Skip to main content

ప్రైవేటు ఇంజనీరింగ్, ఇతర కాలేజీలకు ‘ఏఐసీటీఈ’కీలకఆదేశం

సాక్షి, అమరావతి: విద్యాసంస్థల్లో బోధన, బోధనేతర సిబ్బంది వేతనాలు వెంటనే చెల్లించాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ఇంజనీరింగ్ తదితర ప్రయివేటు కాలేజీలకు ఆదేశాలు జారీచేసింది.
వేతనాలు చెల్లించడం లేదని మండలికి అనేక ఫిర్యాదులు అందుతున్నాయని, కోవిడ్-19 లాక్‌డౌన్ సమయంలో వేతనాలు చెల్లించకపోతే సిబ్బంది కుటుంబాలు తీవ్ర ఇబ్బందుల పాలవుతాయని మండలి చైర్మన్ ప్రొఫెసర్ అనిల్ డి.సహస్రబుద్ధి ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. కొన్ని కాలేజీలు వేతనాలు చెల్లించకపోవడమే కాకుండా సిబ్బందిని అర్థంతరంగా ఉద్యోగాలనుంచి తొలగిస్తున్నారని, దీనిని నివారించాలని ఆయా రాష్ట్రాలకు కూడా ఆదేశాలు జారీచేసినట్లు ఏఐసీటీఈ మెంబర్ సెక్రటరీ రాజీవ్‌కుమార్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంటు నిధులు బకాయిలతో కలుపుకొని పూర్తిస్థాయిలో ప్రభుత్వం చెల్లించినా కొన్ని యాజమాన్యాలు మాత్రం సిబ్బందికి వేతనాలు ఇవ్వడంలేదు. దీనిపై అటు ప్రభుత్వం ఏర్పాటుచేసిన ‘స్పందన’కు, ఉన్నత విద్యా పర్యవేక్షణ, నియంత్రణ కమిషన్‌కు ఫిర్యాదులు వచ్చాయి.
  • ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం కింద కాలేజీలకు 2019-20 సంవత్సర ఫీజులతో పాటు గత ప్రభుత్వం బకాయి 1,880 కోట్లను కలిపి దాదాపు రూ.4వేల కోట్లు చెల్లించారు.
  • నిధులు చెల్లించిన సమయంలోనే సిబ్బంది వేతనాలు చెల్లించాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
  • ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంటు ప్రొఫెసర్లతోపాటు బోధనేతర సిబ్బందికి కూడా వేతనాలు ఇవ్వడంలేదన్న ఫిర్యాదులు ఉన్నత విద్యానియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌కు చేరాయి.
  • తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన కైట్ గ్రూపు కాలేజీల సిబ్బంది పలువురు తమ వేతనాలు ఇవ్వడం లేదంటూ కమిషన్‌కు, ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు.
  • గుంటూరు తదితర జిల్లాల్లోని కాలేజీల్లో కొన్ని ఇలాగే వేతనాలు ఇవ్వకుండా వేధిస్తున్నాయని ఫిర్యాదులు వచ్చాయి.
  • కొన్ని యాజమాన్యాలు ఏదో ఒక సాకు చూపి ఏకంగా విధులనుంచి తొలగిస్తున్నాయని సిబ్బంది వాపోతున్నారు.
  • తమకు కూడా ఇలాంటి కాలేజీలపై పలు ఫిర్యాదులు ఈమెయిళ్ల ద్వారా అందాయని, వీటిపై చర్యల కోసం అఖిలభారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ)కి, కాకినాడ జేఎన్‌టీయూకు లేఖ రాశామని రాష్ట్ర ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ కార్యదర్శి డాక్టర్ ఎన్.రాజశేఖరరెడ్డి పేర్కొన్నారు.
  • లాక్‌డౌన్ సమయం ముగియగానే ఈ కాలేజీలకు నోటీసులిచ్చి చర్యలు తీసుకుంటామని వివరించారు.
Published date : 14 May 2020 04:11PM

Photo Stories