Skip to main content

తెలంగాణ రాష్ర్ట అడవులు

అడవులు మానవాభివృద్ధితోపాటు దేశ, రాష్ర్ట ఆర్థికాభివృద్ధికీ తోడ్పడతాయి. అడవుల వల్ల వాతావరణ కాలుష్య నియంత్రణతో పాటు సకాలంలో వర్షాలు కురిసి ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం చేకూరుతుంది. అంతేకాకుండా వన్యప్రాణులను సంరక్షిస్తాయి. అటవీ ఉత్పత్తులు, ఆక్సిజన్, మృత్తిక పోషకాలను కూడా అడవులు అందిస్తున్నాయి.
2015 ఆర్థిక సర్వే ప్రకారం తెలంగాణలో అడవులు 29,242 చ.కి.మీ. వైశాల్యంలో విస్తరించి ఉన్నాయి. ఇవి రాష్ర్టం మొత్తం వైశాల్యంలో 25.46 శాతం. కానీ తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు తర్వాత ఖమ్మం జిల్లాలోని 327 ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపడం వల్ల రాష్ర్ట అడవుల విస్తీర్ణం 26,903.70 చ.కి.మీ.కు తగ్గింది. ఇది రాష్ర్ట వైశాల్యంలో 23.99 శాతం.తెలంగాణ.. అడవుల విస్తీర్ణంలో దేశంలో పన్నెండో స్థానంలో ఉంది.
గమనిక: మన జాతీయ అటవీ విధానం (1952), పర్యావరణ సమతుల్యత దృష్ట్యా ఒక ప్రాంత వైశాల్యంలో 33 శాతం అడవులను కలిగి ఉండాలి.
  • తెలంగాణలో అడవుల విస్తీర్ణం అధికంగా ఉన్న జిల్లాలు వరుసగా.. 1. ఆదిలాబాద్, 2. ఖమ్మం
  • రాష్ర్టంలో అడవుల విస్తీర్ణం తక్కువగా ఉన్న జిల్లాలు 1. రంగారెడ్డి 2. నల్లగొండ.
  • రాష్ర్టంలో జిల్లా భౌగోళిక విస్తీర్ణం పరంగా అడవుల శాతం ఎక్కువగా ఉన్న జిల్లాలు 1. ఖమ్మం, 2. ఆదిలాబాద్
  • జిల్లా భౌగోళిక విస్తీర్ణం పరంగా అడవులు అత్యల్పంగా ఉన్న జిల్లాలు 1. నల్లగొండ 2. మెదక్.
పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ర్టంలోని అడవులను మూడు రకాలుగా విభజించారు. అవి..
1) రిజర్వేడ్ అడవులు: ఇవి రాష్ర్టంలో 18,294.52 చ.కి.మీ. విస్తీర్ణంతో మొత్తం అడవుల వైశాల్యంలో 68 శాతం వరకు విస్తరించి ఉన్నాయి.
2) రక్షిత అడవులు: ఇవి 7,802.07 చ.కి.మీ. విస్తీర్ణంతో రాష్ర్టం మొత్తం అడవుల వైశాల్యంలో 29 శాతం వరకు ఉన్నాయి.
3) విభజించిన అడవులు: ఇవి సుమారు 807.11 చ.కి.మీ.లలో మొత్తం అటవీ విస్తీర్ణంలో 3 శాతం ఉన్నాయి.
  • తెలంగాణ రాష్ర్ట వృక్షం - జమ్మిచెట్టు.
  • తెలంగాణ రాష్ర్ట పుష్పం - తంగేడు.
తెలంగాణ రాష్ర్ట అడవులు - రకాలు
సాధారణంగా అడవుల పెరుగుదల ఒక ప్రాంత వర్షపాతం, ఉష్ణోగ్రత, ఎత్తు వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. తెలంగాణలో ఆర్థికంగా అతి ముఖ్యమైన అడవులు ఆకురాల్చే అడవులు. వీటితోపాటు రాష్ర్టంలో చిట్టడవులు ఉన్నాయి. కానీ రాష్ర్టంలో సతతహరిత, మడ, పర్వత తదితర అడవులు కనిపించవు.
