Skip to main content

ఇంటర్ తర్వాత పయనమెటు?

తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు దాదాపు ముగిశాయి! ఇప్పుడు విద్యార్థులతోపాటు తల్లిదండ్రుల ఆలోచనంతా ఇంటర్ తర్వాత.. ఎటువైపు అడుగులు వేస్తే బాగుంటుంది? కెరీర్ ఉజ్వలంగా వెలుగులీనాలంటే.. ఏ కోర్సుల్లో చేరాలి.. ఇంటర్‌తో లభించే ఉద్యోగాలేమైనా ఉన్నాయా.. ఇలాంటి ఎన్నో సందేహాలు విద్యార్థులను వెంటాడుతుంటాయి..
ఇంటర్మీడియెట్ తర్వాత ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ... ఇలా గ్రూప్‌ల వారీగా విద్యార్థులకు అందుబాటులో ఉన్న అవకాశాల గురించి తెలుసుకుందాం...

ఎంపీసీ.. ఇంజనీరింగ్‌తోపాటు మరెన్నో!!
ఇంజనీరింగ్ :
ఎంపీసీ అనగానే నూటికి 90 శాతం మంది విద్యార్థుల టార్గెట్.. ఇంజనీరింగ్. వీరందరి తొలి లక్ష్యం.. ఐఐటీలు, ఆ తర్వాత ఎన్‌ఐటీలు. వీటితోపాటు రాష్ట స్థాయిల్లోని క్యాంపస్ కాలేజీలు, ఇతర ప్రయివేట్ ఇంజనీరింగ్ ఇన్‌స్టిట్యూ ట్స్‌లోనూ ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరే అవకాశముంది. అందుకోసం జేఈఈ- అడ్వాన్స్‌డ్, జేఈఈ మెయిన్, ఎంసెట్‌లో ప్రతిభ చూపాల్సి ఉంటుంది. ఇంజనీరింగ్‌తోపాటు ఇతర ప్రత్యామ్నాయ కోర్సులపైనా ఎంపీసీ విద్యార్థులు దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.
బీఎస్సీ:
ఇంజనీరింగ్‌లో కోరుకున్న కాలేజీలో, బ్రాంచ్‌లో ప్రవేశం లభించకుంటే... ఎంపీసీ విద్యార్థులకు అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయం.. సంప్రదాయ డిగ్రీ కోర్సుగా భావించే బ్యాచిలర్ ఆఫ్ సైన్స్(బీఎస్సీ). బీఎస్సీలోనూ పలు కొత్త స్పెషలైజేషన్లు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రస్తుత జాబ్ మార్కెట్ ట్రెండ్స్‌కు సరితూగేలా బీఎస్సీలో కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్స్, స్టాటిస్టిక్స్ వంటి కాంబినేషన్లతో గ్రూప్ సబ్జెక్ట్‌లు ఎంచుకునే అవకాశముంది. ఇటీవల కాలంలో ఇంజనీరింగ్‌కు చక్కటి ప్రత్యామ్నాయంగా బీఎస్సీని పలువురు విద్యార్థులు ఎంచుకుంటున్నారు.

ఐఐఎస్‌ఈఆర్ :
ఎంపీసీ విద్యార్థులు ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్‌లలో ఉత్తమ సైన్‌‌స కోర్సులు అభ్యసించేందుకు వీలు కల్పించే వేదికలు.. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(ఐఐఎస్‌ఈఆర్) క్యాంపస్‌లు. కేవీపీవై, జేఈఈ అడ్వాన్‌‌సడ్, ఐఐఎస్‌ఈఆర్‌లు నిర్వహించే ఆప్టిట్యూడ్ టెస్ట్‌లలో ఏదో ఒక పరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా వీటిలో ప్రవేశం పొంది.. అయిదేళ్ల బీఎస్-ఎంఎస్ కోర్సులు పూర్తి చేయొచ్చు.

