Skip to main content

నిజాంల పాలనలో తెలంగాణ సాగునీటి రంగం

తెలంగాణ ప్రాంతంలో కాకతీయుల, చోడ రాజుల కాలం నుంచి గొలుసు చెరువులను నిర్మించి ఒక పద్ధతి ప్రకారం నీటి పారుదల సౌకర్యాలు కల్పించారు. హైదరాబాద్ సంస్థానంలో రాజకీయ, పరిపాలనా సంస్కరణలను ప్రవేశపెట్టిన సాలార్జంగ్.. 1868లో స్పష్టమైన నీటిపారుదల విధానాన్ని రూపొందించి ‘ఇరిగేషన్ బోర్డు’ను ఏర్పాటు చేశారు. పబ్లిక్ వర్‌‌క్స (ప్రజా పనుల) శాఖలో భాగంగానే ఈ బోర్‌‌డ ఉండేది. అంతకు ముందు ఒక స్పష్టమైన నీటిపారుదల విధానం లేదు. తాలూక్దార్లు, ఇతర రెవెన్యూ అధికారులు చెరువులు, కుంటల నిర్వహణను చూసేవారు. వీటి నిర్వహణకోసం నిజాం ప్రభుత్వం బడ్జెట్‌లో ఏటా సుమారు రూ.2 లక్షలు కేటాయించేది. మారుమూల ప్రాంతాల్లోని చెరువుల పర్యవేక్షణ అధికారులకు సాధ్యమయ్యేదికాదు.
నిజాం సంస్థానంలో ప్రవహించే కృష్ణా, గోదావరి నదులు, వాటి ఉపనదుల నీటిని సాగుకు వినియోగించాలనే ప్రణాళికలు 1870కి పూర్వం నిజాం ప్రభుత్వానికి లేవు. బ్రిటిష్ మిలటరీ ఇంజనీర్ ఆర్థర్ కాటన్ సంస్థాన సరిహద్దులో గోదావరి నదిపై ఇచ్చంపల్లి వద్ద 1858లో ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించాడు. అయితే ఇంజనీర్లు ప్రాణాంతక వ్యాధులతో మరణించడంతో ప్రాజెక్టు అర్ధంతరంగా నిలిచిపోయింది.
ఏడో నిజాం పాలనలో తెలంగాణలో నీటి పారుదల సౌకర్యాలు
ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ మరణానంతరం 1911లో ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ హైదరాబాద్ సంస్థానం పాలనా బాధ్యతలు చేపట్టారు. చెరువులను పునరుద్ధరించడానికి సర్వే జరిపించాలని 1921-22లో నిజాం ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం 2 బృందాలను ఏర్పాటు చేసింది. ఒక సర్వే బృందం గోదావరి, దాని ఉపనదులు ప్రవహించే ప్రాంతంలో, మరో బృందం కృష్ణానది, దాని ఉపనదులు ప్రవహించే ప్రాంతంలో సర్వే చేపట్టాయి. ఈ బృందాలిచ్చిన నివేదికల ఆధారంగా నిజాం ప్రభుత్వం 984 చెరువులకు 65,48,346 ఉస్మానియా సిక్కాలను మంజూరు చేసింది.
1923-25లో నిజాం ప్రభుత్వ డెవలప్‌మెంట్ బోర్డు పాత చెరువులు, కుంటలు, బావులకు మరమ్మతులు చేయడంతోపాటు కొత్తగా ప్రాజెక్టులు నిర్మించి వర్షపు నీటిని, నదీజలాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని భావించింది. అందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించింది.
ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ తెలంగాణలో, హైదరాబాద్ సంస్థానంలోని ఇతర ప్రాంతాల్లో అతివృష్టి, అనావృష్టి సమస్యలకు పరిష్కారం బావులు, చెరువులు, ప్రాజెక్టుల నిర్మాణమేనని భావించాడు. నీటిపారుదల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇచ్చాడు.
తిండి లేక, తాగు, సాగు నీటికి నోచుకోక ప్రజలు పడుతున్న బాధలు, పెరుగుతున్న ఆహారధాన్యాల ధరలు నిజాంను ఆందోళనకు గురిచేశాయి. నీటిపారుదల వసతిని పెంచడమే వీటికి తగిన పరిష్కారమని మీర్ ఉస్మాన్ అలీఖాన్ అభిప్రాయపడ్డారు. స్పష్టమైన నీటిపారుదల విధానాన్ని రూపొందించారు. దీని పర్యవసానంగానే 1922-48 మధ్యకాలంలో వేలాది చెరువులు, కుంటలు, చిన్న నీటిపారుదల ప్రాజెక్టులు, డజనుకు పైగా భారీ నీటి పారుదల ప్రాజెక్టులను చేపట్టారు. వాటి వివరాలు..