ఉష్ణ మండల ఆకురాల్చే అడవులు: ఈ అడవులు తెలంగాణలో ఎక్కువగా ఉన్నాయి. ఇవి తక్కువ వర్షం, అధిక వేడి ప్రాంతాలు, ఎక్కువగా పీఠభూమి ప్రాంతాల్లో పెరుగుతాయి. ఇవి ముఖ్యంగా రెండు రకాలు..
  • ఉష్ణమండల ఆర్థ్ర (లేదా) తేమ ఆకురాల్చే అడవులు: ఈ అరణ్యాలు 100 నుంచి 200 సెం.మీ. వార్షిక వర్షపాతం గల ప్రాంతాలు, 27 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత గల ప్రాంతాలు, సముద్ర మట్టానికి సుమారు 300 నుంచి 500 మీటర్ల ఎత్తయిన ప్రాంతాలు, కొండల అంచులు తదితర ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ అడవులు తెలంగాణలో ఎక్కువగా ఉన్నాయి. ఇవి ముఖ్యంగా ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. ఈ అడవుల్లో ప్రధానంగా వేగి, ఏగిస, మద్ది, సాల్, వెదురు, బండారు, జిట్టేగి, తంగేడు, విప్ప మొదలైన చెట్లు కనిపిస్తాయి.
  • ఉష్ణమండల శుష్క (లేదా) అనార్థ్ర ఆకురాల్చే అడవులు: ఈ అరణ్యాలు 70 - 100 సెం.మీ. వార్షిక వర్షపాతం గల ప్రాంతాల్లో సరాసరి 23 నుంచి 29 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాల్లో సముద్రమట్టానికి 150 నుంచి 300 మీటర్ల ఎత్తుగల ప్రాంతాల్లో విస్తరించి ఉంటాయి. ఈ అరణ్యాల్లో ప్రధానంగా టేకు, వేప, వెదురు, వెలగ, తునికి, చిగురు బిల్లా, మోదుగ, మద్ది, బూరుగ వంటి వృక్షాలు పెరుగుతాయి. ఈ అడవులు ప్రధానంగా రంగారెడ్డి, మెదక్, వరంగల్, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి.
చిట్టడవులు లేదా ఉష్ణమండల పొదలు: ఈ అరణ్యాలు 75 సెం.మీ. కంటే తక్కువ వార్షిక వర్షపాతం గల ప్రాంతాలు, అధిక ఉష్ణోగ్రత ఉండే పొడి ప్రాంతాల్లో పెరుగుతాయి. ఈ అడవులు దట్టంగా ఉండవు. ఈ అడవుల్లో పెరిగే వృక్షాలు తుమ్మ, రేగుచెట్లు, బలుసు, మర్రి, బ్రహ్మజెముడు, నాగజెముడు లాంటివి పెరుగుతాయి. ఈ అడవులు ప్రధానంగా నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఉన్నాయి.

ప్రధాన అటవీ ఉత్పత్తులు
వెదురు: ఇది తక్కువ కాలంలో అత్యంత వేగంగా పెరిగే మొక్క. దీన్ని గృహనిర్మాణం, గృహాలంకరణ వస్తువుల తయారీకి ఉపయోగిస్తారు. దీన్ని పేపర్ తయారీకి వాడతారు. వెదురు కర్ర నుంచి పోలీసుల లాఠీ తయారు చేస్తారు. దీన్ని ‘పేదవాడి కలప’ అని అంటారు. ఇది ఖమ్మం జిల్లాలో అత్యధికంగా విస్తరించి ఉండగా, ఉత్పత్తి మాత్రం ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువ.
టేకు: దీన్ని ‘ప్రాక్ దేశపు రాజ్యవృక్షం’ అంటారు. ఇది అత్యంత మన్నికైన కలపను ఇస్తుంది. ఇది ఎక్కువగా గోదావరి పరీవాహక జిల్లాలైన ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాలో విస్తరించి ఉంది.
సరివి (కాజురైనా): తెలంగాణలోని అన్ని జిల్లాల్లో చవిటి నేలల ప్రాంతంలో కనిపిస్తాయి. ఇది ఎడారి లక్షణం ఉన్న చెట్టు. దీన్ని టెంట్ కర్రలకు, ఇళ్ల నిర్మాణంలో సపోర్టుకు వాడతారు.
