Skip to main content

గ్రూప్-2 ఇంటర్వ్యూలో విజయానికి మెలకువలు...

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) నిర్వహించిన గ్రూప్-2 ఫలితాలపై కోర్టు స్పష్టతనిచ్చింది. ఓఎంఆర్ షీట్‌లో డబుల్ బబ్లింగ్, వైట్‌నర్ వినియోగంపై కోర్టులో దాఖలైన వ్యాజ్యాన్ని పరిష్కరిస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. వైట్‌నర్ వినియోగించిన ఓఎంఆర్ షీట్లను, డబుల్ బబ్లింగ్ చేసిన వారిని తొలగించాలని కోర్టు పేర్కొంది. దీంతో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న గ్రూప్-2 అభ్యర్థులకు ఊరట లభించినట్లైంది. 2016 నవంబర్‌లో నిర్వహించిన గ్రూప్-2లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు త్వరలో మౌఖిక పరీక్షలు నిర్వహించే అవకాశముంది. ఈ నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీ గ్రూప్-2 ఇంటర్వ్యూలో విజయానికి మెలకువలు...
ఇంటర్వ్యూ కీలకం..
గ్రూప్-2 పరీక్ష.. నాలుగు పేపర్లతో ఒక్కో పేపర్‌కు 150 మార్కుల చొప్పున మొత్తం 600 మార్కులకు జరిగింది. ఇంటర్వ్యూకు 75 మార్కులు కేటాయించారు. ప్రతి ఒక్క మార్కు ఎంతో కీలకమైన గ్రూప్-2లో అభ్యర్థులు ఇంటర్వ్యూలో సాధించే మార్కులు తుది ఎంపికలో ప్రధాన పాత్ర పోషించనున్నాయి. కాబట్టి ఇంటర్వ్యూలో మంచి మార్కులు పొందేందుకు కృషి చేయాలి.

వ్యక్తిత్వ వికాసంపైనే..
టీఎస్‌పీఎస్సీ గ్రూప్-2 ఇంటర్వ్యూలను నిర్వహించే బోర్డు.. అభ్యర్థుల విషయ పరిజ్ఞానం కంటే.. వ్యక్తిత్వ వికాసానికి అధిక ప్రాధాన్యమిచ్చే అవకాశముంది. ఎందుకంటే.. రాత పరీక్షలోనే అభ్యర్థి నాలెడ్జ్ ఏంటో తెలిసిపోతుంది. వాస్తవానికి ప్రభుత్వ అధికారిగా విధులను సమర్థంగా నిర్వహించగలిగే నైపుణ్యాలు అభ్యర్థిలో ఉన్నాయా లేవా అనే విషయాన్ని నిర్ధారించడానికే ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఆ క్రమంలో ప్రధానంగా అభ్యర్థి ప్రాంతం, విద్యా నేపథ్యంతోపాటు... కమ్యూనికేషన్ స్కిల్స్, విశ్లేషణ నైపుణ్యాలు, రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ పరిణామాలపై ఉన్న సహజ అవగాహనను తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. దాంతోపాటు అభ్యర్థి వ్యక్తిత్వం, నిజాయితీ, నిర్భీతి, ఆత్మవిశ్వాసం, పరిణితి తదితర అంశాలను అంచనా వేయడానికి ఇంటర్వ్యూ ఉపయోగపడుతుంది.

ఆ అభిప్రాయం కలగాలంటే..
టీఎస్‌పీఎస్సీ నిర్వహించే ఇంటర్వ్యూలో అభ్యర్థి స్వస్థలం.. భౌగోళికంగా ఆ ప్రాంత విశిష్టతలు.. అక్కడి నదులు, రిజర్వాయర్లు, దేవాలయాలు, పర్యాటక ప్రాంతాలు.. ఆ ప్రాంతంలో పేరొందిన వ్యక్తులు.. సాహిత్యంతో ముడిపడిన ప్రముఖులు.. తదితర అంశాలపై అభ్యర్థి అవగాహనను తెలుసుకునేలా ప్రశ్నలు అడిగే అవకాశముంది. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. కాబట్టి మొదట్లోనే బోర్డుకి మీ మీద సానుకూల అభిప్రాయం కలగాలంటే.. పైన చెప్పిన ప్రాథమిక అంశాలకు సంబంధించి ఎలాంటి ప్రశ్నలు అడిగినా తడబాటు లేకుండా చెప్పగలగాలి. దీంతోపాటు అభ్యర్థి బయోడేటాపై తప్పనిసరిగా ప్రశ్నలు ఉంటాయి. అభ్యర్థి కుటుంబం, విద్యార్హతలు, చదివిన కాలేజీలు, ఉద్యోగం చేస్తుంటే.. ప్రస్తుత ఉద్యోగం తీరుతెన్నులపై ఎక్కువగా దృష్టిసారించాలి.