ఎన్‌డీఏ:
ఎంపీసీ గ్రూప్ ఉత్తీర్ణతతో.. సుస్థిర కెరీర్, సమున్నత హోదాను అందించేత్రివిధ దళాల్లో అడుగుపెట్టొచ్చు. ఇందుకోసం యూపీఎస్‌సీ నిర్వహించే నేషనల్ డిఫెన్స్ అకాడమీ(ఎన్‌డీఏ) ఎగ్జామినేషన్‌లో విజయం సాధించాల్సి ఉంటుంది. విజేతలు తాము ఎంపిక చేసుకున్న విభాగం(ఇండియన్ ఆర్మీ/ ఎయిర్‌ఫోర్స్/ నేవల్ అకాడమీ)లో శిక్షణ పూర్తి చేసుకోవాలి. శిక్షణ కాలంలో స్టైఫండ్ సైతం లభిస్తుంది. ఆర్మీ కేడెట్స్‌గా శిక్షణ పూర్తి చేసుకున్న వారికి బీఎస్సీ/బీఏ డిగ్రీ; నేవల్, ఎయిర్‌ఫోర్స్ కేడెట్‌గా శిక్షణ పొందిన వారికి బీటెక్‌తోపాటు పర్మనెంట్ కమిషన్డ్ ర్యాంకు హోదాతో త్రివిధ దళాల్లో కెరీర్ ప్రారంభమవుతుంది.

డిఫెన్స్‌లో టెక్నికల్ ఎంట్రీ స్కీమ్:
ఎంపీసీ విద్యార్థులకు అందుబాటులో ఉన్న మరో మంచి అవకాశం.. ఇండియన్ ఆర్మీలోని 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్. ఎంపీసీ అభ్యర్థుల అకడెమిక్ మెరిట్ ఆధారంగా నిర్వహించే ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూలో ప్రతిభ ద్వారా ఎంపిక జరుగుతుంది. ఎంపికైన అభ్యర్థులకు త్రివిధ దళాలలకు చెందిన మిలటరీ అకాడమీలలో శిక్షణ లభిస్తుంది. ఈ శిక్షణ పూర్తి చేసుకుంటే.. బీటెక్ డిగ్రీతోపాటు పర్మనెంట్ కమిషన్డ్ ర్యాంకుతో కెరీర్ ప్రారంభించొచ్చు. వీటికోసం ఇండియన్ ఆర్మీ, నేవీలు వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేస్తాయి.

బైపీసీ... బహుళ అవకాశాలు :
సైన్స్ కోర్సుల పరంగా క్రేజీ గ్రూప్.. బైపీసీ. వాస్తవానికి బైపీసీ అనగానే.. విద్యార్థుల లక్ష్యం ఎంబీబీఎస్, బీడీఎస్. కాని ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లు తక్కువ. పోటీపడే అభ్యర్థుల సంఖ్య ఎక్కువ. కాబట్టి ప్రవేశం లభించేది చాలా తక్కువమందికి మాత్రమే. బైపీసీ విద్యార్థులకు ఇప్పుడు ఎన్నో ప్రత్యామ్నాయ మార్గాలు అందుబాటులో ఉన్నాయి.

