Skip to main content

స్కూళ్లు, కాలేజీల్లో భౌతికదూరం, ఆన్‌లైన్ బోధనపై ప్రత్యేక దృష్టి

సాక్షి, హైదరాబాద్ :ప్రస్తుత పరిస్థితుల్లో విద్యా కార్యక్రమాల అమలు కోసం చేపట్టాల్సిన కార్యాచరణ ఖరారుకు ఇటీవల తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు అధికారుల కమిటీని ఏర్పాటు చేసింది.
ఆ కమిటీ రానున్న 2 - 3 నెలలతోపాటు ఆ తరువాత మరో 3 -4 నెలల్లో చేపట్టాల్సిన కార్యాచరణను సిద్ధం చేస్తోంది. కరోనా అదుపులోకి వస్తే ఏయే చర్యలు చేపట్టాలి?, అదుపులోకి రాకపోతే ఏం చేయాలనే అంశాలతో నివేదికలు సిద్ధం చేస్తోంది. నేడో రేపో దానిని బోర్డుకు అందజేయనుంది. జూన్ 15లోగా కరోనా అదుపులోకి వచ్చినా ఆ తరువాత కనీసం ఆరు నెలలపాటు భౌతికదూరం పాటించాల్సి ఉంటుందని కమిటీ భావిస్తోంది. అందుకనుగుణంగానే రాష్ట్రంలోని జూనియర్ కాలేజీలు, వాటి అనుబంధ హాస్టళ్లలో అమలు చేయాల్సిన విధానాన్ని ఖరారు చేస్తోంది. మరోవైపు పాఠశాలల్లోనూ భౌతికదూరం పాటించేలా చేపట్టాల్సిన చర్యలపైనా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.

భౌతికదూరం, ఆన్‌లైన్ బోధనపై ప్రత్యేక దృష్టి...
స్కూళ్లు, కాలేజీల్లో భౌతికదూరం నిబంధనను అమలు చేయడం, ఆన్‌లైన్ విద్యకు ప్రాధాన్యం ఇవ్వడం వంటి చర్యలపై కమిటీ ప్రధానంగా దృష్టిపెట్టింది. ప్రస్తుత పరిస్థితుల్లో తరగతి గదుల్లో ఒక్కో సెక్షన్‌లో ఉండే 40 - 60 మంది విద్యార్థులను పక్కనప్కనే కూర్చోబెట్టి బోధించడం సమస్య కానుంది. ప్రభుత్వ విద్యాసంస్థల్లో కొంత మెరుగ్గా ఉన్నా ప్రైవేటు విద్యాసంస్థల్లో ఈ సమస్య తీవ్రంగా ఉండనుంది. తెలంగాణలోని దాదాపు 27వేల ప్రభుత్వ స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో 28 లక్షల మంది విద్యార్థులుంటే 11వేల వరకు ఉన్న ప్రైవేటు పాఠశాలలు, కాలేజీల్లో 31.32 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ఈ నేపథ్యంలో షిఫ్ట్‌ల వారీగా విద్యాసంస్థల నిర్వహణ, ఆన్‌లైన్ విద్యా బోధన వంటి అంశాలపైనా కమిటీ కసరత్తు చేస్తోంది. అలాగే హాస్టళ్లలోనూ భౌతికదూరం పెంపునకు చర్యలు చేపడుతోంది. భవిష్యత్తులో 25 శాతం బోధన ఆన్‌లైన్, ఈ-లర్నింగ్ వంటి ప్రత్యామ్నాయ పద్ధతుల్లో ఉండాలని ఇటీవల యూజీసీ నిఫుణుల కమిటీ చెప్పిన నేపథ్యంలో ఈ కమిటీ కూడా ఆన్‌లైన్ విద్యాబోధనపైనే కీలక సిఫార్సులు చేసే అవకాశం ఉంది. తద్వారా ఎక్కువ మంది పిల్లలు ఒకేచోట గుమికూడకుండా చూడొచ్చని భావిస్తోంది. భౌతికదూరం పాటించేందుకు ఏం చేయాలి?, విద్యా సంవత్సరంలో ఆలస్యమైన కాలాన్ని ఎలా సర్దుబాటు చేయాలనే అంశాలను అందులో పేర్కొననుంది.
Published date : 05 May 2020 02:17PM

Photo Stories