాని న్యూఢిల్లీలో అక్టోబర్ 4న జరిగిన భారత్-బంగ్లాదేశ్ బిజినెస్ ఫోరంలో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హసీనా మాట్లాడుతూ... ‘మీరు (భారత్) ఎందుకు ఉల్లి ఎగుమతిని ఆపారో తెలీదు. కానీ ఇలాంటి పరిస్థితి వస్తే ముందే చెబితే బాగుండేది. మీరు హఠాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవడంతో మాకు ఇబ్బంది కలుగుతోంది. భవిష్యత్తులో మాత్రం ఇలాంటి పరిస్థితి వస్తే ముందే చెప్పండి’ అంటూ వ్యాఖ్యానించారు. అనంతరం మంత్రి పీయూష్ మాట్లాడుతూ.. కోల్‌కతా, ఖుల్నాల మధ్య నడుస్తున్న బంధన్ ఎక్స్‌ప్రెస్ రైలును, రెండు సార్లకు పెంచాలని భావిస్తున్నామన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్-బంగ్లాదేశ్ బిజినెస్ ఫోరం
ఎప్పుడు : అక్టోబర్ 4
ఎవరు : బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్
ఎక్కడ : న్యూఢిల్లీ

ప్రధాని మోదీతో బంగ్లాదేశ్ ప్రధాని భేటీ
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భేటీ అయ్యారు. న్యూఢిల్లీలో అక్టోబర్ 5న జరిగిన ఈ సమావేశంలో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, అస్సాంలో ఎన్నార్సీ ప్రచురణ ప్రక్రియ, రొహింగ్యా శరణార్థుల సమస్య వంటి అంశాలపై ప్రధానులిద్దరూ చర్చలు జరిపారు. అనంతరం రెండు దేశాల అధికారులు ఏడు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు. చర్చల సందర్భంగా ఇద్దరు ప్రధానులు వీడియో లింకేజీ ద్వారా.. బంగ్లాదేశ్ నుంచి ఎల్‌పీజీ గ్యాస్‌ను ఈశాన్య రాష్ట్రాలకు తరలించేందుకు ఉద్దేశించిన ప్రాజెక్టును, బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో నిర్మించిన వివేకానంద భవన్‌ను, ఖుల్నాలో స్కిల్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌ను ప్రారంభించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ
ఎప్పుడు : అక్టోబర్ 5
ఎవరు : బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా
ఎక్కడ : న్యూఢిల్లీ

భారత్‌కు స్విస్ బ్యాంకు ఖాతాదారుల జాబితా
స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో భారత పౌరుల ఖాతాల వివరాలతో కూడిన మొట్టమొదటి జాబితాను స్విట్జర్లాండ్ ప్రభుత్వం అక్టోబర్ 7న భారత్‌కు అందజేసింది. 2018లో కుదిరిన ఆటోమేటిక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్(ఏఈఓఐ) ఒప్పందం ప్రకారం ప్రస్తుతం మనుగడలో ఉన్న, 2018లో మూసివేసిన అకౌంట్ల వివరాలు ఈ జాబితాలో ఉన్నాయని స్విస్ ప్రభుత్వం తెలిపింది. రెండో జాబితాను 2020 సెప్టెంబర్‌లో అందజేస్తామని పేర్కొంది.
ఎఫ్‌టీఏలో భారత్ సభ్యత్వం
అంతర్జాతీయ ప్రమాణాలకు లోబడి ఆర్థిక లావాదేవీల సమాచారాన్ని పంచుకునేందుకు స్విట్జర్లాండ్ ప్రభుత్వ ఫెడరల్ టాక్స్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌టీఏ)తో ఒప్పందం కుదుర్చుకున్న 75 దేశాల్లో భారత్ కూడా ఒకటి. ఎఫ్‌టీఏ కింద 65 సభ్య దేశాలకు చెందిన 31 లక్షల అకౌంట్ల వివరాలను ఇప్పటి వరకు స్విస్ ప్రభుత్వం అందజేసింది. ఆయా దేశాల నుంచి 24 లక్షల మంది ఖాతాదారుల సమాచారాన్ని సేకరించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్‌కు స్విస్ బ్యాంకు ఖాతాదారుల జాబితా
ఎప్పుడు : అక్టోబర్ 7
ఎవరు : స్విట్జర్లాండ్ ప్రభుత్వం

భారత్‌కు తొలి రఫేల్ యుద్ధ విమానం
ఫ్రాన్స్ నుంచి భారత్‌కు తొలి రఫేల్ యుద్ధ విమానం అందింది. భారత వాయుసేన వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని అక్టోబర్ 8న ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో గల మిరిన్యాక్ వైమానిక స్థావరం వద్ద తొలి రఫేల్ విమానాన్ని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లాంఛనంగా అందుకున్నారు. శస్త్ర పూజ పేరుతో యుద్ధ విమానానికి పూజలు చేశారు. అనంతరం సుమారు 25 నిమిషాలపాటు రఫేల్ విమానంలో రాజ్‌నాథ్ చక్కర్లు కొట్టారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ మాట్లాడుతూ.. రఫేల్ యుద్ధ విమానాల చేరికతో భారతీయ వాయుసేన యుద్ధ సామర్థ్యం గణనీయంగా పెరిగిందని అన్నారు.
మొత్తం 36 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించిన ఒప్పందంపై భారత్, ఫ్రాన్స్ లు 2016 సెప్టెంబరులో సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం విలువ రూ.58 వేల కోట్లు. ఫ్రాన్స్ కు చెందిన డసో ఏవియేషన్ సంస్థ రఫేల్ విమానాలను తయారుచేస్తుంది. మొత్తం 36 రఫేల్ విమానాలలో మొదటివిడత 18 విమానాలు 2021 నాటికి, మిగిలినవి 2022 ఏప్రిల్, మే నెల నాటికి అందుతాయని అంచనా. రఫేల్ యుద్ధ విమానాల్లో భారత వాయుసేన నిర్దిష్టంగా ప్రతిపాదించిన 13 ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేశారు. రఫేల్ ఒప్పందంలో భారతీయ వాయుసేన ప్రస్తుత అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్.కె.భదౌరియా కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో తొలి విమానం తోక భాగంపై ‘ఆర్‌బీ 01’ అని రాశారు.
ఫలవంతమైన చర్చలు..
ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లేతో రాజ్‌నాథ్ సింగ్ ఫ్రెంచ్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ కేంద్ర కార్యాలయంలో అక్టోబర్ 9న చర్చలు జరిపారు. ఈ చర్చలు ఫలవంతమైనట్లు రాజ్‌నాథ్ తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్‌కు తొలి రఫేల్ యుద్ధ విమానం అందజేత
ఎప్పుడు : అక్టోబర్ 8
ఎవరు : డసో ఏవియేషన్ సంస్థ, ఫ్రాన్స్
ఎక్కడ : మిరిన్యాక్ వైమానిక స్థావరం, పారిస్, ఫ్రాన్స్
Published date : 30 Oct 2019 06:04PM

Photo Stories