ఫార్మసీ కోర్సులు:
బైపీసీ విద్యార్థులకు చక్కటి ప్రత్యామ్నాయం.. ఫార్మసీ కోర్సులు. బీఫార్మసీ, డాక్టర్ ఆఫ్ ఫార్మసీ(ఫార్మా-డి), డిప్లొమా ఇన్ ఫార్మసీ.. ఇలా మూడు స్థాయిల కోర్సులకు బైపీసీ ఉత్తీర్ణులు అర్హులు. బీఫార్మసీ, ఫార్మా-డికి ఎంసెట్‌లో ర్యాంకు ఆధారంగా ప్రవేశం లభిస్తుంది. ఇవి పూర్తి చేసుకున్న వారికి ఫార్మాస్యుటికల్ కంపెనీలు, క్లినికల్ రీసెర్చ్ సంస్థల్లో ఆకర్షణీయ వేతనాలతో ఉద్యోగాలు లభిస్తాయి.
విభిన్న కోర్సులు: బైపీసీ విద్యార్థులకు మరెన్నో ప్రత్యామ్నాయ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అవి.. బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ, డైరీటెక్నాలజీ, పౌల్ట్రీ సైన్స్, ఫిషరీస్, ఆక్వాకల్చర్ వంటి ప్రొఫెషనల్ డిగ్రీలు అందుబాటులో ఉన్నాయి. వీటితోపాటు బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో బీఎస్సీ (బీజెడ్‌సీ)తోపాటు బయోకెమిస్ట్రీ, బయోఫిజిక్స్,బయోఇన్ఫర్మాటిక్స్, మైక్రోబయాలజీ తదితర లైఫ్ సెన్సైస్ కోర్సుల్లో చేరే వీలుంది.
మెడికల్, పారామెడికల్: బైపీసీ విద్యార్థులు బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతి, బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ సెన్సైస్ తదితర మెడికల్ కోర్సులనూ ఎంచుకోవచ్చు. వీటితోపాటు.. పారామెడికల్ కోర్సులుగా పేర్కొనే ఫిజియోథెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, ఆప్టోమెట్రీ, మెడికల్‌ల్యాబ్ టెక్నీషియన్‌లలో డిప్లొమా, పీజీ డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీలు పూర్తి చేస్తే.. ప్రభుత్వ వైద్య విభాగాలతోపాటు, కార్పొరేట్ హాస్పిటల్స్‌లో ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అదేవిధంగా.. నర్సింగ్ కూడా చక్కటి అవకాశాలు కల్పిస్తోంది. ప్రస్తుతం బైపీసీ ఉత్తీర్ణులకు డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ స్థాయిల్లో నర్సింగ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
కెరీర్ అవకాశాలు: బైపీసీ విద్యార్థులకు ప్రత్యేకంగా ఉన్న కెరీర్ అవకాశాలను పరిశీలిస్తే.. బైపీసీలో ఉత్తీర్ణత సాధించిన మహిళా అభ్యర్థులకు ఇండియన్ ఆర్మీ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ కోర్సులో ప్రవేశం కల్పిస్తుంది. దీనిద్వారా నాలుగేళ్లపాటు శిక్షణనిచ్చి బీఎస్సీ నర్సింగ్ సర్టిఫికెట్‌తోపాటు ఇండియన్ ఆర్మీకి చెందిన హాస్పిటల్స్‌లో పర్మనెంట్ హోదాలో ఉద్యోగం ఖరారు చేస్తుంది.

