ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ (APREIS) నడుపుతున్న పాఠశాలల్లో 2022–23 విద్యా సంవత్సరానికి 5వ తరగతిలో ప్రవేశానికై అర్హత కలిగిన విద్యార్థులను ప్రభుత్వంచే నియమించబడిన కమిటీ సభ్యుల సమక్షంలో ఆటోమేటెడ్ ర్యాండమ్ పద్ధతి ద్వారా ఎంపిక చేసినట్లు సంస్థ రాష్ట్ర కార్యదర్శి ఆర్.నరసింహారావు తెలిపారు.
5వ తరగతి ప్రవేశాల జాబితా విడుదల
ఈ మేరకు గుంటూరులోని సంస్థ రాష్ట్ర కార్యాలయం నుంచి జూన్ 13న ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని 38 సాధారణ, 12 మైనార్టీ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశాలకు సంబంధించి ఎంపిక చేసిన విద్యార్థుల జాబితాలను ఆయా పాఠశాలలకు పంపినట్లు పేర్కొన్నారు. ఎంపికైన విద్యార్థుల సెల్ఫోన్లకు జూన్ 14న సాయంత్రంలోపు సమాచారాన్ని పంపుతామని, సమాచారాన్ని అందుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు సంబంధిత ధ్రువపత్రాలతో జూన్ 20 లోపు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులను సంప్రదించి విద్యార్థుల ప్రవేశాలను నిర్ధారించుకోవాలని సూచించారు. 20వ తేదీ అనంతరం మిగిలిన ఖాళీలను భర్తీ చేసేందుకు రెండో జాబితా విడుదల చేస్తామని తెలిపారు.