Skip to main content

టీచర్ టు కలెక్టర్.. గోపాలకృష్ణ

గ్రామస్తుల్లో ఆ కుటుంబం అంటే చిన్నచూపు. కుటుంబ ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే.మరోవైపు..అవమానాలు.. అవహేళనలు. ఇవన్నీ అతడిని ఎంతో ప్రభావితంచేశాయి. చిన్నచూపు చూసిన వారిముందే తలెత్తుకు తిరగాలనే తపన. ఆ తపనతోనే చదువులో రాణిస్తూ.. చివరికి దేశంలోనే అత్యున్నత పరీక్షగా పేర్కొనే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌లో జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించేలా చేశాయి. శ్రీకాకుళం జిల్లాలోని పలాస మండలం పరసాంబ అనే మారుమూల ప్రాంతానికి చెందిన రోణంకి గోపాలకృష్ణ దూరవిద్యలో డిగ్రీ పూర్తిచేసి.. ఆ డిగ్రీ అర్హతతో సివిల్స్ 2016 ఫలితాల్లో ఆలిండియా 3వ ర్యాంకు సొంతం చేసుకున్నారు. గోపాలకృష్ణ సక్సెస్ స్టోరీ ఆయన మాటల్లోనే..
మా స్వస్థలం శ్రీకాకుళం జిల్లా పలాస మండలంలోని పరసాంబ గ్రామం. మాది వ్యవసాయ కుటుంబం. నాన్న అప్పారావు సన్నకారు రైతు. 50 సెంట్ల భూమి సాగుచేస్తారు. మరో మూడెకరాలు కౌలుకు చేస్తారు. అమ్మ రుక్మిణి నాన్నకు వ్యవసాయ పనుల్లో సహాయం చేస్తుంటారు. ఇద్దరికీ చదువుల గురించి పెద్దగా తెలియదు. కానీ, తమలా కాకుండా తమ పిల్లలు బాగా చదువుకొని పైకి రావాలని కోరుకునేవారు. నేను ఈ రోజు పట్టుదలతో చదివి ఈ స్థాయికి రావడానికి కారణం వారి ప్రేరణే. 
 
విద్యాభ్యాసం స్వస్థలంలో :
నా విద్యాభ్యాసం అంతా స్వస్థలంలోనే సాగింది. ఒకటో తరగతి నుంచి అయిదో తరగతి వరకు సొంతూరులోనే చదివాను. అయిదు నుంచి పదో తరగతి వరకు మా ఊరుకు సమీపంలోని బ్రాహ్మణ తర్ల గ్రామంలో.. ఇంటర్మీడియెట్ పలాసలో పూర్తిచేశాను.
 
టీటీసీలో ప్రవేశం :
కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో ఉద్యోగం చేయాల్సిన ఆవశ్యకత. ఇందుకు అప్పట్లో టీటీసీ (టీచర్ ట్రైనింగ్ కోర్స్)ని సులువైన మార్గంగా భావించేవారు. ఆ కోర్సు పూర్తిచేస్తే ఉద్యోగం ఖాయం అనే భావన ఉండేది. వాస్తవానికి నా విషయంలో అది నిజమైంది కూడా. 2004 నుంచి 2006 వరకు టీటీసీ చదవడం.. అది పూర్తవుతూనే 2006లో డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడటం ఎస్‌జీటీగా ఉద్యోగం లభించడం వెంటవెంటనే జరిగాయి. దీంతో నాలో ‘సాధించగలను’ అనే ఆత్మవిశ్వాసం ఏర్పడింది. ఉద్యోగంలో చేరిన వెంటనే దూరవిద్య విధానంలో 2009లో బీఎస్సీ పూర్తిచేశాను. 
 
సివిల్స్ ఆలోచన :
సివిల్ సర్వీసెస్‌కు హాజరవ్వాలనే ఆలోచన చిన్నప్పటి నుంచే ఉండేది. దీనికి ప్రధాన కారణం.. మా చుట్టు పక్కల ఉన్న పరిస్థితులే. అంతేకాకుండా అప్పటికే సివిల్ సర్వీసెస్ అధికారులుగా కలెక్టర్లు, సబ్ కలెక్టర్లు వంటి వారు ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి దిశగా పనులు చేయడం కూడా నాలో ప్రేరణనిచ్చాయి. డీఎస్సీ-2006లో విజయం సాధించి, టీచర్ ఉద్యోగంలో చేరినప్పటి నుంచే సివిల్ సర్వీసెస్ పరీక్ష దిశగా కృషి చేయడం ప్రారంభించాను. ముందుగా పరీక్షకు సంబంధించిన వివరాలు తెలుసుకోవడంతో మొదలు   పెట్టాను. సివిల్ సర్వీసెస్‌కు సన్నద్ధం కావడానికి సరైన వాతావరణం హైదరాబాద్‌లో ఉంటుందని తెలుసుకొని 2010లో హైదరాబాద్‌లో అడుగుపెట్టాను. ఎలాంటి కోచింగ్ లేకుండానే ప్రిపరేషన్‌కు ఉపక్రమించాను. 
 