పోచారం ప్రాజెక్టు
ఏడో నిజాం పాలనలో నిర్మించిన మొదటి ప్రాజెక్టు పోచారం మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు. దీన్ని నిజాం ప్రభుత్వం నిజామాబాద్ జిల్లా నాగిరెడ్డిపేట మండలం పోచారం గ్రామం వద్ద అల్లేరు వాగుపై 1922లో రూ.22.11 లక్షల వ్యయంతో నిర్మించింది. ఈ ప్రాజెక్టు ద్వారా నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి మండలాల్లోని 42 గ్రామాల్లో 10,500 ఎకరాల భూమి సాగులోకి వచ్చింది. పోచారం ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 1.82 టీఎంసీలు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రస్తుతం ఎల్ల్లారెడ్డి నియోజకవర్గంలో రెండు పంటలు కలిపి సుమారు 17 వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది. పోచారం ప్రాజెక్టు పనులను 1915లో ప్రారంభించారు. 13 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించే లక్ష్యంతో రూ.32 లక్షల అంచనా వ్యయంతో దీన్ని ప్రారంభించారు.
నిజాం సాగర్ ప్రాజెక్టు
గోదావరి ఉపనది అయిన మంజీరాపై భారీ ప్రాజెక్టును నిర్మించాలని నిజాం ప్రభుత్వం సంకల్పించింది. 1916లో అప్పటి పబ్లిక్ వర్‌‌క్స శాఖ ప్రభుత్వ కార్యదర్శి, ప్రముఖ ఇంజనీర్ నవాబ్ అలీ నవాజ్‌జంగ్ నిజాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి అనువైన స్థలం ఎంపిక చేయడానికి సర్వే ప్రారంభించారు.
ఆ తర్వాత ఈ ప్రాజెక్టు ఇన్వెస్టిగేషన్ పనులను పోచారం ప్రాజెక్టుకు ఇన్‌చార్జిగా పనిచేస్తున్న సీసీ పాల్‌కు అప్పగించారు. (1918లో నవాబ్ అలీ నవాజ్ జంగ్‌ను నిజాం ప్రభుత్వం చీఫ్ ఇంజనీర్‌గా నియమించింది). సీసీ పాల్ మంజీరా నదిపై బీదర్ జిల్లాలో రెండు స్థలాలను, నిజామాబాద్ జిల్లాలోని ఎల్లారెడ్డికి పశ్చిమ దిశలో 7 మైళ్ల దూరంలో మరో స్థలాన్ని ఎంపిక చేశారు. చీఫ్ ఇంజనీర్ అలీ నవాజ్ జంగ్ 1920 జూన్‌లో ఎల్లారెడ్డి సమీపంలోని స్థలాన్ని పరిశీలించారు. సీసీపాల్ ఎంపిక చేసిన స్థలానికి 1.5 మైళ్ల ఎగువన మాల్‌దొడ్డి గ్రామం వద్ద డ్యాం నిర్మిస్తే ముంపు తక్కువగా ఉంటుందని నవాజ్ జంగ్ భావించారు. ఆ స్థలంలో మంజీరా నది రెండు పాయలుగా చీలి ఒక మైలు దిగువన మళ్లీ కలుస్తుంది. ఇక్కడ ప్రాజెక్టు నిర్మాణానికి ఇన్వెస్టిగేషన్‌కు నిజాం రాజు 1922 జూలై 26న అనుమతించారు. నిజామాబాద్ జిల్లాలో 377 గ్రామాల్లోని 2,75,000 ఎకరాలకు సాగునీరందించాలని నిజాం సంకల్పించారు. ఇన్వెస్టిగేషన్ నివేదిక అందిన తర్వాత 30-08-1923న 3 కోట్ల 5 లక్షల ఉస్మానియా సిక్కాల అంచనా వ్యయంతో నిజాంసాగర్ ప్రాజెక్టుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. 8-10 ఏళ్ల కాలంలో ప్రాజెక్టును పూర్తి చేయాలని ఆదేశించింది. 1931లో దీని నిర్మాణం పూర్తయింది. సవరించిన అంచనాల ప్రకారం దీని వ్యయం 4,26,79,000 ఉస్మానియా సిక్కాలు. 1933లో కాల్వలకు నీరు విడుదలైంది. నిజాంసాగర్ కాల్వల ద్వారా 452 పెద్ద, చిన్న చెరువులకు, కుంటలకు కూడా నీరందించారు. ఈ ప్రాజెక్టు ప్రధాన కాల్వను 62 మైళ్ల పొడవున (తోడిచ్‌పల్లి వరకు) నిర్మించారు. నిజాం సాగర్‌కన్నా ముందు నిర్మించిన మైసూర్‌లోని కృష్ణరాజ సాగర్ ప్రాజెక్టు, మద్రాస్‌లోని కావేరీ-మెట్టూరు ప్రాజెక్టు, బొంబాయిలోని నీరా డెవలప్‌మెంట్ ప్రాజెక్టుల వ్యయం కన్నా నిజాంసాగర్ ప్రాజెక్టు ఖర్చు తక్కువ. నిజాంసాగర్ రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం 29.14 టీఎంసీలు కాగా నీటి వినియోగ సామర్థ్యం 58 టీఎంసీలు. 2,60,000 ఎకరాల మొదటి (ఆబి) పంట; 40,000 ఎకరాల రెండో (తాబి) పంట; 20,000 ఎకరాల చెరకు పంటకు సాగు నీరందించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు నిర్మించారు. 400 గ్రామాలకు తాగునీటి సౌకర్యం కల్పించారు.
