Skip to main content

పెద్ద మనుషుల ఒప్పందం

హైదరాబాద్ స్టేట్‌గా ఉన్న తెలంగాణ ప్రాంతాన్ని విశాలాంధ్రలో విలీనం చేసే సమయంలో తెలంగాణ ప్రాంతపజలకు భరోసా కల్పిస్తూ అప్పటి కేంద్ర ప్రభుత్వం రూపొందించినదే పెద్ద మనుషుల ఒప్పందం. అయితే దీని అమల్లో ఎన్నో ఉల్లంఘనలు, మరెన్నో ఆటుపోట్లు. దాంతో తెలంగాణ ప్రాంతానికి న్యాయం జరగలేదు. ఫలితంగా తెలంగాణ ప్రాంత ప్రజల్లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష బలోపేతమైంది. ఈ నేపథ్యంలో పెద్ద మనుషుల ఒప్పందం పూర్వాపరాలు, అమల్లో లోపాలపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిలబస్ కమిటీ సభ్యులు, గ్రూప్-1 సిలబస్ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అందిస్తున్న ప్రత్యేక వ్యాసం..
మూలం.. ‘ముల్కీ’ అమల్లో లోపాలే!
ఒక విధంగా పెద్ద మనుషుల ఒప్పందానికి మూలం ముల్కీ నిబంధనల అమలు సరిగ్గా జరగకపోవడంలోనే ఉందని చెప్పొచ్చు. వీటి అమల్లో లోపాల కారణంగా తెలంగాణ ప్రాంత ప్రజలకు అన్యాయం జరుగుతోందనే ఆందోళనతోనే ముల్కీ ఉద్యమాలు జరిగాయి. 1948 సెప్టెంబర్‌లో పోలీస్ చర్య ద్వారా నిజాం రాజ్యమైన హైదరాబాద్, భారతదేశంలో భాగమైంది. 1952లో సార్వత్రిక ఎన్నికల తర్వాత హైదరాబాద్ రాష్ట్రంలో బూర్గుల రామకృష్ణారావు సారథ్యంలో మొదటి ప్రజా ప్రభుత్వం ఏర్పడింది. 1948-52 మధ్య నాలుగేళ్ల కాలంలో బయటి నుంచి వచ్చినవారే పరిపాలన సాగించారు. బయటి నుంచి వచ్చిన అధికారులు స్థానికుల పట్ల అనుచితంగా ప్రవర్తించడంతో.. స్థానికేతర ఉద్యోగుల పట్ల స్థానికుల్లో వ్యతిరేకత పెరిగి, 1952 నాటికే ముల్కీ ఉద్యమం మొదలైంది. మరోవైపు 1953లో కేంద్ర ప్రభుత్వం జస్టిస్ ఎస్ ఫజల్ అలీ సారథ్యంలో రాష్ట్రాల పునర్విభజన కమిషన్(ఎస్సార్సీ)ను నియమించింది. భాషా ప్రాతిపదికన రాష్ట్రాల పునర్విభజనను సిఫార్సు చేయడానికి ఈ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఫజల్ అలీ కమిటీ తెలంగాణలోని పలు ప్రాంతాల్లో పర్యటించినప్పుడు ప్రజలు తమ అస్తిత్వం, తెలంగాణ వెనుకబాటుతనంపై ఆందోళన వెలిబుచ్చారు. అంతేకాకుండా ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షనూ బలంగా వినిపించారు. వీటన్నింటినీ నమోదు చేసుకున్న కమిటీ 1961 వరకూ విలీనం వద్దంటూ నివేదికలో కొన్ని కీలక సిఫార్సులు చేసింది.
