Skip to main content

World Shooting : భారత్ కు 14వ పతకం

World Shooting 14th medal for India
World Shooting 14th medal for India

దక్షిణ కొరియాలోని చాంగ్వాన్‌ లో జరుగుతున్న అంతర్జాతీయ షూటింగ్‌  సీజన్‌లోని మూడో ప్రపంచకప్‌ టోర్నమెంట్‌లో భారత షూటర్ల పతకాల వేట కొనసాగుతోంది. జూలై 19న భారత్‌ ఖాతాలో 14వ పతకం చేరింది. 25 మీటర్ల ర్యాపిడ్‌ ఫైర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌ విభాగంలో అనీశ్‌ భన్వాలా–రిథమ్‌ సాంగ్వాన్‌ ద్వయం భారత్‌కు కాంస్య పతకాన్ని అందించింది. కాంస్య పతక పోరులో అనీశ్‌–రిథమ్‌ జోడీ 16–12 పాయింట్లతో అనా దెడోవా–మార్టిన్‌ పొదరాస్కీ (చెక్‌ రిపబ్లిక్‌) జంటపై విజయం సాధించింది. ఆరు జోడీలు పాల్గొన్న క్వాలిఫికేషన్‌ స్టేజ్‌–2లో అనీశ్‌–రిథమ్‌ 380 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతక పోరుకు అర్హత పొందారు. అనీశ్‌–రిథమ్‌ జంటకిది రెండో ప్రపంచకప్‌ పతకం. ఈ ఏడాది మార్చిలో కైరోలో జరిగిన ప్రపంచకప్‌ టోరీ్నలో అనీశ్‌–రిథమ్‌ జోడీ స్వర్ణ పతకం సొంతం చేసుకుంది. 50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్‌ మిక్స్‌డ్‌ ఈవెంట్‌లో బరిలోకి దిగిన రెండు భారత జోడీలు త్రుటిలో పతక మ్యాచ్‌లకు దూరమయ్యాయి. సంజీవ్‌ రాజ్‌పుత్‌–అంజుమ్‌ మౌద్గిల్‌ జంట ఐదో స్థానంలో, ఐశ్వరీ ప్రతాప్‌ సింగ్‌ తోమర్‌–ఆశీ చౌక్సీ జోడీ ఆరో స్థానంలో నిలిచాయి. తాజా ప్రపంచకప్‌ టోరీ్నలో భారత్‌ ఐదు స్వర్ణాలు, ఐదు రజతాలు, నాలుగు కాంస్య పతకాలు సాధించి మొత్తం 14 పతకాలతో టాప్‌ ర్యాంక్‌లో కొనసాగుతోంది.

Also read: Yulimar Rojasకి ట్రిపుల్‌ జంప్‌లో 3వ స్వర్ణం

 Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

 

Published date : 20 Jul 2022 05:15PM

Photo Stories