Skip to main content

శాతవాహన వర్సిటీ పేపర్‌ లీక్‌పై పోలీసుల దర్యాప్తు: చాలా చోట్ల పేపర్‌ లీక్‌?

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌/శాతవాహన యూనివర్సిటీ: శాతవాహన యూనివర్సిటీలో చోటుచేసుకున్న పేపర్‌ లీకేజీలో ఒక్కొక్కటిగా బాగోతాలు బయటపడుతున్నాయి.
పరీక్షకు దాదాపు పావు గంట ముందే పలు కాలేజీల సిబ్బంది పేపర్‌ను లీక్‌ చేయడంతో విద్యార్థులు సామాజిక మాధ్యమం ద్వారా పంచుకున్నారు. అలా పదుల సంఖ్యలో పేపర్‌ను షేర్‌ చేసుకున్నట్లు తెలుస్తోంది. లీకేజీ వ్యవహారంపై ‘సాక్షి’వరుస కథనాలతో కదిలిన వర్సిటీ అధికారులు శనివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థుల నుంచి స్వా«దీనం చేసుకున్న ఫోన్లను శాతవాహన సిబ్బంది సోమవారం పోలీసులకు అప్పగించింది. తొమ్మిది సెల్‌ఫోన్ల నంబర్ల ఆధారంగా కాల్‌డేటా రికార్డులను తెప్పించే పనిలో పడ్డారు. లీకైన రోజు ముందు నిందితులు ఎవరెవరితో మాట్లాడారో గుర్తిస్తే కేసు సగం ఛేదించినట్లేనని పోలీసులు భావిస్తున్నారు. వాట్సాప్‌లో ప్రశ్నాపత్రాలు ప్రత్యక్షమయ్యే ముందు, తర్వాత ఈ వ్యవహారంతో సంబంధమున్న వారు ఫోన్‌ మాట్లాడుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. చాలామంది విద్యార్థులు ఫోన్లను స్వా«దీనం చేసుకునే లోపే నంబర్లను డీయాక్టివ్‌ చేసుకుని, వాట్సాప్‌ సమాచారం డిలీట్‌ చేసి ఉంటారని భావిస్తున్నారు. ఒకవేళ డేటా డిలీట్‌ అయినా.. డేటాను రీట్రైవ్‌ చేసే సాంకేతికత తమ వద్ద ఉందని పోలీసులు ధీమాతో ఉన్నారు. ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబొరేటరీకి పంపాలా లేక తమ వద్ద ఉన్న డేటా రీట్రైవ్‌ యంత్రం సరిపోతుందా అన్న విషయంపై పోలీసు అధికారులు ఇంకా నిర్ణయానికి రాలేదు.

ప్రత్యేక బృందాల ఏర్పాటు అనివార్యం..
శాతవాహన వర్సిటీ లీకేజీ వ్యవహారం కరీంనగర్‌ కమిషరేట్‌ పరిధిలోనే వెలుగు చూసినా ఇతర జిల్లాల్లోని కాలేజీల నుంచి కూడా పేపర్లు బయటకు వచ్చాయని సమాచారం. వర్సిటీ పరిధి కరీంనగర్‌తో పాటు సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, హన్మకొండ, సిద్దిపేట, భూపాలపల్లి జిల్లాల్లోనూ విస్తరించి ఉంది. గతంలో ఎంసెట్‌ (మెడికల్‌)–2 పేపర్‌ లీకేజీ వ్యవహారంలో రాష్ట్రాలు దాటిన వ్యవహారం కావడంతో సీఐడీ ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులోనూ ప్రత్యేక పోలీసు బృందాల ఏర్పాటు అనివార్యమని పోలీసులు భావిస్తున్నారు.
Published date : 24 Aug 2021 03:35PM

Photo Stories