పీజీ మెడికల్ సీట్ల భర్తీపై కమిటీ ఏం చేసింది? : ఏపీహైకోర్టు
Sakshi Education
సాక్షి, అమరావతి: పీజీ మెడికల్ సీట్ల భర్తీలో ఎన్టీఆర్ వైద్య వర్సిటీ అధికారులు నిబంధనల మేరకు వ్యవహరించడం లేదంటూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది.

ఓపెన్ కేటగిరీలో సీట్లు పొందిన ప్రతిభావంత రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థుల సీట్లు ఏదైనా కారణం వల్ల ఖాళీ అయితే, ఆ సీట్లను ఓసీ అభ్యర్థులతో భర్తీ చేస్తున్నారంటూ బీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఆల వెంకటేశ్వర్లు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీనిపై బుధవారం న్యాయమూర్తులు జస్టిస్ ఆకుల వెంకటశేషసాయి, జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ధర్మాసనం, గతేడాది కూడా ఇదే అంశంపై వివాదం తలెత్తినప్పుడు తాము ఓ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించామని తెలిపింది. తమ ఆదేశాల మేరకు ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసిందా లేదా? అని ప్రశ్నించింది. దీనికి ప్రభుత్వ న్యాయవాది కొమ్మసాని శ్రీనివాసరెడ్డి సమాధానమిస్తూ.. ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసిందని, ఈ కమిటీ సిఫారసులు ఎన్టీఆర్ వైద్య ఆరోగ్య వర్సిటీ ముందు ఉన్నాయన్నారు. డేగా హర్షవర్ధన్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేస్తున్నారా? అని ధర్మాసనం ప్రశ్నించగా, అమలు చేస్తున్నామని శ్రీనివాసరెడ్డి తెలిపారు. పిటిషనర్ తరఫు న్యాయవాది జడా శ్రవణ్కుమార్ జోక్యం చేసుకుంటూ.. రేపో, ఎల్లుండో కౌన్సిలింగ్ పూర్తి చేసేందుకు వర్సిటీ అధికారులు ఏర్పాట్లు చేశారన్నారు. వర్సిటీ న్యాయవాది విజయకుమార్ స్పందిస్తూ.. గడువిస్తే వివరాలను కోర్టు ముందు ఉంచుతామన్నారు. వాదనలు విన్న ధర్మాసనం, తమ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన కమిటీ పీజీ మెడికల్ సీట్ల భర్తీ వివాదానికి సంబంధించి ఏం చేసిందో తెలపాలని అటు ప్రభుత్వ న్యాయవాదిని, ఇటు వర్సిటీ న్యాయవాదిని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది.
Published date : 28 May 2020 02:54PM