పిట్ట కొంచెం కూత ఘనం... చిన్న వయసులోనే సరికొత్త ఆవిష్కరణలు
Sakshi Education
పీలేరు (చిత్తూరు జిల్లా): చిన్న వయసులోనే సరికొత్త ఆవిష్కరణలతో అందరినీ అచ్చెరువొందిస్తున్నాడు ఓ బాలుడు. చిత్తూరు జిల్లా పీలేరుకు చెందిన కోర్టు ఉద్యోగి ఆర్ సురేష్ సింగ్, సౌజన్య దంపతుల కుమారుడు హనూష్ సింగ్ (14) స్థానిక ప్రైవేటు పాఠశాలలో చదువుకుంటున్నాడు.

వయసుకి మించి పరిణతి చూపిస్తున్న ఈ బాలుడు కరోనా కట్టడిలో భాగంగా తన ఇంటి మెట్లపై ‘ఆటోమేటిక్ గేట్వే’ ఏర్పాటు చేశాడు. ఎవరు ఇంట్లోకి ప్రవేశించాలన్నా ముందుగా ఆ పరికరం అందించే సంకేతాలను అనుసరిస్తూ తమ చేతులను శానిటైజ్ చేసుకుని, పాం డిటెక్టర్లో అరచేతిని స్కాన్ చేసుకోవడం పూర్తయ్యాకే ఆ ఆటోమేటిక్ గేటు తెరుచుకుంటుంది. కేవలం రూ. 300 ఖర్చుతో హనూష్ సింగ్ ఈ పరికరాన్ని రూపొందించాడు. దీని తయారీకి కార్డు బోర్డు, పీవీసీ పైపు, ఎస్జీ 90 మోటారు, ట్రాన్స్ మీటర్, రిసీవర్, 9 ఓల్టుల బ్యాటరీ వినియోగించాడు. అదేవిధంగా హనూష్ సింగ్ రూ. 650 ఖర్చుతో ‘సోషల్ డిస్టెన్స్ రిమైండర్’ (ఐడీకార్డ్)ని తయారు చేశాడు. ఎవరైనా భౌతిక దూరం పాటించకుండా ఆలింగనం చేసుకోవడానికో, కరచాలనం చేయడానికో ప్రయత్నిస్తే మెడలో వేసుకున్న ఐడీ కార్డు బీప్ సౌండ్ చేస్తూ హెచ్చరిస్తుంది. గతంలోనూ రైతుల కోసం తక్కువ ఖర్చుతో ఎక్కువ లబ్ధి పొందేలా సోలార్ ప్లేట్లను తయారు చేశాడు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం తనకు స్పూర్తి అని, భవిష్యత్తులో మంచి సైంటిస్టు కావాలన్నదే తన లక్ష్యమని హనూష్ సింగ్ చెబుతున్నాడు.
Published date : 14 May 2020 03:17PM