అప్పర్ మానేర్ ప్రాజెక్టు
గోదావరి నదికి మరో ఉపనది అయిన మానేర్‌పై కరీంనగర్ జిల్లాలోని కుడులేరు వాగు మానేరులో కలిసే చోట నర్మాల గ్రామం వద్ద అప్పర్ మానేర్ డ్యాం నిర్మించారు. 6.47 టీఎంసీల నీరు ఈ ప్రాజెక్టు స్థలం వద్ద మానేరులో అందుబాటులో ఉంది. ఈ నీటితో 32 వేల నుంచి 38 వేల ఎకరాల ఆయకట్టు సాగుకు నిజాం ప్రభుత్వం సంకల్పించింది. చీఫ్ ఇంజనీర్ నవాబ్ అలీ నవాజ్ జంగ్ ఆదేశంపై ఇంజనీర్ ఖాజా అజీముద్దీన్ ఈ ప్రాజెక్టు ప్రణాళికను సిద్ధం చేశారు. ఆ తర్వాత ముందుగా ఎంపిక చేసిన స్థలానికి 2 మైళ్ల ఎగువన 17,680 ఎకరాలకు సాగునీరందించే సామర్థ్యంతో ఈ ప్రాజెక్టును నిర్మించారు. 1945లో ప్రాజెక్టు నిర్మాణం మొదలై 1952లో పూర్తయింది. ముఖ్య పనులన్నీ 1949లోనే పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్టు ప్రధాన కాల్వ ద్వారా అనేక చెరువులను నీటితో నింపారు.
తుంగభద్ర జలాల కోసం ఒప్పందాలు, ప్రాజెక్టు నిర్మాణం
  • కృష్ణానది ఉపనది అయిన తుంగభద్ర నదీ జలాలను మద్రాసు, హైదరాబాద్ రాష్ట్రాలు సమష్టిగా వినియోగించుకోవడానికి 1920-30లో నవాబ్ అలీ నవాజ్ జంగ్ సారథ్యంలో సంబంధిత రాష్ట్రాల ఇంజనీర్ల మధ్య చర్చలు జరిగాయి.
  • 1930 అక్టోబర్ 27న కృష్ణా నది దిగువన, ఎగువన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలకు సర్వే చేయాలని నిర్ణయించారు.
  • 1933లో మల్లాపురం వద్ద తుంగభద్ర డ్యాం నిర్మాణానికి బొంబాయి, మద్రాసు, మైసూరు, హైదరాబాద్ రాష్ట్రాలు ఒక స్థూల అవగాహనకు వచ్చాయి. 1944 జూన్ 24-26 తేదీల్లో ఈ రాష్ట్రాల ప్రతినిధుల మధ్య ఒక అంగీకారం కుదిరింది.
  • 1945 ఫిబ్రవరి 28న తుంగభద్ర డ్యాం నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. 16-10-1946న ప్రముఖ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మద్రాసు-మైసూరు, మద్రాసు-హైదరాబాద్ ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందాలను ఆమోదించారు.
  • అంతకుముందే 1938లో రాజోలిబండ డైవర్షన్ స్కీం గురించి మద్రాసు-హైదరాబాద్ ప్రభుత్వాల మధ్య స్థూల అంగీకారం కుదిరింది. అప్పటి మద్రాసు రాష్ర్టంలోని కడప-కర్నూలు కాలువ స్థాయిలో రాజోలిబండకు సాగునీరు ఇవ్వాలని హైదరాబాద్ ప్రభుత్వం మద్రాసు ప్రభుత్వాన్ని కోరింది. రాజోలిబండ ప్రతిపాదిత స్థలం వద్ద తుంగభద్ర నదిలో 336 టీఎంసీల నీరు లభిస్తుందని అంచనా వేసి కర్నూలు- కడప కాల్వకు, రాజోలిబండ కాల్వకు చెరి 65 టీఎంసీల నీరు వాడుకోవడానికి మద్రాసు ప్రభుత్వం అంగీకరించింది.
  • దీంతో మహబూబ్‌నగర్ జిల్లాలోని నడిగడ్డగా పిలిచే గద్వాల, అలంపూర్ తాలూకాల్లోని 87,500 ఎకరాలకు సాగునీరందించే రాజోలిబండ డైవర్షన్ స్కీం ప్రాజెక్టును నిజాం ప్రభుత్వం ప్రారంభించింది.
Published date : 04 Aug 2016 03:03PM

Photo Stories