ఫజల్ అలీ కమిటీ.. హైదరాబాద్ స్టేట్ ప్రత్యేక ప్రస్తావన
ఫజల్ అలీ కమిటీ చేసిన సిఫార్సుల్లో ముఖ్యమైంది.. హైదరాబాద్ రాష్ట్ర ప్రత్యేక ప్రస్తావన. తమ నివేదికలోని 359 నుంచి 393వ పేరా వరకు హైదరాబాద్ రాష్ట్రం గురించి ఈ కమిటీ ప్రత్యేకంగా ప్రస్తావించింది. విశాలాంధ్రలో హైదరాబాద్ రాష్ట్రం విలీనం జరిగితే అది ఇష్టపూర్వకంగా, స్వచ్ఛందంగా జరగాలని పేర్కొంది. విలీనంపై తెలంగాణలో అప్పటికీ స్పష్టమైన అభిప్రాయాలు లేవని, అదే సమయంలో ఆంధ్ర ప్రాంత వాసుల ఆధిపత్యంపై ఆందోళన కూడా కొనసాగుతోందని తెలిపింది. ఆంధ్రాతో కలిస్తే సమానమైన ప్రతిపత్తి ఇవ్వకుండా చిన్నచూపు చూస్తారని, తెలంగాణ ప్రాంతం వలస ప్రాంతంగా మిగిలిపోతుందనే ఆందోళన తెలంగాణ ప్రజల్లో ఉందని పేర్కొంది. కాబట్టి తొందరపాటు చర్యగా విలీనం చేయడం సరికాదని స్పష్టం చేసింది. అంతేకాకుండా 1961 వరకు తెలంగాణ ప్రాంతం ప్రత్యేక రాష్ట్రంగా ఉండాలని, 1961 ఎన్నికల తర్వాత అసెంబ్లీలో మూడింట రెండు వంతుల మెజారిటీ సభ్యులు ఆమోదిస్తేనే విలీనం చేయాలని ఫజల్ అలీ కమిటీ తన నివేదికలో స్పష్టంగా పేర్కొంది. శ్రీబాగ్ ఒడంబడిక, యూకేలోని స్కాట్లాండ్‌ల తరహాలో బలవంతంగా విలీనం చేయొద్దని ప్రత్యక్ష నిదర్శనాలతో వ్యాఖ్యానించింది. ఇదే క్రమంలో అన్ని ప్రాంతాల నిర్ణయాలను సమీక్షించేందుకు అప్పుడు జాతీయ స్థాయిలో జవహర్‌లాల్ నెహ్రూ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ కూడా విలీనాన్ని వ్యతిరేకించింది. కానీ 1956 ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్న కొందరు ఆంధ్ర ప్రాంత నేతలు.. 1955లోనే తెలంగాణ ప్రాంతాన్ని విలీనం చేసే దిశగా జాతీయ స్థాయిలో ఒత్తిడి తెచ్చారు. దీన్ని సాధ్యం చేసుకునేందుకు తాము తెలంగాణ అభివృద్ధికి, ఉద్యోగాల కల్పనకు, తెలంగాణ వనరులను ఆ ప్రాంతానికే వినియోగించే విధంగా నిబంధనలు రూపొందించి అమలు చేస్తామని.. ముల్కీ నిబంధనలు కొనసాగిస్తామని, తెలంగాణ వివక్షకు గురి కాకుండా చూస్తామనే హామీలతో ముందుకొచ్చారు.
పెద్దమనుషుల ఒప్పందానికి సవరణలు:
పెద్ద మనుషుల ఒప్పందానికి అప్పటి ప్రభుత్వం కొన్ని సవరణలు చేసింది. ఈ ఒప్పందం స్థానంలో ‘నోట్ ఆన్ సేఫ్ గార్డ్స్ ఫర్ తెలంగాణ’ పేరుతో 1956 ఆగస్టు సమావేశాల్లో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. ఈ సవరణల్లో ముఖ్యమైనవి.. తెలంగాణ రీజనల్ కౌన్సిల్ స్థానంలో తెలంగాణ రీజనల్ కమిటీ ఏర్పాటు చేయడం, దానిలో తెలంగాణ ప్రాంతానికి చెందిన శాసనసభ్యులంతా సభ్యులుగా ఉండాలి.
