Skip to main content

నూతన జాతీయ విద్యా విధానం అమలు మహాయజ్ఞం: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ: నవ భారతానికి నూతన జాతీయ విద్యా విధానం పునాది వంటిదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
నూతన జాతీయ విద్యా విధానం(ఎన్‌ఈపీ) కేవలం ఒక విధాన పత్రం కాదని, దాన్ని అమలు చేయడం ఒక మహాయజ్ఞమని అభివర్ణించారు. నూతన జాతీయ విద్యా విధానాన్ని సంబంధిత అన్ని వర్గాలు కలసి కట్టుగా, పూర్తి నిబద్ధతతో అమలు చేయాల్సి ఉందన్నారు. విద్యకు సంబంధించి ఇప్పటివరకు ‘ఏం ఆలోచించాలి?’ అనే విషయంపైననే దృష్టి పెట్టారని, తాజా ఎన్‌ఈపీ ‘ఎలా ఆలోచించాలి?’ అనే విషయానికి ప్రాధాన్యత ఇస్తుందని వ్యాఖ్యానించారు. వర్తమాన, భవిష్యత్‌ భారతదేశ నిర్మాణానికి ఎన్‌ఈపీ తొలి అడుగు అని పేర్కొన్నారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ, యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ సంయుక్తంగా నిర్వహించిన ‘నూతన జాతీయ విద్యా విధానంలోని విప్లవాత్మక ఉన్నతవిద్య సంస్కరణలు’ అంశంపై సదస్సును ఉద్దేశించి ప్రధాని శుక్రవారం ఆన్‌లైన్‌ మాధ్యమంగా ప్రసంగించారు.

ఎన్‌ఈపీతో కొత్త ఆరోగ్యకర చర్చకు తెర లేచిందని, తద్వారా విద్యా విధానం మరింత మెరుగవుతుందని పేర్కొన్నారు. ఎన్‌ఈపీని విజయవంతంగా అమలు చేయడంలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. ‘గత కొన్ని సంవత్సరాలుగా మన విద్యా విధానంలో గొప్ప మార్పులేవీ చోటు చేసుకోలేదు. దాంతో దేశంలో ఆసక్తి, సృజనాత్మకతల స్థానంలో మూక మనస్తత్వం అభివృద్ధి చెందింది’ అన్నారు. యువతలో విశ్లేషణాత్మక, సృజనాత్మక ఆలోచనావిధానం అభివృద్ధి చెందాల్సి ఉందని ప్రధాని పేర్కొన్నారు. సమాచార సాగరంలో మనకు అవసరమైన సమాచారాన్ని మాత్రమే తీసుకునే సామర్ధ్యం పెంపొందించుకోవాలన్నారు. విద్యా విధానం కూడా ఆ దిశగా మార్పు చెందాలని ప్రధాని కోరారు.
Published date : 08 Aug 2020 02:04PM

Photo Stories