ఇండియన్ రోజ్‌వుడ్ (డాల్ బర్జియా): ఇది ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కనిపిస్తుంది. దీన్ని రైల్వే వాగన్లు, బోగీల తయారీలో ఉపయోగిస్తారు.
ఉసిరి: ఇది ఎడారి లక్షణం గల చెట్టు. ఇది అన్ని జిల్లాల్లో కనిపిస్తుంది. ఇది ‘సి’ విటమిన్‌కు ప్రధాన వనరు.
పుణికి చెట్టు: ఇది ఆదిలాబాద్ జిల్లాలో కనిపిస్తుంది. దీన్ని ‘నిర్మల్ కొయ్యబొమ్మల’ తయారీకి ఉపయోగిస్తారు.
రూసా గడ్డి: ఇది నిజామాబాద్ జిల్లాలోని అడవుల్లో పెరుగుతుంది. దీన్ని సెంట్‌ల తయారీలో ఉపయోగిస్తారు.
తుంగ గడ్డి: ఇది మహబూబ్‌నగర్ జిల్లాలో లభిస్తుంది. దీన్ని ‘తుంగచాపల’ తయారీలో ఉపయోగిస్తారు.
బీడి ఆకులు: వీటిని బీడిల తయారీకి ఉపయోగిస్తారు. ఈ ఆకులను తునికాకు, తెండు ఆకులు అని పిలుస్తారు. ఇవి ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో లభిస్తాయి.
విప్ప పువ్వు: దీన్ని సారా తయారీకి ఉపయోగిస్తారు. ఆదిలాబాద్, ఖమ్మం, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లోని అడవుల్లో లభిస్తాయి
తెలంగాణ రాష్ర్టంలోని అటవీ సంబంధిత సంస్థలు
  • తెలంగాణ ఫారెస్ట్ అకాడమీ - దూలపల్లి (రంగారెడ్డి)
  • అటవీ క్షేత్ర పరిశోధన కేంద్రం - దూలపల్లి (రంగారెడ్డి)
  • ఫారెస్ట్ రీసెర్చ్ డివిజన్ - హైదరాబాద్, వరంగల్
  • స్టేట్ ఫారెస్ట్ రీసెర్‌‌చ అండ్ డెవలప్‌మెంట్ - హైదరాబాద్ సర్కిల్
  • ప్రాంతీయ అటవీ పరిశోధన కేంద్రం - ములుగు (మెదక్)
సామాజిక అడవులు
 సామాజిక అడవుల్లో ముఖ్యంగా వంట చెరకు, పశుగ్రాసం, కలప సేకరించడానికి పెద్ద ఎత్తున పథకాలు అమల్లోకి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమాలు ఐదో పంచవర్ష ప్రణాళిక నుంచి ప్రారంభమై 1980-82 సంవత్సరాల్లో భారీ ఎత్తున చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రంగారెడ్డి, మెదక్, నల్లగొండ, నిజామాబాద్ జిల్లాల్లో వంట చెరకు మొక్కలను నాటారు.
 తెలంగాణ రాష్ర్ట అటవీశాఖ, ప్రజల భాగస్వామ్యంతో వన సంరక్షణ సమితులు, ఎకో డెవలప్‌మెంట్ కమిటీలు, నదీలోయ ప్రాంతాల్లో వాటర్‌షెడ్ డెవలప్‌మెంట్ కమిటీలు నిర్వహిస్తోంది. వీటిని ‘త్రి-టైర్ సిస్టమ్’లో ఉంటాయి. అవి..
 1. రాష్ర్ట స్థాయిలో - స్టేట్ ఫారెస్ట్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ఎస్‌ఎఫ్‌డీఏ).
 2. డివిజన్ స్థాయిలో - ఫారెస్ట్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ఎఫ్‌డీఏ).
 3. గ్రామ స్థాయిలో - వన సంరక్షణ సమితి (వీఎస్‌ఎస్).
Published date : 30 Jul 2016 11:34AM

Photo Stories