రీజనల్ కమిటీ.. కుదించిన అధికారాలు
పెద్ద మనుషుల ఒప్పందానికి మార్పులు చేసి తెలంగాణ ప్రాంత మండలి స్థానంలో తెలంగాణ ప్రాంత కమిటీని ఏర్పాటుచేశారు. రాష్ట్రపతి ఆమోదంతో 1958 ఫిబ్రవరిలో తెలంగాణ రీజనల్ కమిటీ ఏర్పడింది. 1958 మార్చిలో కమిటీ ఏర్పాటుపై గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఇలా కొత్త కమిటీని ఏర్పాటు చేసినా ఆ కమిటీ అధికారాలను కుదించారు. ఆర్థిక అంశాలతో ముడిపడని సిఫార్సులను మాత్రమే కమిటీ చేయవచ్చని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రణాళికకు సంబంధించి ప్రతిపాదనల విషయంలోనూ అధికారాల కుదింపు జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా ముల్కీ నిబంధనల పర్యవేక్షణ సైతం ఈ కమిటీ పరిధిలోకి తీసుకురాలేదు. ఉన్నత విద్యా రంగాన్ని కూడా ఈ కమిటీ పరిధి నుంచి తొలగించారు. వీటన్నింటి కారణంగా తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం ఏర్పాటైన రీజనల్ కమిటీ కేవలం సలహా మండలిగానే మారిపోయింది. ఈ కమిటీ వ్యవధిలో మొత్తం నలుగురు అచ్యుత్ రెడ్డి, చెన్నారెడ్డి, హయగ్రీవాచారి, చొక్కారావు చైర్మన్లుగా వ్యవహరించారు. మొదటి చైర్మన్‌గా అచ్యుత్ రెడ్డి, చివరి చైర్మన్‌గా చొక్కారావు పనిచేశారు.
పరిమిత అధికారాలతోనూ
తెలంగాణ ప్రాంత రీజనల్ కమిటీ తనకున్న పరిమిత అధికారాలతోనే సాధ్యమైనంత మేర కృషి చేసింది. ముఖ్యంగా తెలంగాణ ప్రజలు, ఎన్‌జీవోలు తమ సమస్యలు నివేదించుకోవడానికి ఇది ఒక వేదికగా ఉపయోగపడింది. అంతేకాకుండా నీళ్లు, ప్రాజెక్ట్‌ల విషయంలో ప్రభుత్వంతో కొన్ని సందర్భాల్లో తలపడింది. ముల్కీ నిబంధనల అమలుపై ఎప్పటికప్పుడు అనుగుణమైన సూచనలు చేసింది. పంచవర్ష ప్రణాళికల్లో తెలంగాణకు కేటాయింపుల విషయంలోనూ సమర్థంగా వ్యవహరించింది. అయితే ఈ సిఫార్సులను అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో కమిటీ సభ్యుల్లోనే అసంతృప్తి పెరుగుతూ వచ్చింది. ఒకానొక సందర్భంలో ‘అసలు మేము స్వతంత్ర భారత దేశంలో ఉన్నామా లేదా పరాయి పాలనలో ఉన్నామా?’ అని కమిటీ సభ్యులే బహిరంగంగా వ్యాఖ్యానించడమే ఈ కమిటీ వివక్షకు గురైన తీరుకు నిదర్శనం. ఇలా కాలక్రమంలో విద్యార్థి ఉద్యమాలు సైతం బలోపేతం అయ్యాయి. 1968లో ఇవి మరింత ఉధృతమయ్యాయి. ఈ సందర్భంలో సైతం కమిటీ సభ్యులు ఆ ఉద్యమ నేతలతో ఇలా వ్యాఖ్యానించారు ‘మేం ఏమీ చేయలేకపోతున్నాం. మీరే ఉద్యమాలతో సాధించుకోండి’!
అష్ట సూత్ర పథకం
1969 తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో 1969 ఏప్రిల్‌లో కేంద్ర ప్రభుత్వం అష్ట సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని ప్రకారం తెలంగాణ రీజనల్ కమిటీ అధికారాలను ప్రభుత్వం మళ్లీ విస్తృతం చేసింది. విద్యా రంగం, కుటీర, చిన్న తరహా, భారీ పరిశ్రమలు, రాష్ట్ర బడ్జెట్, స్థానిక రిజర్వేషన్లు, ఉపాధి కల్పన చర్యల రూపకల్పనలోనూ సిఫార్సులు, పర్యవేక్షణ అధికారాలు కట్టబెడుతూ తెలంగాణ ప్రాంతీయ కమిటీని పటిష్టపరిచింది.