తెలుగు మీడియంలోనే..
చిన్నప్పటి నుంచి తెలుగు మీడియం చదువులు. ఇంగ్లిష్‌పై అవగాహన లేదు. దాంతోపాటు తెలుగు భాషపై మక్కువతో తెలుగు సాహిత్యాన్ని ఆప్షనల్‌గా ఎంపిక చేసుకున్నాను. ఆంధ్ర భాషా చరిత్ర, ఆంధ్ర సాహిత్య చరిత్ర వంటి ప్రామాణిక పుస్తకాలతోపాటు ప్రముఖ ఫ్యాకల్టీల ప్రచురణలను చదివాను. తెలుగు మీడియంలోనే పరీక్షకు హాజరయ్యాను. ఈ విషయంలో ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ప్రిపరేషన్ సమయంలోనే ఇంగ్లిష్ మెటీరియల్‌లోని అంశాలను తెలుగులోకి అనువాదం చేసుకొని సొంత నోట్స్ రాసుకున్నాను. వాటినే ఒకటికి పదిసార్లు చదవడం అలవాటు చేసుకున్నాను. 2012లో తొలిసారిగా సివిల్స్ పరీక్షకు హాజరయ్యాను. కానీ ఫలితం దక్కలేదు. ఆ తర్వాత మరోరెండు అంటెప్ట్స్‌లోనూ విజయం లభించలేదు. కానీ ఇప్పుడు నాలుగో ప్రయత్నంలో జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సొంతమవడం ఎంతో ఆనందంగా ఉంది. 
 
ఇంటర్వ్యూ సైతం తెలుగులోనే :
సివిల్ సర్వీసెస్ ఎంపికలో అత్యంత కీలకమైన ఇంటర్వ్యూను సైతం తెలుగులోనే చేశాను. ఇందుకు యూపీఎస్సీ నిబంధనలు కూడా అనుకూలంగా ఉండటం కలిసొచ్చింది. అనువాదుకుడి సహాయంతో ఇంటర్వ్యూ పూర్తిచేశాను. సుజాత మెహతా నేతృత్వంలోని బోర్డ్ ఇంటర్వ్యూ చేసింది. గ్రామీణ, పట్టణ ప్రాంత విద్యార్థుల సామర్థ్యాల్లో వ్యత్యాసాలుంటాయనే వ్యాఖ్యానాలపై అభిప్రాయం అడిగారు. అదే విధంగా నేను ప్రస్తుతం నిర్వహిస్తున్న టీచింగ్ కెరీర్ గురించి, గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యల గురించి ప్రశ్నలు అడిగారు. పాటలు పాడటం ఇష్టమని చెప్పడంతో.. భారత సైనికులను ఉద్దేశించి సొంతగా రాసిన పాటను పాడాను. ఆ తర్వాత ఆ పాటను అనువాదకులు ఇంగ్లిష్‌లో వివరించబోగా పాట భావం అర్థమైందని.. పాట బాగుందని అభినందించారు.
 
సొంత శిక్షణ :
సివిల్స్‌కు ఎలాంటి శిక్షణ తీసుకోలేదు. అయితే కొంతమంది ప్రముఖ ఫ్యాకల్టీలను సంప్రదించి వారి సలహాలు తీసుకున్నాను. అంతేకాకుండా నిరంతరం చదవడమే పనిగా చేసుకున్నాను. రాత పరీక్ష పరంగా సొంతగా ప్రిపేర్ అయినప్పటికీ ఇంటర్వ్యూలకు సన్నద్ధమయ్యేందుకు ఆర్.సి.రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్, బ్రెయిన్ ట్రీ అకాడమీల్లో మాక్ ఇంటర్వ్యూలకు హాజరయ్యాను.
 
సాక్షి పత్రికను ప్రతిరోజూ చదువుతాను. అందులో వచ్చే ఎడిటోరియల్స్, ప్రత్యేక కథనాలను క్రమం తప్పకుండా చదవడంతో పాటు వాటిని కట్ చేసుకుని తర్వాత కూడా చదివేవాడిని. ‘సాక్షి’ భవిత కూడా ప్రిపరేషన్‌కు ఎంతగానో ఉపయోగపడింది.
Published date : 02 Jun 2017 05:15PM

Photo Stories