వర్తమాన అంశాలపై..
నేపథ్యం మీద ప్రశ్నలు ముగిసిన తర్వాత అభ్యర్థికి సమకాలీన అంశాలపై అభిప్రాయాలను, పరిజ్ఞానాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి వర్తమాన అంశాలపై అభ్యర్థులు పూర్తి అవగాహన పెంచుకోవాలి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ వర్తమాన అంశాలపై పట్టు సాధించాలి. గత 6 నెలల వర్తమాన అంశాలను ప్రిపేర్ కావాలి. అభ్యర్థులు సమకాలీన అంశాలను లోతుగా అధ్యయనం చేయాలి. అందుకోసం ప్రముఖ తెలుగు, ఆంగ్ల పత్రికల్లో వచ్చిన ఎడిటోరియల్స్ చదవడం లాభిస్తుంది. అంతర్జాతీయ, జాతీయ, రాష్ర్ట స్థాయిల్లో ఇటీవల వార్తల్లో నిలిచిన సంఘటనలను అన్ని కోణాల్లో అధ్యయనం చేసి.. వాటిపై ఒక అభిప్రాయం ఏర్పరచుకోవాలి. ఆ అభిప్రాయాన్ని సమర్థించుకునే పాయింట్లు సిద్ధం చేసుకోవాలి.

ఈ అంశాలపై లోతుగా..
ఇంటర్వ్యూలో.. రుపాయి క్షీణించడం, ట్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్, సుప్రీంకోర్టు తాజాగా చెల్లదంటూ తేల్చిన సెక్షన్ 497(అడల్టరీ) పూర్వాపరాలు, మీ టూ ఉద్యమం, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంక్షోభం, భారత్ రష్యాల మధ్య ఇటీవల పుతిన్ పర్యటనలో జరిగిన ఒప్పందాలు, చమురు ధరల పెరుగుదల-నియంత్రణ మార్గాలు, పరువు హత్యలు, అర్బన్ నక్సలైట్, ఇటీవల దేశంలో జరుగుతున్న రైతు ఉద్యమాలు, కర్ణాటక రాజకీయాలు, తెలంగాణలో ముందస్తు ఎన్నికలు, తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిణామాలపై అవగాహన కలిగి ఉండాలి. ఆయా అంశాలపై ప్రశ్నలు సంధించి... అభ్యర్థి అభిప్రాయం కోరే అవకాశముంది. దీంతోపాటు సామాజిక సమస్యలు, కుల వ్యవస్థ, మహిళలపై దాడులు, అవినీతి వంటి అంశాలపైనా పూర్తి స్థాయిలో అవగాహన ఏర్పరచుకోవాలి.

నిర్ణయాత్మక సామర్థ్యంపై :
అభ్యర్థుల ‘డెసిషన్ మేకింగ్’ ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు కొన్ని విపత్కర పరిస్థితులను ఉదాహరణగా చెప్పి.. క్లిష్టమైన సందర్భంలో ఎలా వ్యవహరిస్తారో తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తారు.

బీ కూల్..
బోర్డు రూంలోకి ప్రవేశించాక.. ముందుగా బోర్డ్ చైర్మన్‌తోపాటు సభ్యులను విష్ చేయడం.. ఇంటర్వ్యూ పూర్తయ్యాక తిరిగి వెళ్లేటప్పుడు కృతజ్ఞతలు తెలియజేయడం మరవకూడదు. అలాగే అనుమతించాక కుర్చీలో కూర్చోవడం, కూర్చునేందుకు అనుమతిచ్చినందుకు థ్యాంక్స్ చెప్పడం వంటివి చేయాలి. దాంతోపాటు ఇంటర్వ్యూ ఆసాంతం ప్రశాంత వదనంతో సందర్భానికి తగ్గట్టు చిరునవ్వుతో సమాధానం చెప్పే ప్రయత్నం చేయాలి.

బాడీ లాంగ్వేజ్ :
బాడీ లాంగ్వేజ్‌లోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటర్వ్యూ సమయంలో.. తల, శరీర కదలికలు, చేతుల ద్వారా హావభావాలు కనీస స్థాయిలో ఉండేలా చూసుకోవాలి. కంటి చూపు (ఐ కాంటాక్ట్) కూడా ముఖ్యమే. ఇది తక్కువ తీక్షణతతో అత్యంత సహజంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దీంతోపాటు వేషధారణపైనా దృష్టిపెట్టాలి. ఆడంబరాలకు పోకుండా.. సింపుల్‌గా, హుందాగా నప్పే దుస్తులతో వెళ్లడం మేలు. హుందాతనం ఉట్టిపడే చక్కటి వేషధారణతో సభ్యుల దృష్టిలో పడొచ్చు. పురుష అభ్యర్థులు లైట్ కలర్ ఫుల్ హ్యాండ్ షర్ట్, ముదురు రంగు ప్యాంటు వేసుకుంటే మంచిది. అలాగే ఫార్మల్ షూస్ వేసుకోవాలి. మహిళలు చుడీదార్లు, చీరలు ధరించవచ్చు.