జై ఆంధ్ర ఉద్యమంతో కనుమరుగు
రీజనల్ కమిటీ అధికారాలు విస్తృతమై, తెలంగాణ ప్రాంతానికి కొంత మేలు జరుగుతుందనే భావన ప్రాథమిక దశలో ఉన్నప్పుడే.. 1972 జై ఆంధ్ర ఉద్యమం మొదలైంది. ఈ క్రమంలో ఆంధ్ర నేతల ఒత్తిళ్ల కారణంగా సిక్స్ పాయింట్ ఫార్ములా తెరమీదికొచ్చింది. ఈ సిక్స్ పాయింట్ ఫార్ములా కారణంగా తెలంగాణ రీజనల్ కమిటీ సహా.. తెలంగాణకు కల్పించిన ఇతర రక్షణలన్నీ రద్దయిపోయాయి. ఈ విధంగా పేరుకే పెద్ద మనుషుల ఒప్పందంగా మిగిలిపోయింది. తెలంగాణ ప్రాంతంపై వివక్ష కొనసాగింది. అదే చివరికి ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష తీవ్ర రూపం దాల్చడానికి దారి తీసింది!!
అభ్యర్థులకు సలహా
పెద్ద మనుషుల ఒప్పందం అంశాన్ని చదివేటప్పుడు అభ్యర్థులు ముఖ్యమైన తేదీలు; సిఫార్సులు, కమిటీలు బాగా గుర్తుంచుకోవాలి. శ్రీకృష్ణ తదితర కమిటీల నివేదికలను చదవాలి. అదే విధంగా కె.వి.నారాయణ రాసిన Study on Regional committee పుస్తకంలో విస్తృత సమాచారం లభిస్తుంది.
హైదరాబాద్ హౌస్ వేదికగా ఒప్పందం
ఆంధ్ర నాయకులు తెలంగాణ ప్రాంత అభివృద్ధికి తాము అన్ని విధాలుగా నిబంధనల ప్రకారం వ్యవహరిస్తామని హామీ ఇచ్చారు. ఆ మేరకు 1956 ఫిబ్రవరి 20న ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో పెద్ద మనుషుల ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంలో 14 ముఖ్యాంశాలను పొందుపరిచారు.
  1. బడ్జెట్‌కు సంబంధించి ఉమ్మడి ఖర్చులను దామాషా ప్రకారం ఖర్చు చేయాలి. ఈ మేరకు తెలంగాణ ప్రాంతానికి చెందిన నిధుల్లో మిగులు ఉంటే వాటిని ఆ ప్రాంత అభివృద్ధికే కేటాయించాలి. దీన్ని అయిదేళ్ల తర్వాత సమీక్షించేలా రూపొందించారు.
  2. తెలంగాణలో మద్యపాన నిషేధం అమలు చేయాల్సి వస్తే.. దాని విధి విధానాలు ఖరారు చేసుకునే అధికారం తెలంగాణ ప్రాంత శాసనసభ్యులకే ఉంటుంది.
  3. తెలంగాణ ప్రాంతంలోని విద్యా వ్యవస్థ, ప్రవేశాలు తెలంగాణకే కేటాయించడం.
  4. ఒకవేళ విలీన క్రమంలో ఉద్యోగుల తొలగింపు చేయాల్సి వస్తే అది కూడా జనాభా దామాషా పద్ధతిలో చేయాలి.
  5. ఉమ్మడి ఉద్యోగాలకు సంబంధించి నియామకాలు కూడా దామాషా పద్ధతిలోనే జరగాలి.
