ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్పై ప్రత్యేక దృష్టిపెట్టాలి: సీఎం వైఎస్
Sakshi Education
సాక్షి, అమరావతి: అంగన్వాడీ కేంద్రాలను రూ.4,000 కోట్లతో అభివృద్ధి చేసి నాడు-నేడు కార్యక్రమం ద్వారా రూపు రేఖలు మార్చనున్నట్లు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు.

స్కూళ్లలో సదుపాయాలు కల్పిస్తున్న తరహాలోనే అంగన్వాడీ కేంద్రాల్లో కూడా పరిశుభ్రమైన తాగు నీరు, రన్నింగ్ వాటర్తో బాత్రూమ్స్తోపాటు ఫర్నిచర్, ఫ్యాన్లు ఉండాలని సూచించారు. ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్పై ప్రత్యేకంగా దృష్టి సారించామని, అంగన్వాడీలు ఇకపై వైఎస్సార్ ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా ఉంటాయని తెలిపారు. అంగన్వాడీల పాఠ్యప్రణాళికపై విద్యా శాఖ దృష్టి పెట్టాలని ఆదేశించారు. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా అంగన్వాడీ టీచర్లకు సులభమైన బోధనా విధానాలపై శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రీ స్కూల్ విద్యపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు
.ఆ వివరాలివీ...
- పిల్లలకు పాలు, గుడ్లు , తదితరాలు నిల్వ చేసేందుకు వీలుగా వైఎస్సార్ ప్రీ ప్రైమరీ స్కూళ్ల (అంగన్వాడీ)లో ఫ్రిజ్లు ఏర్పాటు చేయాలి,
- అమ్మ ఒడి పథకం ద్వారా విద్యా వ్యవస్థలో సంస్కరణలు తెచ్చాం. ఇప్పుడు ప్రీ ప్రైమరీ విద్యలోనూ అదే బాటలో నడుస్తున్నాం. ప్రాథమిక దశ నుంచే సంపూర్ణ మార్పులకు శ్రీకారం చుడుతున్నాం. అంగన్వాడీల్లో ఒకటో తరగతి పాఠ్యప్రణాళికతో ట్రాన్సిషన్ మొదలు కావాలి. అంగన్వాడీలకు ఇప్పుడున్న కనీస అర్హత పదో తరగతి కాగా వారికి ఏడాది పాటు డిప్లొమా కోర్సు నిర్వహించాలి. ఒకవేళ ఇంటర్, ఆపై కోర్సులు పూర్తి చేసిన వారుంటే ఆరు నెలల డిప్లొమా కోర్సు ఉండాలి. సులభమైన మార్గాల్లో పాఠాలు బోధించడంపై శిక్షణ ఇవ్వాలి.
- అంగన్వాడీలకు భవనాల నిర్మాణం, పాఠ్య ప్రణాళిక, టీచర్లకు డిప్లొమా కోర్సు, సులభమైన బోధనా పద్ధతుల్లో శిక్షణపై కార్యాచరణ సిద్ధం చేసి నిర్ణీత వ్యవధిలోగా పూర్తి చేయాలి.
- వైఎస్సార్ ప్రీ ప్రైమరీ స్కూళ్ల కోసం కొత్తగా రూపొందించిన పుస్తకాలను సమావేశంలో సీఎం పరిశీలించారు. పిల్లల ఆరోగ్యం, ఆహారం, చదువులపై ప్రత్యేక దృష్టి పెట్టేందుకు అంగన్వాడీలను ఇదివరకు ఉన్న బీఎల్వో లాంటి విధుల నుంచి మినహాయించాలని సమావేశంలో నిర్ణయించారు. సమీక్షలో మంత్రులు ఆదిమూలపు సురేష్, తానేటి వనిత, సీఎస్ నీలం సాహ్నితో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Published date : 18 Aug 2020 01:24PM