సమాధానాలు చెప్పే తీరు :
ఇంటర్వ్యూ అనేది ప్రధానంగా అభ్యర్థి పర్సనాలిటీ(వ్యక్తిత్వం)ని అంచనా వేయడానికి ఉద్దేశించింది. అందువల్ల బోర్డు అడిగే ప్రశ్నలకు సూటిగా, స్పష్టంగా సమాధానం చెప్పాలి. అంతేకాకుండా అభ్యర్థి మాటల్లో నిజాయితీ, ఆత్మవిశ్వాసం ధ్వనించాలి. నిజానికి ఇంటర్వ్యూ బోర్డులోకి ప్రవేశించిన తర్వాత.. అభ్యర్థికి సుహృద్భావ వాతావరణం కల్పించే ప్రయత్నమే జరుగుతుంది. స్నేహపూరిత వాతావరణంలోనే ఇంటర్వ్యూలు జరుగుతాయి. కాబట్టి సమాధానాలు చెప్పే సమయంలో ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఉండాలి. బిగుసుకుపోయినట్లు కాకుండా.. నిబ్బరంగా కూర్చోవాలి. సమాధానాలు చెప్పేటప్పుడు స్పష్టంగా మాట్లాడాలి. టోన్ మరీ ఎక్కువ కాకుండా.. సందర్భానుసారంగా వినసొంపైన గొంతుతో మాట్లాడాలి. సమాధానం తెలియని ప్రశ్నలకు తెలియదని చెప్పాలి. కొన్నిసార్లు బోర్డు సభ్యులు మీ సహనాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలు సంధించే ఆస్కారముంది. కాబట్టి బోర్డు సభ్యుల పట్ల గౌరవంతో మెలుగుతూ సహనంతో సమాధానాలు ఇవ్వాలి.

ప్రశ్నలు ఇలా అడిగే అవకాశం..
  • మొత్తంగా ఇంటర్వ్యూలో అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో చోటుచేసుకున్న పరిణామాలపై ఎక్కువగా ప్రశ్నలు అడుగుతారని నిపుణులు చెబుతున్నారు. అలానే, అభ్యర్థి ప్రొఫైల్ ఆధారంగా బోర్డు సభ్యుల ప్రశ్నలు ఉంటాయి. ఉదాహరణకు టీచర్‌గా విధులు నిర్వర్తిస్తున్న వారిని విద్యా రంగానికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు.
  • మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ లాంటి ప్రభుత్వ పథకాల ప్రాముఖ్యత, వాటి ఉద్దేశం, ఆయా పథకాలకు ఎంత నిధులు అవసరం.. వాటిని ప్రభుత్వం ఎలా సమకూర్చుకుంటుంది. ఏయే సంస్థల నుంచి కావాల్సిన నిధులు తెచ్చుకుంటుంది. ఆయా పథకాల అంచనా బడ్జెట్లు ఎంతెంత?
  • మీకు బాగా నచ్చిన, నచ్చని రాష్ర్ట ప్రభుత్వ పథకాలు ఏమిటి? అందుకు గల కారణాలు?
  • రాష్ట్రానికి సంబంధించి కృష్ణ-గోదావరి నదీ జల వివాదాలపై అభ్యర్థికి ఉన్న విషయ పరిజ్ఞానాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలు అడుగుతారు. మరీ ముఖ్యంగా కృష్ణా నదిపై ఎక్కువగా వివాదాలు రావడానికి కారణాలు ఏమిటని అడగొచ్చు.
  • తెలంగాణ ప్రభుత్వం-భూసేకరణ ప్రాధాన్యత, రాష్ట్రంలో భూసేకరణకు సంబంధించి ప్రభుత్వం ఎదుర్కొంటున్న సమస్యలు, ఒకవేళ మీరు డిప్యూటీ తహశీల్దార్‌గా ఎంపికైతే ప్రజా సమస్యలను ఎలా పరిష్కరిస్తారు, ప్రజలను ఎలా మెప్పిస్తారు? అని అడగొచ్చు.
  • ఒకవేళ మీరు మున్సినల్ కమిషనర్‌గా ఎంపికైతే పురపాలికలను అభివృద్ధి బాటలో ఎలా నడిపిస్తారు? ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్‌గా ఎంపికైతే గ్రామాల అభివృద్ధికి ఎలా కృషి చేస్తారు వంటి ప్రశ్నలు కూడా ఎదురయ్యే అవకాశముంది.
  • అభ్యర్థి చదువు నేపథ్యాన్ని బట్టి కూడా ప్రశ్నలు సంధించే అవకాశముంది. ఉదాహరణకు ఫార్మసీ నేపథ్యం ఉన్న అభ్యర్థులైతే ఔషధాల గురించి ప్రశ్నలు అడగొచ్చు. డ్రగ్స్ వినియోగానికి సంబంధించి ఒకింత లోతైన ప్రశ్నలు కూడా ఎదురుకావచ్చు.
  • కొత్తగా జిల్లాల ఏర్పాటు జరిగిన నేపథ్యంలో... జిల్లాల సమాచారంపై ప్రశ్నలు ఎదురయ్యే అవకాశముంది. ముఖ్యంగా ఆయా జిల్లాల్లో పర్యాటక ప్రాంతాలు, ప్రముఖ వ్యక్తులు, రాజ కీయ నాయకులు, జిల్లా విశిష్టతపై అభ్యర్థుల అవగాహనను పరీక్షిస్తారు.
Published date : 22 Oct 2018 05:56PM

Photo Stories