సీఈసీ.. కార్పొరేట్ కొలువులకు వేదిక :
ఇంటర్మీడియెట్‌లో గ్రూప్ ఎంపికలో ఎంపీసీ, బైపీసీ తర్వాత ఎక్కువ మంది విద్యార్థులు చేరే గ్రూప్.. సీఈసీ. ప్రస్తుతం జాబ్ మార్కెట్ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే.. సీఈసీ విద్యార్థులకు నైపుణ్యాలుంటే ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలు విస్తృతమని చెప్పొచ్చు.
  • బీకాం: ఉన్నత విద్య పరంగా సీఈసీ విద్యార్థులకు మొదట గుర్తొచ్చేది బ్యాచిలర్ ఆఫ్ కామర్స్(బీకామ్). కామర్స్, అకౌంటింగ్ వంటి కాంబినేషన్లతోపాటు జాబ్ మార్కెట్ అవకాశాలకు తగ్గట్లు.. ఈ-కామర్స్, టాక్స్ ప్రొసీజర్స్ అండ్ ప్రాక్టీస్, అడ్వర్టయిజింగ్ అండ్ మార్కెటింగ్ వంటి విభిన్న స్పెషలైజేషన్స్ అందుబాటులోకి వస్తున్నాయి.
  • పొఫెషనల్ కోర్సులు: సీఈసీ విద్యార్థులు కామర్స్ విభాగంలో ప్రొఫెషనల్ కోర్సులుగా పేర్కొనే చార్టర్డ్ అకౌంటెన్సీ(సీఏ), కాస్ట్ అకౌంటెన్సీ(సీఎంఎస్), కంపెనీ సెక్రటరీ(సీఎస్) కోర్సుల వైపు మొగ్గు చూపుతున్నారు. వీటిని పూర్తి చేయడం ద్వారా కార్పొరేట్ కొలువులు ఖాయం చేసుకోవచ్చు. ఉన్నత విద్య పరంగా ఎంబీఏ వంటి మేనేజ్‌మెంట్ కోర్సులు, ఎంకామ్ వంటి పీజీ కోర్సులూ చేసే అవకాశముంది.
ఉద్యోగావకాశాలు: సీఈసీ పూర్తిచేసిన విద్యార్థులు అకౌంటింగ్‌లో స్వల్పకాలిక సాఫ్ట్‌వేర్ ప్యాకేజ్ కోర్సులు(ట్యాలీ, వింగ్స్, ఫోకస్ తదితర) పూర్తి చేస్తే కంపెనీల్లో అకౌంటెంట్ హోదాలో ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు.
జీఎస్‌టీతో జాబ్స్: ప్రస్తుతం జీఎస్‌టీ అమలవుతున్న నేపథ్యంలో కామర్స్ విద్యార్థులకు ఇది కూడా కలిసొచ్చే అంశంగా మారుతోంది. ఇందుకు సంబంధించి కొన్ని స్వల్పకాలిక కోర్సులు పూర్తి చేయడం ద్వారా ఆయా కంపెనీల్లో జీఎస్‌టీ కన్సల్టెంట్స్‌గా వ్యవహరించొచ్చు.

హెచ్‌ఈసీ.. పోటీ పరీక్షలకు మేటి
హెచ్‌ఈసీ గ్రూప్‌తో ఇంటర్మీడియెట్ పూర్తిచేసుకున్న విద్యార్థులు ఉన్నత విద్య పరంగా బీఏలో చేరొచ్చు. బీఏలో చదివే సబ్జెక్టులపై పట్టుసాధించడం ద్వారా పలు పోటీ పరీక్షల్లో ముందుండేందుకు ఆస్కారం లభిస్తుంది. అత్యున్నత సివిల్ సర్వీసెస్ నుంచి గ్రూప్-4 వరకూ.. అన్ని పోటీ పరీక్షల్లోనూ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ తదితర సబ్జెక్ట్‌లు తప్పనిసరిగా ఉంటాయి. వీటిని హెచ్‌ఈసీ విద్యార్థులు ఇంటర్మీడియెట్‌తోపాటు బీఏ స్థాయిలోనూ చదువుతారు. కాబట్టి హెచ్‌ఈసీ విద్యార్థులు పోటీ పరీక్షల్లో మిగతా అభ్యర్థులతో పోల్చితే కొంత ముందంజలో నిలుస్తారని చెప్పొచ్చు.
  • బీఏలో ఆధునికత: బీఏ కోర్సు కూడా ఆధునికత సంతరించుకుంటోంది. బీఏలో మాస్ కమ్యూనికేషన్స్ అండ్ పబ్లిక్ రిలేషన్స్, మార్కెటింగ్, అడ్వర్టయిజింగ్ వంటి స్పెషలైజేషన్లు అందుబాటులోకి వస్తున్నాయి. వీటిలో చేరడం ద్వారా మీడియా, మార్కెటింగ్ విభాగాల్లో ఉపాధి పొందొచ్చు.
‘లా’: హెచ్‌ఈసీ విద్యార్థులకు అందుబాటు ఉన్న ముఖ్య కోర్సు.. లా. జాతీయ స్థాయిలో నిర్వహించే క్లాట్, రాష్ట్ర స్థాయిలో జరిపే లాసెట్ ద్వారా అయిదేళ్ల బీఏఎల్‌ఎల్‌బీ కోర్సులో అడుగుపెట్టే అవకాశం లభిస్తుంది. లా కోర్సులో కార్పొరేట్ అవసరాలకు అనుగుణంగా ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, కార్పొరేట్ లా తదితర కొత్త సబ్జెక్టులు ప్రవేశపెడుతున్నారు. ఆయా సబ్జెక్టుల అధ్యయనం ద్వారా ‘లా’ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులు.. న్యాయవాద వృత్తికే పరిమితం కాకుండా.. కార్పొరేట్ కొలువులు సైతం సొంతం చేసుకునే వీలుంది.  
 
