ఈమె అంకిత భావాన్ని అందరూ..మెచ్చుకోవాల్సిందే..
Sakshi Education
ఒకసారి కరోనా కరాళ నృత్యాన్ని కళ్లారా చూసి, దానిని అనుభవించిన తర్వాత తిరిగి ఆ మృత్యుకోనలోకి కోరి కోరి ఎవరూ కాలు మోపరు. అది కేవలం సేవాగుణం కల వైద్యులకు, నర్సులకే సాధ్యం.

గుర్గావ్ సివిల్ ఆసుపత్రిలో విధులు నిర్వర్తిస్తున్న స్టాఫ్ నర్స్ పూనమ్కి కరోనా వైరస్ సోకింది. కరోనా వ్యాధిగ్రస్తుల సేవలో మునిగిన ఆమెకు పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. అయినా పూనమ్ భయపడలేదు. ఆ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకొని, క్వారంటైన్ ముగించుకొని తిరిగి డ్యూటీలో చేరింది. పూనమ్ 2006లో గుర్గావ్లో నర్సింగ్ కోర్సు పూర్తి చేసింది. 2008లో హర్యానా ప్రభుత్వ ఉద్యోగం పొందింది. అప్పటి నుంచి గుర్గావ్లోని సివిల్ ఆసుపత్రిలో విధులను నిర్వర్తిస్తోంది. ‘కరోనా కొంతకాలం నా శరీరాన్ని పట్టింది కానీ, నా ఆత్మను కాదు. కరోనాకు భయపడవద్దు. కానీ సురక్షితంగా, జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు నేను రోగులకు ఇంకా ఎక్కువ నిబద్ధతతో నా సేవలను అందించగలను’ అని చెబుతోంది పూనమ్. అంతేకాదు, ‘కరోనాతో ఎంత కాలం జీవించాల్సి వస్తుందో చెప్పలేం. అందుకే మన జీవితంలో తప్పక మార్పులు చేసుకోవాలి’ అని సూచిస్తున్న పూనమ్ను, ఆమె అంకిత భావాన్ని అందరూ అభినందనల్లో ముంచెత్తుతున్నారు. కరోనా పాజిటివ్ వస్తుందని భయం కాదు ఆ రోగాన్ని జయించగలమనే పాజిటివ్ ఆలోచనతో ముందడుగువేయాల్సిన తరుణమిది అని నిరూపిస్తున్న ఇలాంటి నర్సులకు సలామ్.
Published date : 18 May 2020 04:09PM