ఏఎన్యూకి జాతీయ స్థాయిలో ప్రథమ ర్యాంకు
Sakshi Education
ఏఎన్యూ (గుంటూరు): లండన్ ప్రధాన కేంద్రంగా ఉన్న క్యూఎస్ (క్వాకరెల్లి సైమండ్స) ఐ గేజ్ ఇచ్చే ర్యాంకింగ్స్ లో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ జాతీయ స్థాయిలో ప్రథమ ర్యాంకు దక్కించుకుంది.

యూనివర్సిటీ ఆన్లైన్ ర్యాంకింగ్స్ కోఆర్డినేటర్ డాక్టర్ భవనం నాగ కిషోర్ గురువారం ఈ విషయాన్ని తెలిపారు. లాక్డౌన్ కాలంలో ఆన్లైన్ తరగతుల నిర్వహణ, యూనివర్సిటీలో ఆన్లైన్ పరిజ్ఞానం వినియోగం అంశాలను ప్రాతిపదికగా తీసుకుని ప్రభుత్వ యూనివర్సిటీల కేటగిరీలో ఏఎన్యూని జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకుకు ఎంపిక చేసిందన్నారు. లాక్డౌన్ కాలంలో వర్సిటీ అధ్యాపకులు 600 ఆన్లైన్ తరగతులు నిర్వహించారని చెప్పారు. శుక్రవారం ఆన్లైన్ ద్వారా ర్యాంకుకు సంబంధించిన పత్రాలను క్యూఎస్ ఐ గేజ్ సంస్థ ప్రదానం చేస్తుందని వెల్లడించారు. జాతీయ స్థాయిలో ఏఎన్యూ ప్రథమ ర్యాంకును సాధించడం పట్ల వీసీ ఆచార్య పి.రాజశేఖర్, రెక్టార్ ఆచార్య పి.వరప్రసాదమూర్తి, రిజిస్ట్రార్ ఆచార్య కె. రోశయ్య హర్షం వ్యక్తం చేశారు.
Published date : 29 May 2020 01:43PM