  6. ఉర్దూ భాషను మరికొంత కాలం (కనీసం అయిదేళ్లయినా) అధికారిక వ్యవహరాల్లో కొనసాగించే వీలు కల్పించాలి. తెలుగు భాష వినియోగం తప్పనిసరి చేయనవసరం లేదు.
  7. ముల్కీ నిబంధనలు యథావిథిగా కొనసాగించాలి.
  8. తెలంగాణలో వ్యవసాయ భూముల అమ్మకాలు ప్రాంతీయ మండలి నియంత్రణలో జరగాలి.
  9. తెలంగాణ అభివృద్ధి దిశగా అవసరాలు, మార్గ నిర్దేశనాలు రూపొందించడానికి ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేయాలి.
  10. 20 మంది సభ్యులతో కూడిన తెలంగాణ ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేయాలి. వీరంతా శాసన సభ, పార్లమెంటు సభ్యులై ఉండాలి. తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులు ఈ మండలిలో ఉండాలి.
  11. తెలంగాణ ప్రాంతీయ కౌన్సిల్‌కు సంబంధించి ఈ అంశాలతోపాటు తెలంగాణ ప్రాంత అభివృద్ధికి అవసరమైన విధి విధానాలు రూపకల్పన బాధ్యత కౌన్సిల్‌కు ఇవ్వాలి. ఈ ఏర్పాటు 10 సంవత్సరాలపాటు కొనసాగాలి.
  12. కేబినెట్‌లో ఇరు ప్రాంతాలకు దామాషా పద్ధతిన మంత్రి పదవులు ఇవ్వాలి. 60 శాతం ఆంధ్ర, 40 శాతం తెలంగాణ. తెలంగాణ నుంచి ఎంపిక చేసిన మంత్రుల్లో ఒకరు కచ్చితంగా ముస్లిం వర్గీయులై ఉండాలి.
  13. ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తి అయితే ఉప ముఖ్యమంత్రి తెలంగాణకు చెందిన వ్యక్తి ఉండాలి. అదే విధంగా ముఖ్యమంత్రి తెలంగాణకు చెందిన వ్యక్తి అయితే ఉప ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ చెందిన వారై ఉండాలి. హోం శాఖ, ఆర్థిక శాఖ, రెవెన్యూ శాఖ, ప్రణాళిక-అభివృద్ధి, వాణిజ్యం- పరిశ్రమ శాఖల్లో రెండు తెలంగాణ నుంచి వచ్చిన మంత్రులకు కేటాయించాలి.
  14. హైదరాబాద్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీని పెద్ద మనుషుల ఒప్పందం రోజు నుంచి పదేళ్ల పాటు ప్రత్యేకంగా ఉంచాలి.
ఉల్లంఘనల పరంపర..
అందరూ అనుమానించినట్లుగానే పెద్ద మనుషుల ఒప్పందం ఉల్లంఘన మొదటినుంచే ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ అవతరణ రోజున ఏర్పడిన నీలం సంజీవ్‌రెడ్డి మంత్రివర్గంలో తెలంగాణవారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు. అంతేకాకుండా తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఉద్యోగ ఖాళీల్లో ఆంధ్ర ప్రాంతంవారిని పెద్దయెత్తున నియమించారు. తెలంగాణ ప్రాంతంలోని లక్షలాది ఎకరాల భూములను ఆంధ్ర ప్రాంతం నుంచి వలస వచ్చినవారు తెలంగాణ ప్రాంతీయ కమిటీ అనుమతి లేకుండానే కొన్నారు. తెలంగాణలోని విద్యాసంస్థల్లోనూ ఆంధ్రా ప్రాంత విద్యార్థులకు పెద్దయెత్తున ప్రవేశాలు కల్పించారు. తెలంగాణ ప్రాంత మిగులు నిధులను ఆంధ్ర ప్రాంతం అభివృద్ధి కోసం భారీగా తరలించారు. ఇలా.. పెద్ద మనుషుల ఒప్పందంలోని ఉల్లంఘనల పరంపర, తెలంగాణ ప్రజల పట్ల వివక్ష కొనసాగింది.
Published date : 25 Sep 2015 06:12PM

Photo Stories