ఇంటర్‌తో జాబ్స్..
ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత సాధించిన గ్రూప్‌తో సంబంధం లేకుండా విద్యార్థులకు పలు ఉద్యోగావకాశాలు అందుబాటులో ఉన్నాయి. అవి..
ఎస్‌ఎస్‌సీ-హయ్యర్ సెకండరీ లెవల్ ఎగ్జామినేషన్: కేంద్ర ప్రభుత్వ శాఖల్లోని డేటా ఎంట్రీ ఆపరేటర్, లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే పరీక్ష ఇది. ఇంటర్మీడియెట్ అర్హతతోపాటు డేటాఎంట్రీ, కంప్యూటర్ టైపింగ్‌లో అనుభవం ఉంటే ఈ పరీక్షలో సులువుగా రాణించి, ప్రభుత్వ ఉద్యోగం సొంతం చేసుకోవచ్చు. 
పోస్టల్ అసిస్టెంట్స్, సార్టింగ్ అసిస్టెంట్స్: తపాల శాఖలో ఆయా రాష్ట్రాల స్థాయిలోనే ఇంటర్మీడియెట్ అర్హతతో నియామకాలు చేపట్టే ఉద్యోగాలు.. పోస్టల్ అసిస్టెంట్స్, సార్టింగ్ అసిస్టెంట్స్. వీటికోసం రాత పరీక్ష, కంప్యూటర్/టైపింగ్ టెస్ట్‌లో ప్రతిభ చూపాల్సి ఉంటుంది.
పోలీస్ శాఖలో కానిస్టేబుల్: పోలీస్ శాఖలో కానిస్టేబుల్ ఉద్యోగానికి కూడా ఇంటర్మీడియెట్ కనీస అర్హత. ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణతతోపాటు నిర్దేశిత శారీరక ప్రమాణాలు ఉండాలి. ఎంపిక ప్రక్రియలో భాగంగా నిర్వహించే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, రాత పరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా కొలువు సొంతం చేసుకోవచ్చు.
పారా మిలటరీ: జాతీయ స్థాయిలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సీఐఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఇండో-టిబెటిన్ బోర్డర్ ఫోర్స్ తదితర పారా మిలటరీ విభాగాల్లోనూ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఇంటర్మీడియెట్ అర్హతగా దరఖాస్తు చేసుకోవచ్చు.
గ్రూప్-4 ఉద్యోగాలు: రాష్ట్ర స్థాయిలో ఆయా శాఖల్లో జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్ తదితర ఉద్యోగాల భర్తీకి చేపట్టే గ్రూప్-4 నియామక పరీక్షలకు ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణతతోనే పోటీ పడొచ్చు. అదే విధంగా రెవెన్యూ శాఖ పరిధిలో వీఆర్‌ఓ(విలేజ్ రెవెన్యూ ఆఫీసర్) పోస్టులకు కూడా ఇంటర్మీడియెట్ అర్హతగా భర్తీ జరుగుతుంది.
Published date : 16 Mar 2018 04:41PM

Photo Stories